
గుమ్నామీ బాబా మిస్టరీలో మరో మలుపు
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటన మిస్టరీ వీడిందని ఆయన వారసులు భావిస్తున్న తరుణంలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. చాలా మంది నేతాజీగా భావించిన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్జీకు సంబంధించిన వస్తువుల్లో బోస్ కుటుంబ సభ్యులు ఫొటోలను రెండింటిని కనుగొన్నారు. ఫైజాబాద్ జిల్లా ట్రెజరీలో వీటిని గుర్తించారు.
ఓ ఫొటోలో 22 మంది బోస్ కుటుంబ సభ్యులు ఉన్నారు. మరో ఫొటోలో బోస్ తల్లిదండ్రులు ప్రభావతి దేవి, జానకీనాథ్ బోస్ ఉన్నారు. అంతేగాక అజాద్ హింద్ ఫౌజ్ సీనియర్ నాయకులు పవిత్రా మోహన్ రాయ్, సునీల్ కాంత్ గుప్తాలు.. నేతాజీ పుట్టినరోజు (జనవరి 23)న భగవాన్జీకి పంపిన టెలీగ్రామ్లను కూడా గుర్తించారు. గుమ్నామీ బాబా చివరి రోజుల్లో రామ్ భవన్లో గడిపారు. దీని యజమాని శక్తి సింగ్ ఈ విషయాలను వెల్లడించారు. గుమ్నామీ బాబా 1985, సెప్టెంబర్ 16వ తేదీన మరణించారు. కాగా నేతాజీ జీవితానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన రహస్య పత్రాల ప్రకారం.. 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్టు వెల్లడైంది.