బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా | no one couldn't benami transactions | Sakshi
Sakshi News home page

బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా

Published Fri, Mar 3 2017 8:16 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా - Sakshi

బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా

న్యూఢిల్లీ: బినామీ లావాదేవీలు నిర్వహిస్తే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని ఆదాయ పన్నుల (ఐటీ) శాఖ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. 2016 నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక‌్షన్స్‌ చట్టం- 1988 ప్రకారం ఎవరూ బినామీ లావాదేవీలు జరపడానికి వీల్లేదని పేర్కొంది. బినామీగా వ్యవహరించిన వ్యక్తి, వాస్తవ ఆస్తిపరుడు, సాయం చేసిన వారు అందరూ శిక్షార్హులేనని, వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్‌ ధరలో 25 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది.

బినామీ ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి మార్కెట్‌ ధరలో 10 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, సంబంధిత బినామీ ఆస్తిని గుర్తిస్తే ప్రభుత్వం దాన్ని జప్తు చేస్తుందని వెల్లడించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుటి నుంచి దేశవ్యాప్తంగా 230 కేసులు రిజిస్ట్రర్‌ కాగా, రూ. 55 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌ అయ్యాయి. అలాగే రూ. 200 కోట్ల ఆస్తులకు సంబంధించి 140 మందికి ఐటీ శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు 124 కేసులకు సంబంధించిన రూ. 55 కోట్ల విలువైన బినామీ ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అటాచ్‌ అయిన ఆస్తుల్లో బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ, ఇతర భూములు, ప్లాట్లు, జ్యువెలరీ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement