Income Tax (IT)
-
కొత్త పన్ను చట్టం.. ఎంతో సులభతరం!
న్యూఢిల్లీ: అర్థం చేసుకునేందుకు, ఆచరణకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త ఆదాయపన్ను బిల్లును (ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, 2025) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభకు సమర్పించనున్నట్టు సమాచారం. ఇందులో ఎలాంటి కొత్త పన్నుల్లేవు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఇతరులకు సంబంధించిన ఆదాయపన్ను ముసాయిదా చట్టం ఇది. చిన్న వ్యాక్యాలతో, చదివేందుకు వీలుగా, టేబుళ్లు, ఫార్ములాలతో ఉంటుంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో తీసుకువస్తున్న ఈ నూతన బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలన, పార్లమెంట్ ఆమోదం అనంతరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ‘‘1961 నాటి ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నో సవరణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రాథమిక నిర్మాణమే మారిపోయింది. భాష సంక్లిష్టంగా ఉండడంతో, నిబంధనల అమలు విషయంలో పన్ను చెల్లింపుదారులపై వ్యయ భారం పెరిగింది. ఇది పన్ను యంత్రాంగం సమర్థతపైనా ప్రభావం చూపిస్తోంది’’అని కొత్త బిల్లు తీసుకురావడానికి గల కారణాలను ప్రభుత్వం వివరించింది. బిల్లులోని అంశాలు.. ట్యాక్స్ ఇయర్: గడిచిన ఆర్థిక సంవత్సరానికి (పీవై) రిటర్నులు దాఖలు చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ సంవత్సరంగా (ఏవై) ప్రస్తుతం పిలుస్తున్నారు. ఇకపై పీవై, ఏవై పదాలు ఉండవు. వీటి స్థానంలో ఏప్రిల్ 1 నుంచి 12 నెలల కాలాన్ని (ఆర్థిక సంవత్సరాన్ని) ‘ట్యాక్స్ ఇయర్’గా సంభాషిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి 2024–25 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. సైజు కుదింపు: 1961 నాటి చట్టం 880 పేజీలు, 298 సెక్షన్లు, 23 చాప్టర్లు, 14 షెడ్యూళ్లతో ఉంది. కొత్త బిల్లును 622 పేజీలకు కుదించారు. అదే సమయంలో సెక్షన్లను 526కు, షెడ్యూళ్లను 16కు పెంచారు. చాప్టర్లు 23గానే ఉన్నాయి. టేబుళ్ల రూపంలో: టీడీఎస్, ప్రిజంప్టివ్ ట్యాక్స్, వేతనాలు, మినహాయింపులకు సులభంగా అర్థం చేసుకునేందుకు టేబుళ్లను ఇచ్చారు. టీడీఎస్ సెక్షన్లు అన్నింటికీ ఒకే క్లాజు కిందకు తీసుకొస్తూ అర్థం చేసుకునేందుకు సులభమైన టేబుళ్ల రూపంలో ఇచ్చినట్టు నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ ఎంఅండ్ఏ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ ఝున్ఝున్వాలా తెలిపారు. → వేతనాల నుంచి స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ, ఎల్టీసీ తదితర తగ్గింపులన్నింటినీ వేర్వేరు సెక్షన్ల కింద కాకుండా ఒకే చోట ఇచ్చారు. → ‘నాత్ విత్ స్టాండింగ్’ (అయినప్పటికీ) అన్న పదం ప్రస్తుత చట్టంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. దీని స్థానంలో ఇర్రెస్పెక్టివ్ (సంబంధంలేకుండా)ప్రవేశపెట్టారు. ఇలా అనవసర పదాలు తొలగించారు. → ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లకు (ఈసాప్) సంబంధించి పన్నులో స్పష్టత తీసుకొచ్చారు. → పన్ను చెల్లింపుదారుల చాప్టర్లో.. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను వివరంగా పేర్కొన్నారు. -
కొత్త ఆదాయ పన్ను బిల్లులో ‘ట్యాక్స్ ఇయర్’?
పార్లమెంటులో త్వరలో ప్రవేశపెట్టనున్న కొత్త ఆదాయపు పన్ను బిల్లు(New Income Tax Bill) సామాన్యులకు ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభతరం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన కీలక మార్పుల్లో ‘ట్యాక్స్ ఇయర్’ ఒకటని సమాచారం. ఈ మార్పువల్ల వ్యాపారుల పన్ను చెల్లింపులను సులభతరం చేసేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.టాక్స్ ఇయర్(Tax Year) అంటే ఏమిటి?టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం ఉపయోగించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్ను వాడనున్నారు.ఇదీ చదవండి: ఎల్ అండ్ టీ చైర్మన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలుపన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?స్థిరమైన ట్యాక్స్ ఇయర్ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాతతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
పాత vs కొత్త పన్ను విధానం: ఎప్పుడు ఏది ఎంచుకోవాలంటే..
యూనియన్ బడ్జెట్ 2025లో కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే విధంగా కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొన్ని ప్రధాన మార్పులను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. సెక్షన్ 87A కింద రాయితీ కోసం ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు.నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4 లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు.వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. పాత పన్ను విధానం ఎందుకోవాలా? కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా అని కొంత తికమకపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ పన్ను విధానం ఎందుకోవాలో పరిశీలిద్దాం..కొత్త పన్ను విధానం ఎప్పుడు ఎందుకోవాలంటే..➤సెక్షన్ 87A కింద పూర్తి రాయితీకి అర్హత ఉన్నందున, రూ. 12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి.➤సెక్షన్ 80C (ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, జీవిత బీమా, లేదా హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ తిరిగి చెల్లింపు వంటివి) లేదా సెక్షన్ 80డీ (మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం) కింద మినహాయింపులు ఉండవు.➤మీరు భారీ తగ్గింపులను క్లెయిమ్ చేయకపోతే.. కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వివరణాత్మక డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది.మీరు పాత పన్ను విధానం ఎప్పుడు ఎంపిక చేసుకోవాలంటే..అధిక తగ్గింపులను క్లెయిమ్ చేయగల వ్యక్తులకు పాత పన్ను విధానం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో.. సెక్షన్ 80సీ కింద పీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్ చెల్లింపు మొదలైనవి మాత్రమే కాకుండా.. సెక్షన్ 80డీ కింద వ్యక్తిగత & కుటుంబ సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) వంటివి కూడా ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ తగ్గింపులను గరిష్టంగా పెంచుకుంటే, వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.కొత్త పన్ను విధానంలో శ్లాబులురూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5 శాతంరూ.8-12 లక్షలు - 10 శాతంరూ.12-16 లక్షలు - 15 శాతంరూ.16-20 లక్షలు - 20 శాతంరూ.20-24 లక్షలు - 25 శాతంరూ.24 లక్షల పైన 30 శాతంపాత పన్ను విధానంలో పన్ను శ్లాబులురూ.2,50,001 - రూ.5,00,000 - 5 శాతంరూ.5,00,000 నుంచి రూ. 10,00,000 - 20 శాతంరూ.10,00,000 ఆపైన - 30 శాతంఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా? -
పన్ను ఆదా.. భవిష్యత్తుకు పెట్టుబడి!
మనది పొదుపు సమాజం. మన తల్లిదండ్రులు, తాతలు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేసేవారు. భవిష్యత్ కోసం వీలైన ప్రతి రూపాయినీ ఆదా చేసేవారు. కానీ, నేటి తరం ఖర్చు చేయడాన్ని ఇష్టపడుతోంది. సౌకర్యాలు, సుఖాలు, ఆడంబరాలు, ఆనందం కోసం ఖర్చుకు వెనుకాడని ధోరణి పెరిగిపోతోంది. ‘ధనవంతుడు కావాలంటే పేదవారిగా బతకాలి’ అన్నది ఆర్థిక నిపుణులు చెప్పే సూక్తి. పేదవారిగా జీవించాలని చెప్పడం కాదు ఇందులోని అసలు అర్థం. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు పోకూడదన్న సూచన ఇందులో కనిపిస్తుంది. తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపన్ను రాయితీలను గణనీయంగా పెంచేశారు విత్త మంత్రి. రూ.12.75 లక్షల వరకు కొత్త విధానంలో పన్ను లేకుండా వరాలు కురిపించారు. దీంతో వివిధ తరగతుల వారికి గరిష్టంగా రూ.లక్ష, అంతకుమించి పన్ను రూపంలో ఆదా కానుంది.ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని ఖర్చు బకెట్లో వేసేసుకుని సంబరపడిపోకుండా.. పెట్టుబడులకూ కొంత కేటాయించుకోవాలన్నది నిపుణుల సూచన. తద్వారా భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు మరింత బలం చేకూరుతుంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛను సొంతం చేసుకోగలరు. పన్ను భారం తప్పించుకునేందుకు కొత్త విధానంలోకి మారిపోయి.. ఇప్పటి వరకు పాత విధానంలో చేస్తున్న పన్ను ఆదా పెట్టుబడులకు మంగళం పాడే తప్పు అస్సలు చేయొద్దని సూచిస్తున్నారు. ఆదాయ స్థాయిలకు అనుగుణంగా కొత్త పన్ను విధానంలో ఆదా అయ్యే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వారికి రూ.83,200, రూ.15 లక్షలు సంపాదించే వారికి రూ.32,500 వరకు తాజా ప్రతిపాదనలతో పన్ను ఆదా కానుంది. అలాగే, రూ.24 లక్షల సంపాదనాపరులకు రూ.1.14 లక్షలు, రూ.కోటి ఆదాయ వర్గాలకు రూ.1,25,840, రూ.5 కోట్ల ఆదాయం కలిగిన వారికి రూ.1.43 లక్షల వరకు పన్ను మిగులు లభించనుంది. ఈ కొత్త ప్రతిపాదనలు 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు కానున్నాయి. అంటే 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి ఇవి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్న రేట్లే వర్తిస్తాయి. పాత విధానంలో వివిధ సెక్షన్ల కింద పలు రకాల పెట్టుబడులతోపాటు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలతో కలుపుకుని రూ.8.50 లక్షల ఆదాయంపై పన్ను ఆదాకు అవకాశం ఉంది. పెట్టుబడులు ఆపొద్దు.. ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక ఉండాలి. జీవితంలో అన్ని ముఖ్య అవసరాలను సాధించే మార్గసూచీగా ఇది ఉంటుంది. ఈ లక్ష్యాలకు పెట్టుబడులే ఆధారం. ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పెట్టుబడులకు మళ్లించుకోవాలి. అయితే, జీవిత లక్ష్యాల దృష్టితో కాకుండా పన్ను ఆదా కోసమే పెట్టుబడులను ఆశ్రయించే వేతన జీవులు కూడా ఉన్నారు. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), ఐదేళ్ల పన్ను ఆదా ఎఫ్డీల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై సెక్షన్ 80సీ పరిధిలో (పాత పన్ను వ్యవస్థ) రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనికి అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్కు సెక్షన్ 80డీ పరిధిలో పన్ను మినహాయింపులు ఉన్నాయి. గృహ రుణం తీసుకుని అసలు చెల్లింపులను సెక్షన్ 80సీ పరిధిలో, వడ్డీ చెల్లింపులను సెక్షన్ 24 పరిధిలో చూపించుకోవచ్చు. కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండడంతో, ఇంతకాలం పన్ను ఆదా దృష్టితో కొనసాగించిన ఈ పెట్టుబడులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. ఈ తప్పు అస్సలు చేయొద్దు. కొత్త పన్ను విధానం సూటిగా, సరళంగా ఉంటుంది. పన్నుల గందరగోళం వద్దనుకునే వారు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే తప్పేమీ కాదు. కానీ, అదే సమయంలో పాత పన్ను విధానం ప్రోత్సహిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, మదుపులను విస్మరించకుండా, వాటిని కొనసాగించడం ద్వారానే గరిష్ట ప్రయోజాన్ని పొందగలరు. పన్ను ఆదా కోసం ఉద్దేశించినవి కాకపోయినా, మెరుగైన ఇతర సాధనాల్లో అయి నా పెట్టుబడులు కొనసాగించుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ ఒక విభాగం. ఇందులో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. దీంతో ఇతర ఈక్విటీ ఫండ్స్ అంత అమ్మకాల ఒత్తిడి వీటిల్లో ఉండదు. కనుక స్థిరత్వం ఎక్కువ. మల్టీక్యాప్ (ఏ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేయగలదు) విధానంతో పెట్టుబడులు పెడుతుంటుంది. పదేళ్ల కాలంలో 12–18 శాతం మధ్య, ఐదేళ్లలో 13–27 శాతం మధ్య రాబడులు ఈ పథకాల్లో గమనించొచ్చు. కొత్త పన్ను విధానంలోకి మళ్లిన వారు ఈఎల్ఎస్ఎస్లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు. వీటికి ప్రత్యామ్నాయంగా లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీక్యాప్, ఇండెక్స్ ఫండ్స్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, బీమా పథకాలకు పన్ను ఆదాకు మించి ప్రయోజనాలను ఇచ్చే సామర్థ్యం ఉన్నట్టు సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ పార్ట్నర్ కునాల్ సవాని పేర్కొన్నారు. కొత్త విధానంలోకి వెళ్లినా కానీ, భవిష్యత్ కోసం ఉద్దేశించిన ఈ పెట్టుబడులను నిలిపివేయొద్దని సూచించారు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా (టర్మ్, ఎండోమెంట్) పాలసీల ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పాత వ్యవస్థలో పన్ను మిననహాయింపు ఉంది. వార్షిక ప్రీమియం మొత్తం కవరేజీలో (సమ్ అష్యూర్డ్/రక్షణ) 10 శాతం మించకపోతే, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను లేదు. ఈ పన్ను ప్రయోజనం కోసం ఎండోమెంట్, టర్మ్ పాలసీలను కొందరు తీసుకుంటున్నారు. ఏ పన్ను విధానంలో ఉన్నారనే అంశంతో సంబంధం లేకుండా, కుటుంబానికి ఆర్థికంగా ఆధారమైన ప్రతి వ్యక్తీ తన పేరిట తగినంత బీమా కవరేజీతో అచ్చమైన టర్మ్ పాలసీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తన వార్షిక ఆదాయానికి సుమారుగా 20 రెట్ల మేర సమ్ అష్యూర్డ్ ఉండేలా చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆర్జించే వ్యక్తి ప్రాణానికి ప్రమాదం వాటిల్లితే, వచ్చే బీమా పరిహారంతో అతనిపై ఆధారపడిన కుటుంబం సాఫీగా జీవించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నేడు జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. కనుక ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం పన్ను ఆదా కోసం ఉద్దేశించిన సాధనం కానే కాదు. పెద్ద ప్రమాదం లేదా కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో ఆస్పత్రి పాలైతే, హెల్త్ కవరేజీ లేని పరిస్థితుల్లో అప్పటి వరకు కూడబెట్టినదంతా కరిగిపోయే ప్రమాదం ఎదురవుతుంది. అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం వల్ల ఆర్థికంగా సమస్యల్లోకి వెళ్లకూడదని కోరుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్ను తీసుకోవాలి. ఒక కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10లక్షలు ఉండేలా చూసుకోవాలి. దీనిపై అదనపు కవరేజీని సూపర్ టాపప్ ప్లాన్ రూపంలో తీసుకోవచ్చు. ఉద్యోగం చేసే సంస్థ తరఫున గ్రూప్ హెల్త్ కవరేజీ ఉన్న వారు సైతం విడిగా తమ కుటుంబానికి ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కారణంతో కంపెనీని వీడినా, ఉద్యోగం మానేసినా కవరేజీ కొనసాగుతుంది.ఖర్చు కంటే పెట్టుబడి ముఖ్యం చాలా మంది తమ ఆదాయంలో ఖర్చులుపోను మిగులుంటే అప్పుడు పెట్టుబడులకు మళ్లిస్తుంటారు. కానీ, ముందు పెట్టుబడులకు కేటాయింపులు చేసిన తర్వాతే ఖర్చులకు వెళ్లాలన్నది నిపుణుల సూచన. కొత్త పన్ను వ్యవస్థలో మిగిలే నిధులను ఎన్పీఎస్ తదితర పెన్షన్ ప్లాన్లకు కేటాయించుకోవాలని సింఘానియా అండ్ కో పార్ట్నర్ బన్సాల్ సూచించారు. దీనివల్ల గణనీయమైన రిటైర్మెంట్ ఫండ్ ఏర్పడుతుందన్నారు. చాలా మంది రిటైర్మెంట్ లక్ష్యాన్ని పెద్దగా పట్టించుకోరు. 60 ఏళ్ల తర్వాత సంగతి కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ, ఉద్యోగంలో చేరిన నాటి నుంచే రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం పెట్టుబడి చేసుకుంటూ వెళ్లడం ద్వారా స్వల్ప మొత్తమే పెద్ద నిధిగా మారుతుందన్నది తెలుసుకోవాలి.కొత్త–పాత పన్ను వ్యవస్థలు ఏ విధానంలో కొనసాగాలన్నది తమ ఆదాయం ఆధారంగానే నిర్ణయించుకోవాలి. హెచ్ఆర్ఏ, గృహ రుణ ప్రయోజనాలు, ఎల్టీసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ పెట్టుబడులతో రూ.8 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్తో రూ.50 వేలు మొత్తంగా రూ.8.50 లక్షల వరకు పాత పన్ను వ్యవస్థలో మినహాయింపులున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే రూ.24 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారికి పాత వ్యవస్థ అనుకూలమని నిమిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు నితేష్ బుద్దదేవ్ తెలిపారు. ఒకవేళ తమ పెట్టుబడులు ఈ స్థాయిలో లేకపోతే కొత్త విధానాన్ని పరిశీలించొచ్చు. రూ.24 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త విధానమే అనుకూలం. ఎన్పీఎస్ రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాల్లో ఎన్పీఎస్ ఒకటి. అతి తక్కువ నిర్వహణ చార్జీలతోపాటు, పెట్టుబడిపైనా, రాబడి ఉపసంహరణపైనా పన్ను ప్రయోజనాలున్నాయి. ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై సెక్షన్ 80సీసీఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80సీ గరిష్ట ప్రయోజనం కిందకే ఇది కూడా వర్తిస్తుంది. దీనికి అదనంగా సెక్షన్ 80సీసీడీ (1బి) కింద ఎన్పీఎస్ టైర్–1 ఖాతాలో మరో రూ.50,000 పెట్టుబడికి సైతం పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ కిందే ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడికీ పన్ను ఆదా ప్రయోజనాన్ని 2025–26లో బడ్జెట్లో కల్పించారు. తమ పేరు మీద లేదా తమ కుమార్తె లేదా కుమారుల పేరిట ఎన్పీఎస్ వాత్సల్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బి) కింద గరిష్ట ప్రయోజనం రూ.50వేలకు పరిమితం. 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకంలో సమకూరిన మొత్తం నిధి నుంచి 60 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. మరో 40 శాతం మొత్తానికి పింఛను ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో చేసే జమలపైనా పాత విధానంలో పన్ను ప్రయోజనాలున్నాయి. సెక్షన్ 80సీసీడీ (2) కింద మూలవేతనం, డీఏ మొత్తంలో 10 శాతాన్ని ఉద్యోగి తరఫున యాజమాన్యం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగి తరఫున ప్రభుత్వమే జమ చేస్తుంటే అప్పుడు 14 శాతంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పించారు. కొత్త విధానంలో ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ టైర్–1లో జమ చేస్తే (మూలవేతనం, డీఏలో 10 శాతం / వచ్చే ఏప్రిల్ నుంచి 14 శాతం) ఆ మేరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ హామీతో కూడిన డెట్ పెట్టుబడి సాధనాలు. వీటిల్లో రిస్క్ సున్నా. ఈ రెండు సాధనాల్లో ఏటా చేసే పెట్టుబడులను పాత పన్ను వ్యవస్థలోని సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తంపై పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో పన్ను లేదు. పన్ను ప్రయోజనాలున్న ఈ మెరుగైన పథకాలు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిందే. తమ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతం ఈ సాధనాలకు కేటాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్కు మళ్లించుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడికి కొంత రక్షణతోపాటు దీర్ఘకాలంలో అధిక రాబడిని సొంతం చేసుకోగలరు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో పెట్టుబడులకు వర్తించే వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ వీటి రేట్లను ప్రకటిస్తుంటుంది. పీపీఎఫ్లో ప్రస్తుతం 7.10 శాతం రేటు అమల్లో ఉంది. దీని కాల వ్యవధి 15 ఏళ్లు. అనంతరం మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.2 శాతం రేటు అమల్లో ఉంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని ప్రారంభించుకోవచ్చు. బాలికల వయసు 10 ఏళ్లు మించకూడదు. ఆలోపు వయసున్న వారి పేరుతో ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తెలకు 21 ఏళ్లు నిండగానే పథకం ముగిసిపోతుంది. లేదా 18 ఏళ్లు నిండిన తర్వాత, 21 ఏళ్లు రాక ముందే వారికి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఈ పథకం నుంచి వైదొలగొచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న వారికీ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలు అనుకూలమేనని వేద్ జైన్ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అంకిత్ జైన్ సూచించారు. ఎందుకంటే ఈ రెండు పథకాల్లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనం కొత్త వ్యవస్థ కింద లేకపోయినా కానీ, వడ్డీ రాబడికి పన్ను మినహాయింపు ప్రయోజనం ఉన్నట్టు తెలిపారు. కుమార్తెల వివాహం, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ పెట్టుబడులు ఎంతో ఉపయోగపడతాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త ఆదాయపు పన్ను బిల్లు వచ్చే వారమే
-
కొత్త ఐటీ బిల్లు వచ్చే వారమే..
ఆరు దశాబ్దాల నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (New Income Tax Bill) లోక్సభలో వచ్చే వారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. ఎగువసభలో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో బడ్జెట్ అనంతర సంప్రదాయ సమావేశంలో ప్రసంగించిన తర్వాత సీతారామన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటరీ కమిటీ సిఫారసులు చేసిన తర్వాత బిల్లు మళ్లీ కేబినెట్కు వెళ్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతారని మంత్రి చెప్పారు. బిల్లు విషయంలో తనకు ఇంకా మూడు క్లిష్ట దశలు ఉన్నాయని అన్నారు.‘రెండు సంవత్సరాల క్రితం కూడా కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి కొన్ని హేతుబద్ధీకరించాం. భారత్ను మరింత పెట్టుబడిదారులు, వాణిజ్య స్నేహపూర్వకంగా మార్చాలనుకుంటున్నాం. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్తో సమతుల్యం చేయాలనుకుంటున్నాం. పరిశ్రమకు అవసరమైన విధంగా సుంకాల రక్షణను అందిస్తాం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు. -
పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ క్లారిటీ
కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఓ సమావేశంలో వెల్లడించారు.పాత పన్ను విధానం ఔచిత్యం, ప్రణాళికల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ పన్ను వ్యవస్థ మొత్తం సరళంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పన్ను విధానం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, దీనికోసం పాత పన్ను విధానాన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.మొత్తం పన్ను చెల్లింపుదారులందరూ.. కొత్త పన్ను విధానానికి మారాలని కోరుకుంటున్నారా? అని ఆర్థిక మంత్రిని అడిగినప్పుడు. పాత పన్ను విధానం రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా కొత్త ఆదాయ పన్ను చట్టం గురించి ప్రస్తావిస్తూ.. 1931లో తీసుకొచ్చిన పాత పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్దేశ నిర్మాణం కోసం పన్ను చెల్లింపుదారులు చేస్తున్న సేవలను గౌరవించడానికి ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' చేసిన ప్రయత్నమే 2025 బడ్జెట్లో ఇచ్చిన పన్ను ఉపశమనం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత మూడు.. నాలుగు సంవత్సరాలుగా, మేము నిరంతరం పన్ను చెల్లింపుదారులతో నిమగ్నమై ఉన్నాము. ప్రభుత్వంపై వారి నమ్మకం చెక్కుచెదరకుండా ఉండటానికి, మేము అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు. -
ఐటీ ఆఫీస్లో ముగిసిన దిల్ రాజు విచారణ
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట విచారణలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఆయన్ను ఐటీ అధికారులు విచారించారు. ఈ మధ్య కాలంలో తన బ్యానర్ నుంచి విడుదలైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన వ్యాపారాల అకౌంట్స్ అన్నీ అధికారులు తణిఖీలు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. విచారణ అనంతరం బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయం నుంచి దిల్ రాజు తిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆయన్ను మరోసారి విచారిస్తారా..? లేదా..? అనే విషయం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
ఇక దేశానికి ఆ కోటి మందే దిక్కు!
కొత్త పన్ను విధానాన్ని షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా స్టార్ అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) విమర్శించారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో కోటి మంది మాత్రమే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లిస్తారని, తద్వారా భారత్ ఆదాయ పన్ను రహిత దేశంగా మారుతుందని ఎద్దేవా చేశారు.కేంద్ర బడ్జెట్లో (Union budget 2025-26) రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపును ప్రకటించిన అనంతరం కొత్త పన్ను విధానాన్ని విమర్శిస్తూ అనుపమ్ మిట్టల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. దేశంలో పన్ను దాఖలు చేసేవారిలో 90% మంది రూ. 13 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారేనని చెప్పుకొచ్చారు. అంటే ఆ మిగిలిన కొద్ది మంది మాత్రమే దేశానికి ట్యాక్స్ ఆదాయం అందిస్తారనేది ఆయన భావన.భారత్ "ఆదాయపు పన్ను రహిత దేశం" అవుతుందంటూ అనుపమ్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలు కొత్త పన్ను విధానంలోని పన్నుల వ్యవస్థ హేతుబద్ధతపై చర్చను రేకిస్తున్నాయి. "భారతదేశంలో దాదాపు 90% ట్యాక్స్ ఫైలర్లు రూ.13 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారేనని తేలింది. అంటే 140 కోట్ల మందిలో కోటి మంది మాత్రమే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లిస్తారు. దేశాన్ని ఆదాయపు పన్ను రహితంగా మారుస్తారు" అని మిట్టల్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.కొత్త పన్ను విధానం కేవలం పన్ను కోత కాదని, "వ్యవస్థాగత దిద్దుబాటు" అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక వేదిక లింక్డ్ఇన్లో చర్చకు తెరతీశారు. బలమైన ఆర్థిక వ్యవస్థ సాధికారత కలిగిన మధ్యతరగతిపైనే ఆధారపడుతుందని, అధిక పన్నుల భారం మోపడం సరికాదని వాదించారు. ఈ సందర్భంగా అమెరికా, చైనాలతో దేశ పన్ను విధానాన్ని పోలుస్తూ భారత్లో గతంలో వేతనజీవులను అధిక పన్నులతో పిండేశారని ఆరోపించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్ దేశ పన్ను శ్లాబ్లలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు ఇక నుంచి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని మంత్రి ప్రకటించారు.20 ఏళ్లకే కోటీశ్వరుడుజీవితం ఎప్పుడూ సాఫీగా సాగకపోవచ్చు. ఎన్నో బాధలు.. కష్టాలు.. అనుభవించాల్సి రావొచ్చు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కొన్నిసార్లు సంపాదించిన సొమ్మంతా కోల్పోవాల్సి రావొచ్చు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనుపమ్ మిట్టల్. 20 ఏళ్లకే కోటీశ్వరుడైన ఆయన ఒడిదుడుకులను ఎదుర్కొని పడిలేచారు.'కొద్దికాలంలోనే గొప్ప విజయాలు సాధించా. 20 ఏళ్లకే కోటీశ్వరుడిని అయిపోయా. మైక్రోస్ట్రాటజీలో నేను ప్రొడక్ట్ మేనేజర్గా ఉన్న సమయంలో కంపెనీ విలువ 40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో బాగానే డబ్బులు సంపాదించా. తర్వాత పరిస్థితి మారిపోయింది. డాట్-కామ్ బబుల్ సమయంలో అంతా కోల్పోయా. అప్పుల్లో కూరుకుపోయా. తర్వాత ధైర్యం తెచ్చుకుని షాదీ.కామ్ స్టార్ట్ చేశా. మళ్లీ పూర్వవైభవం సాధించా' అంటూ అనుపమ్ గతంలో లింక్డ్ఇన్లో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. -
కొత్త పన్ను విధానంలోకి ఇక భారీగా..!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో తెరతీసిన ఆదాయ పన్ను భారీ రిబేట్లు కారణంగా కొత్త విధానంలోకి మరింత మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చేరతారని ప్రభుత్వం భావిస్తోంది. 90 శాతానికిపైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతంమంది కొత్త విధానంలో ఉన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ రూ. 12 లక్షల వరకూ ఆదాయంపై పన్ను లేకుండా ప్రతిపాదించడంతో పలువురు కొత్త విధానంలోని మారనున్నట్లు తెలియజేశారు. పన్ను శ్లాబుల పునర్వ్యవస్థీకరణ సైతం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగాన్ని మరింత పెంచడం ద్వారా మానవ జోక్యం లేని పన్నుల నిర్వహణకు ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఆదాయాన్ని ప్రకటించడంలో సాధారణ పన్ను చెల్లింపుదారులకు సులభమైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచి్చనట్లు తెలియజేశారు. ఇందుకు ప్రవేశపెట్టిన సరళతర ఐటీఆర్–1, ముందస్తుగా నమోదయ్యే ఐటీ రిటర్నులు, మూలంవద్ద పన్ను(టీడీఎస్)లో ఆటోమాటిక్ మదింపు తదితరాలను ప్రస్తావించారు. మినహాయింపులు, తగ్గింపులవంటివి లేని నూతన పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మదింపు మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. వెరసి ఐటీ నిపుణుల అవసరంలేకుండానే ఐటీఆర్ను దాఖలు చేయవచ్చని తెలియజేశారు. -
లక్కీ భాస్కర్ లెక్కలివి..
(సాక్షి, అమరావతి) : ఏడాదికి వచ్చే ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నవారెవరూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా రూ.7 లక్షలుగా ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచటం ద్వారా... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊహించని కానుకనిచ్చారు. మేమంతా ‘లక్కీ భాస్కర్’లమే అని మధ్య తరగతి వేతన జీవులు సంబరపడేలా తాజా బడ్జెట్లో ప్రతిపా దనలు చేశారు. ఈ రకంగా చూస్తే.. ఏడాదికి రూ.12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ.80,000 పన్ను ఇకపై వారికి మిగులుతుంది. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000ను కూడా కలిపితే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం ఆదా యం రూ.12.75 లక్షలకన్నా ఒక్క రూపాయి పెరిగినా... వారు వివిధ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు ఇది వ్యక్తులు జీతం రూపంలో ఆర్జించే మొత్తానికే వర్తిస్తుందని, మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్) వంటి ఇతర ఆదాయాలకు మాత్రం ఈ రిబేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అంటే మీరు ఒక ఏడాదిలో ఆర్జించిన మూలధన లాభాలు, జీతం కలిపి రూ.12 లక్షల లోపు ఉన్నా... మూలధన లాభాలపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్న మాట!!. శనివారం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి... త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అత్యంత గజిబిజీగా ఉన్న ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో అత్యంత సరళంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా పన్నుల శ్లాబులను మరింత సరళతరం చేస్తూ... అత్యధిక పన్నురేటు30 శాతాన్ని ఇప్పటి దాకా రూ.15 లక్షలు దాటితే వర్తింపజేస్తుండగా... ఇకపై దాన్ని రూ.24 లక్షలు దాటితేనే వర్తింపజేస్తామని ప్రకటించారు.అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కు ఉపయోగపడేలా టీడీఎస్, కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా టీసీఎస్ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతం రిటర్నులు దాఖలు చేస్తున్న వారిలో 85 శాతానికి పైగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక కొత్త పన్ను చట్టంఇంటి అద్దె, అలవెన్సులు, పొదుపు పథకాలు, గృహరుణాలు, ఇతర వ్యయాల వంటి వాటిని చూపించి పన్ను భారం తగ్గించుకునే పాత పన్నుల విధానం స్థానంలో ఎటువంటి పొదుపు అవసరం లేని కొత్త పన్నుల విధానాన్ని 2020 బడ్జెట్ ద్వారా కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. కొత్త, పాత విధానాల్లో ఏది ఎంచుకుంటారన్నది పన్ను చెల్లింపు దారుల ఇష్టమని మొదట్లో చెప్పినా... ప్రతి బడ్జెట్లో కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా... పాత పన్నుల విధానాన్ని అనుసరిస్తున్న వారిని నిరుత్సాహ పరిచలేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక పాత విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించారో ఏమో... ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ... దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్నే ఎంచుకునే పరిస్థితిని కల్పించారు మంత్రి నిర్మల. వచ్చే వారం పార్లమెంటులో కొత్త పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పటం ద్వారా ఇక పాత పన్ను చట్టానికి స్వస్తి చెబుతామని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారిలో ఒకటో అరో తప్ప అంతా రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే. ఇప్పుడు వారందరికీ పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వటంతో.... ఇక వారికి రకరకాల సేవింగ్స్ చేయటం, బిల్లులు చూపించటం వంటివి తప్పిపోతాయి. నేరుగా పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి వారంతా సహజంగానే కొత్త విధానంలోకి మారిపోతారు. అంటే.... దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పాత విధానాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి కొత్త విధానంలోకి మారిపోతారు. కొత్త చట్టం వచ్చినా వ్యతిరేకత ఉండదు.రూ.80వేల నుంచి రూ.1.10 లక్షల దాకా లాభంకొత్త పన్ను (2025–26 నుంచి అమలు) విధానం ప్రకారం... మినహాయింపు పరిమితిని రూ.7 నుంచి 12 లక్షలకు పెంచటమే కాదు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న బేసిక్ లిమిట్ను రూ.4 లక్షలకు పెంచారు. దాంతో పాటు ప్రతి 4 లక్షలకు ఒక శ్లాబు రేటు చొప్పున మొత్తం 7 శ్లాబులను ప్రవేశపెట్టారు. దీంతో రూ.24 లక్షల లోపు ఆదాయానికి 30% పన్ను వర్తించదు.గతంలో 15 లక్షలు దాటితే 30% పన్ను రేటు చెల్లించాల్సి వచ్చేది. అలాగే రూ.20–24 లక్షల ఆదాయం ఉన్న వారికి 25% పేరుతో కొత్త శ్లాబు రేటును ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి 80,000, రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70,000, రూ.25 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ.1.10 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.సీనియర్ సిటిజన్లకు ఊరటవడ్డీ ఆదాయంగా జీవించే సీనియర్ సిటిజన్స్ టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీడీఎస్ అంటే మూలం దగ్గర చెల్లించే పన్ను. అంటే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం గనక పరిమితిని దాటితే అందులో 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలే కట్ చేస్తాయి.ప్రస్తుతం ఈ వడ్డీఆదాయం టీడీఎస్ పరిమితి రూ.50,000. ఇకపై దీన్ని రూ.లక్ష చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.ఇంటద్దె రూపంలో వచ్చే వార్షికాదాయం గనక రూ.2.4 లక్షలు దాటితే ఇప్పటిదాకా టీడీఎస్చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.6 లక్షలకు పెంచారు.బీమా కమీషన్లపై టీడీఎస్ రేటును 5 నుంచి 2 శాతానికి తగ్గించారురెమిటెన్స్లపై విధించే టాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు... విదేశీ విద్యకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చేసే రెమిటెన్స్లై టీసీఎస్ను ఎత్తివేస్తు్తన్నట్లు ప్రకటించారు. ఇక నుంచి అధిక టీడీఎస్ను కేవలం పాన్ నెంబర్ లేని కేసులకు మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. తప్పుగా ఆదాయం చూపించిన రిటర్నులు సవరించుకునే కాలపరిమితిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. నాలుగేళ్లలోపు స్వచ్ఛందంగా అధిక పన్ను చెల్లించడం ద్వారా సవరించిన రిటర్నులు తిరిగి దాఖలు చేసుకోవచ్చు.రూ.12.75 లక్షలకుఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో... చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని. అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సిఉంటుంది. ఉదాహరణకు... మీ వార్షిక వేతనం రూ.12.80 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. కాబట్టి మీ వేతనం నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా... మిగిలిన రూ.12.05 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది. అంటే... దీన్లో రూ.4 లక్షలవరకూ జీరో... రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలు, రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలు, మిగిలిన 5వేలపై 15 శాతం... అంటే రూ.750. మొత్తంగా రూ.60,750 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే... రూ.12.75 లక్షలకన్నా 5వేలు ఎక్కువ ఉన్నందుకు రూ.60,750 పన్ను చెల్లించాల్సి వస్తోంది. అదే 12.75 లక్షల లోపుంటే... రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదీ లెక్క. ఇది మరిచిపోకండి... జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదు. మీ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇంటద్దె రూపంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకే వస్తాయి. ఇక షేర్లు, క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం కింద పరిగణించబోమని ఈ సారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం రూ.12.75 లక్షల లోపున్నా సరే... మీ మొత్తం ఆదాయానికి కలిపినా కూడా రూ.12.75 లక్షల లోపున్నా సరే... వీటిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
పన్ను శ్లాబుల సవరణకు కారణాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం కలిగించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆదాయపు పన్ను శ్లాబ్ల్లో మార్పులు చేశారు. ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో.. ఇది పన్ను చెల్లింపుదారులను ఎలా ప్రభావితం చేస్తుందో కింద తెలుసుకుందాం.డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచడంఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడానికి ప్రధాన కారణాలలో ఒకటి మధ్య తరగతి వారికి డిస్పోజబుల్ ఆదాయాన్ని(ఖర్చులు అన్ని పోను మిగిలే ఆదాయం) పెంచడం. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా, వ్యక్తులు, కుటుంబాలు ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉంటారు. ఇది ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దారితీస్తుంది.పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడంపొదుపును, పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త పన్ను విధానాన్ని రూపొందించారు. అధిక డిస్పోజబుల్ ఆదాయంతో, వ్యక్తులు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడే ఆర్థిక సాధనాలు, స్థిరాస్తి లేదా వ్యాపారాల్లో పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది.పన్ను వ్యవస్థను సరళతరం చేయడంపన్ను వ్యవస్థను సరళతరం చేయడమే లక్ష్యంగా పన్ను శ్లాబులను సవరించారు. పన్ను చెల్లింపుదారులు వారి పన్ను విధానాలను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం సులభతరం అవుతుంది. ఈ సరళీకరణ పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన పన్ను సేకరణకు దారితీస్తుంది.మధ్యతరగతికి మద్దతుమధ్యతరగతి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటోంది. వారికి పన్ను ఉపశమనం కల్పించడం, వారి కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. మధ్య తరగతివారిపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు, మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.పాత పన్ను విధానం రద్దు చేసేలా..?2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా క్రమంగా పాత పన్ను విధానాన్ని పలుచన చేస్తున్నారు. తాజా మార్పులు పాత వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను కొత్త విధానానికి మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్గృహ వినియోగాన్ని ప్రేరేపించడంపెరిగిన డిస్పోజబుల్ ఆదాయం అధిక గృహ వినియోగానికి దారితీస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా మారుతుంది. వినియోగదారుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచడం ద్వారా వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ద్రవ్యోల్బణంపెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయంతో ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడం కుటుంబాలపై కొంత ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. -
పెట్టుబడిదారులకు ప్రోత్సాహం చట్టాలలో కీలక మార్పులు
-
వేతన జీవులకు బిగ్ రిలీఫ్ .. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
ఉద్యోగులకు శుభవార్త.. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
భారత్పై అన్ని దేశాల కన్ను
-
రైతులు మరియు స్టీల్ ప్లాంట్ పై బీజేపీ మొండి వైఖరి
-
పేదలు, మహిళల కోసం కొత్త పథకాలు
-
Income Tax Slabs : సామాన్యుడిపై పన్నుల భారం తగ్గించండి
-
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు
పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని పెంచడానికి, పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన నొక్కి చెబుతుందని కొందరు విశ్వసిస్తున్నారు.ఫేస్ లెస్ అసెస్ మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్, రిటర్నులను వేగంగా ప్రాసెస్ చేయడం వంటి కీలక అంశాలను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దాదాపు 99% రాబడులు ప్రస్తుతం స్వీయ మదింపు(సెల్ఫ్ అసెస్మెంట్)పై ఆధారపడి ఉన్నాయన్నారు. పన్ను విధానాలను ముందుగా కేంద్రం విశ్వసించిన తర్వాతే వాటి మార్పులను పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టడం వల్ల పన్నుల వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని, పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేయడపై దృష్టి పెడుతారని కొందరు భావిస్తున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులపై విస్తృత ప్రభావాలను చూపుతుందని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు. -
‘ఐటీ’ కటాక్షించేనా?
(సాక్షి, బిజినెస్ డెస్క్, సాక్షి, అమరావతి) : మరి కొద్ది గంటల్లో బడ్జెట్(Budget) ప్రవేశపెట్టనున్న తరుణంలో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలు వేతన జీవులు, మధ్య తరగతి వర్గాల్లో ఆశలను పెంచుతున్నాయి. 2014 నుంచి పన్నుల శ్లాబులు మార్చకపోవడం.. మండిపోతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా జీతాలు పెరగని నేపథ్యంలో ఈదఫా వేతన జీవులకు ఊరట లభిస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే ఇదే సంకేతాలనిచ్చింది. 2023–24లో కంపెనీల లాభాలు 22.3 శాతం పెరగగా ఇదే సమయంలో ఉద్యోగాల కల్పన వృద్ధి 1.3 శాతానికి పరిమితం కావడం.. సంస్థలు వ్యయాల నియంత్రణ పేరుతో సిబ్బంది సంఖ్యతో పాటు వేతనాల్లో కోత పెడుతుండటంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 2002–03లో దేశ జీడీపీలో 2.1 శాతంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల లాభాలు 2023–24 నాటికి ఏకంగా 4.8 శాతానికి చేరుకున్నాయని, ఇదే సమయంలో వేతనాల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం ఆర్థిక అసమానతలను పెంచుతుందని సర్వే పేర్కొంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితేమీ అంత గొప్పగా లేదు. వృద్ధి నెమ్మదించింది. అమెరికాలో ట్రంప్ విజయం సాధించటమేకాక... భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరగటంతో... ఇపుడు బ్లూచిప్, చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీల్లోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఫారిన్ ఫండ్స్) తమ వాటాలను అయినకాడికి తెగనమ్మేస్తున్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతోంది... డాలర్తో పోలిస్తే రూపాయి భారీగా పతనమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గటం లేదు. ఇలాంటి సమస్యలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో 2025–26 కేంద్ర బడ్జెట్ను శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నా... మోదీ ప్రభుత్వం మూడోసారి గెలిచాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.ఎందుకంటే ఎన్నికలు సంవత్సరం మధ్యలో రావటంతో మిగిలిన కాలానికి ఓటాన్ అకౌంట్తో నెట్టుకొచ్చారు. మరి ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే సరికొత్త గేమ్ ఛేంజర్ విధానాలు అవసరమన్నది నిపుణుల మాట. ఒకవైపు పేద, మధ్య తరగతి వర్గాలకు తగిన రక్షణ కల్పిస్తూనే.. వృద్ధిని పరుగులెత్తించాల్సిన బాధ్యత ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఏ మేరకు నెరవేరుస్తారన్నదే సర్వత్రా చర్చనీయమవుతోంది.ఆదాయపు పన్నులో మరింత ఊరట!బడ్జెట్ వచ్చిందంటే మధ్య తరగతి ఎదురుచూసేది ఆదాయపు పన్ను సవరణల గురించే. ఈసారి ఆదాయ పన్ను విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తెచ్చింది. ఎలాంటి మినహాయింపులూ లేకుండా పన్ను శ్లాబులను మాత్రం సవరించింది. పాత పన్ను విధానంలోనైతే గృహ రుణం, స్కూలు ఫీజుల నుంచి మనం చేసిన వివిధ సేవింగ్స్ను కూడా మినహాయించుకునే అవకాశముండేది. కొత్త విధానంలో అలాంటి మినహాయింపులేవీ లేవు. కాకపోతే పన్ను రేట్లు కాస్త తక్కువ. జీతాన్ని బట్టి ప్రస్తుతం ఎవరి లెక్కలు వారు వేసుకుని, ఎవరికి ఏది అనుకూలమంటే దాన్ని ఎంచుకుంటున్నారు. కాకపోతే రెండేళ్లు ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ఆకర్షణీయమైన మార్పులు చేస్తూ... పాత పన్ను విధానం నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా కొత్త విధానంలోకి మారేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈసారి పాత విధానం వృథా అనేలా చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్నుల విధానంలో 72 శాతం మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారు. పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి.. కొత్త పన్నుల విధానంలో పలు రాయితీలను ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేయవచ్చన్నది ఆర్థిక మంత్రి ఆలోచనగా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం... కొత్త విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, రూ.15–20 లక్షల వరకు ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబ్ను ప్రవేశపెట్టాలనే వాదనలు బలంగా వస్తున్నాయి. ఆర్థిక మంత్రి గనక ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్లో మధ్య తరగతికి మేలు జరిగినట్లే. బడ్జెట్ సమావేశాల ఆరంభానికి ముందు... శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పన్ను మినహాయింపులపై ఆశలు పెంచేలా ఉన్నాయి. మధ్యతరగతి, పేదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇన్ఫ్రాకు బూస్ట్కొంతకాలంగా ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంపై దృష్టి సారించడం వల్ల ఇన్ఫ్రా రంగంమీద ఫోకస్ ఉంటుంది. అయితే ఈ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు నిరుత్సాహకరంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చే మూలధన వ్యయం మద్దతును పెంచే అవకాశముంది. వివిధ పరిశ్రమలలో ఇప్పటికే మంచి ఫలితాలను చూపించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించడం ద్వారా తయారీ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం కనిపిస్తోంది. వినియోగాన్ని పెంచడం తక్షణ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోటీతత్వం ,ఉపాధి అవకాశాలను పెంచే దీర్ఘకాలిక వ్యూహాలపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.యువత ఉపాధి, కీలక రంగాలకు మద్దతురాబోయే రోజుల్లో లక్షల మంది యువతీ యువకులు డిగ్రీ పట్టాలతో మార్కెట్లోకి వస్తారు. వీళ్లందరికీ ఉద్యోగాలు లభిస్తేనే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. ఇందువల్ల ఉద్యోగ కల్పనపై కూడా బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవ కాశం ఉంది. నిర్మాణం, జౌళి, ఇ–కామర్స్, పర్యాటక రంగాలు పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.ఈ రంగాలకు బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు ఉండొచ్చు. దీనికి అదనంగా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం వారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా విధానాలు ప్రకటించచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి ప్రభుత్వం నుంచి నిరంతర సహాయం అందేలా చర్యలు తీసుకునే వీలుంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం రుణ హామీ పథకాలను విస్తరించడం, ఎగుమతులకు అదనపు ప్రోత్సాహæకాలు అందించడం వంటి చర్యలను పరిశీలించవచ్చు. వీటికి తోడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై విధించే పన్నుల సరళీకరణ కూడా బడ్జెట్లో ఉండొచ్చు.వ్యవసాయం, గ్రామీణ ఆర్థికంపై ఫోకస్వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎక్కువ మద్దతు లభించే అవకాశం ఉంది. రైతులు రుణాలను సులభంగా పొందడానికి ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాలను విస్తరించవచ్చు. ఈ రంగానికి మరింత మద్దతుగా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పంట నిల్వల కోసం గోదాముల నిర్మాణం, వ్యవసాయ మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వొచ్చు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వంటి కార్యక్రమాలు నీటిపారుదలను గణనీయంగా పెంచినప్పటికీ, ఇంకా పురోగతికి అవకాశం ఉంది. పరిశోధన, అభివృద్ధితో సహా సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలతో వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెంచడానికి రైతులకు మరింత మద్దతు అవసరం. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని, అందుబాటు గృహాల నిర్మాణం మరో ముఖ్యమైన అంశంగా ఉండొచ్చు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలకు నిధులు పెంచి, దాని పరిధిని విస్తరించే అవకాశముంది. -
ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రం
ఏటా బడ్జెట్ వస్తుందంటే చాలు.. తమకు ఏమైనా ఊరట లభిస్తుందేమోననే ఆశ వేతన జీవుల్లో కనిపిస్తుంది. ఆదాయపన్నులో ఏమైనా రాయితీలు కల్పించారా అనే లెక్కల్లో మునిగిపోతారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మనదేశంలో పన్ను చెల్లించే ఉద్యోగుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు బడ్జెట్ రోజున ఐటీ శ్లాబ్(IT Slabs)ల గురించి ఆరా తీస్తారు. అయితే, దేశం మొత్తం ఈ లెక్కలతో బిజీగా ఉన్నా.. ఒక్క రాష్ట్రంలోని ప్రజలు మాత్రం తమకేం సంబంధం లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆదాయపన్ను అనేదే కట్టరు. అదేంటి పన్ను కట్టకుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అనే డౌట్ వస్తుందా? అవును ఆ వెసులుబాటు ఇచ్చిందే కేంద్రం. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటో తెలుసా?.. సిక్కిం. 330 ఏళ్లకుపైగా రాచరిక రాజ్యంగా స్వతంత్రంగా ఉన్న సిక్కిం(Sikkim).. 1975లో 22వ రాష్ట్రంగా భారత్లో విలీనమైంది. అయితే ఆ సమయంలో సిక్కిం ఓ షరతు పెట్టింది. తాము భారత్లో విలీనమైనా.. తాము అంతకుముందు తమ పాలనలో ప్రజలకు పన్నులు విధించలేదని, ఇప్పుడు కూడా ఆ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేసింది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో సిక్కిం ప్రజలకు ఆదాయ పన్ను కట్టే భారం తప్పింది. ఈమేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం సిక్కింకు ప్రత్యేక హోదా ఉంటుంది.తలసరి ఆదాయంలో నంబర్వన్..దేశంలో సేంద్రియ రాష్ట్రంగా గుర్తింపు పొందిన సిక్కిం తలసరి ఆదాయం కూడా అదుర్స్. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.5,88,000 తలసరి ఆదాయంతో దేశంలోనే సిక్కిం టాప్లో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరం జాతీయ సగటులో సిక్కిం తలసరి ఆదాయం 320 శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక సిక్కిం తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) దేశ తలసరి జీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలుఎవరికి మినహాయింపు ఉంటుంది?ఇదంతా విన్న తర్వాత అర్జెంటుగా సిక్కిం వెళ్లిపోతే ఈ ఐటీ బాధలేమీ ఉండవు అనుకుంటున్నారా? అలాంటి పప్పులేమీ ఉడకవు.. 1975 కంటే ముందు నుంచి అక్కడ ఉన్న సిక్కిం నివాసితులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వలస వెళ్లినవారికి ఇది వర్తించదు. ఈ మేరకు 2008లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను(Income Tax) చట్టంలో సెక్షన్ 10 (26 ఏఏఏ)ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తి సిక్కింకి చెందిన వారు అయి ఉండి ఏ రకంగానైనా ఆదాయం సంపాదిస్తున్నట్లయితే పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంపెనీ వేరే రాష్ట్రంలో ఉండి డివిడెండ్లు, సెక్యూరిటీల ద్వారా ఆదాయం వస్తే కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. -
‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’
అమెరికా పన్నుల వ్యవస్థను పునర్నిర్మించే సాహసోపేత చర్యలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక విధానాలు అనుసరించాలని చెప్పారు. అమెరికన్ పౌరులకు ఆదాయపు పన్నును రద్దు(abolishing income tax) చేయాలని ప్రతిపాదించారు. దాని స్థానంలో పౌరుల డిస్పోజబుల్ ఆదాయాన్ని(కనీస అవసరాలు, ఈఎంఐలు.. వంటి వాటికి ఖర్చు చేశాక మిగిలే మొత్తం) పెంచే లక్ష్యంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను ప్రవేశపెట్టాలని ట్రంప్ సూచించారు. హౌస్ రిపబ్లికన్ మెంబర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.1870-1913 మధ్య కాలంలో అమెరికా ప్రత్యేక టారిఫ్(tariff)లను ప్రవేశపెట్టి వాటివల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడిందని ట్రంప్ తెలిపారు. తర్వాత ఆ ప్రత్యేక టారిఫ్లను క్రమంగా తొలగించారని గుర్తు చేశారు. ఈ వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరోసారి ఊతమిస్తుందని ట్రంప్ అన్నారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికన్లను ధనవంతులుగా, మరింత శక్తిమంతులుగా మార్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆదాయపన్ను రద్దు చేసి, దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచాలనే విధానాలు ప్రవేశపెట్టాలని ట్రంప్ చెబుతుండడం చర్చకు దారి తీసింది.భారత్, చైనాలపై టారిఫ్లుఈ విధానాన్ని పర్యవేక్షించడానికి, టారిఫ్లు, సంబంధిత ఆదాయాల నిర్వహణకు బాధ్యత వహించే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే జనవరి 20న ట్రంప్ తన ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ..‘అమెరికా పౌరులను సంపన్నులుగా చేయడానికి విదేశాలపై సుంకాలు విధిస్తాం. మన ఖజానాకు విదేశీ వనరుల నుంచి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది’ అన్నారు. ట్రంప్ చైనా, భారత్ వంటి దేశాలపై టారిఫ్లు విధిస్తామని చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్లో రూ.102 కోట్ల మోసంఈ ఆదాయ పన్ను రద్దు పథకంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరిలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించినప్పటికీ, మరికొందరిలో విమర్శలకు దారితీస్తుంది. పెరిగిన దిగుమతి వ్యయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పన్ను పునర్వ్యవస్థీకరణను అమలు చేయడంలో లోపాలు ఎదురవుతాయని అమెరికన్ కాంగ్రెస్లో కొంతమంది చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అమెరికన్ కార్మికులు, వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి నిబద్ధతతో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ‘అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము వెంటనే వాణిజ్య వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు. -
Budget 2025: కొత్త ట్యాక్స్ శ్లాబ్ రాబోతోందా?
పన్ను చెల్లింపుదారులకు ఉపశమనంగా రాబోయే యూనియన్ బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) కొత్త పన్ను విధానంలో గణనీయమైన మార్పులు చూడవచ్చు. రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబ్ను (new tax slab)ప్రవేశపెట్టడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రకటించబోతున్నారు. రెండు పన్ను విధానాలలో రాయితీలు, పన్ను తగ్గింపుల కోసం వేతనజీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ. 7.75 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు. ఇందులో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. ఇక సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు అత్యధికంగా 30% పన్ను శ్లాబ్ కిందకు వస్తారు. వీటిలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది."రెండు అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. బడ్జెట్ అనుమతించినట్లయితే, రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం స్లాబ్ను ప్రవేశపెట్టవచ్చు" అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా నివేదిక ఉటంకించింది. ఈ ఆదాయపు పన్ను మినహాయింపు ప్రభావంతో రూ.50,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల ఆదాయ నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినట్లు వివరించింది.కీలక ప్రతిపాదనలుకేంద్ర బడ్జెట్ 2025-26 నేపథ్యంలో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) కీలకమైన పన్ను సంస్కరణలను సిఫార్సు చేసింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5.7 లక్షలకు పెంచాలని సూచించింది. 2025 నాటికి పొదుపు సొమ్ముపై వచ్చే వడ్డీకి ఇస్తున్న రూ. 10,000 మినహాయింపును రూ. 19,450కి పెంచడం, బీమా ప్రీమియంలు, పీఎఫ్ కాంట్రిబ్యూషన్కు సంబంధించి రూ. 1.5 లక్షల మినహాయింపును రూ. 2.6 లక్షలకు సర్దుబాటు చేయడం వంటి చర్యలను జీటీఆర్ఐ ప్రతిపాదించింది.ఇదీ చదవండి: డబుల్ గుడ్న్యూస్! కొత్త బడ్జెట్లో రెండు పెద్ద ప్రకటనలు?గత ఏడాది మాదిరిగా కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను పెంచడంలో ఆశ్చర్యం కలిగించకపోవచ్చని చాలా మంది మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వృద్ధి దెబ్బ తిన్న సమయంలో వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కొన్ని పన్ను చర్యలను ప్రకటించినప్పటికీ, వృద్ధి లేదా ఆదాయాలను పునరుద్ధరించడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే విషయంలో బడ్జెట్ పరిమిత ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుందని వారు నమ్ముతున్నారు. -
డబుల్ గుడ్న్యూస్! కొత్త బడ్జెట్లో రెండు పెద్ద ప్రకటనలు?
కేంద్ర కొత్త బడ్జెట్-2025 (Union Budget 2025) మన ముందుకు వచ్చేందుకు ఇక కొన్ని రోజులే ఉన్నాయి. ఇదిలా ఉంటే పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానానికి సంబంధించి రెండు పెద్ద ప్రకటనలు చేయనున్నారు. కొత్త పన్ను విధానంలో మినహాయింపుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇచ్చే ప్రణాళిక ఇది. అలాగే ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వచ్చేలా చేసి వారి ఖర్చు సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యం.ఆయా వర్గాల సమాచారం నిజమైతే.. ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులో మార్పులు చేయవచ్చు. కానీ ఈ మినహాయింపు కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు, మినహాయింపు పరిధిని పెంచవచ్చు. మొదటి ప్రయోజనం స్టాండర్డ్ డిడక్షన్లో కాగా, రెండోది రూ.15-20 లక్షల పన్ను శ్లాబ్లో ఉన్నవారికి ఇవ్వవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు?కొత్త పన్ను విధానంలో ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.75,000 లుగా ఉంది. మూలాల ప్రకారం.. ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచవచ్చు. గత బడ్జెట్లో కూడా ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50000 నుండి రూ. 75000కి పెంచింది. ఈ మార్పు జరిగితే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంలో రూ.లక్ష వరకు పన్ను ఆదా అవకాశాన్ని పొందుతారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు.20% పన్ను శ్లాబ్ పరిధి పెంపు?రెండవ పెద్ద శుభవార్త ఏమిటంటే.. కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం 20% పన్ను స్లాబ్ పరిధిని పెంచవచ్చు. రూ. 12-15 లక్షల ఆదాయం ఉన్న వారిపై ఇప్పటి వరకు 20% పన్ను విధించేవారు. కానీ, ఇప్పుడు దాన్ని రూ.20 లక్షల ఆదాయానికి పెంచవచ్చు. ఈ మార్పు ముఖ్యంగా రూ.15-20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ మార్పు మధ్య, అధిక ఆదాయ సమూహానికి చెందిన పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?పీఎంవోదే తుది నిర్ణయం 2025 బడ్జెట్లో పన్ను సంబంధిత మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం పీఎంవో తీసుకుంటుంది. దీనికి సంబంధించిన నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాత పన్ను విధానాన్ని ఉపసంహరించుకునేందుకు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు పరిధిని పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో ఉంది.ఆర్థిక లోటును తగ్గించడమే సవాలుదేశ సార్వత్రిక బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వానికి ఇది రెండవ పూర్తి బడ్జెట్. ఆర్థిక లోటును అదుపులో ఉంచుకోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉంటుందని పెద్ద ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు లక్ష్యం 4.9%. దీనిని 2026 నాటికి 4.5% కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
బహుమతి పుచ్చుకుంటున్నారా..?
పెళ్లి, నామకరణం.. వేడుక ఏదైనా బోలెడన్ని బహుమానాలు వచ్చి పడుతుంటాయి. ఉద్యోగుల పనితీరుకు మెచ్చి యాజమాన్యాలు సైతం పలు రూపాల్లో ఉచిత కానుకలు అందిస్తుంటాయి. నగదు రూపంలో లేదా వస్తు రూపంలో లేదా పర్యటనల రూపంలో ఈ ప్రయోజనాలు ఉండొచ్చు. ఇలాంటి బహుమతులన్నీ ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం. ఈ విషయంలో చట్టంలో పలు మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే వచ్చిన కానుకలను చట్టబద్దం చేసుకోవచ్చు. ఇవి తెలియకపోతే ఆదాయపన్ను విభాగం నుంచి తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించే కథనం ఇది. బహుమానం ఎవరి నుంచి వచ్చిందన్న దానితో సంబంధం లేదు. దాని విలువ రూ.50,000కు మించకుండా ఉంటే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ ఈ బహుమానం స్నేహితులు, లేదా ఇతరుల నుంచి అందుకుంటే, దాని విలువ రూ.50,000కు మించి ఉంటే ఆ మొత్తంపై తప్పకుండా పన్ను చెల్లించాలి. ఒకవేళ ఈ బహుమానం విలువ రూ.50,000కు మించి ఉన్నా సరే.. దాన్ని సమీప బంధువుల నుంచి అందుకుంటే ఎలాంటి పన్ను వర్తించదని ఆదాయపన్ను చట్టం చెబుతోంది. రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఒక ఆర్థిక సంవత్సరానికే పరిమితం. అంటే ఒకే సారి కాకుండా, ఏటా రూ.50,000 విలువకు మించకుండా బంధువులు కాని వారి నుంచి బహుమతి స్వీకరించడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ప్రత్యేక మినహాయింపులు పెళ్లి సందర్భంగా బంధు మిత్రుల నుంచి వివిధ రూపాల్లో కానుకలు వస్తుంటాయి. విలువతో సంబంధం లేకుండా ఇలాంటివన్నీ కూడా పన్ను మినహాయింపు కిందకే వస్తాయి. బంగారం, వ్రస్తాలు, ప్రాపర్టిలు, షేర్లు, బాండ్లు.. ఇలా బహుమతి ఏదైనా, ఎంత విలువ అయినా పెళ్లి సమయంలో అందుకుంటే పన్ను పడదు. వీలునామా ద్వారా సంక్రమించిన కానుకలు (ఆస్తులు/మరేవైనా) లేదా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపైనా లేదా ఒకరి మరణంతో దానంగా సంక్రమించే వాటికి కూడా బహుమతి పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. గిఫ్ట్ ట్యాక్స్ను మొట్టమొదటగా 1958 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. దీన్ని 1998లో రద్దు చేశారు. అనంతరం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) కింద బహుమతి పన్నును ప్రవేశపెట్టారు. విలువతో కూడిన ఏ బహుమానం అయినా, అది ఏ రూపంలో ఉన్నా ఈ సెక్షన్ కింద పన్ను పరిధిలోకి వస్తుంది. బహుమతి స్వీకరించిన వారికే పన్ను బాధ్యత. ఇచ్చిన వారిపై ఉండదు. తప్పకుండా వెల్లడించాల్సిందే.. సమీప బంధువులు, బంధువులు కాని వారి నుంచి బహమతులు అందుకున్నా కానీ, ఈ వివరాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. ‘ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ షెడ్యూల్ కింద వివరాలు తెలియజేయాలి. ఉచిత బహుమతులే అయినప్పటికీ, వీటిని భవిష్యత్తులో విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను బాధ్యత ఎదురవుతుంది. కనుక బహుమతుల స్వీకరణను ఐటీఆర్లో తప్పకుండా వెల్లడించడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు గిఫ్ట్ స్వీకరణకు సంబంధించి ఆధారాలను సైతం జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. భవిష్యత్తులో ఆదాయపన్ను శాఖ అధికారులు వివరాలు కోరితే ఇవ్వడానికి ఉంటుంది. విలువైన, ఖరీదైన బహమతుల విషయంలో స్టాంప్ పేపర్పై గిఫ్ట్ డీడ్ రాసుకోవాలన్నది నిపుణుల సూచన. ఆదాయపన్ను శాఖ అదికారుల నుంచి పిలుపు వస్తే నిరూపించుకునేందుకు ఆధారంగా పనికొస్తుంది. ‘‘పన్ను పరిధిలోకి రాని బహుమతుల వివరాలు వెల్లడించేందుకు ప్రస్తుత ఐటీఆర్ షెడ్యూల్స్లో నిబంధనల్లేవు. అయినా కానీ, రక్షణాత్మక ధోరణితో వాటిని ‘షెడ్యూల్ ఎగ్జెంప్ట్ ఇన్కమ్’ కింద వెల్లడించడం సూచనీయం’’అని ఇండస్ లా పార్ట్నర్ శృతి కె.పి సూచించారు. అన్ని ఐటీఆర్ పత్రాల్లోనూ షెడ్యూల్ ఈఐ ఉంటుంది. కనుక ఆదాయ వనరుల ఆధారంగా ఐటీఆర్ను ఎంపిక చేసుకుని, అందులో బహమతుల వివరాలు వెల్లడించాలి. తల్లిదండ్రుల నుంచి బహుమతి తీసుకున్నప్పుడు, వారి ఆదాయ వనరుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సమీప బంధువులు ఎవరు? చట్టంలో ‘రిలేటివ్’ (బంధువు)కు వివరణ ఉంది. భార్య లేదా భర్త; తల్లి దండ్రులు; అమ్మ వైపు అమ్మమ్మ, తాతయ్య; నాన్న వైపు నాయనమ్మ, తాతయ్య; భార్య లేదా భర్త వైపు సహోదరులు; తల్లి, తండ్రి తోడబుట్టిన వారు.. వీరంతా బంధువు కిందకే వస్తారు. సెక్షన్ 56 ప్రకారం మరింత వివరంగా చెప్పుకోవాలంటే..? భార్యకు భర్త, భర్తకు భార్య బంధువే. వీరిలో ఒకరి సోదరులు, సోదరీమణులు మరొకరికి బంధువే అవుతారు. సోదరుడు, సోదరుడి భార్య, అలాగే సోదరి, సోదరి భర్తను కూడా చుట్టంగానే చట్టం పరిగణిస్తోంది. తండ్రి లేదా తల్లి తోడబుట్టిన వారు, వారి జీవిత భాగస్వాములు సైతం (అత్త, మామ, బాబాయి, పిన్ని) బంధువులే అవుతారు. అలాగే భార్య తన భర్త తండ్రి (మామ), తల్లి (అత్త) నుంచి, ఆ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి తీసుకునే కానుకలు.. ఇదే మాదిరి భర్త తన భార్య తల్లిదండ్రులు (అత్త, మామ), ఈ అత్తా మామల తల్లిదండ్రుల నుంచి పొందే కానుకల విలువ ఎంత ఉన్నా చట్టం పరిధిలో పన్ను చెల్లించక్కర్లేదు. కానుకలు అన్నీ ఒక్కటేనా? ఉచితంగా ఇచ్చేవి ఏవైనా సరే కానుకల కిందకే వస్తాయి. వాస్తవ విలువలో కొంత మొత్తాన్ని తీసుకుని ఇచ్చినా చట్ట పరిధిలో బహుమతి అవుతుంది. బంగారం కావచ్చు. లేదా భూమి, ఫ్లాట్, ఆభరణాలు, కళాకృతులు (స్థిర, చరాస్తులు), గృహోపకరణాలు, ఇతర వస్తువులు ఏవైనా సరే చట్టం పరిధిలో బహుమతే అవుతుంది. నగదు రూపంలో వచ్చే బహుమానం విషయంలో, విలువ ఎంతన్న దానిపై గందరగోళం ఉండదు. కానీ, బంగారం లేదా షేర్లు, లేదా భూములు తదితర కానుకల విలువ నిర్ణయించే విషయంలో నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. అంటే వీటికి చట్టపరిధిలో విలువను ఖరారు చేయాలి. లిస్టెడ్ కంపెనీల షేర్లు అయితే బహుమతి ఇచ్చే నాటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. భూమి, ఫ్లాట్, ప్లాట్ తదితర స్థిరాస్తిని రూపాయి కూడా తీసుకోకుండా బహుమతి కింద ఇస్తే.. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ స్థిరాస్తిని (భూమి/భవనం) ఉచితంగా కాకుండా, మార్కెట్ విలువ కంటే తక్కువకు బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. అటువంటప్పుడు స్వీకర్త చెల్లించిన మొత్తం, స్టాంప్ డ్యూటీ విలువ నుంచి తీసివేసిన తర్వాత, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మొత్తం స్టాంప్ డ్యూటీలో 10 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి రూ.10 లక్షల ప్రాపర్టీని రూ. 5లక్షలు తీసుకుని బహుమతి కింద ఇచ్చారని అనుకుందాం. ఆ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.8 లక్షలు ఉంది. ఈ కేసులో మార్కెట్ విలువ రూ.8 లక్షల నుంచి, స్వీకర్త చెల్లించిన రూ.5 లక్షలు మినహాయించగా, మిగిలిన రూ.3లక్షలు.. రూ.50,000 పరిమితిని దాటింది. కనుక ఈ కేసులో స్టాంప్ ట్యూటీ విలువ రూ.8 లక్షల్లో 10 శాతం అంటే.. రూ.80,000పై పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆభరణాలు, పెయింటింగ్లు, శిల్పాలు తదితర చరాస్తులను బహమతిగా పొందినప్పుడు, వాటి ఫెయిర్ మార్కెట్ ప్రైస్ (సహేతుక మార్కెట్ ధర) రూ.50,000 మించితే, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. ఒకవేళ సహేతుక మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తానికి కానుకగా పొందారనుకుంటే.. అప్పుడు సహేతుక మార్కెట్ ధర నుంచి, చెల్లించిన ధర తీసివేయగా మిగిలిన వ్యత్యాసంపై పన్ను చెల్లించాలి. స్థిరాస్తిని రూపాయి కూడా చెల్లించకుండా ఉచిత బహమతిగా పొందితే, విడిగా ప్రతి లావాదేవీకి రూ.50,000 పరిమితి వర్తిస్తుందని ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఎఫ్ఏక్యూ స్పష్టం చేస్తుంది. దీని ఆధారంగా ఎక్స్ అనే వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు స్థిరాస్తులను బహమతిగా స్వీకరించాడని అనుకుందాం. విడిగా ప్రతి ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.50,000 మించి లేదు. ఇలాంటప్పుడు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడదు. హెచ్యూఎఫ్లకు కూడా ఇదే వర్తిస్తుంది. గిఫ్ట్ ద్వారా ఆదాయం..→ నామకరణం, ఇతర సందర్భాల్లో పిల్లల పేరిట కూడా బహమతులు సంక్రమిస్తుంటాయి. అ లాంటి బహుమతులపై వచ్చే ఆదాయం వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. → కొంత మంది పన్ను భారం తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో.. ప్రాపర్టిపై తమకు వస్తున్న అద్దె ఆదాయాన్ని తమ పిల్లలు లేదా మనవళ్లు/మనవరాళ్లకు (బంధువులు) ఏ నెలకానెల బహుమతి కింద ఇచ్చేస్తుంటారు. చట్టం దీన్ని బహుమతిగానే పరిగణిస్తుంది. కానీ, దీనికంటే ముందు బహుమతిగా ఇస్తున్న వ్యక్తి వార్షిక ఆదాయానికి అద్దె ఆదాయం కలుస్తుందని మర్చిపోవద్దు. అంటే చట్ట ప్రకారం సంబంధిత అద్దె ఆదాయాన్ని తమ వార్షిక రిటర్నుల్లో చూపించి, పన్ను పరిధిలోకి వస్తే పన్ను చెల్లించాల్సిందే. → తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి అందులో నగదు డిపాజిట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తారు. కానీ, ఇలా మైనర్ పేరిట చేసిన డిపాజిట్పై వచ్చే ఆదాయం సంబంధిత తల్లితండ్రి లేదా సంరక్షకుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డిపాజిట్ను బహమతిగా చూపించినప్పటికీ.. చిన్నారులు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు. వారికి ఏ విధమైన ఆదాయం ఉండదు. కనుక ఆ బహమ తులపై ఆదాయం వారి తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. → ఒకవేళ ప్రత్యేక నైపుణ్యాలు, మరేదైనా స్టార్టప్ రూపంలో చిన్నారులు సంపాదిస్తుంటే వారి వ్యక్తిగత ఆదాయమే అవుతుంది. అలాంటి కేసుల్లో చిన్నారుల తరఫున తల్లిదండ్రులు రిటర్నులు వేసి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆదాయానికి కలిసే విషయంలో.. దంపతులు ఇద్దరూ సంపాదనా పరులైతే వారి లో ఎక్కువ ఆర్జించే వారికి ఇది కలుస్తుంది. → ఉదాహరణకు షేర్లను పిల్లలకు గిఫ్ట్గా ఇస్తే, వాటిపై వచ్చే డివిడెండ్ తల్లిదండ్రుల ఆదాయానికే కలుస్తుంది. యాజమాన్యం నుంచి బహమతులు మన దేశంలో ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులకు పలు సందర్భాల్లో బహమతులు ఇస్తుంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే బహుమతుల విలువ రూ.5,000 మించకపోతే, దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. నగదు, గిఫ్ట్ వోచర్, ఈ–వోచర్, ప్రీపెయిడ్కార్డ్ ఇలా ఏ రూపంలో ఉన్నా, వాటి విలువ రూ.5,000 మించితే ఆ మొత్తం వేతన ఆదాయానికి కలిపి చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ‘‘ఒక ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం చెల్లించే అన్ని రకాల బహుమతుల విలువ రూ.5,000 మించితే అది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది’’అని బీడీవో ఇండియా పార్ట్నర్ (ట్యాక్స్) ప్రీతి శర్మ తెలిపారు. ఎంత పన్ను చెల్లించాలి? ఆదాయపన్ను చట్టం ప్రకారం పన్ను మినహాయింపుల్లేని కేసుల్లో.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న కానుకల విలువను ఇతర ఆదాయం (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) కింద చూపించాల్సి ఉంటుంది. అంటే సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి మొత్తం ఆదాయానికి ఇది తోడవుతుంది. శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వారి ఆదాయం బేసిక్ పన్ను మినహాయింపు (పాత విధానంలో రూ.2.5 లక్షలు, కొత్త విధానంలో రూ.3 లక్షలు) పరిధిలోనే ఉండి, బహుమానం విలువ కలిపిన తర్వాత కూడా బేసిక్ పరిమితి దాటకపోతే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఒక్కో బహుమతికి విడిగా రూ.50,000 పరిమితి వర్తించదని, ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న అన్ని బహుమతులకు (నిబంధనల మేరకు) రూ.50,000 పరిమితి వర్తిస్తుందని మనీఎడ్యుసూ్కల్ వ్యవస్థాపకుడు ఆర్ణవ్ పాండా తెలిపారు. – సాక్షి, బిజినెస్డెస్క్ -
బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. -
ఐటీఆర్ ఫైలింగ్: రేపటి నుంచి రూ.5000 ఫైన్!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇచ్చిన గడువు నేటితో (జనవరి 15) ముగియనుంది. ఇక రేపటి నుంచి ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే.. ఆలస్య రుసుము కింద రూ. 1000 నుంచి రూ. 5000 వరకు జరిమానాతో చెల్లించాల్సి ఉంటుంది.ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఆ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
Budget 2025: వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు!
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో (Budget 2025) మూలధన వ్యయాలు, పన్ను చట్టాల సరళతరం, వ్యక్తిగత ఆదాయపన్ను (income taxe) తగ్గింపు ప్రతిపాదనలకు చోటు కల్పించొచ్చని ఈవై ఇండియా అంచనా వేసింది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు పన్నుల ఉపశమనం తప్పనిసరి అని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను వచ్చే నెల 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. దీంతో బడ్జెట్ అంచనాలతో ఈవై ఇండియా ఒక నోట్ను విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.31 లక్షల కోట్ల మేర ఆదాయపన్ను వివాదాల రూపంలో చిక్కుకుపోయినట్టు చెప్పింది. ఆదాయపన్ను కమిషనర్ (అప్పీళ్లు) సత్వరమే వీటిని పరిష్కరించాలని, ప్రత్యామ్నాయ పరిష్కార యంత్రాంగాలను తీసుకురావాలని సూచించింది.‘‘ప్రత్యక్ష పన్నుల కోడ్ సమగ్ర సమీక్షకు సమయం తీసుకోవచ్చు. కాకపోతే ఈ దిశగా ఆరంభ నిర్ణయాలకు బడ్జెట్లో చోటు ఉండొచ్చు. వ్యక్తిగత ఆదాయపన్నును సైతం తగ్గించొచ్చు. తక్కువ ఆదాయ వర్గాలకు ఉపశమనంతోపాటు డిమాండ్కు ఊతం ఇచ్చేందుకు వీలుగా చర్యలు ఉండొచ్చు’’అని ఈవై ఇండియా నేషనల్ ట్యాక్స్ లీడర్ సమీర్ గుప్తా తెలిపారు.ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే విధంగా వ్యూహాత్మక సంస్కరణలపై బడ్జెట్లో దృష్టి సారించొచ్చన్నారు. ద్రవ్య స్థిరీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధికి తగిన నిర్మాణాత్మక చర్యలు ఉండొచ్చన్నారు.పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు.. ముఖ్యంగా పన్నుల విధానాన్ని సులభంగా మార్చడం, కస్టమర్ల సేవలను మెరుగుపరచడం, వివాదాలను తగ్గించడం, పన్ను నిబంధనల అమలును పెంచడం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రకటించొచ్చని ఈవై ఇండియా అంచనా వేస్తోంది. పన్ను చట్టాల సులభీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేసింది.ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కీలకంగా దృష్టి సారించాలని పేర్కొంది. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మూలధన లాభాల విధానాన్ని హేతుబద్దీకరించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతూ.. ఈ దిశగా మరిన్ని చర్యలు రాబోయే బడ్జెట్లో ఉండొచ్చని తెలిపింది. ముఖ్యంగా ఎస్ఎంఈలకు పన్నుల సంక్లిష్టతను తగ్గించడం ఎంతో అవసరమని అభిప్రాయపడింది. -
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పెంచుతూ కీలక ప్రకటన చేసింది. దీంతో గడువు మరో 15 రోజులు ముందుకు సాగింది.నిజానికి ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) గడువు 2024 డిసెంబర్ 31.. అయితే ఈ గడువును ఆదాయ పన్ను శాఖ 2025 జనవరి 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులు.. వారి ఫైలింగ్లను పూర్తి చేయడానికి లేదా సవరించడానికి ఓ అవకాశం అని తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 119 ప్రకారం.. బోర్డు అధికారాలను ఉపయోగించి ఈ మార్పు చేసింది.సాధారణంగా ప్రతి ఏటా ఐటీఆర్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ జులై 31. ఈ తేదీ లోపల ఐటీఆర్ ఫైల్ చేయనివారు.. జరిమానా చెల్లించి డిసెంబర్ 31 లోపల ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ గడువును కూడా మరో 15 రోజులు పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. జనవరి 15 లోపల ఐటీఆర్ ఫైల్ చేయని వారు మాత్రమే కాకుండా.. ఫైల్ చేసిన వారు కూడా ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఆదాయం ఐదు లక్షల రూపాయలకంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో బకాయిలపై వడ్డీ, ఫెనాల్టీ వంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్లైన్ పొడిగింపు2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జనాభాలో 6.68 శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) డిసెంబర్ 17న పార్లమెంటుకు తెలియజేశారు. ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసుకునే మొత్తం వ్యక్తుల సంఖ్య 8,09,03,315 అని ఆయన పేర్కొన్నారు.CBDT extends the last date for furnishing Belated/ Revised return of income for AY 2024-25 in the case of Resident Individuals from 31st December, 2024 to 15th January, 2025.✅Circular no. 21/2024 dated 31/12/2024 issued-https://t.co/DedADMfnGX pic.twitter.com/sBVdGZqxRF— Income Tax India (@IncomeTaxIndia) December 31, 2024 -
ట్యాక్స్ పేయర్లకు శుభవార్త.. డెడ్లైన్ పొడిగింపు
ఆదాయపు పన్ను శాఖ 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' (Vivad Se Vishwas Scheme 2024) గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు తక్కువ ట్యాక్స్ రేట్లతో వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.డిసెంబర్ 31తో ముగియనున్న 'వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024' గడువును ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ 2025 జనవరి 31కి పొడిగించింది. ఈ గడువును పొడిగించకుండా ఉండి ఉంటే.. దరఖాస్తు చేసుకునేవారు 10 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉండేది. కాబట్టి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకొని వారు కూడా నిర్దిష్ట గడువు లోపల అప్లై చేసుకోవచ్చు.పొడిగించిన గడువు వల్ల ప్రయోజనాలువివాద్ సే విశ్వాస్ స్కీమ్ అనేది.. 2024 బడ్జెట్లో ప్రకటించారు. పన్ను (Tax) చెల్లింపుదారులు తక్కువ మొత్తంలో వివాద్ సే పన్నును చెల్లించడం ద్వారా పెండింగ్లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అనుమతిస్తుంది.2025 జనవరి 31 తరువాత లేదా ఫిబ్రవరి 1నుంచి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారు అదనంగా 10 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సీబీడీటీ (CBDT) పేర్కొంది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.CBDT extends due date for determining amount payable as per column (3) of Table specified in section 90 of Direct Tax Vivad Se Vishwas Scheme, 2024 from 31st December, 2024 to 31st January, 2025.Circular No. 20/2024 dated 30.12.2024 issuedhttps://t.co/uYGf1Oh3g2 pic.twitter.com/agjuRsMHqg— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2024 -
‘వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గించాలి’
వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని వాణిజ్య సంఘాలు కోరాయి. అలాగే, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలకు ప్రేరణనివ్వాలని, ఇంధనం(Fuel)పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని, చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్(Budget 2025) ముందస్తు సమావేశంలో భాగంగా ఈమేరకు ప్రతిపాదనలు చేశాయి.ఈ కార్యక్రమంలో వాణిజ్య మండళ్ల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో దీపమ్ కార్యదర్శితోపాటు ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పాల్గొన్నారు. 2025 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి మీడియాతో మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నట్టు చెప్పారు.‘భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉత్పత్తులు చైనా ద్వారా దిగుమతి అవుతుండడం చూస్తున్నాం. వాతావరణానికి సంబంధించి సమస్యలు, ఇతర అంశాలు ఆహార భద్రత, ద్రవ్యోల్బణం(Inflation)పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ దిశగా మేము పలు సూచనలు చేశాం. అధిక ఉపాధికి అవకాశం ఉన్న వ్రస్తాలు, పాదరక్షలు, పర్యాటకం, ఫర్నీచర్ తదితర రంగాలకు ప్రేరణ కల్పించే చర్యలు తీసుకోవాలని కోరాం. ఎంఎస్ఎంఈ(MSME)లకు సంబంధించి చర్యలతోపాటు, అంతర్జాతీయ వాల్యూ చైన్తో భారత్ను అనుసంధానించాలని కోరాం. పెట్రోల్పై కొంత ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా ఖర్చు పెట్టే ఆదాయాన్ని పెంచొచ్చని సూచించాం’ అని పురి వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ వలంటీర్లు.. సేవా కార్యక్రమాలుచైనా దిగుమతులతో ఇబ్బందులు..చైనా సొంత ఆర్థిక వ్యవస్థ నిదానించడంతో చౌకగా ఉత్పత్తులను భారత్లోకి పంపిస్తోందంటూ, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు తాము తెలియజేశామని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్ తెలిపారు. ఆదాయపన్ను తగ్గించడం వల్ల ప్రజల చేతుల్లో ఆదాయం మిగులుతుందని, వినియోగాన్ని పెంచుతుందని సూచించినట్టు పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ హేమంత్ జైన్ వెల్లడించారు. జీఎస్టీని సులభంగా మార్చాలని కూడా కోరినట్టు తెలిపారు. సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎంఎస్ఎంఈలకు కావాల్సిన వాటిపై (రుణాల లభ్యత, టీడీఎస్ సులభతరం) దృష్టి పెట్టాలని కోరినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ పేర్కొన్నారు. -
సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్లలో ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.అయితే ఇది ఫేక్ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck✔️This message is #fake pic.twitter.com/kFVbGje5FB— PIB Fact Check (@PIBFactCheck) December 29, 2024 -
వచ్చే బడ్జెట్లో భారీ శుభవార్త! ట్యాక్స్ తగ్గుతుందా?
రాబోయే 2025-26 బడ్జెట్లో ( 2025-26 Budget ) కేంద్ర ప్రభుత్వం ( Govt ) భారీ శుభవార్త చెప్పబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రూ. 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్నును ( Income Tax ) తగ్గించే అవకాశం ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనం మధ్య ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు వివరించింది.పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కోరారు. రాబోయే బడ్జెట్పై వారి అభిప్రాయాలు సూచనలను వినడానికి నీతి ఆయోగ్లో ( NITI Aayog ) ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్నును తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్లో ఎగుమతులకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) 2025-26 సంవత్సరానికి బడ్జెట్ను 2025 ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా గత జులైలో 2024-25 బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్షను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 2025-26 బడ్జెట్కు ముందు ప్యానెల్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.అయితే కొత్త ఐటీ చట్టం రాబోయే బడ్జెట్ సెషన్లో ఉండదని, ఇది అమలులోకి రావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని మనీ కంట్రోల్ రిపోర్ట్ పేర్కొంది. ‘మార్పులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి. ఇది పూర్తిగా కొత్త చట్టం కాబట్టి, చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని నియమాలు కొత్త ఫారమ్లను ప్రారంభించాలి. పరీక్షించాలి.. సిస్టమ్-ఇంటిగ్రేట్ చేయాలి దీనికి సమయం కావాలి’ అని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది. -
వివాద్ సే విశ్వాస్ పై సందేహాల నివృత్తి
ఆదాయపన్ను శాఖ ‘వివాద్ సే విశ్వాస్’ పథకానికి సంబంధించి సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. తరచూ అడిగే ప్రశ్నలకు (ఎఫ్ఏక్యూలు) సమాధానాలు విడుదల చేసింది. 2024 జులై 22 నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల అప్పీళ్లకు వివాద్ సే విశ్వాసం పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని భావించే వారు ఈ నెల 31లోపు ప్రత్యక్ష పన్నుల వివాద్ సే విశ్వాస్ కింద డిక్లరేషన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి.ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! భారీగా తగ్గిన బంగారం ధరతాజా స్పష్టతతో పన్ను చెల్లింపుదారులు అందరికీ కేసుల పరిష్కారంలో సమాన అవకాశాలు లభిస్తాయని నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ సచిన్ గార్గ్ తెలిపారు. జులై 22 నాటికి పెండింగ్లో ఉన్నవి, కొట్టేసిన వాటికి సైతం ఈ పథకం కింద పరిష్కారానికి అర్హత ఉంటుంది. వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2024–25 బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అక్టోబర్ 1న దీన్ని నోటిఫై చేశారు. డిసెంబర్ 31లోపు డిక్లరేషన్ దాఖలు చేసిన వారు పరిష్కారానికి వీలుగా వివాదంలో ఉన్న పన్ను మొత్తాన్ని చెల్లించాలి. 2025 జనవరి 1, ఆ తర్వాత డిక్లరేషన్ దాఖలు చేస్తే వివాదంలోని పన్ను మొత్తంలో 110 శాతాన్ని చెల్లించాలని ఆదాయపన్ను శాఖ తెలిపింది. -
గుకేశ్ ప్రైజ్మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?
అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన డీ గుకేశ్కు దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, టెక్ సీఈఓ సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు. 58 ఎత్తుల్లోప్రత్యర్థి ఆటకు చెక్ పెట్టిన గుకేశ్ ప్రైజ్ మనీ కింద సుమారు రూ.11 కోట్లు పొందనున్నారు. అయితే ఇందులో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? చివరగా చేతికి వచ్చేది ఎంత అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వరల్డ్ చెస్ పెడరెషన్ (ఫిడే) ప్రకారం.. చెస్ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు. ఒక గేమ్ గెలిచిన వారికి రూ.1.68 కోట్లు ఇస్తారు. ఇలా గుకేష్ మూడు గేమ్స్ గెలిచాడు. ఈ లెక్కన మొత్తం రూ.5.04 కోట్లు గుకేష్ సొంతమయ్యాయి. రెండు గేమ్స్ గెలిచిన డింగ్కు రూ. 3.36 కోట్లు దక్కాయి. అంటే మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీతో ఇద్దరు ఆటగాళ్లు రూ.8.40 కోట్లు కైవసం చేసుకోగా.. మిగిలిన రూ.12.35 కోట్లను ఇద్దరికీ సమానంగా పంచుతారు. ఇలా గుకేశ్కు రూ.11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది.గుకేశ్కు వచ్చిన ప్రైజ్ మనీతో 30 శాతం లేదా రూ.4.67 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం పన్నులు చెల్లించిన తరువాత గుకేష్ చేతికి అంతేది రూ.6.33 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలిచింది గుకేష్ కాదు, ఆర్ధిక శాఖ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ఇది టీడీఎస్.. అంటే ట్యాక్స్ డిటెక్టెడ్ బై సీతారామన్ అని మరికొందరు చెబుతున్నారు. ఆట ఆడకుండానే.. ఆదాయపన్ను శాఖ గెలిచిందని ఇంకొకరు అన్నారు. ఆటగాళ్లపై విధించే ట్యాక్స్లను తగ్గించాలని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు.ఐపీఎల్ వేలంలో కూడా..ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పోతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట. -
Income Tax: పాత విధానమా.. కొత్త విధానమా..?
ఆర్థిక సంవత్సరం 2020–21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. గడువు తేదీలోపల ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే, కొత్త విధానమే పాటించాలి. పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.. ఇలా ఉన్నాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. రేట్లు 5,10, 15, 20, 30 శాతంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. ఏ ప్రాతిపదికన ఎంచుకోవాలి? » మీ ఆదాయ స్వభావం » మీ ఆదాయం » సేవింగ్స్ » పెట్టుబడులు » సొంతిల్లు రుణం – రుణం మీద వడ్డీ » మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు » జీతం మీద ఆదాయం ఒక్కటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి » జీతంతో పాటు ఇతర ఆదాయాలు ఉంటే మరొకలాగా ఆలోచించాలి » వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు .. వారి ఇన్వెస్ట్మెంట్ విధానం » ఉద్యోగస్తులు వారికి ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. » వ్యాపారస్తులకు అలా మార్చుకునే వెసులుబాటు లేదు » ఒకరితో ఒకరు పోల్చుకోకండి. మీ విధానం మీదే. మీ ఆదాయం మీదే. మీ పన్నుభారం మీదే.ఎటువంటి సేవింగ్స్ లేకపోతే కొత్త పద్ధతిలో రూ. 29,900 పన్ను భారం తగ్గుతుంది. సుమారు రూ. 30,000 మిగులు. అయితే, మీ చేతిలో ఎంతో నిలవ ఉంటుంది. దీన్ని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరిచ్చే ప్రాధాన్యత, మీ అవసరం మొదలైన వాటి ప్రకారం మీ ఇష్టం.మరో కేసులో కేవలం జీతం రూ. 7,00,000 కాగా సేవింగ్స్ లేవు అనుకుందాం. అప్పుడు..కొత్త పద్ధతిలో ట్యాక్స్ పడదు. పాత పద్ధతిలో పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదంటే, ఆ మేరకు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అంటే మీ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. ఆటోమేటిక్గా అందరూ కొత్త దాని వైపే మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా పీఎఫ్ మొదలైన సేవింగ్స్ ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం సేవ్ చేస్తుంటాం. మన అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులంటే, ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి.. ఇద్దరూ కొంత చేసి.. ఇలా ఎన్నో ఆలోచనలే మీ ట్యాక్స్ ప్లానింగ్కి దారి తీస్తాయి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 15 డెడ్లైన్!
ఆదాయ పన్ను చెల్లించేవారు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలు తెలుసుకోవడం మాత్రమే కాదు, దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 15 వచ్చేస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరం మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుకు ఇదే చివరి గడువు.డిసెంబర్ 15లోపు మూడో విడత పన్ను చెల్లించాలి. లేకుంటే భారీ ఫెనాల్టీ చెల్లించడం మాత్రమే కాకుండా.. చట్ట పరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా పన్నులు చెల్లించడం వల్ల జరిమానాలను నివారించవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారు.. జూన్ 15, సెప్టెంబరు 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీలలో నాలుగు వాయిదాలలో ముందస్తు పన్ను చెల్లించాలి.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మూడవ ముందస్తు పన్ను వాయిదా డిసెంబర్ 15, 2024న ముగుస్తుంది. ఆ రోజు ఆదివారం కాబట్టి.. చెల్లింపుదారులు ఎలాంటి జరిమానాలు లేకుండా సోమవారం (డిసెంబర్ 16) చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం 1994లో జారీ చేసిన ఒక సర్క్యులర్లో వెల్లడించారు. అప్పటి నుంచి ఈ నియమంలో ఎలాంటి మార్పు చేయలేదు. కాబట్టి ట్యాక్స్ చెల్లించడానికి ఆఖరు రోజు సెలవు దినం అయితే.. ఆ మరుసటి పనిదినంలో చెల్లించవచ్చు.అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కించడంప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అందే అన్ని రకాల ఆదాయాలను అంచనా వేయాలి. అంచనా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులను తీసివేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్నును లెక్కగట్టాలి. ఈ మొత్తం పన్ను విలువ రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ముందస్తు పన్ను చెల్లించాలి.ఆన్లైన్లో అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు చేయడం ఎలా?● ఆన్లైన్లో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలనుకునే వారు 'ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా' (భారత ఆదాయపు పన్ను శాఖ) ఈ-ఫైలింగ్ పోర్టల్ని ఓపెన్ చేయాలి.● అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు క్విక్ లింక్స్ కింద కనిపించే 'ఈ-పే ట్యాక్స్' (e-Pay Tax)పై క్లిక్ చేయాలి. ● ఈ-పే ట్యాక్స్ ఓపెన్ చేసిన తరువాత పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.● ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ● 'ఇన్కమ్ ట్యాక్స్' కింద ట్యాక్స్ కేటగిరి ఎంచుకుని.. కంటిన్యూ అవ్వాలి.● అడ్వాన్స్ ట్యాక్స్ 100కు చెల్లించాలనుకుంటే.. కేటగిరి 100ను ఎంచుకోవాలి. ● ట్యాక్స్ మొత్తాన్ని ఎంచుకున్న తరువాత.. ఏ విధంగా చెల్లింపులు చేస్తారో సెలక్ట్ చేసుకోవాలి. ● ట్యాక్స్ చెల్లించడానికి ముందు.. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. ఆ తరువాత ట్యాక్స్ చెల్లించాలి. -
రూ.27 కోట్లలో రిషబ్ పంత్ చేతికి వచ్చేది ఎంతంటే..
ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఏకంగా రూ.27 కోట్ల ధరకు పలికాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) సొంతం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ రెండూ కూడా పంత్ కోసం పోటీపడి ఊరుకున్నాయి.ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పొందుతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట.డిసెంబర్ 2022లో రోడ్డుప్రమాదం నుంచి బయటపడిన పంత్కు మోకాలి సర్జరీ జరిగింది. ఆ తరువాత పంత్ క్రికెట్ ఆడలేడేమో అని అందరూ భావించారు. కానీ పట్టువదలని విక్రమార్కునిలా మళ్ళీ బ్యాట్ చేతపట్టుకున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఐపీల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. -
పన్ను చెల్లింపుదారులు పెరిగారు
ఆంధ్రప్రదేశ్లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పెరిగారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆదాయపు పన్ను ఫైల్ బేస్ వాటా పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలవగా.. బిహార్, ఏపీ, రాజస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. 2023–24 అసెస్మెంట్ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్)లపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను సోమవారం విడుదల చేసింది. 2023–24 అసెస్మెంట్ ఏడాదిలో వ్యక్తిగత ఐటీఆర్ ఫైల్ చేసిన వారిలో మహిళలు 15 శాతం ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. మహిళలు వ్యక్తిగత ఐటీఆర్ ఫైల్ చేసిన టాప్ రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని తెలిపింది. -
భారీగా పెరిగిన వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు
సాక్షి, అమరావతి: గడచిన దశాబ్దకాలంలో దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2014 నుంచి 2024 వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. 2014లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించిన వారి సంఖ్య కేవలం 40వేలు ఉండగా, 2024లో ఐదు రెట్లు.. అంటే 2.2 లక్షలకు పెరిగిందని నివేదిక వెల్లడించింది.అలాగే దేశంలో 2014లో మధ్యతరగతి ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.5.0 లక్షల వరకు ఉండగా 2024లో మధ్యతరగతి ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.10.0 లక్షల వరకు పెరిగిందని పేర్కొంది. దేశంలో గత పదేళ్లలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 4.8 కోట్లు పెరిగిందని నివేదిక వివరించింది. 2014లో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 3.79 కోట్ల మంది ఉండగా 2014లో 8.62 కోట్ల పెరిగిందని ఎస్బీఐ వెల్లడించింది. -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
గడువు తేదీ గడిచిపోయిందా..
రెండు రోజులు ఆలస్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా అందరికీ అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటూ.. ‘‘గడువు తేదీ’’ని కేవలం ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు వేసే కోణంలోనే పరిశీలిద్దాం. 2024 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరపు రిటర్నులు వేయడానికి గడువు తేదీ 2024 జూలై 31. మీలో చాలా మంది సకాలంలో వేసి ఉంటారు. ఈసారి రిటర్నులు వేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డిపార్టుమెంటు వారు చెప్తున్నారు. అనారోగ్యం కానివ్వండి. విదేశాయానం కానివ్వండి. కారణం ఏదైనా కానివ్వండి. మీరు రిటర్ను ఇంకా వేయలేదా? చింతించకండి. బెంగ వద్దు. ఇలాంటి వారికి చక్కని రాజమార్గం ఉంది. లేటు ఫీజు కట్టాలి. ఇలా లేటు ఫీజు చెల్లించినవారికి 2024 డిసెంబర్ 31 వరకు గడువు తేదీ ఉన్నట్లు లెక్క. అంటే మరో రెండు నెలల పదిహేను రోజులు. అలా అని ఆలస్యం చేయకండి.ఎంత లేటు ఫీజు చెల్లించాలి.. ఆలస్యమైన నెలలతో సంబంధం లేకుండా రెండు రకాల నిర్దేశిత రుసుములు ఉన్నాయి. పన్నుకి గురయ్యే ఆదాయం.. రూ. 5,00,000 లోపల ఉంటే రూ. 1,000 చెల్లించాలి. పన్నుకి గురయ్యే ఆదాయం రూ. 5,00,000 దాటి ఉన్నట్లయితే, ఫీజు రూ. 5,000 ఉంటుంది. ఇవి మారవు. అంటే మీరు ఆగస్టు 1 నుండి డిసెంబర్ 31 లోపల ఎప్పుడు దాఖలు చేసినా రుసుములంతే. అయితే, పన్ను చెల్లించాల్సి ఉంటే వడ్డీ విధిస్తారు. ఇది నెలకు 1 శాతం చొప్పున వడ్డిస్తారు.రిఫండు క్లెయిమ్ చేసినా అప్పటికి పన్ను చాలా చెల్లించినట్లయితే, ఈ వడ్డీ పడదు. పన్ను చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే మీరు తొందరపడాల్సి ఉంటుంది. వడ్డీని తగ్గించుకోవచ్చు. మీరు బయటి నుంచి 1 శాతం వడ్డీతో అప్పు తెచ్చి పన్ను భారం చెల్లించే బదులు ఆ వడ్డీ మొత్తం ఏదో ‘సీతమ్మగారి పద్దు’లో పడేలా ప్లాన్ చేసుకోండి. మీ ఆర్థిక వనరులను ప్లాన్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆలోచించుకోండి. ఈ వెసులుబాటనేది ‘తత్కాల్’ టిక్కెట్టు కొనుక్కుని రైల్లో ప్రయాణం చేసినట్లు ఉంటుంది. అయితే, రిటర్ను గడువు తేదీలోగా దాఖలు చేయకపోవడం వల్ల రెండు పెద్ద ఇబ్బందులు తలెత్తుతాయి. వీటి విషయంలో ఎలాంటి వెసులుబాటు లేదు. గడువు తేదీ లోపల రిటర్ను వేసేవారికి డిపార్టుమెంటు రెండు ప్రయోజనాలు పొందుపర్చింది. ఆ రెండు ప్రయోజనాలూ లేటు విషయంలో వర్తించవు. ఇంటి మీద ఆదాయం లెక్కింపులో మనం లోన్ మీద వడ్డీని నష్టంగా పరిగణిస్తాం.ఆ నష్టాన్ని పరిమితుల మేరకు సర్దుబాటు చేసి, ఇంకా నష్టం మిగిలిపోతే దాన్ని రాబోయే సంవత్సరాలకు బదిలీ చేసి, నష్టాన్ని.. ఆదాయాన్ని సర్దుబాటు చేస్తాం. దీని వల్ల రాబోయే సంవత్సరంలో పన్ను భారం తగ్గుతుంది. ఇది చాలా ప్రయోజనకరంగా, ఉపశమనంగా ఉంటుంది. లేటుగా రిటర్ను వేస్తే ఈ ‘బదిలీ’ ప్రయోజనాన్ని ఇవ్వరు. ఈ సదుపాయాన్ని శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుంది.ఇక రెండోది.. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పద్ధతి లేదా కొత్త పద్ధతుల్లో.. మనం ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సాధారణంగా పన్ను తగ్గే పద్ధతి ఎంచుకుంటాం. మనం గడువు తేదీ లోపల రిటర్ను వేయకపోతే, ఇలా ఎంచుకునే అవకాశం ఇవ్వరు. కంపల్సరీగా కొత్త పద్ధతిలోనే పన్నుభారాన్ని లెక్కించాలి. అయినా, రిటర్ను వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.1. ఇది మీ ఆదాయానికి ధృవపత్రం అవుతుంది 2. రుణ సౌకర్యం లభిస్తుంది 3. విదేశీయానం అప్పుడు వీసాకి పనికొస్తుంది 4. చట్టంలో ఉన్న అన్ని ప్రయోజనాలను పొందవచ్చు 5. పెనాల్టీ మొదలైనవి ఉండవు కాబట్టి రిటర్నులు వేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే
ముంబై: షిర్డీ సాయి బాబా ట్రస్టుకు హుండీ కానుకల రూపంలో వస్తున్న నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతేడాది అక్టోబరు 25న ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (షిర్డీ) ఒక ధార్మిక సంస్థ అని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ముంబై ఐటీ కమిషనర్ (మినహాయింపులు) వాదించారు. హుండీ రూపంలో గుర్తుతెలియని భక్తులు సమర్పిస్తున్న కానుకలు.. మొత్తం విరాళాల్లో ఐదు శాతాన్ని దాటుతున్నాయి కాబట్టి.. పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. 2015–16, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో హుండీ కానుకల రూపంలో షిర్డీ ట్రస్టుకు రూ.400 కోట్లు అందాయని, అందులో కేవలం రూ. 2.3 కోట్లు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు వెచ్చించారని ఐటీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. అధికభాగం నిధులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు మళ్లించారని పేర్కొన్నారు. జస్టిస్ జి.ఎస్.కులకర్ణి, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్లు ఈ వాదనతో విభేదించారు. షిర్డీ ట్రస్టు మతపరమైన, చారిటబుల్ ట్రస్టు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోరడం చట్టబద్ధంగా న్యాయమని, సబబని తీర్పునిచ్చారు. -
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్ను అన్లాక్ చేస్తాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్బై ప్లాట్ఫామ్లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్ల చొప్పున తనిష్క్ వోచర్ల కోసం రివార్డ్ పాయింట్ల రిడీమ్ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్యూఎఫ్లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం. -
పన్ను వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 1 నుంచి ‘వివాద్ సే విశ్వాస్ 2.0’
న్యూఢిల్లీ: పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకాన్ని 2024–25 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.రూ.35 లక్షల కోట్ల పన్నుకు సంబంధించి 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్లు వివిధ దశల్లో, న్యాయ వేదికల వద్ద అపరిష్కృతంగా ఉండడం గమనార్హం. వీటికి పరిష్కారంగా గతంలో అమలు చేసిన వివాద్ సే విశ్వాస్ పథకాన్ని మరో విడత కేంద్రం తీసుకురావడం గమనార్హం. -
దేశం విడిచి వెళ్తుంటే ట్యాక్స్ మొత్తం కట్టాల్సిందేనా? కేంద్రం క్లారిటీ
దేశం విడిచి వెళ్తున్న వారందరూ ముందుగా ట్యాక్స్ బకాయిలన్నీ తప్పనిసరిగా చెల్లించాలంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పందించింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చట్టంలోని సెక్షన్ 230కు సంబంధించి వివరణ ఇచ్చింది.పన్ను చెల్లింపుదారుల్లో కలకలం సృష్టించిన ఈ వార్తలపై సీబీడీటీ స్పందిస్తూ.. దేశం విడిచి వెళ్తున్న ప్రతి భారతీయ పౌరుడు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని సెక్షన్ 230 ఆదేశించదని పేర్కొంది. ఆవశ్యకమైన నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఇది వర్తిస్తుంది. 2004 ఫిబ్రవరి 5 నాటి సీబీడీటీ ఇన్స్ట్రక్షన్ నంబర్ 1/2004 ప్రకారం, తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు లేదా ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ. 10 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే దేశం విడిచి వెళ్లే ముందు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి వారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచారణలో ప్రత్యక్షంగా పాల్గొనడం అవసరం.అంతేకాకుండా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ ఏకపక్ష ప్రక్రియ కాదు. దీనికి ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ నుంచి లిఖితపూర్వకమైన ముందస్తు అనుమతి అవసరం. ఇన్కమ్ టాక్స్ యాక్ట్, వెల్త్ టాక్స్ యాక్ట్, గిఫ్ట్-టాక్స్ యాక్ట్, ఎక్స్పెండిచర్-టాక్స్ యాక్ట్, మనీ యాక్ట్, 2015 వంటి వివిధ పన్ను చట్టాల కింద సదరు వ్యక్తికి ఎటువంటి బకాయిలు లేవని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. దీన్ని ఇటీవలి ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించారు.ఫైనాన్స్ (నం. 2) బిల్లు, 2024లో క్లాజ్ 71లో బ్లాక్ మనీ యాక్ట్, 2015కు సంబంధించిన సూచనలను చేరుస్తూ సెక్షన్ 230కి సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు వచ్చే అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం.. గుర్తించిన కేటగిరీల కింద కొంతమంది వ్యక్తులు దేశం విడిచి వెళ్లేముందు తప్పనిసరిగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలి. -
కొత్త పన్ను విధానంలో మార్పులు..
-
ఐటీ పోర్టల్లో అప్డేట్.. ఆ మినహాయింపు దూరం!
ఆదాయపు పన్ను పోర్టల్లో ఇటీవలి అప్డేట్ కారణంగా కొత్త పన్ను విధానాన్ని ఉపయోగిస్తున్న పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన మినహాయింపును కోల్పోయే ప్రమాదం వచ్చింది.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A కింద లభించే ఈ మినహాయింపు, తక్కువ-ఆదాయం ఉన్నవారికి (రూ. 7 లక్షల లోపు) రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్డేట్ చేసిన ట్యాక్స్ ఫైలింగ్ యుటిలిటీని ఉపయోగించి కొత్త పన్ను విధానం కింద రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ట్యాక్స్ పేయర్లు స్వల్పకాలిక మూలధన లాభాలను నమోదు చేసినట్లయితే రూ. 25,000 వరకు లభించే పన్ను మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది.ఈ రిబేట్ అనేది ఆదాయపు పన్నుపై ఇచ్చే రాయితీ. ఇది తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు వారి పన్నును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కేంద్ర బడ్జెట్ 2023లో మార్పుల ప్రకారం, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే రూ. 25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.అసలేమైంది? మినహాయింపు అర్హత కోసం పోర్టల్ 'మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని' గణించే విధానంలో వ్యత్యాసం కారణంగా సమస్య తలెత్తుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ల ప్రకారం, ప్రస్తుత వ్యవస్థ ఈ గణనలో స్వల్పకాలిక మూలధన లాభాలను (STCG) తప్పుగా చేర్చింది.ఇది స్వల్పకాలిక మూలధన లాభాలు కలిగినవారు ఆదాయం పరిమితి రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ పన్ను మినహాయింపును తొలగిస్తోంది.కాగా జూలై 5 లోపు రిటర్న్స్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక మూలధన లాభాలతో సంబంధం లేకుండా మినహాయింపును క్లెయిమ్ చేయగలిగారు. ఆ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తున్నవారికే ఈ సమస్య వస్తోంది. స్వల్పకాలిక మూలధన లాభాలు మినహా స్థూల మొత్తం ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే, సెక్షన్ 111A స్పష్టంగా మినహాయింపును అనుమతిస్తుంది. కానీ పోర్టల్లో లోపం కారణంగా ఇలాంటి వారు మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది. -
‘మూర్తి సార్.. మీ ఇన్ఫోసిస్ వాళ్లకు చెప్పండి’
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్లో సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సున్నితమైన కౌంటర్ ఇచ్చారు ఓ చార్టెర్డ్ అకౌంటెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఐటీ శాఖ పోర్టల్లో సమస్యలు తలెత్తడం మీద దాన్ని అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్పై బెంగళూరుకు చెందిన సీఏ ఒకరు సోషల్ మీడియా వేదికగా అంతృప్తి వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’లో బసు (@Basappamv) అనే సీఏ ఓ పోస్టు పెట్టారు. దేశాన్ని నిర్మించడానికి యువ నిపుణులు వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను హాస్యాస్పదంగా ప్రస్తావించారు. "నారాయణ మూర్తి సార్, మీ సలహా మేరకు, మేము పన్ను నిపుణులం వారానికి 70 గంటలకు పైగా పని చేయడం ప్రారంభించాం. ఆదాయపు పన్ను పోర్టల్ను సజావుగా నడపడానికి మీ ఇన్ఫోసిస్ బృందాన్ని వారానికి కనీసం ఒక గంట పని చేయమని అడగండి" అంటూ రాసుకొచ్చారు.ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన వార్షిక సమాచార ప్రకటన (AIS), పన్ను సమాచార ప్రకటన (TIS) డౌన్లోడ్ చేయడంలో సమస్యలను పేర్కొంటూ చాలా మంది సీఏలు బసు మనోభావాలను ప్రతిధ్వనించారు. ట్యాక్స్ఆరామ్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్, భాగస్వామి మయాంక్ మొహంకా, "ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో సాధారణ జాప్యం జరుగుతోంది" అని పేర్కొన్నారు.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, పోర్టల్లోని సాంకేతిక సమస్యలతో జరిగిన ఆలస్యం కారణంగా చాలా మంది క్లయింట్ల కోసం ఏఐఎస్, టీఐఎస్లను పొందడంలో చాలా మంది చార్టెర్డ్ అకౌంటెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లింపుదారులను, సీఏలను ప్రభావితం చేస్తున్న పోర్టల్ సమస్యలపై అటు ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు ఇన్ఫోసిస్ గానీ స్పందించలేదు. -
ITR Filing: ఇది చేయకపోతే రూ.5 వేలు పెనాల్టీ!
ఇది జూలై నెల. ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 31 చివరి తేది దగ్గర పడుతోంది. అన్ని పత్రాలను సేకరించుకుని ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని 30 రోజులలోపు ధ్రువీకరించడం చాలా ముఖ్యం. మీరు దీన్ని సమయానికి చేయకపోతే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.వెరిఫికేషన్ ఎలా చేయాలంటే..ఆధార్-ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా/డీమ్యాట్ ఖాతా ద్వారా రిటర్న్ను ఈ-వెరిఫై చేయడం ఐటీఆర్ వెరిఫికేషన్కు సులభమైన మార్గం. ఆన్లైన్ వెరిఫికేషన్ సౌకర్యంగా లేకుంటే, ఐటీఆర్-వీ భౌతిక కాపీని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపవచ్చు. అయితే, ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక విజయవంతమైనట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు సందేశం వస్తుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి కూడా ఈమెయిల్ వస్తుంది.తప్పితే జరిమానా కట్టాల్సిందే..ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, 30 రోజులు దాటినా వెరిఫికేషన్ చేయకపోతే సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుములను చెల్లించవలసి ఉంటుంది. 2024 మార్చి 31 నాటి CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) నోటిఫికేషన్ నం. 2/2024 ప్రకారం, ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 5 లక్షల వరకు ఆదాయానికి ఆలస్య రుసుము రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి రూ. 5,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. -
కట్టిన ఇన్కమ్ టాక్స్ కి సులభంగా రిఫండ్ పొందండి ఇలా
-
Budget 2024: పన్నుల తగ్గింపు యోచనలో ప్రభుత్వం!
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తి కేంద్ర బడ్జెట్ను వచ్చే జులై నెలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రకటించే అవకాశం ఉంది. వ్యక్తిగత పన్ను తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని, మధ్యతరగతికి పొదుపు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.వార్షికాదాయం రూ.15 లక్షలు కంటే ఎక్కువ పొందేవారు పన్ను ఉపశమనం పొందే కేటగిరీలో ఉన్నారని, అత్యధిక పన్ను పరిమితి ఆదాయం ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ణయించలేదని నివేదిక తెలిపింది. రూ.10 లక్షల వార్షికాదాయానికి ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని, పాత పన్ను విధానంలో అత్యధికంగా 30 శాతం పన్ను విధించే ఆదాయానికి కొత్త పరిమితిపై చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది.2020లో ప్రారంభించిన పన్ను విధానంలో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం.. రూ .15 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 5 శాతం నుంచి 20 శాతం పన్ను, రూ .15 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఒక వ్యక్తి ఆదాయం రూ .3 లక్షల నుంచి రూ .15 లక్షలకు ఐదు రెట్లు పెరిగినప్పుడు ఆదాయపు పన్ను రేటు మాత్రం ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనదంటూ నివేదిక పేర్కొంది. -
నగల దుకాణంలో కట్టల కొద్దీ.. కోట్లాది నగదు!
మహారాష్ట్రలోని నాసిక్లో ఓ నగల దుకాణంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టల కొద్దీ కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. స్థానిక సురానా జ్యువెలర్స్ యజమాని అప్రకటిత లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ ఆదివారం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు.ఆదాయపు పన్ను శాఖ వివిధ బృందాలను ఏర్పాటు చేసి ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జ్యువెలర్స్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ఓ బులియన్ ట్రేడర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు, ఆస్తులు లభించడం చర్చలకు దారితీసింది. ప్రస్తుతం ఆ వ్యాపారి సంపద ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ గట్టి నిఘా పెట్టింది. ఇటీవల నాందేడ్ లో రూ.170 కోట్ల విలువైన లెక్కల్లోకి రాని ఆస్తులను సీజ్ చేసింది. తరువాత తాజాగా నాసిక్లో ఈ దాడులు నిర్వహించింది. ఆదాయపు పన్ను శాఖ తీసుకున్న ఈ చర్య మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ నోట్లను లెక్కించడానికి ఆదాయపు పన్ను శాఖకు చాలా గంటల సమయం పట్టింది. దీని కోసం పలు బృందాలను పిలిపించగా ఆ తర్వాత బయటకు వచ్చిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. Income Tax Department launched a raid on Surana Jewellers in Nashik, in response to alleged undisclosed transactions by the proprietor. About Rs 26 crore in cash and documents of unaccounted wealth worth Rs 90 crore have been seized in raids carried out by the Income Tax… pic.twitter.com/XJ0wyuI8HQ— ANI (@ANI) May 26, 2024 -
నాసిక్లోని బులియన్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
-
ఐటీ రిటర్న్స్.. కీలక మార్పులు
ITR filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. వ్యక్తులు, వ్యక్తిగత సంస్థలు లేదా సంఘాలు జూలై 31 లోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.ఐటీఆర్-1 ఫారంఅత్యధిక పన్ను రిటర్న్స్ ఐటీఆర్-1 (ITR-1) ఫారం ద్వారానే దాఖలవుతాయి. దీన్ని సహజ్ ఫారం అని కూడా పిలుస్తారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50 లక్షలకు మించని వ్యక్తులు ఈ కేటగిరీ కింద రిటర్న్స్ ఫైల్ చేయడానికి అర్హులు. జీతం, ఒకే ఇంటి ఆస్తి, కుటుంబ పెన్షన్, వ్యవసాయం (రూ. 5,000 వరకు), పొదుపు ఖాతాల నుంచి వడ్డీ, డిపాజిట్లు (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్/కోఆపరేటివ్ సొసైటీ), ఆదాయపు పన్ను రీఫండ్ వడ్డీ.. ఇలా వివిధ మార్గాలలో లభించే ఆదాయంపై పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.ITR-1కి చేసిన కీలక మార్పులు2024-25 అసెస్మెంట్ ఇయర్కి గానూ ఐటీఆర్-1 ఫారం దాఖలులో ఆదాయపు పన్ను శాఖ పలు కీలక మార్పులు చేసింది. అవేంటంటే..ITR-1 ఫారమ్ను ఫైల్ చేసే వ్యక్తులు తమ పన్ను రిటర్న్ ఫైలింగ్లో తమకు ఇష్టమైన పన్ను విధానాన్ని పేర్కొనాలి.సెక్షన్ 115BACలో ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రవేశపెట్టిన సవరణలను అనుసరించి కొత్త పన్ను విధానం ఇప్పుడు డిఫాల్ట్ పన్ను విధానం. వ్యక్తులు, హోచ్యూఎఫ్లు, ఏఓపీలు, బీఓఐలకు కొత్త పన్ను విధానం స్వయంచాలకంగా వర్తిస్తుంది. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలనుకునే వారు సెక్షన్ 115BAC(6) నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టంగా తెలియజేయాలి.వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం కాకుండా ఇతర ఆదాయం ఉన్న వ్యక్తులు సెక్షన్ 139(1) ప్రకారం సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్లో తప్పనిసరిగా తమ ప్రాధాన్య పన్ను విధానాన్ని పేర్కొనాలి.ఆర్థిక చట్టం 2023 ద్వారా ప్రవేశపెట్టిన సెక్షన్ 80CCH ప్రకారం.. 2022 నవంబర్ 1, ఆ తర్వాత అగ్నిపథ్ స్కీమ్లో చేరి అగ్నివీర్ కార్పస్ ఫండ్కు సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యక్తులు అగ్నివీర్ కార్పస్ ఫండ్లో జమ చేసిన మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపునకు అర్హులు.ఈ మార్పునకు అనుగుణంగా, ITR-1 ఫారంను కొత్త కాలమ్ను పొందుపరుస్తూ సవరణలు చేశారు. సెక్షన్ 80CCH కింద మినహాయింపు కోసం అర్హత ఉన్న మొత్తానికి సంబంధించిన వివరాలను కొత్త ఐటీఆర్-1 ఫారం ద్వారా పన్ను చెల్లింపుదారులు అందించాల్సి ఉంటుంది. -
బ్యాంకు ఉద్యోగులకు షాక్.. వాటిపై పన్ను కట్టాల్సిందే..!
బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రహిత లేదా రాయితీ రుణాలు "అంచు ప్రయోజనాలు" (ఫ్రింజ్ బెనిఫెట్స్) అని, వాటిపై పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.బ్యాంకు సిబ్బంది అనుభవిస్తున్న రుణ ప్రయోజనం వారికి ప్రత్యేకమైనదని, అది జీతంతోపాటు అదనపు ప్రయోజనమని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఈ ప్రయోజనంపై పన్ను వర్తిస్తుందని మే 7న ధర్మాసనం పేర్కొంది.ఆదాయపు పన్ను నియమాన్ని కోర్టు సమర్థించడంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును బెంచ్మార్క్గా నిర్ణయించడం కూడా ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని అభిప్రాయపడింది. ఫ్రింజ్ బెనిఫిట్ గణన కోసం ఒకే స్పష్టమైన బెంచ్మార్క్ను నిర్ణయించడం ద్వారా కస్టమర్ల నుండి వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను నిర్ధారించే చిక్కుముడి ఉండదని బెంచ్ పేర్కొంది.బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత లేదా రాయితీతో కూడిన రుణ ప్రయోజనాలపై ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు ప్రకారం వసూలు చేసే వడ్డీ కంటే బ్యాంకు వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉన్నట్లయితే వీటిని ఫ్రింజ్ బెనిఫిట్స్గా భావించి పన్ను విధించే ఆస్కారం ఉందని ఆదాయపు పన్ను నియమాలు చెబుతున్నాయి. -
అలర్ట్: ఆధార్-పాన్ లింక్ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్
ఆధార్-పాన్ లింక్ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని స్పష్టం చేసింది.కాగా 2022 జూన్ 30 వరకు ఆధార్తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులు జూలై 1 నుంచి ఇన్ఆపరేటివ్లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్ కావాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకున్న తర్వాత రిఫండ్ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు. -
రూ. 200 కోట్ల హవాలా గుట్టు రట్టు.. ఆ పార్టీ పనేనా..?
చెన్నై: లోక్సభ ఎన్నికల వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.200 కోట్ల హవాలా గుట్టు రట్టు చేశారు. మలేషియా నుంచి వచ్చిన హవాలా ట్రేడర్ వినోత్కుమార్ జోసెఫ్ను చెన్నై ఎయిర్పోర్టులో అడ్డుకున్న ఐటీ అధికారులు అతడి నుంచి రూ.200 కోట్ల హవాలాకు సంబంధించి విస్తుపోయే విషయాలను కనిపెట్టారు. లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులోని ఓ ప్రముఖ పార్టీ కోసం రూ.200 కోట్ల హవాలా సొమ్మును దుబాయ్ నుంచి తీసుకురావడానికి ప్లాన్ చేసినట్లు వినోత్ వాట్సాప్ చాట్ల ద్వారా ఐటీ అధికారులు కనిపెట్టారు. వినోత్ లాప్టాప్, మొబైల్ఫోన్, ఐ పాడ్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. అప్పు, సెల్వం, మోనికవిరోల, సురేశ్లు వినోత్ బృందంలో పనిచేస్తున్నట్లు బయటపడింది. ఈ హవాలా కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అప్పగించనున్నారు. కాగా, తమిళనాడులో ఉన్న అన్ని లోక్సభ సీట్లకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత -
ఐటీ నోటీసులు.. కాంగ్రెస్కు భారీ ఊరట
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24 వరకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికే పన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయ పన్ను శాఖ రూ.135 కోట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ముందుగా హైకోర్టు ఆశ్రయించగా అక్కడ ఊరట లభించకపోవటంతో అనంతరం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీకి ఆదాయపన్ను శాఖ నుంచి బకాయిల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగదని సుప్రీంకోర్టు తెలియజేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 24కి వాయిదా వేసింది. ఇక.. 2017-2018 నుంచి 2020-2021 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని శుక్రవారం నోటీసు పంపిన ఆదాయపన్న శాఖ...నిన్న(ఆదివారం) రూ. 1744 కోట్లు కట్టాలని మరో నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 2014-15 నుంచి 2016-17 అసెస్మెంట్ సంవత్సారాలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని ఆ నోటీసులో పేర్కొంది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికల వేళ.. పన్ను ఉగ్రవాదంతో ప్రధాన ప్రతిక్షాలను ఆర్థికంగా తీవ్రం ఇబ్బందికి గురిచేస్తోందని ఆరోపణల చేసింది. ఇక.. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈసీకి కూడా ఫిర్యాదు చేయటం గమనార్హం. -
ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆ సమాచారంపై చాలామందికి సరైన అవగాహనలేక తప్పుదారి పట్టిస్తుంటారు. తాజాగా ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ప్రచారమవుతోంది. అందరూ తప్పకుండా కొత్త పన్ను స్లాబ్లనే పాటించాలని పోస్టులు పెడుతున్నారు. ఈ అంశం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. దాంతో కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలపై క్లారిటీ ఇస్తూ మంత్రిత్వశాఖ తన ‘ఎక్స్’ ఖాతాలో కొన్ని కీలకాంశాలను పేర్కొంది. ఆర్థికశాఖ వివరాల ప్రకారం..పన్ను విధానంలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్తగా మారేదీ ఏదీ లేదు. పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115BAC(1A) కింద కొత్త పన్ను విధానాన్ని గతంలోనే ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్ట్గా వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్ (స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, ఫ్యామిలీ పెన్షన్ రూ.15,000 మినహా) కొత్త విధానంలో లేవు. ఇదీ చదవండి: పెరిగిన టోల్ ధర.. ఏమిటీ టోల్ ట్యాక్స్? ఎందుకు చెల్లించాలి? కొత్త పన్ను విధానం ఇక నుంచి డీఫాల్ట్గా వర్తించనుంది. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంత్సరానికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక ఏడాదిలో కొత్త పన్ను విధానం, మరొక ఏడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. It has come to notice that misleading information related to new tax regime is being spread on some social media platforms. It is therefore clarified that: 👉 There is no new change which is coming in from 01.04.2024. 👉 The new tax regime under section 115BAC(1A) was… pic.twitter.com/DtKGkK0D5H — Ministry of Finance (@FinMinIndia) March 31, 2024 -
కాంగ్రెస్ను వెంటాడుతున్న ‘ ఐటీ’.. రూ.3 వేల కోట్లకు చేరిన నోటీసులు
న్యూఢిల్లీ: తాజాగా ఇచ్చిన నోటీసులతో కలిపి ఆదాయపన్ను శాఖకు కాంగ్రెస్ పార్టీ కట్టాల్సిన రికవరీ సొమ్ము మొత్తం రూ.3567 కోట్లకు చేరింది. 2014-15,2015-16, 2016-2017,2017-18 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.3567 కోట్ల ట్యాక్స్ రికవరీ నోటీసులను రెండు విడతల్లో ఐటీ శాఖ కాంగ్రెస్కు పంపింది. రాజకీయ పార్టీలకు ట్యాక్స్ రాయితీలు తొలగించడం కారణాంగానే కాంగ్రెస్ సేకరించిన మొత్తం విరాళాలపై పన్ను కట్టాల్సిందేనని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సవరించిన పన్నుతో పాటు పెనాల్టీ కూడా విధించడంతోనే నోటీసుల్లో డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తం డిమాండ్ నోటీసులను ఐటీ శాఖ తమ పార్టీకి పంపడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత తాము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని, మళ్లీ ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా చేస్తామని హెచ్చరించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్కు మరో 2 ఐటీ నోటీసులు -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
కాంగ్రెస్కు మరో రెండు ‘ఐటీ’ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఆదాయపన్ను శాఖ(ఐటీ) వెంటాడుతోంది. శుక్రవారమే(మార్చ్ 29)రూ.1800 కోట్ల మేర ఆదాయపన్ను రికవరీ నోటీసులు అందుకున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో రెండు నోటీసులను ఐటీ శాఖ పంపిందని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ చెప్పారు. ఈ నోటీసులు శనివారం రాత్రి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ట్యాక్స్ టెర్రరిజానికి కాంగ్రెస్ టార్గెట్గా మారిందని జైరామ్ ఫైర్ అయ్యారు. కాగా, 2017-18 నుంచి 2020-21 ఆదాయపన్ను అసెస్మెంట్ సంవత్సరాలకుగాను పెనాల్టీ, వడ్డీని కలిపి రూ.1800 కోట్ల పన్ను కట్టాలని శుక్రవారం ఇచ్చిన నోటీసులో ఐటీ శాఖ పేర్కొంది. నాలుగేళ్ల రిటర్న్స్పై రీఅసెస్మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఐటీ రికవరీ నోటీసులు పంపింది. 2014-15, 2015-16,2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను రిటర్నులను కూడా రీ అసెస్మెంట్ చేసే చర్యలు ఐటీ ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 135 కోట్ల మేర నగదును ఫ్రీజ్ చేసింది. ఇదీ చదవండి.. రూ.1823 కోట్లు చెల్లించండి -
Income Tax Department: సీపీఐ, సీపీఎంలకు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను నోటీసుల పరంపరం కొనసాగుతోంది. రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి ఐటీ డిపార్టుమెంట్ నోటీసు జారీ చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత కొన్నేళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు ఫెనాలీ్టలు, వడ్డీ కింద రూ.11 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసు ఇచి్చనట్లు తెలిపాయి. ఈ నోటీసులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి సీపీఐ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అలాగే సీసీఎంకు కూడా ఐటీ నోటీసులు అందాయి. 2016–17లో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటూ ఐటీ విభాగం తాజాగా సీపీఎంకు నోటీసులు ఇచి్చంది. అప్పట్లో ఐటీ రిటర్నుల్లో బ్యాంకు ఖాతాను నిర్ధారించనందుకు రూ.15.59 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
Income Tax Department: రూ.1,823 కోట్లు చెల్లించండి
న్యూఢిల్లీ: రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను విభాగం నుంచి తాజాగా తమ పార్టీకి నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, అజయ్ మాకెన్ చెప్పారు. ఐటీ చట్టాలను అధికార బీజేపీ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ ఉల్లంఘలనకు గాను బీజేపీ నుంచి రూ.4,617.58 కోట్లు వసూలు చేయాలని ఐటీ అధికారులను డిమాండ్ చేశారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని, లోక్సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు తమకు విరాళాలు ఇచి్చనవారి పేర్లు, చిరునామాలను ఫామ్ 24ఏలో పొందుపర్చి, ఎన్నికల సంఘానికి సమరి్పంచాల్సి ఉంటుందని అజయ్ మాకెన్ చెప్పారు. బీజేపీ మాత్రం ఇలాంటి వివరాలను ఏనాడూ సక్రమంగా సమరి్పంచలేదని విమర్శించారు. ఐటీ విభాగం బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆక్షేపించారు. కేవలం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని నోటీసులు ఇస్తోందని అన్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం అని తేలి్చచెప్పారు. పాత ఐటీ రిటర్నులను మళ్లీ తెరవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది రాహుల్ గ్యారంటీ ఐటీ డిపార్టుమెంట్ ఇచి్చన తాజా నోటీసులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తూ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య వలువలు ఊడదీస్తున్నవారికి ప్రభుత్వం మారిన తర్వాత తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తాము తీసుకొనే చర్యలు ఎలా ఉంటాయంటే.. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా భయపడేలా ఉంటాయని, ఇది రాహుల్ గ్యారంటీ అని తేలి్చచెప్పారు. -
ఇన్కమ్ ట్యాక్స్ ఓకే.. మీకు ఈ ‘పింక్ ట్యాక్స్’ గురించి తెలుసా?
బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా ‘పింక్ ట్యాక్స్’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులు తమ అందం కోసం వినియోగించే ప్రొడక్ట్ల ధరల కంటే మహిళల ఉపయోగించే ప్రొడక్ట్ల ధరలు ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అంతేకాదు ఆ తరహా వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం..లింగ ఆధారిత ధరల అసమానతలు అనేక రంగాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అధికం. ఉదాహరణకు, మహిళలకు, పురుషుల కోసం ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, లోషన్లు, డియోడరెంట్ ప్రొడక్ట్లు ఉన్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ సోషల్మీడియాలో వైరలవుతున్న వీడియోపై మంజుదార్ షా స్పందించారు. ఆ వీడియోని 1.5లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం విధించే పన్నుకాదు పింక్ ట్యాక్స్ అనేది అసలు ప్రభుత్వ పన్ను కాదు. ఇది మహిళలకు విక్రయించబడే వస్తువుల ధరను పెంచే వివక్షతతో కూడిన ధరలను సూచిస్తుంది. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 పింక్ టాక్స్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు. మరి ఈ పింక్ ట్యాక్స్ అంటే? ఉదాహరణకు సమ్మర్ సీజన్లో మహిళలు చర్మం పాడవుకుండా పలు స్కిన్ కేర్ ప్రొడక్ట్లు వాడుతుంటారు. అలాగే పురుషులు కూడా. అయితే మహిళలు కొనుగోలు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ ధర రూ.100 ఉంటే, పురుషుల స్కిన్ కేర్ ప్రొడక్ట్ దర రూ.80 ఉంటుంది. అంటే పురుషులు - మహిళలు వినియోగించే ధరల మధ్య వ్యత్యాసం. అలా ధరల మధ్య వ్యత్యాసం ఎందుకనే మంజుదార్ షా అడుగుతున్నారు. ఇలా ఒక్క మంజుదార్ షానే కాదు ఐక్యరాజ్య సమితి సైతం పింక్ ట్యాక్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పింక్ ట్యాక్స్ను తొలగించాలి మహిళలు ఆర్థిక వ్యవస్థలో పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని సాధించేలా పింక్ ట్యాక్స్ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. పింక్ టాక్స్ వల్ల ఆర్థిక భారం డబ్ల్యూఈఎఫ్ ప్రకారం.. వివక్షతతో కూడిన ధరల వల్ల మహిళలపై ఆర్థిక భారం పడుతోంది. పురుషుల కంటే మహిళలు తక్కువ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా, పింక్ ట్యాక్స్ విధించే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మహిళలపై ఆర్ధిక భారం పెరుగుతోంది. -
ఐటీ దాడులు.. ఆ కార్ల విలువే 60 కోట్లు!
ఢిల్లీ: ఇన్కమ్ టాక్స్ (ఐటీ) దాడులనగానే.. కరెన్సీ లేదంటే నగలు లేకుంటే కీలక పత్రాలు బయటపడుతుండడం చూస్తుంటాం. కానీ, ఖరీదైన కార్లు.. అందునా కోట్లు విలువ చేసే పోష్ కార్లు బయటపడడం ఎప్పుడైనా చూశామా?.. తాజాగా ఓ టొబాకో కంపెనీపై జరిగిన ఐటీ దాడుల్లో ఇదే వెలుగుచూసింది. అధికారుల దాడుల్లో అత్యంత ఖరీదైన కార్లు పట్టుబడ్డాయి. తమ దాడుల్లో కనిపించిన ఖరీదైన కార్లను చూసిన ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. శుక్రవారం ఐటీ అధికారుల బృందం.. కాన్పూర్కు చెందిన ఓ టొబాకో కంపెనీపై దాడిలు చేసింది. ఢిల్లీలోని ఆ కంపెనీ యజమాని నివాసంలో కూడా సోదాలు జరిపిపారు. ఈ సోదాల్లో వారికి ఆశ్చర్యపరిచే రీతిలో అత్యంత ఖరీదైన.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెక్లారెన్, లంబోర్ఘిని, ఫెరారీ కార్లు పట్టుపడ్డాయి. వాటివిలువ సుమారు రూ.60 కోట్లు ఉండనుందని ఐటీ అధికారుల అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను బృందం అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లతో పాటు కంపెనీ యజమాని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలతో ఉన్న పలు బ్యాగులతో సుమారు రూ.4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాన్పూర్కు చెందిన బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ అధికారులు గురువారం సాయంత్రం నుంచే సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీలో సంబంధాలు ఉన్న ఐదు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై ఏకకాలంలో 15-20 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు పరిశ్రమలకు పొగాకు సంబంధిత సరుకు ఎగుమతి చేసే ఈ కంపెనీ.. భారీ ఎత్తున టాక్స్లు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ యజమాని అయిన పారిశ్రామికవేత్త కేకే. మిశ్రా (అలియాస్ మున్నా మిశ్రా) సంబంధించిన ప్రాపర్టీ వివరాలు.. పలువురితో చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. తమకు ఏడాదికి రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్ మాత్రమే వస్తుందని చెబుతోంది. కానీ, ఆ కంపెనీ అసలు టర్నోవర్ రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని ఐటీ భావిస్తోంది. ఐటీ అధికారుల దాడుల్లో లభ్యమైన పలు ఖరీదైన కార్లతో పోజులు ఇచ్చిన కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. శివం మిశ్రా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమాలోని ‘కహో నా ప్యార్ హై’ అనే పాటలోని ఉన్న వేషధారణతో ఉండటం గమనార్హం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రోజు(శుక్రవారం) కూడా ఐటీ దాడుల కొనసాగుతున్నాయి. -
ఐటీ రిటర్న్స్లో తప్పులు.. ట్యాక్స్ పేయర్లకు అప్డేట్
ట్యాక్స్ పేయర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. 2021-22, 2022-23 సంవత్సరాలలో మీరు ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసివారికి ఇది ముఖ్యమైన వార్త. మీ ఐటీఆర్లో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కొన్ని ఐటీఆర్లు, థర్డ్ పార్టీ సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించామని, వాటిని సరిదిద్దాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. కొంతమంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్లు, థర్డ్ పార్టీల నుంచి వచ్చిన డివిడెండ్లు, వడ్డీ ఆదాయానికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులో ఉందని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. డిపార్ట్మెంట్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్ ఈ-మెయిల్ ద్వారా వ్యత్యాసం గురించి తెలియజేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వ్యత్యాసాన్ని స్పష్టం చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని తక్కువగా నివేదించిన కేసును సరిచేయడానికి అప్డేటెడ్ ఐటీఆర్ సమర్పించే అవకాశాన్ని పరిగణించవచ్చని సీబీడీటీ పేర్కొంది. -
ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి భారీ మొత్తంలో ఎల్ఐసీకి ట్యాక్స్ రిఫండ్!
ఫిబ్రవరి 14, 2024న ఆదాయపు పన్ను శాఖ నుంచి సుమారు రూ.21,740 కోట్ల మొత్తాన్ని రిఫండ్ పొందినట్లు ఎల్ఐసీ తెలిపింది. 2012-13, 2013-14, 2014-15, 2016-17, 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి ఎల్ఐసీ రీఫండ్ ఆర్డర్లను పొందిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ రీఫండ్ మొత్తం విలువ రూ.25,464.46 కోట్లు. దీనికి సంబంధించి, ఆదాయపు పన్ను శాఖ నిన్న రూ.21,740.77 కోట్లను విడుదల చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం నుంచి మిగిలిన మొత్తాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్, కాసేపటికే..
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు అన్ని ఫ్రీజ్ అయ్యాయి. పన్ను చెల్లించలేదన్న కారణంగానే అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, ఇందులో రాజకీయ దురేద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చిన గంటలోపే.. ఆ పార్టీకి ఉపశమనం లభించింది. అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం మీడియా ద్వారా తెలియజేశారు. ఈ చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణించిన ఆయన.. న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కలవరపరిచే అంశం ఇది. రూ.210 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత చర్య.. పార్టీ ఎన్నికల సంసిద్ధతను దెబ్బ తీసేందుకే’ అని మాకెన్ ఆరోపించారు. 2018-19 ఎన్నికల ఏడాదికి సంబంధించి 45 రోజులు ఆలస్యంగా పార్టీ తమ అకౌంట్లను సమర్పించిందని.. ఆ మాత్రం దానికే అకౌంట్లను స్తంభింపజేయడం ఏంటని? మాకెన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారాయన. .. ఇది ఉద్దేశపూర్వక చర్య అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం మా నాలుగు అకౌంట్లు ఒకే పాన్ నెంబర్ మీద లింక్ అయ్యి ఉన్నాయి. అకౌంట్ల ఫ్రీజ్తో అన్నీ ఆగపోతాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేం. కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరాం. ఆఖరికి న్యాయ్ యాత్రపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారాయన. .. దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి లేకుండా చేస్తున్నారు. ఏక పాలన పార్టీ.. ప్రధాన ప్రతిపక్షం లొంగదీసుకునే యత్నం చేస్తోంది. కానీ, మేం తలొగ్గం. న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజల నుండి న్యాయం కోరుతున్నాం అని మాకెన్ చెప్పారు. ఈ చర్యపై న్యాయపరంగా పోరాడతామని అజయ్ మాకెన్ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను (ITAT) ఆశ్రయించామని తెలిపారు. #WATCH | Congress Treasurer Ajay Maken says "We got information yesterday that banks are not honouring the cheque we are issuing. On further investigation, we got to know that the Youth Congress bank accounts have been frozen. The accounts of the Congress party have also been… pic.twitter.com/JsZL1FEy9d — ANI (@ANI) February 16, 2024 మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా అభివర్ణించారాయన. ఎక్స్ ఖాతాలో ఆయన.. ‘‘ ఎన్నికల కోసం బీజేపీ రాజ్యాంగేతర పద్ధతిలో సేకరించిన సొమ్మును ఖర్చు చేస్తోంది. కానీ, మేం ప్రజల నుంచి సేకరించుకున్న డబ్బును సీజ్ చేసింది. అందుకే బీజేపీ మళ్లీ నెగ్గితే భవిష్యత్తులో ఎన్నికలనేవే ఉండవని.. ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం వస్తుందని మేం చెబుతున్నాం. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి నియంతృత్వ పాలన తీరును ఎండగడతాం’’ అని సందేశం ఉంచారు. सत्ता के नशे में चूर, मोदी सरकार ने लोक सभा चुनाव के ठीक पहले देश की सबसे बड़ी विपक्षी पार्टी - भारतीय राष्ट्रीय कांग्रेस - के Accounts Frozen कर दिए है। ये लोकतंत्र पर गहरा आघात है। भाजपा ने जो असंवैधानिक धन इकट्ठा किया है, उसका इस्तेमाल वे चुनाव में करेंगे, लेकिन हमने… — Mallikarjun Kharge (@kharge) February 16, 2024 ఖాతాలు స్తంభించాయనే విషయం గురువారం తమ దృష్టికి వచ్చిందని పార్టీ న్యాయవాది వివేక్ తన్ఖా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద జారీ చేసే చెక్లను అంగీకరించకూడదని బ్యాంకులకు ఐటీ విభాగం సూచనలు జారీ చేసిందనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే అజయ్ మాకెన్ మీడియా సమావేశం నిర్వహించిన గంటలోపే.. ఆ ఖాతాలు పని చేయడం ప్రారంభించాయి. -
పాన్-ఆధార్ లింక్ ఆలస్యం.. కేంద్రానికి ఊహించనంత ఆదాయం!
నిర్ణీత గడువు లోపు ఆధార్ - పాన్ లింక్ చేయని వినియోగదారుల నుంచి కేంద్రం పెనాల్టీల రూపంలో సుమారు రూ. 600 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఆధార్ - పాన్ లింక్ చేయని వారు 11.48 కోట్ల మంది ఉండగా.. వారందరూ బయోమెట్రిక్ ఐడెంటిటీని పూర్తి చేయలేదని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆధార్ - పాన్ లింక్పై లోకసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్వశ్చన్ అవర్లో కేంద్రం ఉచితంగా ఆధార్ - పాన్ లింక్ చేసుకునేందుకు జూన్ 30,2023కి చివరి తేదీగా నిర్ణయించింది. గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవరైతే ఆధార్ - పాన్ లింక్ చేయాలనుకుంటారో వాళ్లు తప్పని సరిగా అదనపు రుసుము కింద రూ.1000 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత అంటే జులై 1,2023 నుంచి జనవరి 31,2024 వరకు ఆధార్ - పాన్ లింక్ కోసం వినియోగదారుల నుంచి అదనపు రుసుము కింద రూ. 601.97 కోట్లు వసూలు చేసినట్లు వివరణ ఇచ్చారు. ట్యాక్స్ పేయిర్స్కి డెడ్ లైన్ ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పన్ను చెల్లింపు దారులకు ఆధార్ - పాన్ లింక్పై పలు సూచనలు చేశారు. జులై1,2023 వరకు ఆధార్- పాన్ లింక్ చేయని పక్షంలో వారి పాన్ కార్డ్ బ్లాక్ అవుతుందని, ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినా ఫండ్ రిఫండ్ చేయమని స్పష్టం చేసింది. అంతేకాదు టీడీఎస్, టీసీఎస్ సైతం అధిక మొత్తంలో ట్యాక్స్ పేయిర్స్ నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ పాన్ కార్డ్ మళ్లీ పునరుద్దరించాలంటే లేట్ ఫీ కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆ సందర్భంలో ట్యాక్స్ పేయిర్లకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివరించారు. -
పాత పన్ను బకాయిలు రద్దు.. సీతమ్మ పద్దు...
అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకుల అభిప్రాయాలు, అభియోగాలు పక్కన పెట్టండి. షేరు మార్కెట్ ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకండి. కేవలం బడ్జెట్నే ప్రస్తావిద్దాం. అరుపులు లేవు. మెరుపులు లేవు. ప్రజాకర్షణ పథకాలు లేవు. అందర్నీ అలరించాలనే ప్రయత్నము లేదు. అలా అని అందర్నీ కొనేయలేదు. నాలగు వర్గాల వారిని దృష్టిలో పెట్టుకున్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులు.. వీరికి ప్రభుత్వ మద్దతు అవసరం.. వీరి వల్లే ‘‘వికసిత భారత్’’ సాధ్యం అని అంటున్నారు. పేదల సాధికారత, మహిళల శక్తి, యువతకు ప్రోత్సాహం, రైతుల శ్రేయస్సు.. ఇలా నడిచింది ప్రసంగం. పదేళ్లలో సాధించిన ప్రగతి మార్గంలో నడిస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. స్థలాభావం వల్ల ఈ కాలమ్లో కేవలం ఇన్కంట్యాక్స్ వరకే పరిమితం చేద్దాం. మినహాయింపులు లేవు తగ్గింపులు లేవు తాయిలాలు లేవు బేసిక్ లిమిట్ పెంచలేదు శ్లాబులు, రేట్లు యధాతథం ఒక పక్కన ట్యాక్స్పేయర్ల సంఖ్య పెరిగిందని పొగుడుతూ మరో పక్కన మీకు సదుపాయాలు ఇవ్వాలని కరుణ చూపిస్తూ చేతులు దులుపుకొన్నారు ఆర్థిక మంత్రి. అయితే, ఏకంగా కట్టాల్సిన పన్నులను రద్దు చేస్తూ, కోటి మంది ట్యాక్స్పేయర్లకు లబ్ధి చేకూరేలాగా పెద్ద వరం ఇచ్చినందుకు సంబరపడాలి. సంతోషించాలి. వివరాల్లోకి వెళ్తే.. చిన్నవి, వెరిఫై చేయనివి, సమన్వయం కానివి, సందిగ్ధతలో ఉన్నవి, తగువులో ఉన్నవి.. ఇలా ఎన్నెన్నో డిమాండ్లు.. డిపార్టుమెంటు వారి బుక్స్లో పెండింగ్లో ఉన్నాయి. రిఫండ్ కోసం క్లెయిమ్ చేస్తే ‘‘మీ రిఫండును పాత బకాయిలకు సర్దుబాటు చేసేశాం’’ అన్న చావు వార్త. వివరాలు కూడా ఇవ్వకుండా సర్దుబాటు చేసేశారు. జవాబుకి జవాబు ఇవ్వకుండా కాలం దాటేశారు. కబురు లేదు. కన్ఫర్మేషన్ లేదు. సమాచారం లేదు. ఇటు ట్యాక్స్పేయర్స్కి దిక్కుతోచని పరిస్థితి. అనిశ్చితి. ఉత్కంఠ. అయోమయం. అగచాట్లు. ఇలాంటి నేపథ్యంలో ఓ శుభవార్త. ➤ 2009–10 సంవత్సరం వరకు రూ. 25,000 లోపు బకాయిలు పూర్తిగా రద్దు.. ➤ 2010–11 నుంచి 2014–15 వరకు రూ. 10,000 వరకు బకాయిలు పూర్తిగా రద్దు. ఈ స్కీము గురించి రెవెన్యూ సెక్రటరీగారు మాట్లాడుతూ 58 లక్షల కేసుల్లో రూ. 25,000 లోపు బకాయిలు ఉన్నాయని తెలిపారు. రూ. 10,000 లోపు బకాయిల కేసులు 53 లక్షలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తికి ఇది చాలా చిన్న రిలీఫ్లాగా కనబడినా దేశం మొత్తంలో రూ. 3,500 కోట్ల ఉపశమనం దొరుకుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకి గండి లేదా నష్టమనే చెప్పాలి. రేట్లు తగ్గనందుకు, శ్లాబులు మార్చనందుకు, ఎటువంటి రాయితీలు ఇవ్వనందుకు కొంచెం బాధ ఉన్నా.. బకాయిలను రద్దు చేసినందుకు మెచ్చుకోవాలి. డిపార్టుమెంటు వారికి పని తగ్గుతుంది. మనకు డిమాండ్ల భారమూ తగ్గుతుంది. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్ వివరించారు. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్ : ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో కీలక మార్పులు!
ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు దారులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విభాగం ఐటీఆర్ ఫైలింగ్లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఆర్ధిక సంవత్సరం 2022-2023 ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఐటీఆర్-2, ఐటీఆర్ -3 ఫారమ్స్ తప్పని సరిగా ఉపయోగించాలని సూచించింది. అందుకు చివరి గడువు జులై31, 2024కి విధించింది. అయితే ఎవరితే వ్యాపారం చేస్తూ వారికి వచ్చే ఆదాయంపై ట్యాక్స్ ఆడిట్ నిర్వహిస్తుంటే వారు తప్పని సరిగా అక్టోబర్ 31, 2024 లోపు ఐటీఆర్-3 ఫైల్ను తప్పని సరిగా చేయాలని కోరుంది. ఐటీఆర్-2 ఫైలింగ్ ఎవరు చేయాల్సి ఉంటుంది? ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్పోర్టల్ వివరాల ప్రకారం.. వ్యక్తులు లేదంటే హెచ్యూఎఫ్.. అంటే హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ.. కార్పొరేటు వ్యాపార పరిభాషలో అవిభక్త హిందూ కుటుంబం.. మరీ సూటీగా చెప్పాలంటే కుటుంబ పార్టీ.. వ్యాపార పరిభాషలో హెచ్యూఎఫ్కు కర్త ఉంటాడు.. మొత్తం వ్యవహారాలన్నీ తన పేరిటే నడిచిపోతుంటాయ్.. కుటుంబసభ్యులే హక్కుదారు.. అలా ఉండి ట్యాక్స్ కట్టేవారు ఐటీఆర్-2ని తప్పని సరిగా ఫైల్ చేయాలి. ఐటీఆర్-1 ఫైల్ చేసేందుకు అనర్హులు. బిజినెస్, ప్రొఫెషన్ ద్వారా వచ్చే ప్రాఫిట్, లాభాలు లేని వారు ఈ ఫామ్స్ ఉపయోగించాలి. వడ్డీ, శాలరీ, బోనస్ కమీషన్, రెమ్యునరేషన్ వంటి వాటి ద్వారా ప్రాఫిట్స్, ఇతర లాభాలు పొందని వారు, అలాగే జీవిత భాగస్వామి, మైనర్ పిల్లలు వంటి వారి నుంచి ఆదాయం అందుకుంటున్న వారు వారి ఆదాయం మొత్తాన్ని జమ చేసి ఐటీఆర్-2 ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్-2లో మార్పులు రాజకీయ పార్టీలకు చేసిన విరాళాల వివరాలు, వైకల్యం ఉన్న వ్యక్తి వైద్య చికిత్సతో సహా నిర్వహణకు సంబంధించి తగ్గింపు వివరాలు, ఇంకా, పన్ను ఆడిట్ చేయడానికి వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ట్యాక్స్ ఆడిట్ అవసరమైనప్పుడు వారు ఈవీసీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. -
Union Budget 2024: ట్యాక్స్ పేయర్స్కు నిరాశే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్ను నిరాశపరిచింది. పన్ను రేట్లకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు ఆర్థిక మంత్రి చేయలేదు. దీంతో పన్ను రేట్లు యథాతథంగా ఉంటాయి. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితి రూ. 7 లక్షలు ఉంది. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని రూ.8 లక్షలకు పెంచుతారని భావించారు. కానీ ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో నిరాశే మిగిల్చింది. ఇక పన్ను శ్లాబులకు విషయానికి వస్తే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో 5 పన్ను శ్లాబులు ఉన్నాయి. ఇవి గతంలో ఆరు శ్లాబులు ఉండగా గతేడాది ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గతేడాది గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. అయితే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో పన్నుచెల్లింపుదారులకు ఎటువంటి ఊరటలను కేంద్రం ప్రకటించకపోవడంతో నిరాశ తప్పలేదు. కాస్త ఊరట.. పన్ను బకాయిల రద్దు పన్ను రేట్ల విషయంలో నిరాశ పరిచినప్పటికీ పాత పన్ను బకాయిలు రద్దు చేస్తూ ఈ బడ్జెట్ కాస్త ఊరటనిచ్చింది. 2009-10 కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.25,000, అలాగే 2014-15కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.10,000 వరకూ రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
పన్ను ఆదా.. చేద్దాం ఇలా!
ఆదాయపన్ను చట్టంలో పన్ను ఆదాకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే ఎంతో ఆదా చేసుకోవచ్చు. అందుకు గతం నుంచి ఉన్న పాత విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఎన్నో సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే పన్ను ఆదా ప్రయోజనాలను గరిష్ట పరిమితి మేరకు పొందగలరు. అందరికీ అన్ని సాధనాలు అనుకూలమని చెప్పలేం. వీటిల్లో పెట్టుబడులకు నిరీ్ణత కాలం పాటు లాకిన్ ఉంటుంది. కొన్నింటితోపాటు రిస్్కను కూడా ఆహా్వనించాల్సి వస్తుంది. తమ లక్ష్యాలు, రాబడి ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాలి. ► రాబడులు 5–6 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు జీవిత బీమా పాలసీలు పన్ను ఆదా కోసం తీసుకునేవి కావు. జీవితంలో అన్ని ఆరి్థక లక్ష్యాలకు రక్షణ కలి్పంచే సాధనం జీవిత బీమా. ఆరోగ్య బీమాని సైతం ఆరోగ్య విపత్తుల నుంచి రక్షించే సాధనంగానే చూడాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్ట వశాత్తూ మరణిస్తే, బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం సదరు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలి. కనుక బీమా పాలసీలను ఎప్పుడూ రక్షణ కోణంలోనే చూసి తీసుకోవాలి. పొదుపుతో సంబంధం లేని, టర్మ్ ప్లాన్లు మెరుగైనవి. టర్మ్ ప్లాన్కు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం 60 ఏళ్లలోపు వారు అయితే సెక్షన్ 80డీ కింద గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపును పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి అయితే ఈ పరిమితి రూ.50,000గా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి బీమాతో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.12,000–14,000 ప్రీమియం కింద చెల్లించాలి. అదే వ్యక్తి రూ.50 లక్షల ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.5 లక్షలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీలలో మరణించిన సందర్భాల్లో వచ్చే పరిహారం, కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్పై పూర్తిగా పన్ను మిహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపు కోరుకునే వారు ఎండోమెంట్ ప్లాన్లకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించకూడదు. యులిప్ ప్లాన్లలో అయితే వా ర్షిక ప్రీమియానికి కవరేజీ కనీసం 10 రెట్లు అయినా ఉండాలి. ► రాబడులు 7–8 % మధ్య ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు వీటిల్లో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం ఉంది. కానీ, రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తన ఆదాయంలో చూపించి, ఏ శ్లాబులో ఉంటే ఆ ప్రకారం రేటు చెల్లించాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5 శాతం కంటే తక్కువే. కాకపోతే వేగంగా, సులభంగా ఇన్వెస్ట్ చేసుకోగల సౌలభ్యం ఇందులో ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ, ఎన్ఎస్సీలో పెట్టుబడిని ఐదేళ్లకు ముందే ఉపసంహరించుకోవడం కుదరదు. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే దీనికి మినహాయింపు ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎన్ఎస్సీలోనే కాస్తంత మెరుగ్గా వడ్డీ రేటు 7.7 శాతం ఉంది. ► ప్రస్తుత రాబడి 7.1% ► లాకిన్: 15 ఏళ్లు ఇది రిస్్కలేని డెట్ సాధనం. ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేకపోవడం అదనపు ఆకర్షణ. పీపీఎఫ్ పథకం కాల వ్యవధి 15 ఏళ్లు. ఈ పథకంలో ప్రస్తుత రేటు 7.1 శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద ఈ సాధనంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ సెక్షన్ 80సీ కింద పూర్తి పరిమితి (రూ.1.5 లక్షలు) మేరకు ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, రాబడిపైనా పన్ను మినహాయింపు ప్రయోజనం కోసం పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల ఉన్నత విద్యకు దీన్ని పరిశీలించొచ్చు. ఇందులో పాక్షిక ఉపసంహరణలకే అనుమతి ఉంటుంది. ప్రారంభించి ఐదేళ్లు నిండిన తర్వాత ఇందుకు అనుమతిస్తారు. ప్రముఖ బ్యాంక్లు, పోస్టాఫీసుల్లో దీన్ని ప్రారంభించొచ్చు ► ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు రిస్్కలేని రాబడి సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ప్రస్తుతం ఇందులో రాబడి 8.2 శాతంగా ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే రాబడి ఎక్కువ. పెట్టుబడి కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత నుంచి ప్రతి మూడేళ్లకు ఒకసారి చొప్పున కాల వ్యవధి పెంచుకుంటూ వెళ్లొచ్చు. పొడిగించుకునే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. ఒక వ్యక్తి ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను పరిధిలోకే వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఆదాయపన్ను చట్టం కింద వృద్ధులకు ఉంది. అంటే రూ.6.25 లక్షల వరకు పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను మినహాయింపు అయిన రూ.50 వేలలోపే ఉంటుంది. 60 ఏళ్లు నిండిన వారు, ముందస్తు పదవీ విరమణ పొందిన వారు 58 ఏళ్ల తర్వాత ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రక్షణ సిబ్బందికి వయో పరిమితి లేదు. ► గడిచిన ఐదేళ్లలో కనిష్ట రాబడి: 8.16% ► పెట్టుబడులకు లాకిన్: 60 ఏళ్లు వరకు పన్ను ఆదాకు మెరుగైన సాధనాల్లో ఇదీ ఒకటి. ఒకవైపు విశ్రాంత జీవనం కోసం నిధిని సమకూర్చుకూర్చుకుంటూ, మరోవైపు పన్ను ఆదా చేసుకునే ప్రయోజనంతో వస్తుంది. గరిష్టంగా ఒక వ్యక్తి ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.2 లక్షల పెట్టుబడిపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1) కింద రూ.1.5 లక్షలు, 80సీసీడీ(1బి)కింద రూ.50వేలపై పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల గరిష్ట పరిమితి పరిధిలోకే సెక్షన్ 80సీసీడీ (1) కూడా వస్తుంది. దీనికి అదనంగా మరో రూ.50వేలను ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీసీడీ (1బి) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సెక్షన్ 80సీసీడీ (2) కింద కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తే.. ఉద్యోగి వేతనంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎన్పీఎస్లో యాక్టివ్ ఆప్షన్ కింద ఈక్విటీలకు గరష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదిలో పెట్టుబడుల కేటాయింపులను (ఈక్విటీ, డెట్, ఏఐఎఫ్) నాలుగు పర్యాయాలు సవరించుకోవచ్చు. పెన్షన్ ఫండ్ మేనేజర్లనూ మార్చుకోవచ్చు. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ఆప్షన్ (ఎస్డబ్ల్యూపీ/క్రమానుగతంగా ఉపసంహరణ)ను కూడా పీఎఫ్ఆర్డీఏ ప్రవేశపెట్టింది. దీనివల్ల గడువు తీరిన తర్వాత ఒకే విడత కాకుండా, నెలవారీగా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఎన్పీఎస్ ఫండ్స్ మంచి పనితీరు చూపించాయి. ఇక ముందూ ఇదే పనితీరు ఉంటుందని అంచనా. ఎన్పీఎస్లో ఈక్విటీ ఫండ్స్ అధిక శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్ కంపెనీలకు కేటాయిస్తాయి. కనుక రిస్క్ దాదాపు చాలా తక్కువ. ► ఐదేళ్లలో వార్షిక రాబడి 7–14 శాతం ► లాకిన్ పీరియడ్: రిటైర్మెంట్ వరకు బీమా కంపెనీలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కాకపోతే చార్జీలు, సౌలభ్యం, పన్ను ప్రయోజనాల కోణంలో ఎన్పీఎస్ కంటే ఇవి మెరుగైనవి కావు. జీవిత బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లు సాధారణంగా యులిప్ల మాదిరి పనిచేస్తాయి. కానీ, ఎన్పీఎస్, యులిప్లలో ఉండే పన్ను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, పెన్షన్ ప్లాన్లు అంత ఆకర్షణీయం కాదని చెప్పుకోవచ్చు. పెన్షన్ ప్లాన్లకు సెక్షన్ 80సీసీడీ కింద పన్ను ప్రయోజనం కలి్పంచాలని బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా, అది సాకారం కావడం లేదు. ప్రస్తుతం ఎన్పీఎస్కు ఈ సెక్షన్ కింద అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తున్నారు. ఎన్పీఎస్లో ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చకపోతే, మరో ఫండ్ మేనేజర్ కిందకు పెట్టుబడులను మార్చుకోవచ్చు. కానీ బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో చివరి వరకు అదే కంపెనీతో కొసాగాల్సి వస్తుంది. యాన్యుటీలపై పన్ను ఎత్తివేస్తే అప్పుడు ఈ ఉత్పత్తి ఆకర్షణీయంగా మారుతుందన్నది నిపుణుల అంచనా. ► రాబడులు: గత ఐదేళ్లలో 7–9 % ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పెట్టుబడులను పూర్తిగా ఈక్విట్లీలోనే పెట్టేస్తాయి. కానీ, రిటైర్మెంట్ ఫండ్స్ అలా కాదు. ఈక్విటీతోపాటు డెట్ సాధనాల్లోనూ కొంత పెట్టుబడులు పెడతాయి. దీంతో డెట్ పెట్టుబడులు పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీ భాగం అధిక రాబడులకు వీలు కలి్పస్తుంది. సెక్షన్ 80సీ కింద వీటిల్లో పెట్టుబడులపై ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ విభాగంలో యూటీఐ రిటైర్మెంట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపించే వాటిల్లో ఒకటి. తక్కువ రిస్్కతో, మెరుగైన రాబడులను ఇస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు 40 శాతంలోపే ఉన్నాయి. తక్కువ రిస్క్ కోరుకుంటూ, విశ్రాంత నిధిని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే ఈ పథకాల్లో పెట్టుబడులపై లాకిన్ ఐదేళ్లుగా ఉంటుంది. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్ అయితే 58 ఏళ్లు నిండడానికి ముందే పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ చార్జీలు విధిస్తోంది. ► ఇందులో రాబడి ప్రస్తుతం 8.2 శాతం ► లాకిన్ పీరియడ్: కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు ఇటీవలే ఈ పథకంలో వడ్డీ రేటును 8.2 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మాదిరే వడ్డీ రేటు, కేంద్ర సర్కారు గ్యారంటీతో కూడిన రిస్క్ లేని సాధనం ఇది. తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరి పేరిట గరిష్టంగా ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో రాబడిపై పూర్తి పన్ను మినహాయింపు ఉంది. పథకాన్ని ప్రారంభించాలంటే కుమార్తెల వయసు 10 లోపు ఉండాలన్నది నిబంధన. పోస్టాఫీసులు, బ్యాంక్ల్లో ఈ స్కీమ్ కింద ఖాతాను ప్రారంభించొచ్చు. ఆర్బీఐ వచ్చే ఆరి్థక సంవత్సరం ద్వితీయ భాగంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత చేపడుతుందని అంచనా. ప్రతి త్రైమాసికం ఆరంభంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర సర్కారు సవరిస్తుంటుంది. కనుక సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత రేటు 8.2 శాతం ఎక్కువ కాలం కొనసాగుతుందని ఆశించరాదు. కాకపోతే ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేనందున, కుమార్తెల భవిష్యత్ అవసరాలకు సంబంధించిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని రిస్్కలేని ఈ పథకానికి కేటాయించుకోవచ్చు. ► గడిచిన ఐదేళ్ల కాలంలో కనిష్ట వార్షిక రాబడి 8.15 శాతం ► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు యూనిట్డ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో (యులిప్లు) పెట్టుబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఈఎల్ఎస్ఎస్ మాదిరిగా పెట్టుబడులకు అంత సౌకర్యవంగా ఉండవు. పోర్ట్ఫోలియో వివరాలు తెలుసుకోవడం కూడా సౌకర్యంగా కష్టమే. కాకపోతే యులిప్ల నుంచి దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఆశించొచ్చు. పైగా పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. బీమా రక్షణ కూడా కొంత లభిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో పెట్టుబడిపై పన్ను మిననహాయింపు ఉంటుందే కానీ, లాభాల ఉపసంహరణ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో లాభం రూ.లక్షకు మించితే 10 శాతం పన్ను చెల్లించాలి. కానీ, యులిప్లలో రాబడి ఎంత వచి్చనా కానీ, గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను ఉండదు. ఈ ప్రయోజనం కోసం చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ కనీసం 10 రెట్లు అధికంగా ఉండాలని సెక్షన్ 10(10డి) చెబుతోంది. యులిప్ పాలసీలోనూ ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య ఇన్వెస్టర్ తన స్వేచ్ఛ ప్రకారం పెట్టుబడుల ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. అలా మార్చుకున్నప్పటికీ పన్ను బాధ్యత ఉండదు. యులిప్ ప్లాన్లలో ఐదేళ్ల తర్వాత నుంచి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ పరిమితంగానే ఉండడం ప్రతికూలం. వార్షిక ప్రీమియానికి 10–12 రెట్ల వరకే రక్షణ ఎంపిక చేసుకోగలరు. అంటే ఏడాదికి రూ.1–1.20 లక్షలు చెల్లించినా, లభించే రక్షణ రూ.10–12 లక్షలకు మించదు. కనుక తగినంత జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవాల్సి రావచ్చు. యులిప్ను రిటైర్మెంట్ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పాటు కొనసాగాల్సి ఉంటుంది. ► గడిచిన ఐదేళ్ల కాలంలో ఏటా సగటు రాబడి 17 శాతం ► లాకిన్ పీరియడ్: మూడేళ్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ కూడా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందిస్తున్నాయి. ఇవి ప్రధానంగా లార్జ్క్యాప్లో ఎక్కువ పెట్టుబడులు పెడతాయి. కనుక సమీప కాలంలో వీటిల్లో రాబడులు మెరుగ్గానే ఉంటాయని అంచనా. రాబడులు, భద్రత, లాకిన్ పీరియడ్ తదితర అంశాల పరంగా చూస్తే ఎన్పీఎస్ తర్వాత, ఎన్పీఎస్తో సమానంగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. పైగా పారదర్శకత ఎక్కువ. పెట్టుబడుల పోర్ట్ఫోలియోను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పెట్టుబడికి లాకిన్ కేవలం మూడేళ్లుగానే ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రిస్్కను సమర్థవంతంగా అధిగమించొచ్చు. సెక్షన్ 80సీ కింద ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో సగటు రాబడులు ఏడాది కాలంలో 19 శాతం, మూడేళ్లలో 18.50 శాతం, ఐదేళ్లలో 17 శాతం, ఏడేళ్లలో 15.46 శాతం, పదేళ్లలో ఏటా 16.60 శాతం చొప్పున ఉన్నాయి. -
Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!?
రానున్న కేంద్ర బడ్జెట్ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రూ.8 లక్షల వరకూ నో ట్యాక్స్! ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలుపుకొని సరళీకృత "సింగిల్ హైబ్రిడ్ స్కీమ్"ని ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిటీ ఛైర్పర్సన్ వివేక్ జలాన్ అంచనా వేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కలకత్తా చాప్టర్) చైర్పర్సన్ రాధికా దాల్మియా చెబుతున్నారు. రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన భత్యం పెంపు, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం కీలకమైనని ఆమె పేర్కొన్నారు. -
దేశంలో ట్యాక్స్ కట్టేవాళ్లు ఎంతమందో తెలుసా?
న్యూఢిల్లీ: గడిచిన పదేళ్లలో ఇన్కం ట్యాక్స్ రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల (ఫైలర్స్) సంఖ్య రెట్టింపయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.78 కోట్లకు చేరింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2013–14లో ఐటీఆర్లు దాఖలు చేసిన వారి సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 105 శాతం పెరిగింది. ఇదే వ్యవధిలో నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 161 శాతం పెరిగి రూ. 6.39 లక్షల కోట్ల నుంచి రూ. 16.64 లక్షల కోట్లకు ఎగిశాయి. స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 173 శాతం పెరిగాయి. రూ. 7.22 లక్షల కోట్ల నుంచి రూ. 19.72 లక్షల కోట్లకు చేరాయి.