
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.