Union Budget 2025-26
-
కొత్త బడ్జెట్టు.. వినియోగపనిషత్తు..
‘‘ఇది ప్రజల బడ్జెట్టు. ప్రజల సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, వినియోగం పెరుగుతాయి’’ అని అన్నారు ప్రధాన మంత్రి. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి అని ఆశిస్తున్నారు మోదీగారు. ‘‘ప్రజలకు ఒరిగిందేమీ లేదు. స్కీముల సంఖ్య పెరిగిందే కానీ సంతోషపడాల్సినదేమీ లేదు. ఆర్థిక మందగమనానికి నాంది’’ అని అంటున్నారు ఒకప్పటి ఆర్థికమంత్రి చిదంబరం.ఇక రాష్ట్రాల విషయానికొస్తే.. ప్రతి రాష్ట్రం ఎంతో కొంత అసంతృప్తిగానే ఉంది. ఆరోగ్యరంగానికి సరిపోయినంత మందు పడలేదంటున్నారు. రైల్వేను పట్టాల నుంచి తప్పించారంటున్నారు. రైతులకు అంతంతమాత్రమే అని ఒకరు .. పరిశ్రమలకు ఫర్వాలేదని మరొకరు.. ఆటలకి పెద్ద పీట.. చిన్న తరహా పరిశ్రమలకు ఊతం..కృత్రిమ మేధస్సుకు ఎక్సలెన్సు, మందుల ధరల తగ్గుముఖం .. ఆహార భద్రతకు అవకాశం .. ఆభరణాల మీద కస్టమ్స్ తగ్గుదల, పత్తికి కొత్త ఊపు, జౌళి పరిశ్రమకు దన్ను, ఎయిర్పోర్టుల విస్తరణ, రోడ్ల మీద చిన్న చూపు, అంతరిక్ష రంగాన్ని మరింత పైకి తీసుకెళ్లే ప్రయత్నం, చిన్న తరహా పరిశ్రమలకు భారీ ఊరట, యాత్రా స్థలాల సుందరీకరణ, ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గుదల.. ఇలా ఒక్కో రంగానిది ఒక్కో పరిస్థితి. ఏది ఎలా ఉన్నా స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్లు పతనం, విజయకేతనం. ఈ పరిణామం దిక్సూచి కాకపోయినా, ఇదో వెంటాడే బూచి. ‘‘నా తలరాత మారింది. నా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు’’ అని మురిసిపోతోంది మధ్యతరగతి మహిళ. భారీగా పెన్షన్ వచ్చే దంపతులు .. ఇక కంపల్సరీ సేవింగ్స్ మానేసి ‘‘పదవే గౌరీ, పరమాత్ముని చూడ’’ అని తీర్థయాత్రలకు విమానంలో ప్లాన్ చేస్తున్నారు. పింగళిగారు రాసిన పాటను పదే పదే పాడి ‘‘ప్రేమించిన పతికి ఎదురునుండగా తీర్థయాత్రకెందుకని’’ అంటూ పతిభక్తి చాటుకున్న భార్య సత్యవతి .. పదండి పదండి ఎప్పుడూ ఈ పాడు కొంపేనా అంటూ ట్రావెలింగ్ ఏజంటు దగ్గరకి పరుగెత్తింది, మొగుడి క్రెడిట్ కార్డు పట్టుకుని.‘వెకేషన్’కి పెద్ద ప్లాన్ చేస్తోంది లావణ్య. అక్కతో పాటు నేనూ, మా ఆయనా వస్తాం అంటోంది చెల్లెలు త్రిష. ‘మ్యుచువల్ ఫండ్స్’లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రవి. ‘నాకు జీతం పెంచకపోయినా ఫర్వాలేదు’ అంటోంది ఉద్యోగిని ఊర్మిళ.. వాళ్లబాసుతో. ఇంట్లో పాత ఫర్నిచరు, టీవీలు తీసేసి కొత్తవి కొనుక్కుందాం అని అంటోంది మరో మహిళ లలిత. ఇల్లు కొత్తది కాకపోయినా మంచిగా ఇంటీరియర్స్ చేయిద్దాం అంటోంది హరిత. ‘‘సేవింగ్స్తో మంచిగా అప్స్కేలింగ్ వైపు వెళ్తాను’’ అని అంటున్నాడు అక్షిత్.లేటెస్టు మ్యూజిక్ పరికరాలు కొని సంగీతం సాధన చేస్తానంటోంది మరో వనిత అభిజ్ఞ. షేరు మార్కెట్లో ఎంటర్ అయ్యి వెల్త్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వారెన్ బఫెట్ బుక్ చతివి రత్నాకర్. ‘‘పొరుగింటి మీనాక్షమ్మని చూశారా’’ అనే ప్రశ్న మానేసి తనకి కావాల్సిన బంగారం ఆభరణాలను ప్లాన్ చేస్తోంది నాగమణి. వీళ్ళందరి ఆలోచనలూ నిజమయ్యేనా? అంటే నిజమే అనిపిస్తోంది. తన ప్రతిపాదనలతో సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయల నష్టమని చెప్తున్నారు సీతమ్మ తల్లి. రెండు కోట్ల మంది ట్యాక్స్ పేయర్లకు లబ్ధి చేకూరుతుందని ఫైనాన్స్ సెక్రటరీ పాండేగారి ఉవాచ. జనాల చేతిలో మిగులు. అలా మిగిలిన మొత్తం వెచ్చించడానికి ఇక హద్దులుండవు. ఇప్పటికి ప్రైవేటు వారి చేతిలో వినియోగం నిమిత్తం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేది రెండు వందల లక్షల కోట్లు. దానికి అదనంగా ఒక లక్ష కోట్లు అంటే సామాన్యం కాదు. పెద్ద సంఖ్యే.క్రమేపీ, పాత విధానం పన్నుల సేకరణ ఉండదు. కొత్త విధానానికి మొగ్గు చూపిస్తున్నారు. ద్రవ్యోల్బణం కొనసాగుతున్నా ఖర్చుల స్థాయి తగ్గలేదు. కోడి పందాల్లో వేల కోట్లు. కుంభమేళా సందర్భంగా కొన్ని వేల కోట్లు. ఆకలి చావులుండవచ్చు.. కానీ కోడి పులావ్ అమ్ముడుపోతుంది. అందరి ఖర్చులు పెరుగుతాయి. లిక్విడిటీ పెరుగుతుంది. ఈ యాగంలో ‘‘వినియోగమే’’ యోగప్రదమైనది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
రూ. 20,000 కోట్ల నిధులు వాడుకోండి..
పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పై దేశీ కార్పొరేట్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తాజాగా పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన రూ. 20,000 కోట్లు నాణ్యమైన ప్రతిపాదనకు వినియోగించుకోవాలని సూచించారు.ప్రయివేట్ రంగ ఆధారిత ఆర్అండ్డీకి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయించిన విషయాన్ని బడ్జెట్ తదుపరి సీఐఐ సభ్యులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టి సందర్భంగా ప్రస్తావించారు. ఏడాది చివరికల్లా మొత్తం నిధులను వినియోగించుకునేలా అత్యుత్తమ ప్రతిపాదనలతో తరలిరావలసిందిగా ఆహ్వానించారు.పర్యావరణహిత ఇంధనాలవైపు ప్రయాణంలో ప్రయివేట్ రంగం చేయూత నివ్వాలని కోరారు. ఇదేవిధంగా అణు విద్యుత్ విషయంలో ప్రభుత్వం పరిశ్రమతో కలసి పనిచేయనున్నట్లు తెలియజేశారు.2025-26 బడ్జెట్ను ప్రకటిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ రంగ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక కార్పస్గా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.20,000 కోట్లు కేటాయించారు. గత జూలై బడ్జెట్లోనూ ఆమె రూ. లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
బైపాస్లో వెళ్లిన బడ్జెట్ రైలు
సాక్షి, అమరావతి: ఈసారి కూడా కేంద్ర రైల్వే బడ్జెట్.. రాష్ట్రంలోని దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్ సిగ్నలే చూపించింది. బడ్జెట్ రైలు రాష్ట్రాన్ని బైపాస్ చేసుకుంటూ వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రానికి ఈ బడ్జెట్లో తీసుకువచ్చిన కొత్త రైల్వే ప్రాజెక్టులు అక్షరాలా శూన్యం. ఒక్కటంటే ఒక్క డిమాండ్ను కూడా రైల్వే శాఖ పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి ఎన్డీయేకు చెందిన 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ, రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీ నుంచి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల గురించి వివరించారు. 2025–26 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ.9,417 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అయితే ఆయన చాలా తెలివిగా 2009–10 వార్షిక బడ్జెట్ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పడం విస్మయ పరిచింది. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలుస్తూ ప్రసుత్త బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపలేదనే విషయాన్ని మరుగున పరిచేందుకు యత్నించారన్నది సుస్పష్టం. రైల్వే బడ్జెట్పై ఆ శాఖ పింక్ బుక్ను విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది. పాత పాటే.. కొత్త ప్రాజెక్టులు లేవు ప్రస్తుతానికి అయితే పాత ప్రాజెక్టుల పాటనే కొత్తగా పాడారని రైల్వే కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టుల గురించి రైల్వే మంత్రి ప్రత్యేకంగా వెల్లడించనే లేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం గమనార్హం. వాస్తవానికి అమృత్ భారత్ పథకం కింద ఆ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. ఆ విషయాన్నే రైల్వే మంత్రి పునరుద్ఘాటించారు. ఇక విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లను రూ.1,132.43 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి ఆ నాలుగు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు కూడా రెండేళ్ల క్రితమే ప్రారంభమై కొనసాగుతున్నాయి. అవేమీ కొత్త ప్రాజెక్టులు కానే కావు. ఇప్పటికే 130 కి.మీ.మేర కవచ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, మరో 1,700 కి.మీ.మేర ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.దీన్నిబట్టి కవచ్ ప్రాజెక్టు పరిధిని కొత్తగా ఏమీ విస్తరించే ఆలోచన లేదని తేల్చి చెప్పినట్లే. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. అందుకే ఈ రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించ లేదని కూడా కుండబద్దలు కొట్టారు. ఏపీ మీదుగా ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు నిర్వహిస్తున్నామని చెబుతూ త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామన్నారు. కొత్త డిమాండ్లు పూర్తిగా బేఖాతరు దీర్ఘకాలికంగా ఉన్న ప్రాజెక్టులకే నిధుల కేటాయింపునకు చేతులు రాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విజయవాడ–ఖరగ్పూర్, విజయవాడ–నాగ్పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు.. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు, విజయవాడ–గూడూరు మద్య నాలుగో లైన్ నిర్మాణం, కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సీఎం చంద్రబాబు ఏం సాధించినట్లు?» కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25 బడ్జెట్లో రైల్వేలో రాష్ట్రానికి కేవలం రూ.9,138 కోట్లు కేటాయించారు. దాంతో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకే ఆ నిధులు సరిపోయాయి. పోనీ.. 2025–26 బడ్జెట్లో అయినా భారీగా నిధులు సాధిస్తారేమోనని ఆశించిన వారికి అడియాశే మిగిలింది. గత బడ్జెట్ కంటే కేవలం రూ.279 కోట్లే అధికంగా రాబట్టగలిగారు. పెరిగిన వ్యయంతో పోలిస్తే, ఆ నిధులు కూడా ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకే సరిపోతాయి. » కాకినాడ – పిఠాపురం, మాచర్ల–నల్గొండ, కంభం–ప్రొద్దుటూరు, గూడూరు–దుగ్గరాజపట్నం, కొండపల్లి–కొత్తగూడెం, భద్రాచలం–కొవ్వూరు, జగ్గయ్యపేట–మేళ్లచెరువు రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై కేంద్రం చిత్తశుద్ధి చూపించనే లేదు. » అమరావతి రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదించినట్లు గత ఏడాది అక్టోబర్లో ప్రకటించినా, నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వ లేదు. » అత్యంత కీలకమైన కడప–బెంగళూరు (255 కి.మీ) రైల్వేలైన్పై కూడా కేంద్రం ముఖం చాటేసింది. » కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా రైల్వే లైన్ల గురించి పట్టించుకోలేదు. -
ఖర్చు పెట్టించేందుకు ఇది చాలదు!
భారతదేశ మధ్య తరగతి బహుశా గడచిన మూడు దశాబ్దాల్లో ఇలాంటి బడ్జెట్ చూడ లేదు. ఆదాయ పన్నులో ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మోదీ సర్కారుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంత భారీ ఊరట లభిస్తుందని మాత్రం ఊహించలేదు. నగరాల్లో నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నవారిని మాత్రమే మధ్య తరగతిగా పరిగణించాలని నేను గతంలో వాదించాను. అయితే, ఇలాంటి వాళ్లు దేశం మొత్తమ్మీద నాలుగైదు శాతం మాత్రమే ఉంటారు. ఇంత మొత్తం ఆర్జిస్తున్నవాళ్లు కూడా పన్నులు కట్టే పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎందుకీ ఉపశమనం?ఫలితంగా ఈ స్థాయి ఆదాయమున్న వారి జేబుల్లోకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అదనంగా వచ్చి చేరుతుంది. ఈ డబ్బును ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. లేదంటే దాచుకుని చిరకాలంగా ఆశపడుతున్న స్మార్ట్ఫోన్ నైనా సొంతం చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రెండు లక్షల రూపాయలనుకుంటే, మారిన పన్ను రేట్ల కారణంగా మీకు నెల నెలా రూ. 9,000 అదనంగా ఆదా అవుతుంది. దీన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడు కోవచ్చు. ఫ్యాన్సీ రెస్టారెంట్కు వెళ్లి భోంచేయొచ్చు. ఏడాదిలో రూ. 1.10 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో 55 అంగుళాల టీవీ, అత్యాధునిక వాషింగ్ మెషీన్ కొనుక్కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే, పన్నుల మినహాయింపు పొందిన మధ్య తరగతి విరగబడి కొనుగోళ్లు చేస్తుందనీ, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమొస్తుందనీ మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దేశంలో, ముఖ్యంగా నగర మధ్యతరగతి వినియోగం తగ్గుతోందన్న ఫిర్యాదులకు ఫుల్స్టాప్ పడుతుంది. 2022–23లో దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించారని దాఖలైన ఆదాయ పన్ను రిటర్న్స్ చెబుతున్నాయి. వీరిలో దాదాపు రెండు కోట్ల మంది పన్నులు చెల్లించారు. ప్రస్తుతం వేతనాల్లో పెంపును పరిగణనలోకి తీసుకున్నా, పన్ను రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా సుమారు 1.5 కోట్ల మంది పన్ను పరిధిలోంచి జారిపోతారు. అంటే, పన్ను చెల్లింపుదారుల సంఖ్య సుమారు 1.4–1.6 కోట్లకు పడిపోనుంది. వీరిలో ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారూ ఉంటారు. ఇది మొత్తం మన శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే. ప్రభుత్వ అంచనా వేరే!పరిస్థితి ఇలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పన్ను రాబడుల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను రూపంలో వచ్చే మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువ కానుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం వచ్చిన దానికంటే రానున్న సంవత్సరం వచ్చే మొత్తం 14 శాతం ఎక్కువ. గతేడాది ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా పన్ను రేట్లలో మార్పుల వల్ల ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం జరగడం లేదు. పాత రేట్లు, శ్లాబ్స్ కొనసాగి ఉంటే ప్రభుత్వం 22 శాతం వరకూ ఎక్కువ ఆదాయపు పన్నులు వసూలు చేసి ఉండేది. ఆదాయ పన్ను రాబడి పెరిగేందుకు ఒకే ఒక్క మార్గం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత ఆదాయం బాగా పెరగడం! ఇలా జరిగే సూచనలైతే లేవు. నిజానికి కృత్రిమ మేధ, వేర్వేరు ఆటో మేషన్ పద్ధతుల ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య తగ్గేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జీతాలు కూడా స్తంభించిపోతాయి. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఇతడికి రూ.70 వేల వరకూ మిగులుతుంది. ఇంత మొత్తాన్ని వస్తు, సేవల కోసం ఖర్చు పెట్టగలడు. ఒకవేళ ఆదాయం పది శాతం తగ్గితే? అప్పుడు పన్ను మినహాయింపులు అక్కరకు రావు. వాస్తవికంగా ఖర్చు పెట్టడం ఇప్పటికంటే మరింత తక్కువైపోతుంది.ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించుకుంటోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.1 శాతం మాత్రమే ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకో 5 శాతమే అదనంగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ద్రవోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ పెంపుదల కేవలం 1.5 శాతమే అవుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటున్న ప్రభుత్వంరోడ్లు, హైవేలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం గతంలో ఖర్చు పెట్టినదానికి ఇది పూర్తి భిన్నం. ఆ ఖర్చులో పెరుగుదల జీడీపీ పెంపునకు దారితీసింది. ఈసారి మూలధన వ్యయం గత ఏడాది కంటే కేవలం ఒకే ఒక్క శాతం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే అసలు మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఏడాది మౌలిక వసతులపై పెట్టే ఖర్చు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, మౌలిక వసతుల రంగానికి అనుబంధమైన స్టీల్,సిమెంట్, తారు, జేసీబీల్లాంటి భారీ యంత్రాలు, బ్యాంకులు కూడా డిమాండ్లో తగ్గుదల నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వేతనాల బిల్లులు తగ్గించుకునే ప్రయత్నం అంటే... వేత నాల్లో కోతలు లేదా ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఇది మధ్య తరగతి వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎక్కువ ఆదా యపు పన్ను ఆశించడం లేదని అంచనా కట్టింది. జీడీపీ విషయంలోనూ ఇంతే. వృద్ధి నామమాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది.పెట్టుబడులు పెరగకపోతే?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తాను లక్ష్యించుకున్న కార్పొరేట్ పన్నులు కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయింది. మొత్తం 10.2 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్తుందని ఆశిస్తే వసూలైంది రూ.9.8 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఆదాయపు పన్ను రాబడులను మాత్రం రూ.11.9 లక్షల కోట్ల నుంచి రూ.12.6 లక్షల కోట్లకు సవరించింది. అంటే ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల కంటే 28 శాతం ఎక్కువ ఆదా యపు పన్ను రూపంలో వసూలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కార్పొరేట్ పన్నుల కంటే ఆదాయపు పన్నులు 33 శాతం ఎక్కువ వసూలు చేస్తామని చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ బాగు పడుతోందనేందుకు ఏమాత్రం సూచిక కాదు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడుల్లేకుండా... కేవలం ఆదాయపు పన్ను రాయితీలతోనే వినియోగం పెరిగిపోతుందని ఆశించడంలో ఉన్న సమస్య ఇది. మధ్య తరగతి ప్రజల జేబుల్లో కొంత డబ్బు మిగిల్చితే, కొన్ని రకాల వస్తు సేవలకు తాత్కాలిక డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎదగకపోతే ఆ డిమాండ్ ఎక్కువ కాలం కొనసాగదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్పై మరింత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా కనిపించడం లేదు. వీరి ప్రాజెక్టుల్లో అధికం ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే. అవే తగ్గిపోతే, కార్పొరేట్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులను కుదించుకుంటాయి. దీంతో పరిస్థితి మొదటికి వస్తుంది. ఆదాయపు పన్ను రిబేట్లు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సాయం చేయనివిగా మిగిలిపోతాయి!అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికాంశాల విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
యూపీఏపైనా రాహుల్ విమర్శలు.. లోక్సభలో ఆసక్తికర పరిణామం
న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అంశంపై లోక్సభలో రాహుల్గాంధీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సోమవారం(ఫిబ్రవరి3) లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్గాంధీ మాట్లాడారు. మోదీ ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థపై సీరియస్నెస్ లేదని విమర్శించారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి మోదీని ఆహ్వానించాలని అడిగేందుకే దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను ముందుగా అమెరికా పంపారని రాహుల్గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్గాంధీ ఆధారాల్లేని ఆరోపణలు చేయవద్దని మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు.ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి అంశమని,ప్రధానమంత్రికి ఆహ్వానంపై ఏది పడితే అది మాట్లాడవద్దని సూచించారు. దీనికి స్పందించిన రాహుల్గాంధీ మీ మనశ్శాంతికి భంగం కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. అనంతరం రాహుల్ చైనా ఆక్రమణలపై మాట్లాడారు. భారత్లో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రధాని మోదీ చెప్పేదానికి,సైన్యం చెప్పేదానికి పొంతన లేదని విమర్శించారు. వెంటనే స్పీకర్ ఓంబిర్లా కలుగజేసుకుని ఆధారాలు లేకుండా ఇలాటి విషయాలు సభలో మాట్లాడడం సరికాదన్నారు.యూపీఏనూ విమర్శించిన రాహుల్గాంధీ..యువతకు ఉద్యోగాల కల్పన అంశంపై రాహుల్గాంధీ లోక్సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశం వృద్ధి చెందుతోంది. అయితే వృద్ధిలో ప్రస్తుతం వేగం తగ్గింది. ఉద్యోగాలు కల్పించే విషయంలో గత యూపీఏ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు యువతకు సమాధానం చెప్పలేకపోయాయని రాహుల్ అన్నారు. మేకిన్ ఇండియా మంచిదే అయినప్పటికీ దానితో ఒరిగేది ఏమీ లేదన్నారు. జీడీపీలో తయారీ రంగ వాటా తగ్గిపోయిందని రాహుల్ విమర్శించారు. -
ఇక దేశానికి ఆ కోటి మందే దిక్కు!
కొత్త పన్ను విధానాన్ని షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా స్టార్ అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) విమర్శించారు. దేశంలోని 140 కోట్ల జనాభాలో కోటి మంది మాత్రమే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్నులు చెల్లిస్తారని, తద్వారా భారత్ ఆదాయ పన్ను రహిత దేశంగా మారుతుందని ఎద్దేవా చేశారు.కేంద్ర బడ్జెట్లో (Union budget 2025-26) రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపును ప్రకటించిన అనంతరం కొత్త పన్ను విధానాన్ని విమర్శిస్తూ అనుపమ్ మిట్టల్ ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. దేశంలో పన్ను దాఖలు చేసేవారిలో 90% మంది రూ. 13 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారేనని చెప్పుకొచ్చారు. అంటే ఆ మిగిలిన కొద్ది మంది మాత్రమే దేశానికి ట్యాక్స్ ఆదాయం అందిస్తారనేది ఆయన భావన.భారత్ "ఆదాయపు పన్ను రహిత దేశం" అవుతుందంటూ అనుపమ్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలు కొత్త పన్ను విధానంలోని పన్నుల వ్యవస్థ హేతుబద్ధతపై చర్చను రేకిస్తున్నాయి. "భారతదేశంలో దాదాపు 90% ట్యాక్స్ ఫైలర్లు రూ.13 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారేనని తేలింది. అంటే 140 కోట్ల మందిలో కోటి మంది మాత్రమే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను చెల్లిస్తారు. దేశాన్ని ఆదాయపు పన్ను రహితంగా మారుస్తారు" అని మిట్టల్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.కొత్త పన్ను విధానం కేవలం పన్ను కోత కాదని, "వ్యవస్థాగత దిద్దుబాటు" అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రొఫెషనల్ సామాజిక వేదిక లింక్డ్ఇన్లో చర్చకు తెరతీశారు. బలమైన ఆర్థిక వ్యవస్థ సాధికారత కలిగిన మధ్యతరగతిపైనే ఆధారపడుతుందని, అధిక పన్నుల భారం మోపడం సరికాదని వాదించారు. ఈ సందర్భంగా అమెరికా, చైనాలతో దేశ పన్ను విధానాన్ని పోలుస్తూ భారత్లో గతంలో వేతనజీవులను అధిక పన్నులతో పిండేశారని ఆరోపించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్ దేశ పన్ను శ్లాబ్లలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారు ఇక నుంచి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని మంత్రి ప్రకటించారు.20 ఏళ్లకే కోటీశ్వరుడుజీవితం ఎప్పుడూ సాఫీగా సాగకపోవచ్చు. ఎన్నో బాధలు.. కష్టాలు.. అనుభవించాల్సి రావొచ్చు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కొన్నిసార్లు సంపాదించిన సొమ్మంతా కోల్పోవాల్సి రావొచ్చు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనుపమ్ మిట్టల్. 20 ఏళ్లకే కోటీశ్వరుడైన ఆయన ఒడిదుడుకులను ఎదుర్కొని పడిలేచారు.'కొద్దికాలంలోనే గొప్ప విజయాలు సాధించా. 20 ఏళ్లకే కోటీశ్వరుడిని అయిపోయా. మైక్రోస్ట్రాటజీలో నేను ప్రొడక్ట్ మేనేజర్గా ఉన్న సమయంలో కంపెనీ విలువ 40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో బాగానే డబ్బులు సంపాదించా. తర్వాత పరిస్థితి మారిపోయింది. డాట్-కామ్ బబుల్ సమయంలో అంతా కోల్పోయా. అప్పుల్లో కూరుకుపోయా. తర్వాత ధైర్యం తెచ్చుకుని షాదీ.కామ్ స్టార్ట్ చేశా. మళ్లీ పూర్వవైభవం సాధించా' అంటూ అనుపమ్ గతంలో లింక్డ్ఇన్లో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. -
మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు
ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ కరుణించిందనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిగురించిందనే అనాలి. త్వరలో కొత్త చట్టం తెస్తున్నట్లు చెప్పారు. అందులో ఏం ఉంటుందనే ఆతృత, ఉత్కంఠకు తెరదించుతూ, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఆదాయ పన్నుకి సంబంధించి ముఖ్యమైన మార్పులు కొన్ని చేశారు. అవేమిటంటే.. ప్రస్తుతం రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటోంది. రూ. 10 లక్షలు దాటిన వారికి ఎంత ఉన్నా 30 శాతంగా ఉంది. ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ వస్తోంది. తాజా మార్పుల వల్ల రూ. 24 లక్షల వరకు 30 శాతం చొప్పున పడదు. ఇది చాలా పెద్ద ఉపశమనం. బేసిక్ లిమిట్ని రూ. 4,00,000కు పెంచారు. ఇది చిన్న ఉపశమనంలాగా కనిపించినా. శ్లాబులు మార్చారుకొత్త శ్లాబులు, పన్ను రేట్లు ఇలా ఉంటాయి. ఈ మార్పుల వల్ల రూ. 12,00,000 ఆదాయం ఉన్నవారికి పన్నుభారం ఉండదు. రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచారు. చాలా సాహసోపేతమైన, గొప్ప నిర్ణయం. వేతనజీవులకు ఈ లిమిట్ను రూ. 12.75 లక్షలు చేశారు. వీరికి స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో రూ. 75 వేలు మినహాయింపు లభిస్తుంది. ఇంత భారీ మినహాయింపు గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వలేదనే చెప్పాలి. సాహసం చేశారు. కొన్ని లక్షల మందికి పన్నుండదు. ఇంతకు తగ్గట్లుగా టీడీఎస్ విషయంలో చాలా మంచి మార్పులు తెచ్చారు. హేతుబద్ధత పేరున న్యాయం చేకూర్చారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయం మీద టీడీఎస్ వర్తింపును రూ. 1,00,000కు పెంచారు. చివరగా పన్నుభారం విషయంలో మార్పులు ఉండకపోయినా ఇది ముఖ్య ఉపశమనం. ఇంటికి అద్దె చెల్లించే విషయంలో సంవత్సరానికి రూ. 2,40,000 దాటితే టీడీఎస్ ఉంది. ఇక నుంచి టీడీఎస్ రూ. 6,00,000 దాటితేనే వర్తిస్తుంది. ఈ రోజుల్లో నగరంలో నెలకు అద్దె రూ. 20,000కు తక్కువ ఉండటం లేదు. ఓనర్లు మాకు బ్లాక్లో ఇవ్వండి అని పేచీ.. టీడీఎస్ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపై ఆ భయాల్లేవు. ఈ లిమిట్ని భారీగా పెంచినట్లు చెప్పవచ్చు. ఈ ఉపశమనంతో పాటు బ్లాక్ వ్యవహారాల జోలికి వెళ్లకుండా రాచమార్గంలో వెళ్లే అవకాశం కల్పించారు. మనలో చాలా మంది విదేశాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం/సర్దుబాటు/బదిలీలు చేస్తుంటాం. ప్రస్తుతం ఏటా రూ. 7,00,000 దాటితే టీడీఎస్ కంపల్సరీ. ఆ లిమిట్ని ఇప్పుడు రూ. 10,00,000కు పెంచారు. అంతే కాకుండా విద్య నిమిత్తం ఎంతైనా పంపవచ్చు. టీడీఎస్ లేకుండా. అయితే, ‘‘సోర్స్’ మాత్రం రుణం రూపంలో ఉండాలి. ప్రస్తుతం ఒక ఇంటి మీద యాన్యువల్ వేల్యూ నిల్గా భావించవచ్చు. ఇక నుంచి ఈ జాబితాలో మరొక ఇల్లును జోడించారు. ఏతావతా రెండిళ్ల మీద మినహాయింపు పొందవచ్చు. రూల్సు మేరకు ఈ రెండూ లభ్యమవుతాయి. ఆర్థిక మంత్రి సీతారామన్గారు మినహాయింపులు పెంచకపోయినా, 80సీ మొదలైన సెక్షన్లలో మినహాయింపులు ముట్టుకోకపోయినా, వాటికి రెట్టింపు/మూడింతలు ఉపశమనం ఇచ్చారు. వినియోగం వైపు మధ్యతరగతి వాళ్లు మొగ్గు చూపేలా మార్గనిర్దేశం చేశారు. వచ్చే వారం మరిన్ని తెలుసుకుందాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
పార్లమెంట్ సమావేశాలు.. కుంభమేళాపై చర్చకు విపక్షాల ఆందోళన
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల సందర్బంగా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష పార్టీల ఎంపీలు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై చర్చకు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో, సభలో నిరసనలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజులు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో భాగంగా మహాకుంభమేళాలో తొక్కొసలాట ఘటనపై ప్రభుత్వం చర్చకు రావాలని విపక్ష పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విపక్ష ఎంపీలు సభను హోరెత్తించారు. దీంతో, ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభ్యులను కోరారు. అనంతరం, రాజ్యసభ నుంచి ప్రతిపక్ష నేతలు వాకౌట్ చేశారు. All Opposition parties' MPs in Rajya Sabha walkout from the House over the issue Prayagraj Mahakumbh stampedePhoto source: Sansad TV/YouTube pic.twitter.com/ekGB0qYIJN— ANI (@ANI) February 3, 2025మరోవైపు.. లోక్సభలో సైతం సభ్యులు కుంభమేళాలో తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. ఈ సందర్భంగా యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, విపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ.. నినాదాలు ఆగలేదు. ఈ పరిస్థితుల మధ్యే లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి #WATCH | Opposition MPs in Lok Sabha raise slogans against Uttar Pradesh's Yogi Adityanath government over Maha Kumbh stampede issue (Video source: Sansad TV/YouTube) pic.twitter.com/8Fl2KXlY9a— ANI (@ANI) February 3, 2025 -
ఇది ప్రజల బడ్జెట్!!
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అమెరికా దివంగత అధ్యక్షుడు అబ్రహాం లింకన్ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. ‘ఇది ప్రజాభిప్రాయంతో, ప్రజల కోసం, ప్రజలు రూపొందించుకున్న బడ్జెట్‘గా అభివర్ణించారు. పన్నులపరంగా కొత్త రేట్లతో మధ్యతరగతికి గణనీయంగా ఊరట లభిస్తుందని ఆమె చెప్పారు. ‘వారి చేతిలో మరింతగా డబ్బు మిగులుతుంది. దీంతో వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి‘ అని వివరించారు. రేట్ల కోత ఆలోచనకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా మద్దతునిచ్చినప్పటికీ, బ్యూరోక్రాట్లను ఒప్పించేందుకే సమయం పట్టిందని మంత్రి వివరించారు. ద్రవ్యోల్బణంపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్న నేపథ్యంలో ఆ బాథ్యతను ప్రధాని తనకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు. పన్నుపరంగా ఉపశమనం కల్పించేందుకు ప్రధాని సత్వరం అంగీకరించినప్పటికీ ఆర్థిక శాఖ, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులను ఒప్పించడానికి సమయం పట్టిందని చెప్పారు. సంక్షేమ పథకాలు, ఇతర స్కీములకు అవసరమైన ఆదాయాన్ని వసూలు చేసే బాధ్యత వారిపై ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. డాలరుతో పోలిస్తే తప్ప రూపాయి పటిష్టంగానే ఉంది.. బలోపేతమవుతున్న అమెరికా డాలరుతో పోలిస్తే మాత్రమే రూపాయి మారకం విలువ క్షీణించిందని, మిగతా కరెన్సీలతో పోలిస్తే స్థిరంగానే ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్థూల ఆర్థికమూలాలు పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణమని ఆమె చెప్పారు. స్వల్ప వ్యవధిలో డాలరుతో పోలిస్తే రూపాయి 3 శాతం పడిపోవడం వల్ల దిగుమతులకు మరింతగా చెల్లించాల్సి రానుండటం ఆందోళన కలిగించే విషయమే అయినా, దేశీ కరెన్సీ అన్ని రకాలుగా బలహీనపడిందనే విమర్శలు ఆమోదయోగ్యం కావని తెలిపారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ. 10.18 లక్షల కోట్ల నుంచి రూ. 11.21 లక్షల కోట్లకు నామమాత్రంగా పెంచడంపై స్పందిస్తూ.. కేవలం అంకెలను కాకుండా ఎంత సమర్థ్ధవంతంగా ఖర్చు చేస్తున్నారనేది చూడాలని మంత్రి చెప్పారు. ఏడాదిగా కసరత్తు.. గతేడాది జూలైలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచే పన్ను కోతల అంశంపై కసరత్తు జరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. తాము నిజాయితీగా పన్నులు కడుతున్నప్పటికీ, దానికి తగ్గట్లుగా తమ సమస్యల పరిష్కారానికి చర్యలు ఉండటం లేదని మధ్యతరగతి ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. ‘మీరేం చేయగలరో చూడండి అని ప్రధాని నాకు సూచించారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే విషయంలో ఆయన స్పష్టంగానే ఉన్నారు. కాకపోతే ఆర్థిక శాఖ, సీబీడీటీ అధికారులను ఒప్పించడానికి సమయం పట్టింది. ఇలా చేయడం వల్ల తలెత్తే ప్రభావాల గురించి వారు నాకు తరచుగా గుర్తు చేసేవారు. వారిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ఆదాయాన్ని సమకూర్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. అయితే, అంతిమంగా అందరూ ఒక అభిప్రాయానికి రావడంతో ఇది సాధ్యపడింది‘ అని మంత్రి వివరించారు. ప్రస్తు తం దేశంలో 8.65 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేస్తున్నారని, టీడీఎస్ వర్తిస్తున్నా రిటర్నులను ఫైలింగ్ చేయని వారి సంఖ్యను కూడా కలిపితే ఇది 10 కోట్లు దాటుతుందని వివరించారు. -
ఇక జీఎస్టీ రేట్లలోనూ భారీ మార్పులు?
ఆదాయపు పన్నులో సంస్కరణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (GST)లోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025-26) ఆదాయపు పన్ను (Income Tax) రేట్లను హేతుబద్ధీకరించిన తర్వాత, జీఎస్టీ రేట్లను కూడా ప్రభుత్వం హేతుబద్ధీకరించాలని చూస్తోందని వార్తా సంస్థ మనీకంట్రోల్ వెల్లడించింది.ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అన్ని రాష్ట్రాలను బోర్డులోకి తీసుకురావడానికి కేంద్రం కృషి చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పినట్లు పేర్కొంది. "జీఎస్టీని హేతుబద్ధీకరించడానికి ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతోంది. ఏవైనా మార్పులను ఖరారు చేయడానికి ముందు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకోవాలనుకుంటున్నాం" అని విషయం గురించి తెలిసిన వ్యక్తొకరు చెప్పినట్లుగా పేర్కొంది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో రూ.12 లక్షలలోపు ఆర్జించేవారికి ఆదాయపు పన్ను నుండి మినహాయించడం ద్వారా మధ్యతరగతి ప్రజలను దాదాపు గణనీయమైన ఉపశమనాన్ని అందించారు. అలాగే ఇతరులకు కూడా పన్ను స్లాబ్లను సర్దుబాటు చేశారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్ల ఆదాయాన్ని వదులుకోనుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు.ఇప్పటికే ఏకాభిప్రాయంజీఎస్టీ రేటు హేతుబద్ధీకరణను పరిశీలించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. గత డిసెంబరులో ఈ ప్యానెల్ దాదాపు 150 వస్తువులపై పన్ను రేట్లను సవరించడంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2017 జూలైలో ఈ పరోక్ష పన్ను విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి జీఎస్టీ రేటు విధానం అనేక సవరణలకు గురైంది. ప్రారంభంలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఇలా.. నాలుగు ప్రాథమిక పన్ను స్లాబ్లతో జీఎస్టీ విధానాన్ని రూపొందించగా వాటి పరిధిలోకి వచ్చే వివిధ వస్తువులను కాలానుగుణంగా పలు సర్దుబాటు చేశారు.భిన్న పన్ను స్లాబ్లు వర్గీకరణ వివాదాలు, సమ్మతి సవాళ్లను సృష్టిస్తాయని వాదిస్తూ సరళమైన జీఎస్టీ విధానం కోసం ఆర్థికవేత్తలు చాలాకాలంగా వాదిస్తున్నారు. పన్ను సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి హేతుబద్ధీకరణ చర్యను పరిశ్రమ నాయకులు కూడా ఆశిస్తున్నారు. కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం కూడా పన్ను విధానాన్ని మరింత బిజినెస్ ఫ్రెండ్లీగా మార్చడానికి ఒక అడుగుగా పరిగణిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్.. రాబోయే సమావేశాలలో రేట్ల హేతుబద్ధీకరణ కోసం తుది రోడ్మ్యాప్పై చర్చిస్తుందని భావిస్తున్నారు. -
పన్ను మినహాయింపు నిర్ణయం అసలెవరిది..?
న్యూఢిల్లీ:సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం వరకు వేతన జీవులకు పన్ను మినహాయించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు.. అసలేం జరిగింది..నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే ఆసక్తికర విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సామాన్యులకు పన్ను మినహాయింపు విషయంలో ప్రధాన మంత్రి మోదీ తొలి నుంచి సుముఖంగా, స్పష్టంగా ఉన్నారని తెలిపారు. ఆయన వద్దకు పన్ను మినహాయింపు ప్రతిపాదన తీసుకెళ్లగానే ఓకే చెప్పారు. అయితే ఈ విషయంలో తన ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులను ఒప్పించేందుకే ఎక్కువ సమయం పట్టిందన్నారు. పన్ను మినహాయింపు ద్వారా ప్రభుత్వానికి జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ఇతర మార్గాల ద్వారా ఆదాయం చూసుకున్న తర్వాతే వారు ఒప్పుకున్నారని, ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లానా పన్ను చెల్లింపుదారులు తనను కలిసి నిజాయితీగా పన్ను చెల్లించే తమకు బడ్జెట్లో వరాలేవీ ఉండవా అని అడిగేవారని గుర్తుచేశారు. వారి కోసమే పన్ను మినహాయింపు ప్రకటించామని నిర్మల చెప్పారు. -
బీఆర్ఎస్,కాంగ్రెస్కు ఎంపీ లక్ష్మణ్ ఛాలెంజ్
సాక్షి,హైదరాబాద్:వికసిత్ భారత్ 2047 విజన్ లక్ష్యంగానే కేంద్రం 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం(ఫిబ్రవరి2) లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో మూడు ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఆర్ఆర్ఆర్కు కేంద్రమే నిధులు ఇస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వమే పునరుద్ధరించిందికరోనా లాంటి గడ్డు పరిస్థితి తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ గాడిలో పెట్టారు. 2014లో 2 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. ఇదొక మైల్ స్టోన్. దశాబ్ద కాలంలో మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మధ్య తరగతి ప్రజలతో దేశ ఆర్థిక ప్రగతి సాధ్యమని భావించి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యం కల్పిస్తూనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సామాన్యుడు కూడా నాణ్యమైన విద్య, వైద్యం అందుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దారుప్రతిపక్షపార్టీలు కళ్లు లేని కబోదులుగా మారి విమర్శలు చేస్తున్నాయి. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్కు కంచుకోటలాగా మెదక్ను చెప్పుకున్నారు.. కానీ అన్ని ఏండ్లు అధికారంలో ఉన్నా రైలు మార్గం వేయలేదు. కానీ మేము వేశాం. త్వరలో రైలు ప్రారంభమవుతుంది. ధర్నా చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..మా హయాంలో పదేండ్లలో మేమేం చేశాం.. మీరేం చేశారు అనే అంశంపై చర్చకు సిద్ధమా?’అని లక్ష్మణ్ సవాల్ విసిరారు.కాగా శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్లో తెలంగాణకు ఎప్పటిలాగే సున్నా నిధులు కేటాయించారని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి బీజేపీ తెలంగాణకు మొండి చెయ్యి చూపించిందని రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి. -
ఖజానాకు చేరిన గత బడ్జెట్ కేటాయింపులు
భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కొన్ని శాఖలు పూర్తిస్థాయిలో అప్పటి బడ్జెట్ నిధులను ఉపయోగించలేదు. మూలధన పెట్టుబడులు, వస్తువుల కొనుగోళ్లలో జాప్యం కారణంగా కొంతమేర నిధులు బూ తిరిగి ఖజానాకు చేరాయి. ఏయే విభాగాలు ఎంతమేరకు ఇలా నిధులు తిరిగి పంపాయో.. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమకు కేటాయించిన బడ్జెట్ను 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. కొనుగోలు ప్రక్రియల్లో జాప్యం, ఇతర బ్యూరోక్రాటిక్ అడ్డంకుల కారణంగా రక్షణ మంత్రిత్వ శాఖ రూ.12,500 కోట్లు తిరిగి కేంద్ర ఖజానాకు జమ చేసింది. ప్రభుత్వం కఠినమైన ఆర్థిక విధానాలు, మెరుగైన ఆర్థిక నిర్వహణ పద్ధతుల ద్వారా భారీగా ఖర్చు చేయడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఖర్చులను ఆదాయ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నాయి. ఇది ఆర్థిక జాప్యాన్ని నివారించడానికి, సమతుల్య బడ్జెట్ను నిర్వహించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 100 మంది వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?మెరుగైన పన్ను వసూలు యంత్రాంగాలు, పన్ను ఎగవేతను అరికట్టడంతో సహా సమర్థమైన ఆదాయ సమీకరణ ప్రయత్నాల వల్ల కొంత బడ్జెట్ను మిగిల్చింది. కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రభుత్వాల మద్దతు వల్ల ద్రవ్యలోటును నిర్వహించడానికి, బడ్జెట్ అమలు సజావుగా జరిగేలా చూడటానికి సాయపడిందని నిపుణులు తెలియజేస్తున్నారు. నిధుల రాబడి, ఆర్థిక క్రమశిక్షణ, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెబుతున్నారు. -
16 మంది ఎంపీలున్నా టీడీపీ నిధులు సాధించడంలో విఫలమైంది
-
గేమ్ ఛేంజర్ బడ్జెట్
-
చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లు
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర బడ్జెట్ 2025లో భాగంగా హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్, సుజుకీ వంటి బ్రాండ్ల ప్రీమియం మోటార్ సైకిళ్లపై సుంకాలను 5-20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు.దిగుమతి సుంకాల తగ్గింపు అమెరికా నుంచి వస్తున్న వస్తువులపై డిమాండ్ స్థిరంగా కొనసాగించేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ టారిఫ్ విధానాలను, హార్లే డేవిడ్సన్ దిగుమతులకు సంబంధించి విమర్శించారు. భారత్ను ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణించిన ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని పదేపదే పిలుపునిచ్చారు.కొత్త విధానం ప్రకారం 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై గతంలో ఉన్న 50 శాతం నుంచి 40 శాతానికి కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు. 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై సుంకాన్ని 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దీంతోపాటు సెమీ నాక్ డౌన్ (ఎస్కేడీ-తయారీదారు ప్లాంట్లో పాక్షికంగా అసెంబుల్ చేసిన వాహనం(లైట్ మోటార్ సైకిళ్లు లేదా కార్లు)), పూర్తిగా నాక్ డౌన్ (సీకేడీ-తయారీదారు ప్లాంట్ వద్దే పూర్తిగా విడి భాగాలుగా చేయడం) యూనిట్లపై సుంకాలను కూడా తగ్గించారు.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..ఈ చర్య భారతీయ వినియోగదారులకు ప్రీమియం మోటార్ సైకిళ్లను మరింత చౌకగా మారుస్తుందని, ఈ హై-ఎండ్ బ్రాండ్ల అమ్మకాలను పెంచుతుందని భావిస్తున్నారు. అమెరికా లేవనెత్తిన వాణిజ్య ఫిర్యాదులను పరిష్కరించడానికి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి భారతదేశం సుముఖంగా ఉందని ఈ నిర్ణయం సూచిస్తుంది. కస్టమ్స్ సుంకాల తగ్గింపు దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, విదేశీ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాన్ని పెంచే విస్తృత వ్యూహంలో భాగం. -
కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి!
-
కేంద్రం బడ్జెట్పై జగన్ మార్క్
-
Big Question: కేంద్ర బడ్జెట్ లోనూ బాబు అసమర్థత బయట పడిందా ?
-
వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ 2025-26
-
డిజిన్వెస్ట్మెంట్@రూ.47,000 కోట్లు
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.47,000 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రతిపాదించింది. అయితే డిజిన్వెస్ట్మెంట్, ఆస్తుల మానిటైజేషన్ తదితర మూలధన వసూళ్లకింద ఈ మొత్తాన్ని అంచనా వేసింది. వెరసి రూ.47,000 కోట్ల మిస్లేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వెరసి పీఎస్యూలలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ(డిజిన్వెస్ట్మెంట్)ను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఏడాది మూలధన సమీకరణగా పేర్కొంది.2024–25లో ప్రభుత్వం వార్షిక డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాల నుంచి దూరం జరిగింది. పీఎస్యూలలో వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్ తదితర మిస్లేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా రూ.50,000 కోట్ల లక్ష్యాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా ఎంఎస్టీసీ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల ఐపీవోలకు దీపమ్ ప్రణాళికలు వేసింది. పీఎస్యూ దిగ్గజాలు హెచ్ఏఎల్, కోల్ ఇండియా, ఆర్వీఎన్ఎల్, ఎస్జేవీఎన్, హడ్కోలలో మైనారిటీ వాటాల విక్రయం(ఓఎఫ్ఎస్)ను సైతం చేపట్టింది. తద్వారా రూ. 13,728 కోట్లు సమకూర్చుకుంది. అయితే ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్సహా వ్యూహాత్మక వాటాల విక్రయం పట్టాలెక్కలేదు. 2021 అక్టోబర్లో టాటా గ్రూప్నకు విమానయాన దిగ్గజం ఎయిరిండియా విక్రయం తదుపరి ప్రధాన డీల్స్కు చెక్పడింది.ఇదీ చదవండి: డివిడెండ్@రూ.2.56లక్షల కోట్లుద్రవ్యలోటు@రూ.15,68,936కోట్లుప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం..ద్రవ్యలోటును 2024–25లో అనుకున్న ప్రకారం 4.8% వద్ద (జీడీపీ విలువలో) కేంద్రం కట్టడి చేయగలిగింది. విలువల్లో ఇది రూ.15,68,936 కోట్లు. 2025–26లో 4.4%కి తీసుకురావాలని నిర్దేశించుకుంది. గణాంకాల్లో చూస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.15.70 లక్షల కోట్ల ద్రవ్యలోటు అంచనా వేయగా, అంతకన్నా తక్కువగా రూ.15.69 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. తాజా ద్రవ్యలోటును పూడ్చుకోడానికి రూ.11.54 లక్షల కోట్ల మార్కెట్ రుణాన్ని సమీకరించాలని కొత్త బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన మొత్తాలను చిన్న తరహా పొదుపు మార్గాల ద్వారా సమీకరించాలని బడ్జెట్ నిర్దేశించింది. స్థూలంగా రూ.14.82 లక్షల కోట్ల మార్కెట్ రుణాలను స్వీకరించాలన్నది లక్ష్యం. -
డివిడెండ్@రూ.2.56లక్షల కోట్లు
కేంద్ర బ్యాంకు ఆర్బీఐ సహా ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ.2.56 లక్షల కోట్లు డివిడెండ్గా అందనున్నట్లు తాజా బడ్జెట్ అంచనా వేసింది. ప్రస్తుత ఏడాది(2024–25)లో డివిడెండ్, మిగులు ద్వారా రూ. 2.34 లక్షల కోట్లమేర లభించనున్నట్లు అభిప్రాయపడింది. గత అంచనాలకంటే ఇది రూ.1,410 కోట్లు ఎక్కువకాగా.. వచ్చే ఏడాది ఇవి మరింత బలపడనున్నట్లు ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెట్టుబడుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందనున్న మొత్తం వసూళ్లు రూ.3.25 లక్షల కోట్లను తాకనున్నట్లు అంచనా. గతంలో నమోదైన రూ.2.89 లక్షల కోట్లను దాటనున్నాయి.ఎల్రక్టానిక్స్ ప్రాజెక్టులకు రూ.18,000కోట్లువచ్చే ఆర్థిక సంవత్సరంలో కీలకమైన టెక్నాలజీ ప్రాజెక్టులకు కేటాయింపులను 84 శాతం అధికంగా రూ. 18,000 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్వేర్, సెమీకండక్టర్లు మొదలైన వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఇండియాఏఐ మిషన్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. మొత్తం మీద ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖకు కేటాయింపులు 48 శాతం పెరిగి రూ.17,566 కోట్ల నుంచి రూ.26,026 కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..అత్యధికంగా మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన లార్జ్ స్కేల్ ఎల్రక్టానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పీఎల్ఐకి రూ. 8,885 కోట్లు కేటాయించారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థలు ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ మొదలైనవి ఈ పథకం లబ్ధిదార్లుగా ఉన్నాయి. మరోవైపు, సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు కేటా యింపులు, సవరించిన అంచనాలకు దాదాపు రెట్టింపై, దాదాపు రూ. 2,500 కోట్లకు చేరాయి. ఇండియాఏఐ మిషన్కి కేటాయింపులు 11 రెట్లు పెరిగి రూ. 2,000 కోట్లకు చేరాయి. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకానికి రెట్టింపు స్థాయిలో రూ. 200 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎలక్ట్రానిక్ రంగ ప్రాజెక్టులకు కేటాయింపులను రూ. 9,766 కోట్లకు సవరించారు. -
రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్ ఇలా..
కేంద్రబడ్జెట్ 2025-26లో నిర్మలా సీతారామన్ సామాన్యుడికి రూ.13 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే చాలామందికి ఇది ఎలా వర్తిస్తుందో అనుమానాలున్నాయి. అయితే ఒక ఉదాహరణతో దీనిపై స్పష్టతకు వద్దాం. మీ వార్షిక వేతనం రూ.13 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. ఎందుకంటే మీ ఆదాయం ప్రభుత్వం ప్రకటించిన రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీ సంపాదన రూ.13 లక్షల నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా మిగిలిన రూ.12.25 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది.ఇందులో రూ.4 లక్షలవరకూ జీరో ట్యాక్స్రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలుమిగిలిన నాలుగు లక్షలు.. రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలుమిగిలిన 25 వేలపై 15 శాతం అంటే రూ.3,750గా లెక్కిస్తారు.మొత్తంగా రూ.4-8 లక్షలు- 5 శాతం ట్యాక్స్ రూ.20,000రూ.8-12 లక్షలు(మిగిలిన రూ.4 లక్షలనే పరిగణిస్తారు)-10 శాతం ట్యాక్స్ రూ.40,000రూ.12-16 లక్షలు(మిగిలిన రూ.25,000కు)- 15 శాతం ట్యాక్స్ రూ.3,750మొత్తం కలిపి రూ.13 లక్షలు ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్స్ పోను మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ రూ.63,750.ఇదీ చదవండి: స్టార్టప్లకు జోష్రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని అని గుర్తుంచుకోవాలి.అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రైవేట్ రంగానికి పీఎం గతి శక్తి డేటా..
చివరి అంచె వరకు డెలివరీ సేవలు అందేలా చూసేందుకు, మౌలిక సదుపాయాల ఆధారిత యాప్లను రూపొందించేందుకు ఉపయోగపడేలా పీఎం గతి శక్తి పోర్టల్లోని నిర్దిష్ట డేటా, మ్యాప్లను ప్రైవేట్ రంగానికి అందించే దిశగా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, ప్రాజెక్ట్ ప్లానింగ్లో ప్రైవేట్ రంగానికి తోడ్పడేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ శాఖలు అందించే రైల్వే స్టేషన్లు, గూడ్ షెడ్లు, జాతీయ.. రాష్ట్ర రహదారులు, గిడ్డంగులు, విమానాశ్రయాలు, ఎంఎంఎల్పీలు (మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు) మొదలైన డేటా, ప్రైవేట్ రంగం లాస్ట్ మైల్ డెలివరీ సేవలను మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడనుంది. అలాగే, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ను రూపకల్పన, టెక్ ఆధారిత లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అవసరాలకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. -
కస్టమ్స్ టారిఫ్లు ఇక ‘ఎనిమిదే’
బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను కేవలం ‘ఎనిమిదింటికి’ పరిమితం చేస్తున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. అయినప్పటికీ సెస్సును సర్దుబాటు చేయడం ద్వారా చాలా వస్తువులపై నికర సుంకాలను ప్రస్తుతం మాదిరే కొనసాగించే విధంగా ఈ మార్పులు చేయడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో మొత్తం మీద ఏడు టారిఫ్లను తొలగించారు. 2023–24లోనూ ఇదే మాదిరిగా ఏడు టారిఫ్లను ఎత్తివేశారు. దీంతో ఇప్పుడు ‘సున్నా’ రేటు సహా మొత్తం ఎనిమిది రేట్లే మిగిలాయి. ఇది సులభతర వ్యాపార నిర్వహణకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న టారిఫ్ల గందరగోళానికి తెరదించినట్టయింది. డెలాయిట్ ఇండియా పార్ట్నర్ హర్ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. బడ్జెట్లో 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం టారిఫ్లను విలీనం చేసి 20 శాతానికి మార్చినట్టు.. సబ్బులు, ప్లాస్టిక్, కెమికల్స్, పాదరక్షలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 100 శాతం, 125 శాతం, 150 శాతం టారిఫ్లను 70 శాతం టారిఫ్లో విలీనం చేసినట్టు తెలిపారు. లేబరేటరీ కెమికల్స్, ఆటోమొబైల్స్కు ఇది అమలవుతుందన్నారు. -
స్టార్టప్లకు జోష్
దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో కేంద్రం పలు కార్యక్రమాలు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.10 వేల కోట్ల కార్పస్తో నిధుల నిధి (ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్) పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన స్టార్టప్లకు పన్ను రాయితీలు కల్పించేందుకు సంబంధించిన విలీన కాలపరిమితిని (ఇన్కార్పొరేషన్ పీరియడ్) ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో కూడా కేంద్రం రూ.10 వేల కోట్ల కార్పస్తో ఎఫ్ఎఫ్ఎస్ తరహా పథకాన్ని ప్రారంభించింది. వెంచర్ మూలధన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. సెక్యూరిటీ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ అయిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు (ఏఐఎఫ్లకు) పెట్టుబడి సమకూర్చే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) దీనిని నిర్వహిస్తుంది. కాగా ఈ ఏఐఎఫ్లు తిరిగి స్టార్టప్లలో పెట్టుబడి పెడతాయి. స్టార్టప్ల కోసం ఉద్దేశించిన ఈ ఏఐఎఫ్లు రూ.91 వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలను కలిగి ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రూ.10 వేల కోట్ల ప్రభుత్వ కార్పస్తో కూడిన నిధుల నిధి పథకం వీటికి దన్నుగా నిలుస్తుందని తెలిపారు. తాజాగా మరో రూ.10 వేల కోట్ల సహాయంతో ఓ కొత్త నిధుల నిధి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పరిశ్రమలను, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)తో భేటీలో ఏఐఎఫ్లు ఈ పథకం కింద మరిన్ని నిధుల కోసం డిమాండ్ చేశాయి. ఎఫ్ఎఫ్ఎస్ సహకారం పొందుతున్న ప్రముఖ స్టార్టప్ పెట్టుబడి సంస్థల్లో చిరాటే వెంచర్స్, ఇండియా కోషియెంట్, బ్లూమ్ వెంచర్స్, ఐవై క్యాప్ తదితరాలున్నాయి. ఎఫ్ఎఫ్ఎస్ కింద ప్రయోజనం పొందే ఏఐఎఫ్లు..తాము అంగీకరించిన మొత్తానికి కనీసం రెండింతలు స్టార్టప్లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 2024 అక్టోబర్ నాటికి ఏఐఎఫ్లు రూ.20,572 కోట్ల మేర స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాయి. కంపెనీల హర్షం ఎఫ్ఎఫ్ఎస్ పథకంపై పలు కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. బడ్జెట్ భారత్ను ప్రపంచ ఆవిష్కరణల పవర్హౌస్ గా నిలబెడుతుందని పేర్కొన్నాయి. రూ.10 వేల కోట్ల తాజా కార్పస్తో స్టార్టప్లకు అవసరమైన పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని భారత్ పే వ్యవస్థాపకుడు శాశ్వత్ నకరాని చెప్పారు. కొత్త స్టార్టప్లకు తాజా ఎఫ్ఎఫ్ఎస్ పథకం కీలకమైన ఆర్థిక మద్దతును అందజేస్తునందని స్టార్టప్ పాలసీ ఫోరం (ఎస్పీఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ రాజ్పాల్ కోహ్లి పేర్కొన్నారు. -
జీఎస్టీలో కొత్త సవరణలు..
పన్నులు ఎగవేసేందుకు ఆస్కారమున్న ఉత్పత్తులను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడేలా ‘ట్రాక్ అండ్ ట్రేస్’ నిబంధన సహా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో కేంద్ర బడ్జెట్ పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ నిబంధన అమలు కోసం విశిష్ట గుర్తింపు మార్కింగ్కు నిర్వచనం ఇస్తూ సెంట్రల్ జీఎస్టీ చట్టంలో కొత్త నిబంధన చేర్చింది. ప్రత్యేకమైన, సురక్షితమైన, తొలగించడానికి వీలుకాని విధంగా ఉండే డిజిటల్ స్టాంప్, డిజిటల్ మార్క్ లేదా ఆ కోవకు చెందిన ఇతరత్రా గుర్తులు ‘విశిష్ట గుర్తింపు మార్కింగ్’ కిందికి వస్తాయి. సరఫరా వ్యవస్థను మెరుగ్గా పర్యవేక్షించడానికి, వ్యాపారవర్గాలను డిజిటైజేషన్ వైపు మళ్లించడానికి ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
టీడీఎస్ ఖుషి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా భారీ ఊరటనిచ్చిన కేంద్ర సర్కారు, మరోవైపు అద్దె చెల్లింపులపై టీడీఎస్, విదేశీ రెమిటెన్స్ల్లోనూ ఊరట కల్పించింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194–ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ.2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను (టీడీఎస్) మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ పరిమితిని రూ.6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఎవరికి ప్రయోజనం..?తాజా ప్రతిపాదన ప్రధానంగా వ్యాపార సంస్థలకు ఊరటగా చెప్పుకోవాలి. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్యూఎఫ్లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50,000 (వార్షికంగా రూ.6లక్షలు) మించినప్పుడు 5 శాతం టీడీఎస్ అమలవుతోంది. అదే వ్యాపార సంస్థలు/ట్రస్ట్లు/ఎన్జీవోలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4 లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది. ఇప్పుడు వ్యక్తులు, హెచ్యూఎఫ్ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ రూ.50,000కు పెంచారు. మరింత స్పష్టత, ఏకరూపత కోసం ఈ చర్య తీసుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘భూమి లేదా మెషినరీని కొన్ని నెలల కోసం అద్దెకు ఇచ్చినప్పుడు, నెలవారీ అద్దె రూ.50,000 మించితే టీడీఎస్లు అమలు చేయాల్సి వస్తుంది’’అని డెలాయిట్ ఇండియా ఆర్తి రాటే తెలిపారు. తక్కువ పన్ను చెల్లించే వారు, భూ/భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ డొమినిక్ రామెల్ అభిప్రాయపడ్డారు. కోటి మంది పన్ను కట్టక్కర్లేదు: సీతారామన్ ఐటీ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మిగిల్చినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘‘రూ.12 లక్షలకు ఆదాయపన్ను మినహాయింపును పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇది. మధ్య తరగతికి ప్రయోజనం కల్పించేందుకు పన్ను రేట్లను తగ్గించాం’’అని మంత్రి ప్రకటించారు. కొత్తగా సులభతర ఆదాయపన్ను చట్టం కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రస్తుతమున్న ఆరు దశాబ్దాల క్రితం నాటి ‘ఆదాయపన్ను చట్టం 1961’ స్థానంలో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ‘ముందు విశ్వసించండి. తర్వాత పరిశీలించండి’ అన్న భావనతో ‘న్యాయ’ స్ఫూర్తితో ఈ బిల్లు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ‘‘కొత్త బిల్లు చాలా స్పష్టతతో, చాప్టర్లు, పదాల పరంగా ప్రస్తుత చట్టంతో పోల్చి చూసినప్పుడు సగం పరిమాణంలోనే ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులు అర్థం చేసుకునేంత సరళంగా ఉంటుంది. ఫలితంగా పన్నుల స్పష్టత ఏర్పడి, వివాదాలు తగ్గిపోతాయి’’అని మంత్రి వివరించారు. కొత్త ఆదాయపన్ను బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. రూ.10 లక్షలు మించితేనే రెమిటెన్స్లపై టీసీఎస్ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపుకునే నిధుల(రెమిటెన్స్/చెల్లింపులు)పై టీసీఎస్లో మార్పు చోటుచేసుకుంది. ఏడాదిలో రూ.7లక్షలు మించితే మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్దేశిత ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి రుణం తీసుకుని విదేశీ విద్య కోసం పంపుకునే రెమిటెన్స్లపై టీసీఎస్ను తొలగిస్తున్నట్టు చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఊరటనిచ్చేదే. విదేశాల్లో చదువు కోసం, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారికి నిధుల అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు స్వదేశం నుంచి వారికి సులభంగా నిధులు పంపుకునేందుకు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచనున్నట్టు ప్రకటించడం స్వాగతించదగిన నిర్ణయం. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుకుంటారు. అప్పుడే పెరిగిన మెడికల్ సీట్ల ప్రయోజనాలను నిజంగా పొందగలం. కామినేని శశిధర్ఎండి, కామినేని హాస్పిటల్స్సిమెంట్ రంగ వృద్ధికి..హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెరిగిన కేటాయింపులు నిర్మాణ సామగ్రికి డిమాండ్ను పెంచుతాయి. అలాగే సామర్థ్య విస్తరణకు దారితీస్తుంది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలపై పెరిగిన పెట్టుబడులతో సిమెంట్ రంగ వృద్ధికి అవకాశాలు విస్తరిస్తాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సిమెంట్ పరిశ్రమ స్థాపిత తయారీ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం కంటే ఎక్కువ స్థిర వార్షిక వృద్ధి రేటును సాధించడానికి ఈ చర్యలు మద్దతు ఇస్తాయి. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.మెడికల్ టూరిజంకు బూస్ట్..దేశీయంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే దిశగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. మెడికల్ టూరిస్టులకు వీసా–ఆన్–అరైవల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో హెల్త్కేర్ గమ్యస్థానంగా భారత్ బలోపేతం అవుతుంది. ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధిపై చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంది. – బి. భాస్కర్ రావు, సీఎండీ, కిమ్స్పోటీతత్వాన్ని పెంచడానికి.. ప్రైవేట్ రంగంలో మూలధనాన్ని సానుకూల దిశలో కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు దేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. – అనీష్ షా, సీఈఓ, ఎండీ, మహీంద్రా గ్రూప్.ఈవీల ఉత్పత్తికి బాసట.. బ్యాటరీ తయారీకి కీలక ముడిపదార్థాలపై దిగుమతి సుంకాలు తొలగించడం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతుంది. స్థిర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థకు భారతదేశాన్ని మార్చడానికి ఒక వ్యూహాత్మక చర్య. – గిరీష్ వాఘ్, ఈడీ, టాటా మోటార్స్. ఉద్యోగాలను సృష్టించడానికి..వృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి బలమైన, నమ్మకమైన వేదికను అందిస్తుంది. రాష్ట్రాల సహకారంతో ఆరు విభాగాలలో సంస్కరణల ద్వారా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడి, ఎగుమతుల వంటి శక్తివంతమైన ఇంజిన్లను పటిష్టం చేయడానికి చేసిన విధాన ఎంపికలు స్వాగతించదగినవి. – సంజీవ్పురి, ప్రెసిడెంట్, సీఐఐపట్టణ సంస్కరణలకు.. ఊతంప్రతి మంత్రిత్వ శాఖకు 3 సంవత్సరాల పైప్లైన్ ప్రాజెక్ట్లను రూపొందించడం ద్వారా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రభావితం చేసే స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మరింత మద్దతునిస్తుంది. రూ. లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పట్టణ సంస్కరణలకు అంకితం. – వై.ఆర్.నాగరాజా, ఎండీ, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. -
అన్నదాత ఆశలపై నీళ్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై మిశ్రమ స్పందన లభిస్తోంది. వ్యవసాయ రంగంలో పలు మిషన్ల ఏర్పాటు చేయడం ఒకింత మేలు చేస్తుందంటున్న నిపుణులు.. పీఎం కిసాన్ యోజన వంటి కొన్ని పథకాల సాయాన్ని పెంచకపోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని చెబుతున్నారు. పీఏం కిసాన్ యోజన సాయం పెంచుతారని రైతులు ఎంతగానో ఎదురు చూశారు.ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున అందించే పెట్టుబడి సాయాన్ని కనీసం రూ.10 వేలకి పెంచాలన్న డిమాండ్ను కేంద్రం ఆమోదిస్తుందని ఆశించారు. అయితే ఈ డిమాండ్ను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏటా ఇచ్చినట్టే ఈ ఏడాది కూడా బడ్జెట్లో రూ.186 కోట్లు కేటాయించారు. ఆక్వా, మత్స్య రంగాలకు ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం పట్ల ఆ రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలు, చేపల ఫీడ్పై ఇంపోర్ట్ డ్యూటీని రద్దు చేయాలన్న విజ్ఞప్తిని కేంద్రం ఏమాత్రం పరిగణనలోకి తీసుకపోవడం పట్ల జాతీయ రొయ్య రైతుల సమాఖ్య నిరసన తెలిపింది.మిషన్లతో కొంత మేలుబడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన పలు మిషన్ల ద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త వంగడాలు, పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల నుంచి ఏటా పదుల సంఖ్యలో కొత్త వంగడాలు విడుదలవుతున్నాయి.కొత్తగా ఏర్పాటు చేసిన హైబ్రిడ్ విత్తన మిషన్ రాష్ట్రంలో పరిశోధనలకు మరింత ఊతమిస్తుందని, మరిన్ని కొత్త వంగడాల అభివృద్ధికి నిధులు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 15 నుంచి 16 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. 18.78 లక్షల టన్నుల దిగుబడులొస్తాయి. సాధారణంగా బోర్ల కింద 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మాత్రం 7 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. గడిచిన ఐదేళ్లలో క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం ఐదారు వేలకు మించి పలకక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏర్పాటు చేస్తున్న పత్తి మిషన్ రాష్ట్రంలో పత్తి సాగు విస్తరణకు, ఉత్పాదకత పెంచేందుకు దోహదపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పప్పు దినుసుల కోసం ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో అపరాల సాగుకు కొంత మేర ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్లో 7.50 లక్షల ఎకరాల్లో, రబీలో 23 లక్షల ఎకరాల్లో అపరాలు సాగవుతుంటాయి. రెండు సీజన్లకు కలిపి 62 లక్షల టన్నుల దిగుబడులొస్తాయి. ప్రత్యేక మిషన్ ద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.రుణ పరపతి పెంపుతో 55 లక్షల మందికి లబ్ధికిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా వడ్డీ రాయితీ రుణ పరపతిని రూ.5 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్రంలో రైతులతో పాటు ఆక్వా, పాడి రైతులకు కూడా మేలు జరగనుంది. సుమారు 55 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలకు కూడా ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది.సాధారణంగా ఇలా పొందిన రుణాలకు రూ.లక్ష వరకు సున్నా వడ్డీ రాయితీ ఇస్తుండగా, రూ. 3 లక్షల వరకు ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద 3 శాతం వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉండేది. ఇక నుంచి రూ.5 లక్షల వరకు ఈ రాయితీ పొందే వెసులుబాటు కల్పించారు. -
చిన్న సంస్థలకు.. భారీ బూస్ట్
న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) మరింత ఊతమిచ్చే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు సంస్కరణలను ప్రతిపాదించారు. ఎంఎస్ఎంఈల వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను పెంచడం, రుణ హామీ పథకం కవరేజీని పెంచడం, ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు కస్టమైజ్ చేసిన క్రెడిట్ కార్డులు అందించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచుతూ బడ్జెట్లో మంత్రి ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడులు, రూ. 10 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను ’సూక్ష్మ’ సంస్థలుగా వర్గీకరిస్తారు. రూ. 25 కోట్ల వరకు పెట్టుబడి, రూ. 100 కోట్ల వరకు టర్నోవరు ఉన్నవి ’చిన్న’ తరహా సంస్థలుగా, రూ. 125 కోట్ల వరకు పెట్టుబడులతో రూ. 500 కోట్ల లోపు టర్నోవరు ఉన్న సంస్థలను ’మధ్య’ తరహా సంస్థలుగా వ్యవహరిస్తారు. ఎంఎస్ఎంఈల విషయంలో ప్రకటించిన చర్యలను పరిశ్రమ స్వాగతించింది. దేశ ఎకానమీలో తయారీ రంగ వాటాను పెంచే దిశగా ఇది కీలకమైన అడుగని జేఎస్డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తెలిపారు. కీలకమైన రెండో ఇంజిన్.. దేశాభివృద్ధికి కీలకమైన రెండో ఇంజిన్గా ఎంఎస్ఎంఈలను నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఉత్ప త్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మె రుగుపర్చుకునేందుకు, మరింతగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు తాజా ప్రతిపాదనలు ఉపయోగపడతాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించేందుకు, యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు లఘు సంస్థలకు ధీమా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోటి పైగా ఉన్న రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు, సుమారు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తయారీ రంగంలో వీటి వాటా 36 శాతంగాను, ఎగుమతుల్లో దాదాపు 45%గా ఉంది. మరిన్ని విశేషాలు.. → 5 లక్షల మంది మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఎంట్రప్రెన్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా మంత్రి కొత్త ప్రతిపాదన ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించేందుకు తోడ్పడుతుంది. → లఘు, చిన్న సంస్థలకు రుణ హామీ కవరేజీని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచారు. దీనితో వచ్చే అయిదేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు లభిస్తాయి. → స్టార్టప్లకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచారు. → ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ. 5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు అందించనున్నారు. తొలి ఏడాదిలో 10 లక్షల కార్డులు జారీ చేస్తారు. → మేడిన్ ఇండియా ఆట»ొమ్మలకు గ్లోబల్ హబ్గా భారత్ను తీర్చిదిద్దే దిశగా ఇంటర్నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటు. -
నీటి నిల్వ 41.15 మీటర్లే
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లే అని తాజా బడ్జెట్ సాక్షిగా మరోమారు స్పష్టమైంది. తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని 194.6 టీఎంసీల నుంచి 119.4 టీఎంసీలకు తగ్గించారనేది బట్టబయలైంది. పోలవరం ప్రాజెక్టుకు నిర్దేశించిన గడువు 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి వీలుగా కేంద్రం 2025–26 బడ్జెట్లో రూ.5,936 కోట్లు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణకు రూ.55 కోట్లు కేటాయించింది. గతేడాది జూలై 23న ప్రవేశపెట్టిన 2024–25 పూర్తి బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించలేదు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికి గత ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 119.4 టీఎంసీలకు తగ్గించి.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157.53 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది ఆగస్టు 28న కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేసినా.. ఆ మంత్రివర్గ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీన్నిబట్టి రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసేందుకు అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర కేబినెట్.. నిర్మాణంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువును మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు 2024–25 సవరించిన బడ్జెట్లో రూ.5,512.50 కోట్లను కేంద్ర జల్ శక్తి శాఖ కేటాయించింది. ఇందులో రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు వెరసి రూ.2,807.69 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఈ నిధుల్లో 75 శాతం వ్యయం చేసి.. యూసీల (వినియోగ ధ్రువీకరణ పత్రాలు)ను పీపీఏ ద్వారా పంపితే మిగతా నిధులు విడుదల చేస్తామని చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 58 రోజులు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యూసీలు పంపితే సవరించిన బడ్జెట్లో కేటాయించిన వాటిలో మిగతా నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది సవరించిన బడ్జెట్లో కేటాయించిన దాని కంటే ప్రస్తుత బడ్జెట్లో రూ.423.50 కోట్లను కేంద్రం అధికంగా కేటాయించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటే గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.బాబు నిర్వాకం వల్లే నీటి నిల్వ తగ్గింపు» విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. కమీషన్ల కోసం అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడితో నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. » ఇందుకోసం 2013–14 ధరల ప్రకారం.. 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే నాబార్డు నుంచి రుణం తీసుకుని రీయింబర్స్ చేస్తామన్న కేంద్రం షరతుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులను చేపట్టాల్సిన చంద్రబాబు.. దానికి భిన్నంగా కమీషన్లు వచ్చే పనులనే చేపట్టి పోలవరంలో విధ్వంసం సృష్టించారు. దీంతో కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అప్పట్లో ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే.» వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు చేసిన తప్పులను వైఎస్ జగన్ సరిదిద్దుతూ పనులను వేగవంతం చేశారు. 2017–18 ధరల ప్రకారం రూ.55,656 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు రీయింబర్స్ కాకుండా అడ్వాన్సుగా నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించారు. » అయితే, 2024 ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసి, మిగతా పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు అంగీకరించడం ద్వారా పోలవరాన్ని మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. తద్వారా వరద ఉన్నప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుంది. మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టా స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గోదావరి జలాల సరఫరా కష్టమే. -
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే ఎందుకు పరిమితమైంది?: బుగ్గన
కర్నూలు (టౌన్): పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేకూరడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం కాదా అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన చేతగానితనం, పొరపాట్ల కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎంతో నష్టం జరిగిందని.. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు పెనుముప్పు ఏర్పడుతోందన్నది నిజం కాదా అని నిలదీశారు. 2025–26 కేంద్ర బడ్జెట్ను శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుగ్గన కర్నూలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిoచాల్సి ఉంది. ఆ విధంగా నిరి్మస్తేనే పోలవరం ద్వారా 200 టీఎంసీల నీరు లభిస్తుంది. దీనివల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి, విశాఖ నగరానికి, 600 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలు చేకూరాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. అయితే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారు. దీనిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి తెలీకుండానే కేంద్రం పోలవరం ఎత్తును 41.15 అడుగులకు ఖరారు చేస్తుందా? నిజానికి.. 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే దానిని సరిదిద్దుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిన విషయం నిజం కాదా? ఇక రూ.12,500 కోట్లు సాధించామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం సాధించింది కాదా!? ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వచేస్తామని చెప్పాం కదా.. తర్వాత రెండేళ్లలో నీటినిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టి ప్రాజెక్టు ఎత్తున 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. ఇది ప్రాజెక్టు మాన్యువల్లోనూ ఉందా లేదా!? కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండానే పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేస్తామని బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. బడ్జెట్ కాపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. ‘నిర్మాణం’ అన్న పదానికి బదులు ప్రాజెక్టు పూర్తి (కంప్లీషన్)కి అని ఎందుకు పేర్కొన్నారు? దీని వెనకున్న మతలబు ఏంటి? ఇకపోతే.. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికీ ఎందుకు నిధులు కోరలేదు? 16 మంది టీడీపీ ఎంపీలున్నా బాబు ఎందుకు విఫలమయ్యారు? ఇక ఎన్డీఏ కూటమిలో 16 మంది టీడీపీ ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో.. నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు? ఈ విషయంలో ఆయన ఏమాత్రం చొరవ చూపలేదన్నది నిజం కాదా? వాస్తవానికి.. టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది కదా! అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి చంద్రబాబు ఎందుకు నిధులు సాధించలేకపోయారు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో చంద్రబాబు అసమర్థుడిగా నిలిచారా లేదా? ఇక గతంలో వైఎస్సార్సీపీకి 23 మంది ఎంపీలున్నారని, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పదేపదే విమర్శించారు కదా! నిజానికి.. అప్పుడు కేంద్రానికి వైఎస్సార్సీపీ మద్దతు అవసరంలేదు. కానీ, ప్రస్తుతం టీడీపీ మద్దతుపై కేంద్రం ఆధారపడి ఉంది. దీనిని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్దఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో చంద్రబాబు ఉన్నా ఇప్పుడాయన ఎందుకు విఫలమయ్యారు? అదే కేవలం 12 మంది ఎంపీలతోనే బిహార్ రాష్ట్రం ఎక్కువ నిధులు సాధించి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఎలా దక్కించుకుంది? ఇటీవల నీతి ఆయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తలసరి ఆదాయంపై ఆయన విశ్లేషణను చూసి ఒక ఎన్ఆర్ఐ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తిచూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23లో రూ.2.20 లక్షలకు చేరింది. చంద్రబాబు హయాం కంటే జగన్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది నిజమా కాదా? సీఎంగా ఉన్న వ్యక్తే తప్పుడు లెక్కలు చెబితే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారా? వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూఇక వైఎస్ జగన్ హయాంలో అమలుచేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరిస్తోంది. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ రాబోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటుచేసి బ్రాడ్బాండ్ సర్విస్ అందించాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశాం. టీడీపీ, ఎల్లో మీడియా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాబోయే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది కదా.. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు కదా.. ఆనాడు మెడికల్ సీట్ల ఆవశ్యకతను మాజీ సీఎం జగన్ గుర్తించి రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి గత ఏడాది ఐదింటిని ప్రారంభించారు. దీనివల్ల 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయా లేదా? అన్ని కళాశాలలు పూర్తయితే 2,450 సీట్లు దక్కేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ సీట్ల సాధనలో ఎందుకు చొరవ చూపట్లేదు? రాష్ట్ర విద్యార్థులకు ఎందుకు ఇంతలా నష్టం చేకూరుస్తున్నారు?. -
నిధుల్లో మేజర్
న్యూఢిల్లీ :గణతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మన దేశాన్ని ఆధునిక రణతంత్రం దిశగా నడిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే... సుమారు 9.53 శాతం అదనంగా ఈసారి రూ.6.81 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45 శాతం, మన దేశ జీడీపీలో ఇది 1.91 శాతం కావడం గమనార్హం.రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మూలధన వ్యయం కింద రూ.1,92,387 కోట్లను చూపారు. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.1,48,722 కోట్లను.. దేశీయంగా ఆయుధాలు, రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం రూ.31,277 కోట్లను.. డిఫెన్స్ సర్వీసెస్ కోసం రూ.12,387 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. మూలధన వ్యయం రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే ఈసారి రూ.21 వేల కోట్లు అదనంగా ఇవ్వనున్నారు.ఆధునీకరణ కోసం.. మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో రూ.48,614 కోట్లను యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం కేటాయించారు. నౌకా దళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం రూ.24,390 కోట్లు, నావికాదళ డాక్యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.4,500 కోట్లు ఇచ్చారు. ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, అభివృద్ధి కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ సరిహద్దుల రక్షణతోపాటు యుద్ధాలు, దాడులకు సంబంధించి వ్యూహాత్మక సన్నద్ధత దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జీతాలు, పెన్షన్లకు అధిక వ్యయం..రక్షణ రంగానికి చేసిన కేటాయింపులలో ఈసారి కూడా పెద్ద మొత్తంలో రక్షణ బలగాల వేతనాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ వ్యయమే అధికంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపుల్లో రూ.4,88,822 కోట్లు అంటే 71శాతానికిపైగా వీటికే ఖర్చుకానున్నాయి. ఇందులో రూ.1,60,795 కోట్లు పెన్షన్ల కోసమే వ్యయం కానున్నాయి.సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.7,146.5 కోట్లుదేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.7,146.5 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు సులువుగా సాగేందుకు వీలుగా రోడ్లు, సొరంగాలు, వంతెనల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తారు.దేశీయంగానే రక్షణ కొనుగోళ్లకు పెద్దపీట రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయంగానే ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచే రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తారు. ఈ మేరకు రూ.1,11,544 కోట్లను దేశీయంగా ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు. ఈ వ్యయంలో రూ.27,886 కోట్ల (25 శాతం)ను మన దేశంలోని ప్రవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్ల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.డీఆర్డీవోకు రూ.26,817 కోట్లు..కీలకమైన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)’కు ఈ బడ్జెట్లో రూ.26,817 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులు రూ.23,856 కోట్లతోపోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ⇒ మొత్తం బడ్జెట్లో 13.45%⇒ మన దేశ జీడీపీలో 1.91%⇒ ఆయుధాలకొనుగోళ్లు, అభివృద్ధికి 1,92,387 కోట్లు⇒ వేతనాలు, రోజువారీ వ్యయానికి రూ.4,88,822 కోట్లు (ఇందులో పెన్షన్లకు 1,60,795 కోట్లు) -
బీమాకు 100% దన్ను
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ తాజా బడ్జెట్లో బీమా రంగానికి పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు)ను అనుమతించేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం బీమాలో 74 శాతంవరకూ ఎఫ్డీఐలకు అనుమతి ఉంది. ఆధునికతరం ఫైనాన్షియల్ రంగ సంస్కరణలలో భాగంగా ఇందుకు తెరతీశారు. అయితే మొత్తం ప్రీమియంను దేశీయంగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు మాత్రమే పెంచిన పరిమితి వర్తించనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. వెరసి విదేశీ పెట్టుబడుల పరిమితులను సమీక్షించడంతోపాటు సరళతరం చేసినట్లు వెల్లడించారు. ఎఫ్డీఐ పరిమితి పెంపునకు వీలుగా ప్రభుత్వం బీమా చట్టం 1938, జీవిత బీమా చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత చట్టం 1999లకు సవరణలు చేయనుంది. మరిన్ని సంస్థలు ప్రవేశించడం ద్వారా బీమా విస్తృతి పెరగడంతోపాటు భారీ ఉద్యోగ అవకాశాలకు తెరలేవనుంది. కొన్ని నిబంధనలు, విధానాలను సరళతరం చేసే ముసాయిదా బిల్లు త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 25 జీవిత బీమా, 34 సాధారణ బీమా కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఇంతక్రితం 2021లో బీమా రంగంలో ఎఫ్డీఐల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం హెచ్చించింది. అంతకుముందు 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు అనుమతించింది. -
కీలక ఖనిజాలపై సుంకాల రద్దు
న్యూఢిల్లీ: కీలకమైన 12 ఖనిజాలు, లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, కొబాల్ట్ ఉత్పత్తులు, జింకు మొదలైన వాటితో పాటు క్యాన్సర్, ఇతరత్రా అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ఔషధాలపై దిగుమతి సుంకాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. కీలక ఖనిజాలపై సుంకాల తగ్గింపుతో వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్కి ఊతం లభిస్తుందని, వాటిపై ఆధారపడిన రంగాలకు సదరు ఖనిజాల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సెస్సు వర్తించే 82 ఉత్పత్తుల కేటగిరీలపై సామాజిక సంక్షేమ సర్చార్జిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటికి మించి సెస్సు లేదా సర్చార్జీని విధించకుండా ప్రతిపాదన చేశారు. నౌకా నిర్మాణ సంబంధిత ప్రయోజనాలు అందడానికి సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి ముడి వస్తువులు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును మరో పది సంవత్సరాలు పొడిగించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న పేషంట్లకు ఊరటనిచ్చేలా బీసీడీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉండే ఔషధాల జాబితాలోకి 36 ఔషధాలను చేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై బీసీడీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచగా, ఓపెన్ సెల్ మొదలైన వాటిపై అయిదు శాతానికి తగ్గించారు. -
తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు
కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. జాతీయ పార్టీలు ఎప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే, 16 మంది ఎంపీలు తెలంగాణకు తెచ్చింది అక్షరాలా గుండుసున్నా. సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తున్న బడేభాయ్– చోటేభాయ్ అనుబంధంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్కు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజల గమనిస్తున్నారు. పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసిం జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైంది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసింది.దేశఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. సీఎం రేవంత్ 30 మార్లు ఢిల్లీకి వెళ్లింది నిధుల కోసం కాదని, ఢిల్లీకి మూటలు మోసేందుకు వెళ్లారని బడ్జెట్ ప్రతిపాదనలతో తేటతెల్లమైంది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు నయాపైసా తీసుకురాలేకపోయారు. – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ఎన్పీఎస్ వాత్సల్యకూ పన్ను ఊరట
న్యూఢిల్లీ: చిన్నారుల రిటైర్మెంట్కు గణనీయమైన నిధిని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పీఎం వాత్సల్య ఎన్పీఎస్ పథకానికి తాజా బడ్జెట్లో రూ.50,000 పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కల్పించారు. తొలిసారిగా 2024–25 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభించి ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్నారులు 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్ ఖాతా కింద మార్చుకుని, అప్పుడు వారు స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. దీని కింద ఇప్పటికే 89,475 ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో రూ.62 కోట్ల పెట్టుబడులు సైతం సమకూరాయి. ఈ పథకానికి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశ్యంతో తాజాగా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి కల్పించారు. సాధారణ ఎన్పీఎస్ ఖాతాకు ఉన్నట్టుగానే ఎన్పీఎస్ వాత్సల్యకు ఒకే విధమైన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. కాకపోతే చట్టం పరిధిలో ప్రస్తుతమున్న గరిష్ట ప్రయోజనాల పరిధిలోనే ఇది ఉంటుందన్నారు. సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద సాధారణ ఎన్పీఎస్కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల జమలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రస్తుతం పాత పన్ను విధానం కింద అమల్లో ఉంది. -
బాహుబలికి కళ్లెం..!
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్టాక్ మార్కెట్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అన్న చందంగా స్పందించింది. శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోని... చివరికి ఫ్లాటుగా ముగిశాయి. వినియోగంపైనే దృష్టి సారిస్తూ.., మూలధన వ్యయాల కేటాయింపు అశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. సెన్సెక్స్ అయిదు పాయింట్ల స్వల్ప లాభంతో 77,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,482 వద్ద నిలిచింది. మార్కెట్లో మరిన్ని సంగతులు → కొత్తగా ఆరు వ్యవసాయ పథకాల ప్రకటనతో పాటు కిసాన్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు అగ్రికల్చర్ షేర్లకు భారీ డిమాండ్ లభించింది. కావేరీ సీడ్స్ , పారదీప్ పాస్ఫేట్, మంగళం సీడ్స్, నాథ్ బయో–జీన్స్, బేయర్ క్రాప్సైన్సెస్, పీఐ ఇండస్ట్రీస్ షేర్లు 7% నుంచి అరశాతం పెరిగాయి. మరోవైపు కెమికల్స్ రంగానికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహక చర్యలు లేకపోవడంతో చంబల్ ఫెర్టిలైజర్స్, ధమాకా అగ్రిటెక్, టాటా కెమికల్స్, కోరమాండల్ షేర్లు 3% నుంచి అరశాతం నష్టపోయాయి. → ఒక వ్యక్తి గరిష్టంగా రెండు ఇళ్లనూ సొంతానికి వినియోగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ బడ్జెట్లో ప్రతిపాదనతో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం ఒక ఇంటికే ఈ ప్రయోజనం అమల్లో ఉంది. ఫినిక్స్ మిల్స్, మాక్రోటెక్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాపరీ్టస్, శోభ షేర్లు 7% నుంచి 4 శాతం లాభపడ్డాయి. సిగ్నేచర్ గ్లోబల్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ రియలిటి, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 3 నుంచి ఒకశాతం పెరిగాయి. → లెదర్ రంగంలో ఉత్పత్తి, నాణ్యత, పోటీతత్వాన్ని పెంచేందుకు త్వరలో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఫుట్వేర్ షేర్లు పరుగులు తీశాయి. మీర్జా ఇంటర్నేషనల్ 20% ఎగసి అప్పర్ సర్క్యూట్ తాకింది. క్యాంపస్ ఆక్టివేర్ 7%, బాటా ఇండియా 6%, మెట్రో బ్రాండ్స్ 4%, లెహర్ ఫుట్వేర్స్ 3%, రిలాక్సో పుట్వేర్స్ ఒకశాతం పెరిగాయి. ట్రేడింగ్ సాగిందిలా...స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 77,501 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 23,529 వద్ద మొదలయ్యాయి. బడ్జెట్పై భారీ ఆశలతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు లాభపడి 77,899 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి వద్ద గరిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 893 పాయింట్లు కోల్పోయి 77,006 వద్దకు చేరింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం 314 పాయింట్లు పతనమై 23,318 వద్ద కనిష్టాలు తాకాయి. ప్రసంగం పూర్తయిన తర్వాత తిరిగి కొనుగోళ్లు నెలకొనడంతో నష్టాలు భర్తీ చేసుకున్న సూచీలు మిశ్రమంగా ముగిశాయి.వినిమయ షేర్లు పరుగులు ప్రజల వినియోగ శక్తి పెంపు లక్ష్యంలో భాగంగా కేంద్రం వేతన జీవుల వ్యక్తిగత ఆదాయపన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది. దీంతో వినిమయ సంబంధిత రంగాలైన రియలిటి, టూరిజం, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్, మీడియా, రవాణా–లాజిస్టిక్స్, ఆటో, ఈవీ–కొత్త తరం ఆటోమోటివ్ షేర్లు పరుగులు పెట్టాయి. → వినిమయ సంబంధిత రంగాల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో అత్యధికంగా బ్లూ స్టార్ 13% పెరిగింది. క్రాంప్టన్ గ్రీవ్స్ 8%, హావెల్స్ 6%, వోల్టాస్ 5%, లాభపడ్డాయి. ఏబీ ఫ్యాషన్, వర్ల్పూల్ 3% చొప్పున, టైటాన్ 2% ఎగిశాయి. → ఎఫ్ఎంసీజీ షేర్లలో ఐటీసీ, టాటా కన్జూమర్, హెచ్యూఎల్, డాబర్, మారికో, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా షేర్లు 5% వరకు రాణించాయి. → ఆటో రంగ షేర్లలో మారుతీ సుజుకీ 5%, టీవీఎస్ మోటార్స్ 4%, ఐషర్ మోటార్స్ 3.50%, బజాజ్ ఆటో, మహీంద్రా షేర్లు 3% చొప్పున పెరిగాయి. మౌలిక రంగ షేర్లు డీలా ప్రతిసారి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పరిమితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.21 లక్షల కోట్ల ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. మూలధన వ్యయ కేటాంపులు అంచనాల కంటే తక్కువగా ఉండటంతో రైల్వేలు, రక్షణ, మౌలిక, ఇంధన ఆయిల్అండ్గ్యాస్, మెటల్, హౌసింగ్, ఫార్మా, బ్యాంక్ షేర్లు డీలాపడ్డాయి. . → రైల్వే రంగ షేర్లైన టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్స్, జుపిటర్ వేగన్స్ , టిటాఘర్ రైల్ సిస్టమ్స్ షేర్లు 6–10% క్షీణించాయి. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్ వికాస్ నిగమ్ షేర్లు 7–10% పతనమయ్యాయి. ఐఆర్సీటీసీ, రీట్స్ షేర్లు 3% నష్టపోయాయి. → రోడ్లు, కస్ట్రక్షన్ షేర్లు ఎన్సీసీ 8%, ఎన్బీసీసీ, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, జీఆర్ ఇ్రన్ఫా, ఐఆర్బీ ఇన్ఫ్రా షేర్లు 2–5% పడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఏబీబీ, సిమెన్స్, భెల్, ఎల్అండ్టీ, అజాద్ ఇంజనీరింగ్స్ షేర్లు 3–6% క్షీణించాయి.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఊతం పన్ను ప్రతిపాదనలు క్యాపిటల్ మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తేందుకు ఊతం ఇస్తాయి. ఉద్యోగులు రూ.12.75 లక్షల వరకు వేతనంపై రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వినిమయం పెరిగేందుకు సహాయపడుతుంది. వినియమం పెరిగితే షేర్లలో పెట్టుబడులు సైతం పెరుగుతాయి. మూలధన వ్యయంలో 10 శాతం వృద్ధితో అధిక పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధికి ఊతమివ్వడమే బడ్జెట్ లక్ష్యం.బ్యాటరీల తయారీకి దన్ను ఈవీ బ్యాటరీల తయారీకి సంబంధించి మరో 35 యంత్రపరికరాలు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీ విషయంలో అదనంగా 28 యంత్రపరికరాలను సుంకాల మినహాయింపు జాబితాలోకి చేర్చినట్లు మంత్రి తెలిపారు. దీనితో దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీల (మొబైల్ ఫోన్లకు, ఎలక్ట్రిక్ వాహనాలకు) తయారీకి ఊతం లభించనుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా తెలిపారు. స్థానికంగా తయారీ వ్యయాలు తగ్గడంతో పాటు కార్యకలాపాలు విస్తరించేందుకు కంపెనీలకు ప్రోత్సాహంగా కూడా ఉంటుందని రివ్యాంప్ మోటో సహవ్యవస్థాపకుడు ప్రీతేష్ మహాజన్ చెప్పారు. బలమైన అడుగులు.. క్యాన్సర్ డే సెంటర్స్, వైద్య విద్య ద్వారా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో పెరిగేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులతోపాటు మెడికల్ టూరిజం, హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహం ప్రకటించారు. సాంకేతికత, మౌలిక రంగంలో పెట్టుబడి, పన్ను స్లాబ్లు, సుంకాల సరళీకరణ వంటి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ నిర్మాణం వైపు బలమైన అడుగులు వేస్తుంది. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్.వైద్య సంరక్షణ కేంద్రంగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రపంచ నాయకత్వం వహించేలా ఎదగడానికి ఈ బడ్జెట్ ప్లాట్ఫామ్గా నిలవనుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాల ద్వారా మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించాలనే ప్రకటన ప్రపంచ రోగులను ఆకర్షించే స్థాయిలో సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. హీల్ ఇన్ ఇండియా మిషన్ కింద అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ కేంద్రంగా భారత్ను ఉంచు తుంది. – ప్రతాప్ సి రెడ్డి, ఫౌండర్, అపోలో హాస్పిటల్స్.పెట్టుబడులకు ఊతం.. వినియోగ ఆధారిత వృద్ధిని మధ్యతరగతి ప్రజలు నడిపిస్తారని మంత్రి విశ్వాసం ఉంచారు. వినియోగ డిమాండ్ పుంజుకోవడం మధ్యస్థ కాలంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. పర్యాటకం, టెక్స్టైల్, హస్తకళలు, పాదరక్షలు, బొమ్మ ల వంటి ఉపాధి ఆధారిత రంగాలు తదుపరి స్థాయికి చేరేందుకు తక్షణ ప్రేరణనిచ్చారు. – సంజయ్ నాయర్, ప్రెసిడెంట్, అసోచామ్.వృద్ధికి ఇంధనం.. తయారీ, గ్రీన్ మొబిలిటీ, గ్రామీణ సాధికారతకు వెన్నుదన్నుగా భారత వృద్ధి వేదికలకు ఇంధనం ఇస్తుంది. ఆవిష్కరణ, ఉద్యోగ సృష్టి, ప్రపంచ నాయకత్వానికి బాటలు పరుస్తుంది. గ్రీన్ ఎనర్జీలో గణనీయ పెట్టుబడులు, ఇంధన నిల్వ పరిష్కారాలకు మద్దతు ఇచ్చే స్పష్ట విధానాలతో ఆటోమొబైల్ రంగం పురోగతికి సిద్ధంగా ఉంది. క్లీన్ మొబిలిటీ భవిష్యత్తు పరివర్తనను వేగవంతం చేస్తాయి. స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు దేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయి. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్. కస్టమర్లకు ఉపశమనం లేదు.. విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు ప్రతిపాదన, అలాగే తయారీ రంగం వాడే యంత్ర పరికరాలపై (క్యాపిటల్ గూడ్స్) పన్ను మినహాయింపు దేశీయ మొబైల్ తయారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం లేదు. బడ్జెట్లో ప్రకటించిన మొత్తం చర్యలు భారతదేశంలో పోటీతత్వాన్ని పెంచుతాయి. పంకజ్ మొహింద్రూ, చైర్మన్, ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్.ఇంధన శక్తిలో అగ్రగామిగా.. ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి ప్రైవేట్ రంగం నుండి ఆవిష్కరణలను పెంచుతూ.. స్థిర ఇంధన శక్తిలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా ఉంచాలనే ప్రభుత్వ ఆశయాన్ని నొక్కి చెబుతోంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని బలోపేతం చేయడం, స్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన స్మార్ట్ మీటరింగ్ వంటి క్లిష్ట సంస్కరణల అమ లుకు రాష్ట్రాలను ప్రోత్సహించడం సానుకూలాంశం. – నారా విశ్వేశ్వర రెడ్డి, సీఎండీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. -
పర్లేదు సార్
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు, వైద్య విద్య, పాఠశాల విద్య, స్కిల్లింగ్కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024–25 బడ్జెట్లో విద్యా రంగం సవరించిన అంచనాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దిశగా కేటాయింపులు చేశారని, ఉద్యోగాల ఆధారిత అభివృద్ధి బ్రాండ్ ఇండియా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడ్జెట్ను స్వాగతించారు. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్..ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ను ప్రకటించారు. దీని ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది. ఐఐటీల విస్తరణ.. 2014 తర్వాత ఏర్పాటు చేసి న ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులు విస్తరించి మరో 6,500 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు కల్పించనున్నారు. ఐఐటీ పాట్నాను పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.30 లక్షలకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరులో టెక్నాలజీ రీసెర్చ్ అభ్యర్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ను వచ్చే ఐదేళ్లలో పది వేల మందికి అందిస్తారు. నైపుణ్యాల పెంపు.. విద్యార్థులకు ఆయా వృత్తులు, విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలు అందించేలా గ్లోబల్ నైపుణ్యాలు, పార్ట్నర్íÙప్స్ కోసం కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను నెలకొల్పనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోని సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తారు. ఐఐఎంలకు పెరిగిన కేటాయింపులు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు గతేడాది రూ.227 కోట్లు కేటాయించగా ఈదఫా రూ.251 కోట్లను కేటాయించారు. ఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు కేటాయింపుల్లో రూ.137 కోట్ల మేర కోత విధించడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఇతర ఉన్నత విద్యా సంస్థలకు కేటాయింపుల్లో 50 శాతం మేర కోత పడింది. ఏఐ ఆవశ్యకతకు గుర్తింపు విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను గుర్తించినట్లు తాజా బడ్జెట్ స్పష్టం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఏర్పాటుతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – వి. రాజన్న, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ – సాఫ్ట్వేర్ సర్విసెస్)రీసెర్చ్ ఔత్సాహికులు పెరుగుతారు ఐఐటీలు, ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్స్ను పెంచడం వల్ల పీహెచ్డీ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. – ప్రొఫెసర్. బి.ఎస్.మూర్తిఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్స్పష్టత ఇవ్వాల్సింది సర్వ శిక్ష అభియాన్, రీసెర్చ్ ఫెలోషిప్స్కు కేటాయింపులు పెంచడం హర్షణీయం. ఐఐటీల్లో సీట్ల పెంపు, మెడికల్ సీట్ల పెంపు విషయంలో స్పష్టత లేదు. బీటెక్ స్థాయిలో ఎన్ని సీట్లు, వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్ల పెంపులో ప్రైవేట్, ప్రభుత్వ సీట్ల సంఖ్యను వేర్వేరుగా స్పష్టం చేస్తే బాగుండేది. ఉన్నత విద్యకు కేటాయింపులు తగ్గాయి. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం సరికాదు. – మహేశ్వర్ పేరి, ఫౌండర్, కెరీర్స్360జాతి వృద్ధికి ఊతం ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుతో ప్రతి విద్యార్థికి ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సాహం లభిస్తుంది. – నిపుణ్ గోయెంక, ఎండీ, జీడీ గోయెంక గ్రూప్ఏటా కుదింపులు.. ఇది మరోసారి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచే చర్యే. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు రూ.1,28,650 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 2.53 శాతం. గత పదేళ్లలో 3.16 నుంచి 2.53 శాతానికి నిధులు తగ్గాయి. – ముత్యాల రవీందర్టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి -
5 ఏళ్లలో 75 వేల సీట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో రూ.99,858.56 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో రూ.89,974.12 కోట్లు కేటాయించగా, ఈసారి 11 శాతం మేర పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే దేశంలో వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా పదివేల సీట్లను పెంచనున్నట్లు తెలిపారు. ఈ పెంచిన సీట్ల ద్వారా వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారి కల సాకారమైనట్లేనన్నారు. కాలేజీల్లో మెడికల్ సీట్ల కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు మెడికల్ సీటు రాక.. మరో ఏడాదిపాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏడాదికి 10 వేల సీట్ల చొప్పున ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచుతున్నట్లు శనివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025–26 వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో 1.1 లక్షల అండర్ గ్రాడ్యుయేట్, పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు.జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లుఇటీవల కాలంలో కేన్సర్ బారిన పడుతూ ఎంతోమంది రోగులు ఆసుపత్రుల్లో బారులుతీరుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం.. ఆ రోగులకు ఉపశమనం కలిగించేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 2025–26లో సుమారు 200 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.కేటాయింపులు ఇలా...» వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.99,858.56 కోట్లను కేటాయించగా, ఇందులో వైద్య, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.95,957 కోట్లు, ఆరోగ్య పరిశోధనల విభాగానికి రూ.3,900.69 కోట్లు కేటాయించారు.» ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.3,992.90 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్లో రూ.3,497 కోట్లను కేటాయించారు.. ఇప్పుడు 14.15 శాతం పెంపు.» జాతీయ ఆరోగ్య మిషన్కు రూ.37,226.92 కోట్ల కేటాయింపు. గత బడ్జెట్లో రూ.36,000 కోట్లు.» ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు (ఏబీపీఎం–జేఏవై) రూ.9,406 కోట్లు.» స్వయంప్రతిపత్తి గల సంస్థలకు రూ.20,046.07 కోట్లు కేటాయించారు. 2024–25లో రూ.18,978.72 కోట్లు కేటాయించారు.36 మందులకు సుంకం మినహాయింపు» కేన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం అందించేందుకు వారు వాడే మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని పూర్తిగా మినహాయించను న్నారు. వారు చికిత్సకు వినియోగించే 36 రకాల జీవ ఔషధాలపై ఈ మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే, ఫార్మాకంపెనీలు పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కింద రోగులకు అందించే మరో 37 రకాల మందులతోపాటు 13 కొత్త ఔషధాలకు బీసీడీని మినహాయించనున్నారు. దీంతో ఆయా మందులను రోగులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. » ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో దేశంలో మెడికల్ టూరిజం, ‘హీల్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడంతోపాటు, సులభతర వీసా విధానాన్ని తెస్తామని చెప్పారు. » ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ప్రభుత్వ మాధ్యమిక స్కూళ్లకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.మెరుగైన ఆరోగ్య జీవితం కోసం...ఈ బడ్జెట్ మెరుగైన ఆరోగ్య జీవితాన్ని అందించేందుకు దోహదపడుతుంది. దేశంలో 200 డేకేర్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటు, కేన్సర్, దీర్ఘకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ చర్యలు సంక్రమణేతర వ్యాధులపై పోరాటానికి, రోగుల జేబులపై భారం తగ్గించేందుకు దోహదపడతాయి. కొత్త విద్యావకాశాలతోపాటు ఉపాధి కల్పనకు కూడా ఈ బడ్జెట్ ఊతమిస్తుంది.– ప్రతాప్ సి.రెడ్డిఅపోలో హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ -
లక్ష్యాల సాధన సాధ్యమేనా?
‘మిడిల్ క్లాస్ ఫీల్గుడ్ బడ్జెట్’గా 2025–26 బడ్జెట్కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. అయితే మధ్యతరగతిని సంతృప్తి పరిచే దిశలో కొంత ప్రయత్నం జరిగినా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారం దిశలో బడ్జెట్లో ఎలాంటి చర్యలూ లేవు. ప్రత్యేకంగా చూస్తే దేశంలో ఆహార ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగానూ ప్రత్యేక చర్యలేవీ తీసుకోలేదు. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల ఆదా యాలు పెంచేందుకు అవసరమైన నిర్దిష్టమైన కార్యక్రమాలు లేదా చర్యలు చేపట్టలేదు. అంటే సమాజంలో అధిక శాతమున్న ప్రజల చేతుల్లో మరింత డబ్బు పెట్టే చర్యలేవీ తీసుకోలేదన్నమాట. అభివృద్ధి సాధనలో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ పెట్టుబడులకు పరిమితం కావడం, ఆశించిన మేర ప్రైవేట్ పెట్టుబడులు పెరగక పోవడం, కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్తోనే వృద్ధిని ముందుకు తీసుకెళ్ల లేకపోవడంతో ఉద్దీపనలతో ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కీలకమైన రంగాల అభి వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా మధ్యతరగతి చేతుల్లో డబ్బుపెట్టి కొనుగోలుశక్తి పెంచడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో వివిధ ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం విషయానికొస్తే... దేశంలో మొత్తం ఏడు వందలకు పైగా జిల్లాలు ఉంటే... కేవలం వంద జిల్లాల్లో ‘ధన్, ధాన్య, కిసాన్ యోజన’ కింద (11 కోట్ల మంది రైతులకు గాను 1.7 కోట్ల మంది) రైతాంగానికి ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు. అది కూడా మూడు పప్పుదినుసులకు సంబంధించి రాబోయే ఆరేళ్లలో దీనిని చేస్తామని చెప్పడం ద్వారా ఇప్పటికిప్పుడు ఈ రైతులకు ఒనగూడే ప్రయోజనం ఏమీఉండదు. దేశ వ్యాప్తంగా విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వ విద్యాలయాల్లో విద్యాభివృద్ధికి, దాని నాణ్యతను పెంచే దిశలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఎక్కడా పేర్కొన లేదు. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగా బడ్జెట్లో కొన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పట్టణాల్లోని డిమాండ్ అనేది స్తబ్ధుగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉండడంతో అర్బన్ డిమాండ్ పెంచేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు ‘ఉద్దీపన’ కింద రాయితీల కల్పన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి అనేది అసంతృప్తితో ఉందని, ఈ వర్గం కొనుగోలు శక్తి తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా నెలకొనడంతో ఈ అంశానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. వార్షిక బడ్జెట్లో ఇచ్చిన ఆదాయపు పన్ను మినహాయింపులతో దాదాపుగా అన్ని వర్గాలనూ సంతోషపరిచే ప్రయత్నం జరిగింది. ఇది ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నదే. గతంలో రూ. 15 లక్షల వార్షికాదాయం గలవారు గరిష్ఠంగా 30 శాతం పన్ను కట్టేవారు. ఇప్పుడు ఈ 30 శాతం పన్ను ఏడాదికి రూ. 24 లక్షలకు పైగా ఆర్జిస్తున్నవారికి వర్తింప చేశారు. ఈ పన్ను మినహాయింపుల పరంగా చూస్తే రూ. 12 లక్షల దాకా ఆదాయం వచ్చేవారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానానికి లోబడి ఉన్న వారికే వర్తిస్తుంది.ఈ విధంగా రూ. లక్ష కోట్ల వరకు వచ్చే ఆదాయపు పన్ను మొత్తాన్ని మధ్యతరగతి చేతుల్లో పెట్టి కొనుగోలుశక్తి పెంచడంద్వారా డిమాండ్పెంచితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయనేది దీని వెనక ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే వాస్తవంగా చూస్తే... స్వేచ్చగా తమ అభిప్రా యాలను వ్యక్తపరిచే ‘వోకల్ సెక్షన్స్’ను సంతృప్తి పరిచే ప్రయత్నంగానే ఇది నిలుస్తోంది. ఇలా పెద్ద సంఖ్యలోని ప్రజలు ఇంకా కొనుగోలు శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఆదాయపు పన్ను మినహాయింపు రూపంలో ఇచ్చిన ఉద్దీపనలు ఏ మేరకు ఉపయో గపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.ప్రొ‘‘ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్సీయూ స్కూల్ ఆఫ్ సోషల్సైన్సెస్ మాజీ డీన్ -
గ్రామాలే మన బలగం
న్యూఢిల్లీ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా మోదీ 3.0 సర్కారు తాజా బడ్జెట్లో పూర్తి అండదండలు అందించింది. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు ఫ్లాగ్షిప్ పథకాలకు కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు పుష్కలంగా నిధులు కేటాయించారు. అలాగే, ఉపాధికి ఢోకా లేకుండా.. గ్రామీణ రోడ్లు పరుగులు తీసేలా.. బడ్జెట్లో ఫోకస్ చేశారు. ఇక తాగునీటి పథకం.. జల్ జీవన్ మిషన్ను 100% పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు పొడిగించి, నిధుల వరద పారించారు. భారత్నెట్ గొడుగు కింద ఇకపై గ్రామాల్లో ప్రభుత్వ సెకండరీ స్కూళ్లు, పీహెచ్సీలకు సైతం హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం దక్కనుంది. సొంతింటికి ఫుల్ సపోర్ట్ (పీఎంఏవై) 2025–26 కేటాయింపులు: రూ.74,626 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.46,096 కోట్లు (సవరించిన అంచనా)పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి ఫుల్ సపోర్ట్ లభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పీఎంఏవై 2.0 స్కీమ్ కింద చేపట్టనున్నట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే. పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అదనంగా కోటి ఇళ్లు అందించే పీఎంఏవై (అర్బన్)కు ఈ బడ్జెట్లో రూ.19,794 కోట్లు కేటాయించారు. 2025–26లో గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబ్దిదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందుకు మొత్తం రూ.3,500 కోట్లను కేటాయించారు. పీఎంఏవై (గ్రామీణ్)కు రూ.54,832 కోట్లు దక్కాయి. 2029 మార్చికల్లా రూ.3.06 లక్షల నిధులతో 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం లక్ష్యం. 2024–25లో 40 లక్షల ఇళ్ల లక్ష్యానికి గాను డిసెంబర్ నాటికి 18 రాష్ట్రాల్లో 27.78 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. గ్రామీణ రోడ్లు.. టాప్ గేర్2025–26 కేటాయింపులు: రూ.19,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.14,500 కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై)కు ఈసారి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్ నాలుగో దశను గత బడ్జెట్లో సీతారామన్ ప్రకటించగా.. ఇప్పుడు జోరందుకుంటోంది. 25,000 ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు దృష్టిపెట్టుకుని పక్కా రోడ్లతో అనుసంధానించనున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 17,570 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం సర్వే పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 35,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘గ్రీన్’టెక్నాలజీతో 18,000 కిలోమీటర్ల రోడ్లు వేయనున్నారు.‘ఉపాధి’కి ఢోకా లేదు2025–26 కేటాయింపులు: రూ.86,000కోట్లు2024–25 కేటాయింపులు: రూ.86,000కోట్లు (సవరించిన అంచనా)గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి దన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈసారీ నిధుల ‘హామీ’దక్కింది. అయితే, 2024– 25 సవరించిన అంచనాల (రూ.86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో కేటాయించారు. రా ష్ట్రాల్లో లక్ష్యాలు, అవసరాలను బట్టి అవసరమైతే మరి న్ని నిధులను కేటాయించే అవకాశం ఉంది. 2023– 24లో రూ.60,000 కోట్లు కేటాయించగా, వాస్తవ వ్యయం రూ.89,153 కోట్లు కావడం గమనార్హం.జల్జీవన్ మిషన్... మరో మూడేళ్లు పొడిగింపు2025–26 కేటాయింపులు: రూ.67,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ.22,694 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రా>మ్ను అమలు చేస్తున్నారు. 2024 నాటికి ఇది సాకారం కావాల్సి ఉండగా.. 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు దీన్ని 2028 వరకు పొడిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఏకంగా మూడు రెట్లు నిధులు పెంచారు. కాగా, ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2025–26లో 1.36 కోట్ల కనెక్షన్లు అందించాలనేది బడ్జెట్ లక్ష్యం. కాగా, ‘జన్ భాగీధారీ’ద్వారా నీటి సరఫరా మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై దృష్టి పెట్టున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.కనెక్ట్ టుభారత్ నెట్.. 2025–26కేటాయింపులు: రూ.22,000 కోట్లు2024–25 కేటాయింపులు: రూ. 6,500 కోట్లు (సవరించిన అంచనా)దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను (దాదాపు 2.5 లక్షలు) హైస్పీడ్ బ్రాండ్బ్యాండ్ నెట్వర్క్తో కనెక్ట్ చేయాలనేది ఈ స్కీమ్ ఉద్దేశం. ఇప్పటిదాకా 2,14323 పంచాయితీలను కనెక్ట్ చేశారు. 6,92,676 లక్షల కి.మీ. పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. అదనంగా 1,04,574 వైఫై హాట్ స్పాట్స్, 12,21,014 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించనుండగా... 64,000 పంచాయతీల్లో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనున్నారు.స్వచ్ఛ భారత్.. విస్తరణ2025–26 కేటాయింపులు: రూ. 12,192 కోట్లు2024–25 కేటాయింపులు: రూ. 9,351 కోట్లు (సవరించిన అంచనా)దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్ స్టేటస్ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్ఛ భారత్ (అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో 2025–26లో 2 లక్షల వ్యక్తిగత టాయిలెట్లు, 20,000 కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించనున్నారు. 98 శాతం వార్డుల్లో ఇంటింటికీ ఘన వ్యర్థాల సేకరణను అమలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 89,000 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణలోకి తీసుకురానున్నారు. 60,000 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయనున్నారు. అలాగే 800 బ్లాక్లలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. కాగా, స్వచ్ఛభారత్ 2.0 కింద తాగునీరు, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల కోసం 100 నగరాలను గుర్తించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
రైల్వేలకు పాత పద్దే!
న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్లో రైల్వేశాఖ పద్దుల్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. 2025–26 బడ్జెట్లో ఈ శాఖకు మొత్తం రూ.2.52 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు మొత్తం రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తాయని అంచనా వేశారు. మరో 200 వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమోభారత్ రైళ్లు ప్రవేశపె ట్టేందుకు అనుమతి ఇచ్చారు. వచ్చే నాలుగేళ్ల లో మొత్తం రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు బడ్జెట్ ప్రకటన అనంతరం శనివారం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదాయ అంచనా రూ.3 లక్షల కోట్లు2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ అన్ని మార్గాల ద్వారా రూ.3,02,100 కోట్ల ఆదాయం ఆర్జిస్తుందని అంచనా వేశారు. 2024–25 బడ్జెట్లో సవరించిన అంచనా ప్రకారం ఇది రూ.2,79,000 కోట్లుగా ఉంది. గత బడ్జెట్లో ప్రయాణికుల చార్జీల ఆదాయం 2024–25లో రూ.80,000 కోట్లు ఉండగా, 2023–24లో రూ.70,693 కోట్లు వచ్చింది. 2024–25 బడ్జెట్లో సరుకు రవాణా ద్వారా రూ.1,80,000 కోట్ల ఆదాయం వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. 2023–24లో ఇది 1,68,199 కోట్లుగా ఉంది. రైల్వేల్లో భద్రతాపరమైన చర్యల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1,14,062 కోట్లు ఉండగా, 2025–26 బడ్జెట్లో దీనిని రూ.1,16,514 కోట్లుగా అంచనా వేశారు. అయితే, ఇంతగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ రైల్వేలకు వస్తున్న ఆదాయంలో మాత్రం పెద్దగా పెరుగుదల ఉండటం లేదని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్, టెలి కమ్యూనికేషన్స్ మాజీ డీజీ శైలేంద్రకుమార్ గోయెల్ చెప్పారు. మరో 200 వందేభారత్ రైళ్లు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశవ్యాప్తంగా మరో 200 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తక్కువ దూరంగల పట్టణాల మధ్య ప్రయాణించే అమృత్ భారత్ రైళ్లను మరో 100 ప్రారంభిస్తామని చెప్పారు. 17,500 కొత్త కోచ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వివరించారు. -
కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. శనివారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రాష్ట్రం నుంచి కేంద్రానికి చేసిన ప్రతిపాదనలు, బడ్జెట్లో కేంద్రం చేసిన కేటాయింపులపై ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ లేవని, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, సీఎస్ఎస్ పథకాల ద్వారా నిధులు, అన్ని రాష్ట్రాలతోపాటు మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా వచ్చే నిధులు మాత్రమే కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వస్తాయని ఆయన వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరినట్టు సమాచారం. రాష్ట్రానికి ఏ ఒక్క పథకానికి నిధులు ప్రత్యేకంగా లేని అంశంపై పార్లమెంట్ సభ్యులు లోక్సభలో గట్టిగా నిలదీసే అంశాన్ని కూడా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు సమకూరేలా చర్యలు తీసుకోకపోవడంపై సీఎం రేవంత్రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రానికి న్యాయం జరిగేలా లోక్సభలో ఎంపీలు పోరాటం సాగించాలన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారంటున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రానికి లేఖ రాసే అంశాన్ని కూడా పరిశీలించినట్టు తెలిసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు, ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఖర్చుల వివరాలను కూడా సీఎం, మంత్రులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ను వాస్తవానికి అనుగుణంగా తయారు చేయాలని, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తయారు చేయాలని సీఎం ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. -
ధన ధాన్య కృషి రైతే మహర్షి
న్యూఢిల్లీ : వ్యవసాయ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, గ్రామీణ ప్రగతి లక్ష్యంగా పథకాలు, కేటాయింపులు ప్రకటించింది. రైతాంగానికి లబ్ధి చేకూర్చేలా కొత్తగా ఆరు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సబ్సిడీతో కూడిన కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఆర్థికాభివృద్ధికి కీలకమైన రంగాల్లో వ్యవసాయం మొదటిదని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..2025–26 బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి కార్యక్రమాలకు కలిపి రూ.1.45 లక్షల కోట్లు కేటాయించారు. అయితే కొత్త పథకాలకు కేటా యింపులపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలు రూ.1.47 లక్షల కోట్లను తాజా బడ్జెట్ అధిగమించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖకు 2.75 శాతం తక్కువ బడ్జెట్ను ప్రకటించినప్పటికీ, కేంద్రం కీలక పథకాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. అయితే అను బంధ రంగాలకు, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమకు 37 శాతం అధికంగా రూ.7,544 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్కు 56 శాతం అధికంగా రూ.4,364 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) మొత్తంగా రూ.1.57 లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్రం ప్రతిపాదించింది.ఆహార భద్రతపై దృష్టి .. తాజా బడ్జెట్లో ఆహార భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టిన కేంద్రం.. తక్కువ సాగు, ఉత్పాదకతతో వ్యవసాయంలో వెనుకబడిన దేశంలోని 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసే ఈ పథకంతో..ధాన్యం ఉత్పాదకత పెంపు, పంటల్లో వైవిధ్యం, పంటల కోత అనంతర సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి .. పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) లక్ష్యంగా ఆరేళ్ల పప్పు ధాన్యాల కార్యక్రమాన్ని (పల్సెస్ మిషన్) కేంద్రం ప్రకటించింది. కంది, మినప, ఎర్రపప్పు (మసూర్) ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి రూ.1,000 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్లు రైతులతో లాంఛనంగా ఒప్పందాలు కుదుర్చుకుని నాలుగేళ్ల పాటు ఈ పప్పు ధాన్యాలను సేకరిస్తాయి. పండ్లు, కూరగాయలు.. పత్తికి ప్రత్యేక కార్యక్రమాలుకూరగాయలు, పండ్ల ఉత్పాదకతను పెంచే సమగ్ర ఉద్యాన కార్యక్రమానికి, అలాగే మంచి (పొడవైన పింజ) పత్తి రకాలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కాటన్ (పత్తి) మిషన్కు రూ.500 కోట్ల చొప్పున కేటాయించా రు. ఇటీవల తెలంగాణలోని నిజామాబాద్లో పసుపు బోర్డును ప్రకటించిన కేంద్రం.. తాజా బడ్జెట్లో బిహార్కు రూ.100 కోట్లతో మఖానా (తామర గింజ (ఫాక్స్ నట్) బోర్డును మంజూరు చేసింది. అదేవిధంగా మరో రూ.100 కోట్లతో వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే విత్తనాల అభివృద్ధి లక్ష్యంగా ఓ పరిశోధనా వ్యవస్థను ప్రకటించింది. అసోంలోని నామ్రూప్లో 12.7లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో ఓ యూరియా కర్మాగారాన్ని కూడా ప్రతిపాదించారు.గ్రామీణ ప్రగతి కార్యక్రమం..గ్రామీణ నిరుద్యోగితకు పరిష్కారంగా సమగ్ర ‘గ్రామీణ ప్రగతి..స్థితి స్థాపకత’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పా రు. వలసలు అనేవి తప్పనిసరి కాకుండా ఓ ప్రత్యా మ్నాయంగానే ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని లక్ష్యమని ఆర్థికమంత్రి వివరించారు. గ్రామీణ మహిళలు, యువత, యువ రైతులు, సన్న చిన్నకారు రైతులు, భూముల్లేని కుటుంబాలపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్వర్క్ .. రూ.60 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ. చేపలు, ఆక్వాకల్చర్ ఉత్తత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఓ సుస్థిర ఫిషింగ్ ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది. ప్రపంచ సీఫుడ్ మార్కెట్లో భారత్ పోటీ తత్వాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా..ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి)పై కనీస దిగు మతి సుంకాన్ని (బీసీడీ) 30% నుంచి 5 శాతానికి తగ్గించింది. కృషి వికాస్ యోజనకు రూ.8,500 కోట్లురాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి 41.66 శాతం పెంపుతో రూ.8,500 కోట్లు కేటాయించారు. కృషియోన్నతి (రూ.8వేల కోట్లు), నమో డ్రోన్ దీదీ, నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి, మత్స్య సంపద యోజన తదితర పథకాలకు నిధులు గణనీయంగా పెంచారు.కిసాన్ క్రెడిట్ కార్డులతో మరింత రుణం రైతులకు రుణ భద్రతను మరింత పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో భాగంగానే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ కలిసి ప్రారంభించాయి. ఈ కార్డుపై ఇప్పటిదాకా రూ.3 లక్షల రుణ పరిమితి ఉండగా..దీన్ని తాజాగా రూ.5 లక్షలకు పెంచడంతో దేశవ్యాప్తంగా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు లబ్ధి పొందనున్నారు. పెంచిన పరిమితి మేరకు వీరు స్వల్పకాలిక రుణాలు పొందేందుకు అవకాశం ఉంది.పరిశ్రమ వర్గాల హర్షం బడ్జెట్లో వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్ అసోసి యేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) అధ్యక్షుడు సంజీవ్ అస్థానా, ఫెడ రేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐఐ)చైర్మన్ అజయ్ రాణా, అదాని విల్మార్ సీఈఓ అంగ్షు మాలిక్, బేయర్ క్రాప్ సైన్సెస్ ఎండీ సైమన్ వీ బుష్లు హర్షం వ్యక్తం చేశారు.దూరదృష్టి బడ్జెట్..‘ఇది దూరదృష్టితో కూడిన బడ్జెట్. విశ్వాసం అనే పరిమ ళం ఇందులో ఉంది. అభివృద్ధి కోసం, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం తపన ఇందులో ఉంది. స్వయం సమృద్ధి భారత్ దిశగా ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత లభించింది..’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.రైతు సంఘాల అసంతృప్తి.. 5న ధర్నా అన్ని పంటలకు చట్టబద్ధమైన గ్యారంటీతో కూడిన కనీస మద్దతు ధర కల్పించాలనే తమ దీర్ఘకాల డిమాండ్ను కేంద్రం పట్టించుకోక పోవడంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పంట రుణాలు మాఫీ చేయకపోవడం, రైతు, కారి్మక, పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్కు నిరసనగా ఈ నెల 5న ధర్నా నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తదితర సంఘాలు ప్రకటించాయి. -
మహిళా, శిశు అభివృద్ధికి రూ.26,889కోట్లు
న్యూఢిల్లీ : మహిళా, శిశు అభివృద్ధి శాఖకు నిధుల కేటా యింపులు స్వల్పంగా పెరిగాయి. 2025–26 బడ్జెట్లో కేంద్రం రూ.26,889.69 కోట్లు కేటా యించింది. 2024–25లో సవరించిన అంచనా రూ.23,182.98 కోట్లు కాగా, తాజాగా బడ్జెట్లో మరో రూ.3,706.71 కోట్లు పెంచారు. మొత్తం కేటాయింపుల్లో రూ.21,960 కోట్లను ‘సాక్షం అంగన్వాడీ’, పోషణ్ 2.0 కార్య క్రమాలకు ఖర్చు చేయనున్నారు. చిన్నారులు, కౌమార దశలోని బాలికల్లో పోషకాహార లేమిని అరికట్టా లని, శిశు సంరక్షణను బలో పేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయ బోతోంది. సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది బాలలు, కోటి మంది గర్భిణులు, బాలింతలు, 20 లక్షల మంది కౌమార బాలికలు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్మన్)కు అదనంగా రూ.120 కోట్లు కేటాయించారు. ఈ నిధులను 75 గిరి జన జాతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వ్యయం చేస్తారు. గిరిజనాభివృద్ధి కోసం ధార్తి అబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్కు రూ.75 కోట్లు కేటాయించారు. బాలల రక్షణ సేవలకు గాను ‘మిషన్ వాత్సల్య’ కోసం గతేడాది రూ.1,391 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1,500 కోట్లు కేటాయించారు. మహిళా వ్యాపారవేత్తలకు రూ.2 కోట్ల రుణం తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం రూ.2 కోట్ల టర్మ్ లోన్ మంజూరు చేయనుంది. 5 లక్షల మందికి ఈ రుణాలు ఇవ్వనున్నారు. సూక్ష్మ, మధ్య తరహా, భారీ పరిశ్రమల కోసం ‘మాన్యుఫాక్చరింగ్ మిషన్’ నెలకొల్పనున్నట్లు వెల్లడించారు.‘మిషన్ శక్తి’కి రూ.3,150 కోట్లు మహిళా సాధికారతే ధ్యేయంగా ‘మిషన్ శక్తి’ అమలుకు రూ.3,150 కోట్లు కేటాయించారు. బేటీ బచావో.. బేటీ పడావో, వన్స్టాప్ సెంటర్లు, నారీ ఆదాలత్లు, ఉమెన్ హెల్ప్లైన్, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ.629 కోట్లు ఖర్చు చేస్తారు. స్వధార్ గృహాలు, ప్రధాని మాతృ వందన యోజన, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, నేషనల్ క్రెష్ స్కీమ్కు రూ.2,521 కోట్లు వెచ్చిస్తారు. నిర్భయ నిధికి రూ.30 కోట్లు, జాతీయ మహిళా కమిషన్కు రూ.28 కోట్లు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు రూ.25 కోట్లు కేటాయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్, చైల్డ్ డెవలప్మెంట్కు రూ.90 కోట్లు, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్ఏ)కు రూ.14.49 కోట్లు కేటాయించారు. -
ఓం భీమ్ తుస్.. గురజాడ నామస్మరణ.. ఏపీ విస్మరణ
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు, కేటాయింపులు చేయించుకోవడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. శనివారం ప్రవేశపెట్టిన 2025–26 కేంద్ర బడ్జెట్లో తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న పద్యం తప్ప ఏపీకి సంబంధించి ఒక్క ప్రకటనా వినిపించలేదు. గత బడ్జెట్ తరహాలోనే ఈసారి బడ్జెట్లో కూడా బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో నిధుల వర్షం కురిపించారు. గత బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15,000 కోట్ల అప్పులు సాధించడం తప్ప.. ఈసారి బడ్జెట్లోనూ కూటమి పెద్దలు కొత్తగా కేటాయింపులు చేయించుకోలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాల్సిందిగా చంద్రబాబు ఇటీవల డిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి కోరారు. గోదావరి– బనకచర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నదుల అనుసంధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని చెప్పగా, కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు గురించి గానీ, ప్రత్యేక సాయం గురించి గానీ నిర్మలా సీతారామన్ ప్రస్తావనే చేయలేదు. గతంలో పోలవరానికి ఇస్తామని అంగీకరించిన నిధులనే ఈసారి బడ్జెట్లో పేర్కొన్నారు తప్ప కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందింది.ఏ మేలూ లేని బడ్జెట్పై పొగడ్తలా?అమరావతి రాజధానికి అప్పులే తప్ప కేంద్రం నుంచి ఎటువంటి గ్రాంట్లు, ప్రత్యేక సాయాన్ని తెచ్చుకోలేకపోయింది. పైగా గత బడ్జెట్లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి మాట మాత్రంగానైనా చెప్పారు. ఈసారి బడ్జెట్లో అసలు వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి గానీ, కేటాయింపుల గురించి గానీ పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న గిరిజన, సెంట్రల్ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయకుండా దేశం మొత్తం కేటాయింపుల్లో కలిపి చూపడం గమనార్హం. పెట్రోలియం యూనివర్సిటీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. గత బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈసారి బడ్జెట్లో అసలు దాని గురించి ప్రస్తావనే చేయలేదు. బీహార్కు పలు ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్కు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కొత్తగా ప్రకటించక పోవడం, విభజన చట్టంలోని అంశాలకు కూడా కేటాయింపులు చేయక పోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విదేశీ సాయంతో కొనసాగుతున్న విద్య, వైద్య, జీవనోపాధి ప్రాజెక్టులకు కేటాయింపులు చూపెట్టారు తప్ప కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ ఆర్థిక ఏడాది కన్నా వచ్చే ఆర్థిక ఏడాది పెరగనున్నట్లు కేంద్ర బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.52,080 కోట్లు రానున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది రూ.57,566 కోట్లుగా పేర్కొన్నారు. ఏ రీతినా చూసినా రాష్ట్రానికి పెద్దగా మేలు చేయని ఈ బడ్జెట్పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించడం విస్తుగొలుపుతోంది. గురజాడ మాట తప్ప..ఏపీ ప్రస్తావనేది?‘తెలుగు మహాకవి, నాటక రచయిత గురజాడ అప్పారావు.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.. అని అన్నారు. దేశం అంటే దాని నేల మాత్రమే కాదని, అందులో ఉన్న ప్రజలని అర్థం. అందుకు అనుగుణంగా వికసిత్ భారత్ ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం మినహా తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క ప్రాజెక్టూ ప్రకటించలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి అదనపు సాయం మాటే లేదు. గత ఏడాది జూలై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. వివిధ సంస్థల ద్వారా అమరావతికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తాం. అందులో భాగంగా 2024–25లో రూ.15 వేల కోట్లు, తర్వాతి సంవత్సరాల్లో అదనపు మొత్తాలను అందజేస్తాం’ అని చెప్పారు. అయితే అందుకు కొనసాగింపుగా ఈ బడ్జెట్లో నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్లోని కొప్పర్తి నోడ్లో, హైదరాబాద్–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని ఓర్వకల్ నోడ్లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు గురించి ఒక్కమాట చెప్పలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిహార్కు మాత్రం భారీ కేటాయింపులు చేసింది. జల్ జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు. ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ప్రధాని మోదీ సారథ్యంలో ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. మోదీ సారథ్యంలోని వికసిత్ భారత్ దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపునిస్తూ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను స్వాగతిస్తున్నా. – ఎన్. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరిస్తుందికేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలపడం, రూ.5,936 కోట్లు కేటాయించడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరందుతుంది. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంది. – కె.పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు 2025–26 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. బిహార్, ఆంధ్రప్రదేశ్ వల్లే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో నిలబడగలుగుతోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చుకొంటే.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. బిహార్ ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలి. రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచి్చన హామీలు, బడ్జెట్లో చేసిన అన్యాయంపై పార్లమెంట్లో వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తాం. – పీవీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేతకూటమి చేతకానితనం వల్లే అన్యాయంబడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. ఓ పక్క బిహార్కు కేంద్రం అనే కానేక వరాలు ప్రకటిస్తే.. ఏపీకి చంద్రబాబు ఒక్క వరమూ పొందలేకపోయారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీల చేతకాని తనమే. ఏపీకి కేంద్రం ఎప్పుడో ప్రకటించిన వాటిని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
లక్కీ భాస్కర్ లెక్కలివి..
(సాక్షి, అమరావతి) : ఏడాదికి వచ్చే ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్నవారెవరూ ఇక ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇప్పటిదాకా రూ.7 లక్షలుగా ఉన్న ట్యాక్స్ రిబేట్ పరిమితిని ఒక్కసారిగా 12 లక్షలకు పెంచటం ద్వారా... ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊహించని కానుకనిచ్చారు. మేమంతా ‘లక్కీ భాస్కర్’లమే అని మధ్య తరగతి వేతన జీవులు సంబరపడేలా తాజా బడ్జెట్లో ప్రతిపా దనలు చేశారు. ఈ రకంగా చూస్తే.. ఏడాదికి రూ.12 లక్షలు ఆదాయం ఉన్న వాళ్లు ప్రస్తుతం చెల్లిస్తున్న సుమారు రూ.80,000 పన్ను ఇకపై వారికి మిగులుతుంది. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000ను కూడా కలిపితే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం ఆదా యం రూ.12.75 లక్షలకన్నా ఒక్క రూపాయి పెరిగినా... వారు వివిధ పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు ఇది వ్యక్తులు జీతం రూపంలో ఆర్జించే మొత్తానికే వర్తిస్తుందని, మూలధన లాభాలు (క్యాపిటల్ గెయిన్స్) వంటి ఇతర ఆదాయాలకు మాత్రం ఈ రిబేటు వర్తించదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అంటే మీరు ఒక ఏడాదిలో ఆర్జించిన మూలధన లాభాలు, జీతం కలిపి రూ.12 లక్షల లోపు ఉన్నా... మూలధన లాభాలపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుందన్న మాట!!. శనివారం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి... త్వరలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అత్యంత గజిబిజీగా ఉన్న ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానంలో అత్యంత సరళంగా ఉండే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా పన్నుల శ్లాబులను మరింత సరళతరం చేస్తూ... అత్యధిక పన్నురేటు30 శాతాన్ని ఇప్పటి దాకా రూ.15 లక్షలు దాటితే వర్తింపజేస్తుండగా... ఇకపై దాన్ని రూ.24 లక్షలు దాటితేనే వర్తింపజేస్తామని ప్రకటించారు.అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కు ఉపయోగపడేలా టీడీఎస్, కంపెనీలకు ప్రయోజనం కల్పించేలా టీసీఎస్ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు.ఈ ప్రతిపాదనల వల్ల ప్రస్తుతం రిటర్నులు దాఖలు చేస్తున్న వారిలో 85 శాతానికి పైగా ప్రయోజనం పొందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక కొత్త పన్ను చట్టంఇంటి అద్దె, అలవెన్సులు, పొదుపు పథకాలు, గృహరుణాలు, ఇతర వ్యయాల వంటి వాటిని చూపించి పన్ను భారం తగ్గించుకునే పాత పన్నుల విధానం స్థానంలో ఎటువంటి పొదుపు అవసరం లేని కొత్త పన్నుల విధానాన్ని 2020 బడ్జెట్ ద్వారా కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. కొత్త, పాత విధానాల్లో ఏది ఎంచుకుంటారన్నది పన్ను చెల్లింపు దారుల ఇష్టమని మొదట్లో చెప్పినా... ప్రతి బడ్జెట్లో కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించేలా... పాత పన్నుల విధానాన్ని అనుసరిస్తున్న వారిని నిరుత్సాహ పరిచలేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇక పాత విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని భావించారో ఏమో... ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద మినహాయింపు పరిమితిని భారీగా పెంచుతూ... దాదాపుగా ప్రతి ఒక్కరూ కొత్త విధానాన్నే ఎంచుకునే పరిస్థితిని కల్పించారు మంత్రి నిర్మల. వచ్చే వారం పార్లమెంటులో కొత్త పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పటం ద్వారా ఇక పాత పన్ను చట్టానికి స్వస్తి చెబుతామని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఇప్పటిదాకా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారిలో ఒకటో అరో తప్ప అంతా రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారే. ఇప్పుడు వారందరికీ పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వటంతో.... ఇక వారికి రకరకాల సేవింగ్స్ చేయటం, బిల్లులు చూపించటం వంటివి తప్పిపోతాయి. నేరుగా పన్ను మినహాయింపు లభిస్తుంది. కాబట్టి వారంతా సహజంగానే కొత్త విధానంలోకి మారిపోతారు. అంటే.... దాదాపు ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే పాత విధానాన్ని ప్రతి ఒక్కరూ వదిలిపెట్టి కొత్త విధానంలోకి మారిపోతారు. కొత్త చట్టం వచ్చినా వ్యతిరేకత ఉండదు.రూ.80వేల నుంచి రూ.1.10 లక్షల దాకా లాభంకొత్త పన్ను (2025–26 నుంచి అమలు) విధానం ప్రకారం... మినహాయింపు పరిమితిని రూ.7 నుంచి 12 లక్షలకు పెంచటమే కాదు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న బేసిక్ లిమిట్ను రూ.4 లక్షలకు పెంచారు. దాంతో పాటు ప్రతి 4 లక్షలకు ఒక శ్లాబు రేటు చొప్పున మొత్తం 7 శ్లాబులను ప్రవేశపెట్టారు. దీంతో రూ.24 లక్షల లోపు ఆదాయానికి 30% పన్ను వర్తించదు.గతంలో 15 లక్షలు దాటితే 30% పన్ను రేటు చెల్లించాల్సి వచ్చేది. అలాగే రూ.20–24 లక్షల ఆదాయం ఉన్న వారికి 25% పేరుతో కొత్త శ్లాబు రేటును ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారికి 80,000, రూ.18 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.70,000, రూ.25 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి రూ.1.10 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుంది.సీనియర్ సిటిజన్లకు ఊరటవడ్డీ ఆదాయంగా జీవించే సీనియర్ సిటిజన్స్ టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీడీఎస్ అంటే మూలం దగ్గర చెల్లించే పన్ను. అంటే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం గనక పరిమితిని దాటితే అందులో 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలే కట్ చేస్తాయి.ప్రస్తుతం ఈ వడ్డీఆదాయం టీడీఎస్ పరిమితి రూ.50,000. ఇకపై దీన్ని రూ.లక్ష చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.ఇంటద్దె రూపంలో వచ్చే వార్షికాదాయం గనక రూ.2.4 లక్షలు దాటితే ఇప్పటిదాకా టీడీఎస్చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.6 లక్షలకు పెంచారు.బీమా కమీషన్లపై టీడీఎస్ రేటును 5 నుంచి 2 శాతానికి తగ్గించారురెమిటెన్స్లపై విధించే టాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ (టీసీఎస్) పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు... విదేశీ విద్యకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చేసే రెమిటెన్స్లై టీసీఎస్ను ఎత్తివేస్తు్తన్నట్లు ప్రకటించారు. ఇక నుంచి అధిక టీడీఎస్ను కేవలం పాన్ నెంబర్ లేని కేసులకు మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించారు. తప్పుగా ఆదాయం చూపించిన రిటర్నులు సవరించుకునే కాలపరిమితిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచారు. నాలుగేళ్లలోపు స్వచ్ఛందంగా అధిక పన్ను చెల్లించడం ద్వారా సవరించిన రిటర్నులు తిరిగి దాఖలు చేసుకోవచ్చు.రూ.12.75 లక్షలకుఒక్క రూపాయి మించినా..నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో... చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్ పరిమితిని. అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్ డిడక్షన్గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సిఉంటుంది. ఉదాహరణకు... మీ వార్షిక వేతనం రూ.12.80 లక్షలనుకోండి. మీరు రిబేట్ పరిధిలోకి రారు. కాబట్టి మీ వేతనం నుంచి రూ.75వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసేయగా... మిగిలిన రూ.12.05 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది. అంటే... దీన్లో రూ.4 లక్షలవరకూ జీరో... రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలు, రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలు, మిగిలిన 5వేలపై 15 శాతం... అంటే రూ.750. మొత్తంగా రూ.60,750 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే... రూ.12.75 లక్షలకన్నా 5వేలు ఎక్కువ ఉన్నందుకు రూ.60,750 పన్ను చెల్లించాల్సి వస్తోంది. అదే 12.75 లక్షల లోపుంటే... రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదీ లెక్క. ఇది మరిచిపోకండి... జీతం ఒక్కటే మీ ఆదాయంగా పరిగణించకూడదు. మీ బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు, ఇంటద్దె రూపంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకే వస్తాయి. ఇక షేర్లు, క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం కింద పరిగణించబోమని ఈ సారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు. వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వచ్చే ఆదాయం రూ.12.75 లక్షల లోపున్నా సరే... మీ మొత్తం ఆదాయానికి కలిపినా కూడా రూ.12.75 లక్షల లోపున్నా సరే... వీటిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
సాగుకు ఊతమేది?
భారత్ను అభివృద్ధి పథంలో పయనింపజేసే కీలకమైన నాలుగు ఇంజిన్లలో వ్యవసాయం ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయ అభివృద్ధి– ఉత్పాదకతల్లో సాధించే ప్రగతి... గ్రామీణ భారతం తిరిగి పుంజుకోవ డానికీ, సౌభాగ్యవంతం కావడానికీ దారితీస్తుందని ఆమె 2025–26 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ అందుకు తగిన కేటా యింపులు చేయడం మాత్రం మరిచారు. భూతాపం పెరుగు తున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతి కూల ప్రభావాలు, అతివృష్టి, అనావృష్టి, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల సగటు రైతులు పంట దిగుబడిలో తీవ్ర మార్పులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో ఈ పరిస్థితి నుంచి వారిని బయటపడవేయడానికి ఎట్లాంటి నిధులూ లేవు. ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ రూ. 1,27,290.16 కోట్లుగా ప్రకటించారు. ఇది 2024–25లో రూ.1,22,528 కోట్లు, 2023–24లో రూ. 1,16,788 కోట్లుగా ఉంది. 2025–26 మొత్తం బడ్జెట్ అంచనా (బీఈ) రూ. 50,65,345 కోట్లు. అంటే వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో ఇచ్చింది కేవలం 2.51 శాతం మాత్రమే అన్నమాట. వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, చేపలు, పాడి పశువుల శాఖలకు కలిపి మొత్తం రూ. 1,45,300.62 కోట్లు. గత ఏడాది ఇది రూ. 1,39,607.54 కోట్లుగా ఉంది. వ్యవసాయ పరి శోధనకు గతేడాది రూ. 9,941.09 కోట్లు ఇస్తే ఈసారి రూ. 10,466.39 కోట్లు కేటాయించారు (పెరుగుదల 5.2 శాతం).ఆశ్చర్యంగా, పంటల దిగుబడి ప్రభుత్వ లెక్కలలో పెరుగుతోంది. అననుకూల పరిస్థితుల వల్ల కేరళ రాష్ట్రంలో 3 పంటలు పండించే ప్రాంతంలో ఒకే పంట వేస్తున్నారు. గత 10 ఏండ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూమి రోడ్లకు, ఇంకా ఇతర అభివృద్ధి పనులకు మళ్ళింది. దాదాపు 100 నదులు ఎండిపోయాయి. ఇవేవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంటల దిగుబడి మీద వ్యతిరేక ప్రభావం చూపకపోగా... దిగుబడి పెర గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంటల విలువ పెరిగింది అని ఆర్థిక సర్వే చెబుతున్నది. అంటే ధరలు పెరిగినాయి. దీని వలన రైతుల ఆదాయం పెరగలేదు. కాగా ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. అందువల్ల సాధారణ పౌరులకు అనేక పంట ఉత్పత్తులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.ఆర్థిక మంత్రి తన 2024–25 బడ్జెట్ ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కునే విధంగా తయారు చేయటం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచేటప్పటికి ఈ ప్రాధాన్యాలు మరిచి పోయారు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ. 7,544 కోట్ల కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగ పెరుగు దలలో ఆర్థిక సర్వే కీలకంగా గుర్తించిన ఈ రెండు రంగాల మీద ప్రభుత్వం బడ్జెట్ పెరుగుదల 5 శాతం లోపే. మొత్తం బడ్జెట్ దిశ మారలేదు. ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రధానంగా నీటి వనరుల కాలుష్యం, పశువులకు దొరకని దాణా వంటి అంశాల మీద దృష్టి లేనే లేదు. వ్యవసాయ పరిశోధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకా’నికి 13 శాతం కోత విధించింది. ఈ సారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకం తగ్గించడం శోచనీయం.రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల కొరత, వ్యవ సాయ కూలీ భారం వంటి అంశాల మీద ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా ప్రస్తావించలేదు. గ్రామీణ భారతంలో ఉన్న భూమి లేని వారి ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు లేవు. గ్రామీణ శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉపాధి రక్షణకు నిధులు మృగ్యం. వ్యవసాయంతో గ్రామీణ శ్రామిక శక్తి అనుసంధానం గురించిన కేటాయింపులు లేవు. పెరుగు తున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడి పోతున్నది. ఆహార ద్రవ్యోల్భణం వల్ల సరైన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం.భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేయడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వ్యవసాయంలో ఉపాధిని తగ్గించే డిజిటలీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా హాని కలిగించే పనుల మీద దృష్టి సారించడం మంచిది కాదు. కేంద్ర బడ్జెట్లో తీవ్ర మార్పులు అవసరం ఉన్నాయి. దార్శనిక నిధుల కేటాయింపుల అవసరం ఎంతైనా ఉంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
అసలు లాభం కోటి మందికేనా?
ఇపుడు యావద్దేశమూ బడ్జెట్లో పెంచిన ఆదాయపు పన్ను పరిమితి గురించే మాట్లాడుతోంది. తాము భారతదేశ మధ్య తరగతికి ఎనలేని మేలు చేశామని, యావత్తు మధ్య తరగతికీ ఊరటనిచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఇది నిజమేనా? వాస్తవానికి 145 కోట్ల మంది భారతదేశ జనాభాలో 2024–25లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారి సంఖ్య దాదాపుగా 8.09 కోట్లు. అందులో దాదాపుగా 6 కోట్ల మంది రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉండి జీరో రిటర్నులు వేసినవారే. మిగిలిన వారిలో కోటి మంది రూ.12 లక్షలకన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు. అంటే మిగిలిన 1.09 కోట్ల మందికే తాజా నిర్ణయంతో ఎక్కువ మేలు కలుగుతుందన్న మాట. ఎందుకంటే వారు మాత్రమే ప్రస్తుతం రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉండి పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నవారు. కాకుంటే.. శ్లాబుల మార్పు వల్ల రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఆదాయం ఉండేవారికి కూడా కొంత ప్రయోజనం కలుగుతుండటం గమనార్హం. మరి ఈ 1.09 కోట్ల మందికి లబ్ధి కలిగించే నిర్ణయం తీసుకుని యావత్తు మధ్య తరగతికీ మేలు చేశామని చెప్పటం కరెక్టేనా? అసలు పన్ను పరిధిలోకే రాని 138 కోట్ల మంది సంగతేంటి? వారి బతుకు తెరువేంటి? అలాంటి వారందరినీ కూడా మధ్య తరగతిలోకో కనీసం ఆదాయ పు పన్ను పరిధిలోకో తేవాలంటే వారందరికీ తగిన ఉద్యోగాలు, ఉపాధి ఉండాలి కదా? కాకపోతే ఆ దిశగా ఈ బడ్జెట్లో తీసుకున్న చర్యలేవీ కనిపించలేదు. కాకపోతే ఉద్యోగులంటేనే ఎక్కువగా మాట్లాడేవాళ్లు. వివిధ వేదికలపై వినిపించేది వారి గొంతే. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేదీ వాళ్లే. అందుకే మోదీ వారిని లక్ష్యంగా చేసుకున్నారు. కాబట్టే ఇపుడు దేశమంతా బడ్జెట్లో మిగతా విష యాలు పక్కనబెట్టి ఆదాయపు పన్ను గురించి మాట్లాడుతోంది. లక్ష కోట్లు నష్టపోయి మరీ... ఎందుకిలా? ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య వల్ల ఏడాదికి లక్ష కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల చెప్పారు. మామూలుగా ఎప్పుడూ ఇంతటి నష్టం వచ్చే చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పటికే రుణాలు పెరిగిపోతున్నాయి. మరి లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోవటమంటే మాటలు కాదు కదా? కాకపోతే ప్రభుత్వ ఉద్దేశం వేరు. తాత్కాలికంగా ఉద్యోగుల్ని సంతృప్తి పరచటం ద్వారా తక్షణ ప్రయోజనాలు పొందటమే కాక... పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించి, ప్రతి ఒక్కరినీ కొత్త పన్ను విధానంలోకి తేవటమన్నది ప్రభుత్వ అసలు లక్ష్యం. ఇందులో భాగంగానే ఈ పరిమితి పెంపు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాత పన్ను విధానం నిరర్ధకమైపోతుంది. పన్ను కోసం చేసే సేవింగ్స్, అలవెన్సులు, పన్ను కోసం చేసే బీమా చెల్లింపుల వంటివన్నీ తెరమరుగైపోతాయి. మొత్తంగా అలవెన్సుల వ్యవస్థే కనిపించకుండా పోతుంది. దీనికితోడు మినహాయింపులేవీ ఉండవు కనక అత్యధిక శాతం మందికి పన్ను రిటర్నులు దాఖలు చేయటం అత్యంత సులభమైపోతుంది. రకరకాల ఆదాయాలుండి, వాటిని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నవారికి తప్ప.. ఒక్క జీతంపైనే ఆధారపడ్డ వారెవ్వరికీ పన్ను రిటర్నులు వేయటానికి ట్యాక్స్ అసిస్టెంట్లు, ఆడిటర్ల అవసరం ఉండదు.ఇక ఆదాయపు పన్ను విభాగంలో కూడా రిఫండ్ల వంటి ప్రక్రియ ఉండదు. పన్నుల వ్యవస్థ సరళమైపోతుంది కనక ఆదాయపు పన్ను విభాగాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పైపెచ్చు సరళమైన పగడ్బందీ పన్ను విధానం అమల్లోకి వస్తుంది. రిబేట్ పరిమితి 12 లక్షల వరకూ ఉంటుంది కనక వృత్తి నిపుణులతో సహా ఎక్కువ మంది రిటర్నులు వేయటానికి ముందుకొస్తారు. ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. మున్ముందు వీరంతా పన్ను చెల్లిస్తే ఆదాయ వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. -
మానవాభివృద్ధి దిశగా!
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం; సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు; పెట్టుబడి, ఎగుమతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, సమ్మిళిత సాధన, ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్యతరగతి ప్రజల వినియోగ వ్యయ సామర్థ్యం పెంపు లాంటి లక్ష్యాల సాధన ‘వికసిత్ భారత్’ ఆకాంక్షలుగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. నూతన పన్ను వ్యవస్థలో భాగంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు వల్ల ప్రజల వ్యయార్హ ఆదాయాలు పెరిగి, కుటుంబ వినియోగ వ్యయం పెరుగుతుంది. తద్వారా దేశంలో సమష్టి డిమాండ్ పెరిగి, ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ఆహ్వానించద గిన పరిణామం. ఈ చర్య ఆరోగ్య బీమా రంగంపై దీర్ఘకాల ప్రభా వాన్ని కలుగజేస్తుంది. బీమా రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు పోటీతత్వం పెరిగి బీమా పాలసీల రూపకల్పన, సేవల డెలి వరీలో నవకల్పనలు చోటుచేసు కుంటాయి. తద్వారా వ్యక్తులు, కుటుంబాలు తమ ఆరోగ్య సంర క్షణ వ్యయాన్ని సక్రమంగా నిర్వ హించుకోవడం ద్వారా నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను పొంద గలుగుతారు. ఆర్థిక సేవల అందు బాటు దేశంలో మానవాభివృద్ధికి దారితీస్తుంది, ఆర్థికాభివృద్ధి వేగ వంతమవుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను విద్యారంగానికి విస్తరించి పెట్టుబడులను ప్రకటించడం ద్వారా దీన్ని భవిష్యత్ సామాజిక – ఆర్థిక ప్రగతికి కారకంగా ప్రభుత్వం గుర్తించింది. అదనంగా పదివేల మెడికల్ సీట్లు, ఐఐటీలలో అదనంగా 6,500 సీట్ల పెంపు, నాణ్యతతో కూడిన శ్రామిక శక్తి పెంపు నవకల్పనలకు దారితీస్తాయి. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనపై పెట్టు బడులు, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దారితీసి, అధిక వినియోగం, మార్కెట్ విస్తరణకు నూతన అవకాశాలు ఏర్ప డతాయి. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్కు కస్టమ్ సుంకాన్ని మినహా యింపునివ్వడం వల్ల పేషెంట్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల క్షీణతకు మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల కారణంగా భావించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయంతో పోల్చినప్పుడు 2025–26లో మూలధన వ్యయంలో పెరుగుదల 10 శాతం మాత్రమే. ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయంలో పెరుగుదల అధికంగా లేనప్పుడు ఆ ప్రభావం ఉత్పాక రంగాలపై రుణాత్మకంగా ఉండి, వృద్ధి క్షీణతకు దారితీస్తుంది. ప్రభుత్వ కోశ విధానాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయి. 2024–25 ఆర్థిక సంవ త్సరం ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతంగా నమోదు కావడం, పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, బాండ్ల రాబడి, ఈక్విటీ మార్కెట్లపై స్వల్పకాల ఒడుదొడుకులను కలుగజేస్తాయి. విదేశీ పెట్టుబడులను భారత్ అధికంగా ఆకర్షించడమనేది ప్రతి పాదిత బడ్జెట్ చర్యలు ఆర్థిక విస్తరణ, రాజకీయ సుస్థిరత, కార్పొరేట్ సంస్థల రాబడుల పెరుగుదలకు దారితీశాయా, లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఆదాయపు పన్ను మినహాయింపు వలన పెరిగిన వ్యయార్హ ఆదాయాన్ని, వినియోగదారులు వినియోగ వ్యయంగా మరల్చగలరనే విషయంలోనూ అనిశ్చితి ఉంది. పన్ను రేట్ల తగ్గింపు స్వల్పకాల ప్రయోజనాలకే దారి తీస్తుంది. మరోవైపు అవస్థాపనా సౌకర్యా లపై పెట్టుబడులు అధికవృద్ధి సాధనకు దారి తీస్తాయి.రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా మ్యంతో వంద జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం, సరకు నిల్వ, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ, స్వల్పకాల, దీర్ఘకాల వ్యవసాయ పరపతి పెంపు లక్ష్యాలుగా, ‘ప్రధాన మంత్రి ధన్ – ధాన్య క్రిషి యోజన’ పథకాన్ని ప్రకటించారు. భారత్లో వ్యవసాయ రంగానికి సంబంధించి అధిక శాతం రైతులు ఉపాంత, చిన్న కమతాలపై ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో రెండు హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న కమతాల వాటా 86 శాతం. కమతాల విస్తీర్ణం తక్కువగా ఉండటం వలన ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించలేకపోతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్క రణలు ముఖ్యంగా మేలు రకమైన వంగడాల వినియోగం,పంటమార్పిడి విధానాన్ని అవలంబించగలిగే సామర్థ్యం తక్కువగా ఉండటానికి రైతులలో ఆధునిక వ్యవసాయ పద్ధతు లపై అవగాహన లేకపోవడంతోపాటు, పరపతి లభ్యత తక్కు వగా ఉండటాన్ని కారణాలుగా పేర్కొనవచ్చు.స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు బడ్జెట్ ప్రతిపాదనలు అనుకూలంగా ఉన్నప్పటికీ లోప భూయిష్ఠ సప్లయ్ చెయిన్ వ్యవస్థ, అసంఘటిత రంగ కార్య కలాపాలు, సంస్థాపరమైన పరపతి లభ్యతలో ఇబ్బందులు అభివృద్ధికి అవరోధంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐఎఫ్ హెచ్ఇ, హైదరాబాద్ -
పంచరంగుల చిత్రం
గమ్యస్థానం: వికసిత భారత్ దారిదీపం: సమష్టి కృషి ఇంధనం: కొత్త తరం సంస్కరణలు స్థూలంగా చెప్పాలంటే 2025–25 కేంద్ర బడ్జెట్లో నిర్మలమ్మ( Nirmala Sitharaman) ఆవిష్కరించిన పంచ రంగుల చిత్రం సారాంశమిదే! మధ్య తరగతి కొనుగోలు శక్తిని, తద్వారా అంతిమంగా ఆర్థిక వృద్ధి రేటును ఇతోధికంగా పెంచడం, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను విస్తృతపరచడమనే మోదీ ప్రభుత్వ లక్ష్యాలను బడ్జెట్లో ఘనంగానే ఆవిష్కరించారు విత్త మంత్రి. ‘‘ఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని చెప్పుకున్నారు. పౌరులందరి ప్రగతే (సబ్ కా వికాస్) లక్ష్యంగా పలు పథకాలను, చర్యలను ప్రతిపాదించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగువారి అడుగుజాడ గురజాడ పంక్తులతో ప్రసంగం మొదలు పెట్టారు. ‘పేదరికం లేని సమాజం, అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన, పాఠశాల విద్య, వైద్య సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి–వారికి మెరుగైన ఉపాధి, మహిళల్లో కనీసం 70 శాతం మందికి ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, భారత్ను ప్రపంచ ఆహార పాత్రగా తీర్చిదిద్దేలా రైతన్నకు వెన్నుదన్నుగా నిలవడం’ తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు.వాటి సాధనకు ‘ఆర్థిక వృద్ధి–ఉత్పాదకత, గ్రామీణ స్వావలంబన, వృద్ధి పథంలో సమష్టి అడుగులు, మేకిన్ ఇండియా ద్వారా నిర్మాణ రంగానికి పెద్దపీట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత తోడ్పాటు, ఉద్యోగిత ఆధారిత వృద్ధి, మానవ వనరులపై భారీ పెట్టుబడులు, రక్షిత ఇంధన సరఫరాలు, ఎగుమతులు, ఇన్నోవేషన్లకు ఇతోధిక ప్రోత్సాహం’... ఇలా పది రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రస్థానంలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను నాలుగు ప్రధాన చోదక శక్తులుగా పేర్కొన్నారు.పన్నులు, ఇంధన, పట్టణాభివృద్ధి, గనులు, ఆర్థికం, నియంత్రణ... ఈ ఆరు కీలక రంగాల్లో వచ్చే ఐదేళ్ల పరిధిలో భారీ సంస్కరణలను ప్రతిపాదించారు. కాకపోతే లక్ష్యాలను ఘనంగా విధించుకున్న మంత్రి, వాటి సాధనకు ఏం చేయనున్నారనేది మాత్రం ఇదమిత్థంగా చెప్పకుండా పైపై ప్రస్తావనలతోనే సరిపెట్టారు. వేతనజీవికి వ్యక్తిగత వార్షిక ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లును వారంలో ప్రవేశపెడతామని తెలిపారు. పన్నుల రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మోదీ సర్కారు మానస పుత్రికలైన స్టార్టప్లు, డిజిటల్ ఇండియా తదితరాలకు నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టారు.న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025–26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో కూడిన పద్దును పార్లమెంటుకు సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 4.4 శాతం ఉండొచ్చని మంత్రి జోస్యం చెప్పారు. జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చన్న అంచనాల నేపథ్యంలో సంక్షేమాన్ని, సంస్కరణలను పరుగులు పెట్టించేలా పలు చర్యలను ప్రతిపాదించారు. 74 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఏమేం చెప్పారంటే... పరిశ్రమలకు మహర్దశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ల్లో పెట్టుబడులను రెట్టింపునకు పైగా పెంచనున్నట్టు మంత్రి వివరించారు. ‘‘ప్రస్తుతం కోటికి పైగా ఎంఎస్ఎంఈల ద్వారా 7.5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వాటికి ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా రుణ సదుపాయం అందనుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణ పరిమితి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరగనుంది. తయారీ రంగంలో మేకిన్ ఇండియాకు మరింత ప్రాధాన్యం దక్కనుంది’’ అని చెప్పారు. చదువుకు జేజే ఈ ఏడాది మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 10 వేల అదనపు సీట్లు, ఐఐటీల్లో కనీసం 6,500 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నట్టు విత్త మంత్రి ప్రకటించారు. ‘‘రూ.500 కోట్లతో సాగు, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతాయి. భారత్నెట్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం అందుబాటులోకి తేనున్నాం. బాలల్లో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించేందుకు సర్కారీ స్కూళ్లలో వచ్చే ఐదేళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటవుతాయి. ‘భారతీయ భాషా పుస్తక్’ పథకంతో స్థానిక భాషల్లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలన్నీ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు. పట్టణాలకు ప్రాధాన్యం పట్టణాలను గ్రోత్ హబ్లుగా తీర్చిదిద్దడానికి రూ.లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అమలు చేసే ప్రతి పథకంలోనూ నాలుగో వంతు నిధులను కేంద్రం అందజేస్తుంది. 2047 కల్లా కనీసం 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మెడికల్ టూరిజానికి ఊపు మెడికల్ టూరిజంలో భాగంగా రూ.20 వేల కోట్లతో ‘హీల్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 50 పర్యాటక ప్రాంతాలను స్థానిక ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 120 పట్టణాలను ఉడాన్ పథకం పరిధిలోకి తేవడం ద్వారా వచ్చే పదేళ్లలో మరో 4 కోట్ల మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సింగిల్ విండో సదుపాయంగా ‘భారత్ ట్రేడ్నెట్’ను అందుబాటులోకి తెస్తామన్నారు.సాగుకు పట్టం...వ్యవసాయ రంగానికి పట్టం కట్టేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మల ప్రకటించారు. ‘‘7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. అసోంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో భారీ యూరియా ప్లాంటు ఏర్పాటవనుంది. వ్యవసాయోత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంపు తదితర లక్ష్యాలతో రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 జిల్లాల్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషీ యోజన అమలవనుంది.రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెజీలియన్స్ పథకంతో ఈ పథకంతో గ్రామీణ మహిళలు, యువ రైతులు, చిన్న, సన్నకారు రైతులకు బాగా లబ్ధి చేకూరుతుంది. వంట నూనెల ఉత్పత్తి తృణధాన్యాల సాగులో ఆత్మనిర్భరత సాధనకు ప్రాధాన్యమిస్తున్నాం. కూరగాయ లు, పళ్ల సాగుకు సమగ్ర పథకం తేనున్నాం. జన్యు బ్యాంకుల ద్వారా విత్తన నిల్వ సా మర్థ్యం పెంపొందిస్తాం’’ అని వివరించారు.ఇది ప్రజల బడ్జెట్: ప్రధాని మోదీన్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజల బడ్జెట్గా అభివర్ణించారు. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేరుస్తుందని అన్నారు. బడ్జెట్లో తీసుకున్న చర్యలవల్ల ప్రజల మధ్య మరింత డబ్బు చలామణి అవుతుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఊతం ఇస్తుందని, ఇది దేశ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.మరిన్ని రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని, దీని ద్వారా ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చని అన్నారు. పొదుపు, పెట్టుబడులు, వినియోగం, అభివృద్ధి వంటి అంశాలకు ఈ బడ్జెట్ ఊతం కల్పిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలతోపాటు దీని రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ బృందాన్ని ప్రధాని అభినందించారు. సాధారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్లు ఉంటాయని, కానీ ఈ సారి అందుకు భిన్నంగా ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువ చెలామణి అయ్యేలా బడ్జెట్ను ప్రవేశపెట్టారని కొనియాడారు.రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలున్యూఢిల్లీ: మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలు కేంద్రం ఇస్తుంది. ఈ నిధులను వివిధ రంగాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో మొదటి అసెట్ మానిటైజేషన్ వ్యూహాన్ని ప్రకటించింది.తాజా బడ్జెట్లో 2025–30 కాలానికి సంబంధించి రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్ను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్లాన్లో భాగంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.10 లక్షల కోట్ల మూలధన సహకారం అందిస్తారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మద్దతుతో రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. బడ్జెట్ హైలైట్స్⇒ కొత్త పన్నువిధానంలో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. వేతన జీవులకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి రూ.12.75 లక్షల వరకు పరిమితి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల రెవెన్యూ తగ్గిపోతుంది. ⇒ ఏడు టారిఫ్ రేట్ల తొలగింపు ⇒ 82 టారిఫ్ లైన్లపై ఉన్న సామాజిక సంక్షేమ సర్చార్జి రద్దు.⇒ అప్పుల ద్వారా ఆదాయం రూ. 34.96 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ.50.65 లక్షల కోట్లు ⇒ జీడీపీ రెవెన్యూ లోటు 4.4 శాతం ⇒ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రధాన్మంత్రి ధన్ ధాన్య యోజనకృషి యోజన ఏర్పాటు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ⇒ కంది, మినుములు, పెసర రైతుల ప్రోత్సాహకం కోసం పప్పుధాన్యాల ఆత్మనిర్భర మిషన్ ఏర్పాటు. దీనిద్వారా నాఫెడ్, ఎన్సీపీఎఫ్లు రైతులనుంచి వచ్చే నాలుగేళ్లలో పప్పుధాన్యాలను సేకరిస్తాయి. ⇒ కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం సమగ్ర పథకం ⇒ మఖానా విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు బిహార్లో మఖానా బోర్డు స్థాపన. అస్సాంలో ఏడాదికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తిచేసే యూరియా ప్లాంట్.ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలతో దేశప్రజలు ఇబ్బంది పడుతుంటే బడ్జెట్తో ప్రజలను మోసగించే యత్నం చేశారు. పదేళ్లలో మధ్యతరగతి నుంచి రూ.54.18 లక్షల కోట్లను ఆదాయపు పన్నుకింద వసూలు చేసి, ఇప్పుడు రూ.12 లక్షలు సంపాదించే వారికి మినహాయింపులు ఇస్తోంది. –– ఖర్గే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుఅభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ విజన్కు ఈ బడ్జెట్ అద్దం పడుతోంది. ప్రధాని ఆలోచనంతా మధ్యతరగతి ప్రజల బాగోగులపైనే. రైతులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు.. అన్ని వర్గాల సంక్షేమంపై ఈ బడ్జెట్ దృష్టిపెట్టింది. –– అమిత్షా, కేంద్ర హోం మంత్రిబిహార్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పాటునందిస్తుంది. మఖానా బోర్డ్ ఏర్పాటు, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు.. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను తీరుస్తాయి. పట్నా ఐఐటీని విస్తరించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సాంకేతిక విద్యకు ఊతం లభిస్తుంది. –– నితీశ్కుమార్, బిహార్ సీఎంకోటీశ్వరులకు రుణాలు మాఫీ చేసే విధానానికి స్వస్తి చెప్పి, అలా ఆదాచేసిన డబ్బులను మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి వాడాలని నేను చేసిన సూచనను బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకపోవడం నిరుత్సాహపరిచింది. కోటీశ్వరుల రుణమాఫీ కింద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించడం సరికాదు. –– కేజ్రీవాల్, ఆప్ జాతీయ కన్వీనర్బడ్జెట్లో అంకెలకన్నా, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గల్లంతు అయ్యారన్న విషయమే నాకు ముఖ్యం. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పలేకపోతోంది. బాధితులు ఇంకా తమ కుటుంబ సభ్యులకోసం వెతుక్కుంటున్నారు. –– అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత వరుసగా 8వసారిదేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ హితోక్తే మా సర్కారుకు స్ఫూర్తిజీవకోటి వానల కోసం ఎదురు చూసినట్టే పౌరులు సుపరిపాలనను అభిలషిస్తారన్న తిరుక్కురళ్ హితవును పన్ను విధానాల రూపకల్పనలో దృష్టిలో ఉంచుకున్నాంఇది సామాన్యుల బడ్జెట్. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేసుకునే దిశగా ఇదో పెద్ద ముందడుగు– బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు ఏ మాత్రం తగ్గుతాయి?
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో కీలకమైన ఎలక్ట్రానిక్ విడి భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రకటించింది. దీంతో స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు తగ్గే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను సమర్పిస్తూ.. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, దిగుమతి పరికరాలపై ధరల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలను వివరించారు.ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన బడ్జెట్ నిర్ణయాల్లో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్ (PCBA)పై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించడం ఒకటి. ఈ చర్య భారతదేశంలో ఇంకా తయారు చేయని కొన్ని హై-ఎండ్ ఐఫోన్ మోడల్లతో సహా దిగుమతి చేసుకునే స్మార్ట్ఫోన్లు, ఉపకరణాల ధరను తగ్గిస్తుంది. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో 2018లో ఈ సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు తాజా తగ్గింపు ఇంపోర్టెడ్ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగుగా పరిగణించవచ్చు.దేశ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను మెరుగుపరచగలదంటూ పరిశ్రమ నాయకులు ఈ చర్యను స్వాగతించారు. మొబైల్ ఫోన్లు, పీసీబీఏ, ఛార్జర్లపై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు స్మార్ట్ఫోన్ తయారీకి అవసరమయ్యే ఇన్పుట్లు, ముడి పదార్థాలపై మినహాయింపులను ఇస్తే దేశీయ ఉత్పత్తి వాతావరణం మెరుగుపడుతుందని షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ బి పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్లను మరింత చవకగా మార్చడానికి ఇది సానుకూల దశ అని ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్రా ప్రశంసించారు.పెద్ద తగ్గింపు ఉండకపోవచ్చు..కస్టమ్స్ సుంకం తగ్గింపు కచ్చికంగా తయారీదారులకు ఖర్చులను తగ్గించగలదు. అయితే రిటైల్ ధరలపై దాని ప్రత్యక్ష ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధరలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చని కౌంటర్పాయింట్ రీసెర్చ్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అభిప్రాయపడుతున్నారు. సుంకం తగ్గింపు స్మార్ట్ఫోన్ ధరలలో 1-2 శాతం స్వల్ప తగ్గుదలకు దారితీయవచ్చు అంటున్నారు. అయితే వినియోగదారులకు అందించే ప్రయోజనం ఎంతనేది ఆయా తయారీదారులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పైపెచ్చు తక్కువ ధర స్మార్ట్ఫోన్లపై ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉంటున్నాయని, కాబట్టి ధరలో చెప్పుకోదగ్గ తగ్గింపు కనిపించకపోవచ్చు అంటున్నారు. -
బడ్జెట్పై ప్రముఖుల స్పందన ఇదే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ప్రముఖులు వివిధ మాధ్యమాల్లో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో మద్దతు ఇవ్వడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తే, సామాన్యులకు బడ్జెట్లో పన్ను శ్లాబ్లను సవరించి మేలు చేశారని, తద్వారా వారి ఆదాయాలు పెంచారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలు బడ్జెట్పై ఎలా స్పందిస్తున్నారో కింద తెలుసుకుందాం.ఆదాయంలో పెరుగుదల -ఆశిష్కుమార్ చౌహాన్, ఎండీ అండ్ సీఈఓ ఎన్ఎస్ఈబలమైన అభివృద్ధి చర్యలు, పెరిగిన మూలధన వ్యయం, తగ్గిన పన్ను భారంతో భారతదేశ వృద్ధి ఊపందుకుంటుంది. ఆదాయంలో పెరుగుదలను, వినియోగ వృద్ధిని పెంచుతుంది. భారతీయ కుటుంబాలకు మరింత సంపద సృష్టి అవకాశాలను అందిస్తుంది. ప్రస్తుతం 11 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారుల సమూహంలో మరింత ఎక్కువ మంది చేరుతారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో వాటాదారులు అవుతారు. తద్వారా ఆర్థిక వృద్ధి, మూలధన నిర్మాణానికి కృషి చేస్తారు.వినియోగదారుల చేతిలో మరింత ఆదాయం- డాక్టర్ అనీష్ షా, మహీంద్రా గ్రూప్ ఎండీ.పన్ను నిర్మాణంలో మార్పుల ద్వారా 2025 బడ్జెట్పై సంతోషంగా ఉన్నాం. భారతీయ వినియోగదారుల చేతిలో మరింత ఆదాయాన్ని ఉంచడం మంచి విషయం. ఇది ప్రైవేట్ సెక్టార్ మూలధన వ్యయం సానుకూల దిశలో పయనించడానికి ప్రోత్సహిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. భారతదేశం తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. వృద్ధికి తక్షణ ఉద్దీపన అందించడంతో పాటు, బడ్జెట్ గణనీయమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధితో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. పునాదులు వేస్తోంది.వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి- ప్రశాంత్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, యస్ బ్యాంక్మెరుగైన ఆర్థిక వ్యవస్థకు వేదికగా బడ్జెట్ను మార్చారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పాదరక్షలు, తోలు, బొమ్మలు, ఆహార ప్రాసెసింగ్ వంటి విభాగాలకు బడ్జెట్లో ప్రోత్సాహం అందించారు. వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపరిచే మార్గాలపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని మెరుగుపరచడం ద్వారా తగిన అవకాశాలను అందించినట్లయింది. మరింత స్థిరమైన పన్నుల విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడానికి, తద్వారా దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించేందుకు వీలుగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు.బడ్జెట్ బూస్టర్- కల్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈఓకేంద్ర బడ్జెట్ 2025-26 స్వయం సమృద్ధి, వికసిత్ భారత్కు సరైన బూస్టర్ను అందిస్తుంది. మధ్యతరగతికి గణనీయమైన పన్ను ఉపశమనం, క్రమబద్ధీకరించిన టీడీఎస్ నిబంధనలు, స్థానిక తయారీకి బలమైన ప్రోత్సాహంతో ఈ బడ్జెట్ వినియోగదారుల చేతుల్లో ఎక్కువ ఆదాయాన్ని ఉంచుతుంది. వారి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులను అధికం చేస్తుంది. ఎంఎస్ఎంఈల వృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల స్థానిక వ్యాపారాలు బలోపేతం కావడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. స్థానిక తయారీని మెరుగుపరచడానికి, దేశం అంతటా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి, సాంకేతికతను ఉపయోగించడానికి బడ్జెట్ తోడ్పడుతుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్అదనంగా 75 వేల వైద్య సీట్లు- డా.మల్లికార్జున, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీకేంద్రబడ్జెట్ 2025లో ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాల కోసం ఎక్కువ కేటాయింపులు జరపడం సంతోషంగా ఉంది. 75 వేల వైద్య సీట్లను అదనంగా జోడించడంతో ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. చాలా వరకు ఇతర దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే విధానాన్ని కొంత కట్టడి చేసినట్లవుతుంది. చాలా క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మేలు జరుగుతుంది. అంగన్వాడీలకు మూలధన వ్యయాన్ని పెంచారు. -
UDAN scheme: విమానాలకు ‘కొత్త’ రెక్కలు!
ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి సవరించిన ఉడాన్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-2026లో ఆవిష్కరించారు. ఇది 120 కొత్త గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. రాబోయే 10 సంవత్సరాలలో 4 కోట్ల మంది ప్రయాణికులకు వాయు రవాణా అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలలో హెలిప్యాడ్లు, చిన్నపాటి విమానాశ్రయాలకు కూడా ఈ పథకం మద్దతునిస్తుందని సీతారామన్ పేర్కొన్నారు. పాట్నా విమానాశ్రయ సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బీహార్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.బిహార్లో 50,000 హెక్టార్లకు పైగా భూమిని సాగుచేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూర్చే వెస్ట్రన్ కోస్ట్ సీ కెనాల్ ఈఆర్ఎం ప్రాజెక్ట్కు ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు. అలాగే విమానాశ్రయం అభివృద్ధి, బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ ప్రణాళికలను వెల్లడించారు.ఇదీ చదవండి: బడ్జెట్ 2025-26: రియల్ ఎస్టేట్కు బూస్ట్!అయితే మొత్తంగా చూస్తే పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు గత బడ్జెట్లో కంటే ఈ బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్లో రూ. 2,922.12 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో కేటాయించింది రూ.2,357.14 కోట్లే. -
పన్ను శ్లాబుల సవరణకు కారణాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం కలిగించడానికి, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో ఆదాయపు పన్ను శ్లాబ్ల్లో మార్పులు చేశారు. ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో.. ఇది పన్ను చెల్లింపుదారులను ఎలా ప్రభావితం చేస్తుందో కింద తెలుసుకుందాం.డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచడంఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడానికి ప్రధాన కారణాలలో ఒకటి మధ్య తరగతి వారికి డిస్పోజబుల్ ఆదాయాన్ని(ఖర్చులు అన్ని పోను మిగిలే ఆదాయం) పెంచడం. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా, వ్యక్తులు, కుటుంబాలు ఖర్చు చేయడానికి, పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉంటారు. ఇది ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి దారితీస్తుంది.పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడంపొదుపును, పెట్టుబడులను ప్రోత్సహించేలా కొత్త పన్ను విధానాన్ని రూపొందించారు. అధిక డిస్పోజబుల్ ఆదాయంతో, వ్యక్తులు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడే ఆర్థిక సాధనాలు, స్థిరాస్తి లేదా వ్యాపారాల్లో పొదుపు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది.పన్ను వ్యవస్థను సరళతరం చేయడంపన్ను వ్యవస్థను సరళతరం చేయడమే లక్ష్యంగా పన్ను శ్లాబులను సవరించారు. పన్ను చెల్లింపుదారులు వారి పన్ను విధానాలను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం సులభతరం అవుతుంది. ఈ సరళీకరణ పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులపై పరిపాలనా భారాన్ని తగ్గిస్తుంది. ఇది మరింత సమర్థవంతమైన పన్ను సేకరణకు దారితీస్తుంది.మధ్యతరగతికి మద్దతుమధ్యతరగతి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటోంది. వారికి పన్ను ఉపశమనం కల్పించడం, వారి కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ నిర్ణయం సాయపడుతుంది. మధ్య తరగతివారిపై పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు, మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.పాత పన్ను విధానం రద్దు చేసేలా..?2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ద్వారా క్రమంగా పాత పన్ను విధానాన్ని పలుచన చేస్తున్నారు. తాజా మార్పులు పాత వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను కొత్త విధానానికి మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్గృహ వినియోగాన్ని ప్రేరేపించడంపెరిగిన డిస్పోజబుల్ ఆదాయం అధిక గృహ వినియోగానికి దారితీస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా మారుతుంది. వినియోగదారుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచడం ద్వారా వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ద్రవ్యోల్బణంపెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయంతో ఆదాయపు పన్ను శ్లాబులను తగ్గించడం కుటుంబాలపై కొంత ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. -
లక్ష్మీదేవిగా నిర్మలమ్మ.. బడ్జెట్పై నెట్టింట ఫన్నీ మీమ్స్
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి, ఆమె చేసే వ్యాఖ్యల గురించి తరచూ సరదా చర్చ నడుస్తుంటుంది. అయితే.. వాటిని తాను కూడా అంతే సరదాగా చూస్తానని ఆమె అంటుంటారు. ఈ క్రమంలో ఇవాళ ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్పైనా నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి.దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...' అని గురజాడ అప్పారావు రాసిన కవితను ఆమె బడ్జెట్ ప్రసంగంలో చదివి వినిపించడం తెలిసిందే. రెండు దశాబ్దాల తర్వాత ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఊరట ఇవ్వడంతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్టులు పెడుతున్నారు. NO INCOME TAX UPTO RS 12 LAKH! pic.twitter.com/FunZJjyGvB— Arjun* (@mxtaverse) February 1, 2025 అంతేకాదు.. మధ్యతరగతి పాలిట లక్ష్మీదేవి అంటూ మీమ్స్తో సందడి చేస్తున్నారు. అయితే ఇది కేవలం మీమ్స్ దగ్గరే ఆగిపోలేదు. ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు.. మార్ఫింగ్ ఫొటోలతో మీమర్స్ చెలరేగిపోతున్నారు.How middle class is seeing @nsitharaman ji today. pic.twitter.com/PsrUDavoWj— Ankit Jain (@indiantweeter) February 1, 2025సబ్ కా వికాస్ లక్ష్యంగా.. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ అన్నారు. కానీ, బడ్జెట్ లెక్కలు పొంతన లేకుండా పోయాయి. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పాలిత రాష్ట్రం బీహార్కు భారీగా వరాలు కురిపించింది కేంద్రం. దీంతో సహజంగానే మిగతా ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. ఆమె తన ప్రసంగంలో పదే పదే బీహార్ పేరును ప్రస్తావించడమూ ‘ఆచార్య పాదఘట్టం’ తరహాలో నెట్టింట ట్రోలింగ్కు దారి తీసింది.Bihar supremacy Budget mein 💪#NirmalaSitharaman#Budget2025 pic.twitter.com/JlC39kuWWS— Raja Babu (@GaurangBhardwa1) February 1, 2025 Most repeated words. #Budget2025 pic.twitter.com/4pjtahNdks— Sagar (@sagarcasm) February 1, 2025ఇదిలా ఉంటే.. ఇవాళ్టి బడ్జెట్తో ఎనిమిదిసార్లు వరుసగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ దక్కించుకున్నారు. గంటా 17 నిమిషాలపాటు ఆమె ప్రసంగం కొనసాగింది. -
బడ్జెట్ 2025-26: రియల్ ఎస్టేట్కు బూస్ట్!
దేశంలో రియల్ఎస్టేట్ రంగానికి వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు స్థోమతను పెంచేలా రూ. 12 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్లతో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, హౌసింగ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెంచుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు."కొత్త పన్ను నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుంది. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రియల్ ఎస్టేట్కు తాజా బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించారో ఇప్పుడు చూద్దాం..నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి (SWAMIH ) ఫండ్-2ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్లో అదనంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కొత్త స్వామి ఫండ్ 2కి రూ.15,000 కోట్ల కేటాయింపును ప్రకటిచింది. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లలో ఇళ్లు కొనుగోలుచేసిన వేలాది మందికి ఉపశమనం కలగనుంది.స్వామి స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న 50,000 నివాస యూనిట్లు పూర్తికావడం, మరో 40,000 పైప్లైన్లో ఉండటం సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ గట్టి ప్రయత్నాన్ని తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు.అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ పరిమితిని ప్రస్తుత రూ. 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అద్దెపై వార్షిక టీడీఎస్ పరిమితిని రూ.2.40 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులు, భూస్వాములు కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం ఒకటి కాకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తులకు నిల్ వాల్యుయేషన్ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలమైన చర్య.పట్టణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ సామర్థ్యం పుంజుకుంటుందని, నగరాలు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారుతాయని నిపుణులు తెలిపారు.ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC)ను ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు సహాయపడే జాతీయ మార్గదర్శక ఫ్రేమ్వర్క్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పెరుగుతున్న దేశ ఆర్థిక ప్రభావం దృష్ట్యా ఈ చర్య బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై వంటి ప్రధాన మెట్రోలతో పాటు టైర్-II, టైర్-III నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ను పెంచుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
రక్షణ బడ్జెట్ రూ.6.81 లక్షల కోట్లు.. ఏం చేస్తారో తెలుసా..?
కేంద్ర బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి రూ.6,81,210 కోట్లు కేటాయించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ భద్రతా భూభాగంలో సాయుధ దళాలను ఆధునీకరించడానికి వ్యూహాత్మక నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. రక్షణ సామర్థ్యాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.రక్షణ బడ్జెట్లోని ముఖ్యాంశాలుమూలధన వ్యయం: రూ.1,92,387 కోట్లుమూలధన వ్యయంలో కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక హార్డ్వేర్లలో పెట్టుబడులు పెడుతారు. 2024-25లో మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లు కాగా, సవరించిన అంచనాలు రూ.1,59,500 కోట్లుగా ఉన్నాయి.రెవెన్యూ వ్యయం: రూ.4,88,822 కోట్లుఇందులో రోజువారీ నిర్వహణ ఖర్చులు, జీతాలు, పింఛన్లు ఉంటాయి. సైనిక పింఛన్లకు రూ.1,60,795 కోట్లు కేటాయించడం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పడుతోందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఆధునీకరణపై దృష్టిపెంచిన బడ్జెట్ కేటాయింపులు భారత సాయుధ దళాలలో ఆధునికీకరణ అవసరాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి. ఆపరేషనల్ సంసిద్ధతను పెంపొందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై పెట్టుబడి పెట్టనున్నారు. సైనిక స్థావరాలు, శిక్షణ సౌకర్యాలు, లాజిస్టిక్స్తో సహా రక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయి. పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్ధారించడానికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, విమానాలు, నౌకాదళ నౌకలను కొనుగోలు చేస్తారు. -
కేంద్ర బడ్జెట్లో వైఎస్ జగన్ మార్క్?!
ఏపీలో గత ఐదేళ్లపాటు ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగింది. ఎక్కడా అవినీతి, లంచం ప్రస్తావన లేకుండా.. పారదర్శకమైన వ్యవస్థలతో నేరుగా అర్హులకే మేలు కలిగింది. ఆ టైంలో జగన్ పాలనపై దేశవ్యాప్త చర్చ నడవడగా.. ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ ఆయన మార్క్ కనిపించడం విశేషం.ఈసారి బడ్జెట్లో వచ్చే ఐదేళ్లకుగానూ ‘‘పేద, యువత, అన్నదాత, మహిళల.. అభివృద్ధి, సంక్షేమం’’ మీద దృష్టిసారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటించుకున్నారు. అయితే ఈ అభివృద్ధి ఎలా ఉంటుందో సీఎంగా జగన్ తన పాలనలో చేసి చూపించారు. 👉వ్యవ‘సాయాని’కే తొలి ప్రాధాన్యమంటూ నిర్మలమ్మ ప్రసంగం పేర్కొంది. ఈక్రమంలో.. ప్రధాన మంత్రి ధాన్య కృషి యోజన కింద పంట ఉత్పత్తులను పెంచడంతోపాటు రైతులకు పలు రకాల సాయాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే క్రమంలో.. గోదాములను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించింది. ఇక.. జగన్ పాలనలో.. రైతు భరోసాతో పంట సాయం అందించడం, ఆర్బీకే సెంటర్లు.. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్ల అందజేత, ఒకవేళ పంట నష్టం జరిగినా సత్వర పరిహారం లాంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో వ్యవసాయంలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ తరహా సంక్షేమాన్ని అందించలేకపోవడం గమనార్హం. 👉వైద్య విద్యను విస్తరించే క్రమంలో 10,000 అదనపు సీట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అయితే.. దశాబ్దాల తర్వాత ఏపీలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైద్య విద్యను ప్రొత్సహించారు వైఎస్ జగన్. అలాగే.. ప్రజారోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ పరిధిని విసర్తించడం, ఇంటికే వైద్యంలో భాగంగా విలేజ్.. ఫ్యామిలీ క్లినిక్ల ఏర్పాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 👉దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. కానీ, జగన్ హయాంలో.. నాడు-నేడుతో స్కూళ్లు కళకళలాడాయి. డిజిటల్ క్లాస్ రూంలతో కార్పొరేట్ బడులకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దారాయన. అలాగే.. ఇంకోవైపు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలతో విద్యార్థులను చదువును దూరం కాకుండా చూసుకోగలిగారు. 👉మహిళా సాధికారత కోసం కేంద్రం తరఫున రకరకాల పథకాలను ప్రవేశపెడతామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అయితే పేద వర్గాలకు వైఎస్సార్ చేయూత, ఆసరా, ఇంకా వివిధ పథకాలతో జగన్ ప్రభుత్వం సాయం అందించింది తెలిసిందే. గ్రామ స్వరాజ్యం, ప్రజారోగ్యం, విద్యా రంగం, మహిళా సాధికారికత.. ఇలా దాదాపు కేంద్ర బడ్జెట్కు సంబంధించిన కీలక అంశాల్లో జగన్ మార్క్ స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
దులారి దేవి ‘గిఫ్ట్’తో నిర్మలా సీతారామన్ బడ్జెట్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ధరించే కేంద్ర బడ్జెట్ 2025-26ను శనివారం (ఫిబ్రవరి 1, 2025) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ధరించిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఏడు బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా సీతారామన్ తన చీరలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆఫ్-వైట్ చేనేత పట్టు చీరలో వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చీర ను పద్మశీ పురస్కారాన్ని అందుకున్న మధుబని కళాకారిణి దులారి దేవి బహుమతిగా అందించారట. భారతదేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయ కళాత్మకతకు అద్దం పట్టిన ఈ చీర, ఆర్టిస్ట్ దులారి దేవి గురించి తెలుసుకుందాం పదండి!ఉదయం 11:00 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించడానికి సిద్ధమవుతూ పార్లమెంటులో సంప్రదాయ చీరలో కనిపించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, శతాబ్దాల నాటి కళను గౌరవిస్తూ ఎంతో సంక్లిష్టమైన మధుబని కళాకృతులతో తీర్చిదిద్దిన చీర అది. ప్రధానంగా మిథిలా కళా సంప్రదాయంలో పనిచేసే దులారి దేవి, అణగారిన దళిత మల్లా కులంలో జన్మించారు. బీహార్లోని మధుబనిలోని మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఔట్రీచ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ను కలిసిన సందర్భంగా ఆమెకు ఈ చీరను బహూకరించారట. తాను ఎంతో కష్టపడి, జాగ్రత్తగా రూపొందించిన మధుబని ప్రింట్ చీరను నిర్మలా సీతారామన్కు అందజేసి బడ్జెట్ దినోత్సవం నాడు ధరించాలని దులారీ దేవి కోరారట. దీనిక మ్యాచింగ్గా ఎరుపు రంగు బ్లౌజ్ను ఎంచుకున్నారు.మధుబని కళబిహార్లోని మిథిలా ప్రాంతంలో మిథిలా పెయింటింగ్గా పేరొందిన కళ ఇది. ఇది సంక్లిష్టమైన రేఖాగణిత నమూనాలు, పూల మూలాంశాలు, ప్రకృతి, పురాణాల వర్ణనల ద్వారా దుస్తులను రూపొందిస్తారు. ఈ కళారూపం దాని శక్తివంతమైన రంగులు, సున్నితమైన గీతలు, ప్రతీకాత్మక వర్ణనలకు ప్రసిద్ధి చెందింది. భారతీయ కళాకారిణి , చిత్రకారిణి చిన్న వయసులోనే.. అంటే పదమూడేళ్ల వయసులోనే వివాహం జరిగింది. పెద్దగా చదువుకోలేదు కూడా. మధుబని కళాకారిణి మహాసుందరి దేవి ఇంట్లో గృహ సేవకురాలిగా పని చేస్తున్న సమయంలో దులారీ దేవి మధుబని కళను ఒంట పట్టించుకున్నారు. ఆ త రువాత మరో కళాకారిణి కర్పూరి దేవిని పరిచయంతో ఈ కళలోని మరిన్ని మెళకువలను నేర్చుకుని నైపుణ్యం సాధించారు. భర్తను కోల్పోవడం , గ్రామీణ జీవితంలోని కష్టాలు వంటి అనేక వ్యక్తిగత సవాళ్ల మధ్య మిథిలా ప్రాంతంలో ఈ కళతోనే జీవనోపాధి వెతుక్కున్నారు. తన కళను విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఈ కళలో ఆమె చేసిన కృషి, సేవలకు గాను 2021లో దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు వచ్చి వరించింది.మరోవైపు 2019లో మధ్యంతర బడ్జెట్ మొదలు, వరుసగా 2020, 2021, 2022, 2023, 2024 (ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఫిబ్రవరి 1), 2024 (మధ్యంతర బడ్జెట్, జులై 23) ఇలా వరుసగా 7 సార్లు నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇలా ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళామంత్రిగా రికార్డ్ సాధించారు. అంతేకాదు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. ,2019-20 బడ్జెట్లో భాగంగా 1372020-21లో 162 నిమిషాల పాటు ప్రసంగించిన ఆమె తాజా బడ్జెట్ ప్రసంగంలో 74 నిమిషాల పాటు ప్రసంగించడం విశేషం. -
నగల ధరలు తగ్గుతాయా..?
కేంద్ర బడ్జెట్ 2025లో ఆభరణాలపై కస్టమ్స్ సుంకాలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫిబ్రవరి 2, 2025 నుంచి ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని (ఐటమ్ కోడ్ 7113-విలువైన లోహం లేదా విలువైన లోహంతో కప్పబడిన ఆభరణాలు, భాగాలు) 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. అదనంగా ప్లాటినం ఆభరణాల తయారీలో ఉపయోగించే ప్రత్యేక వస్తువులపై సుంకాన్ని 25% నుంచి 5%కు తగ్గించారు.టారిఫ్ తగ్గింపు ప్రభావాలువినియోగదారులకు తక్కువ ధరలు: కస్టమ్స్ సుంకం తగ్గింపు వల్ల ఆభరణాల ధర తగ్గుతుందని, వినియోగదారులకు మరింత చౌకగా అవి లభిస్తాయని భావిస్తున్నారు. ఇది లగ్జరీ ఆభరణాల వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక సుంకాలు తరచుగా ధరలు పెరిగేందుకు దారితీస్తాయి.దేశీయ డిమాండ్కు ఊతంఆభరణాలు మరింత చౌకగా మారడంతో దేశీయ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది దేశీయంగా తయారయ్యే ఆభరణాల అమ్మకాల వృద్ధికి తోడ్పడుతుంది.తయారీదారులకు లాభదాయంప్లాటినం ఆభరణాల తయారీకి ఉపయోగించే వస్తువులపై సుంకాల తగ్గింపు వల్ల తయారీదారులకు పెట్టుబడి ఖర్చులు తగ్గినట్లవుతుంది. ఇది వారి లాభదాయకతను పెంచుతుంది. ఇది మొత్తం రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్మార్కెట్ స్పందనఈ ప్రకటన తర్వాత ఆభరణాల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇది ఈ రంగంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత సెంకో గోల్డ్, మోటిసన్స్ జ్యువెల్లర్స్, కళ్యాణ్ జువెలర్స్ వంటి కంపెనీలు తమ స్టాక్ ధరల్లో గణనీయమైన లాభాల్లో ట్రేడయ్యాయి. -
రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ చరిత్రాత్మకం: కిషన్రెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025-26పై కిషన్రెడ్డి స్పందించారు. ‘వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్ ఇది. వ్యక్తిగత ఇన్కమ్ట్యాక్స్ మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు ఆపన్నహస్తాన్ని అందించిన బడ్జెట్. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది. బడ్జెట్లో అన్ని సంక్షేమ పథకాలకు నిధులు పెంచడం అభినందనీయం’అని ప్రధాని మోదీ అన్నారు.దేశ గతినే మార్చే అద్బుతమైన బడ్జెట్: బండి సంజయ్పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్ ఇదిరూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకంతెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి ఏడాదికి రూ.80 వేల వరకు ఆదాగత 75 ఏళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా మధ్యతరగతికి అనుకూలమైన బడ్జెట్ ఇదితెలంగాణలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.5 లక్షదాకా రుణం పొందే అవకాశంకిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలి -
మౌలిక సదుపాయాలకు కేటాయింపులు.. దేనికి ఖర్చు చేస్తారంటే..
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు మూలధన వ్యయాన్ని (CAPEX) పెంచడంపై బడ్జెట్లో దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.11.21 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది రూ.11.11 లక్షల కోట్లతో పోలిస్తే 0.9% ఎక్కువ. అయితే, 2024-25 సంవత్సరానికి సవరించిన అంచనా రూ.10.18 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కొత్త కేటాయింపులు ప్రణాళికాబద్ధమైన పెట్టుబడుల్లో పెరుగుదల నమోదు చేశాయి.మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తాయి. ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో వేసిన అంచనా పద్దుల ప్రకారం కింది విభాగాల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది.ఎందుకోసం ఖర్చు చేస్తారంటే..లాజిస్టిక్స్, ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి రోడ్డు, రైలు, నౌకాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా స్మార్ట్ సిటీలు, పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతారు. సమాన అభివృద్ధి, మార్కెట్ల సౌలభ్య కోసం గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తారు. ప్రపంచం సుస్థిర భవిష్యత్తు దిశగా పయనిస్తున్న తరుణంలో ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులపై ఖర్చు చేస్తుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సౌర, పవన, జలవిద్యుత్ ప్రాజెక్టులను విస్తరిస్తుంది. మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేస్తుంది.డిజిటలైజేషన్ కోసం..సుస్థిర వ్యవసాయ, పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహిస్తుంది. డిజిటలైజేషన్పై, ఈ విభాగంలో వినూత్న విధానాల అమలుకు ఖర్చు చేస్తారు. డిజిటల్ వృద్ధికి తోడ్పడటానికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, 5జీ నెట్వర్క్లను పెంచేందుకు కృషి చేస్తారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ, పారదర్శకతను మెరుగుపరిచేందుకు ఈ-గవర్నెన్స్ ప్లాట్ఫామ్లపై ఇన్వెస్ట్ చేస్తారు. డిజిటల్ బెదిరింపుల నుంచి రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ సదుపాయాలను బలోపేతం చేస్తారు.హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఆసుపత్రులు, క్లినిక్లు, వైద్య పరిశోధన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. విద్యా నాణ్యతను పెంచడానికి పాఠశాలలు, కళాశాలలు, వృత్తి శిక్షణా కేంద్రాలపై పెట్టుబడి పెడుతారు. ఇన్నోవేషన్ను ప్రోత్సహించడానికి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఎంఎస్ఎంఈలపై..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. వృద్ధి, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈలకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు మూలధనాన్ని ఖర్చు చేస్తారు. ఎంఎస్ఎంఈలకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ హబ్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఉత్పాదకతను మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను అవలంబించడంలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వాలి. -
ప్రజల జేబులు నింపే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ:ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో శనివారం(ఫిబ్రవరి1) ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందన్నారు. బడ్జెట్పై శనివారం మధ్యాహ్నం మోదీ స్పందించారు.‘భారత్ అభివృద్ధి ప్రయాణంలో ఈరోజు అత్యంత ముఖ్యమైనది. ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు సంబంధించిన బడ్జెట్.ఈ బడ్జెట్ ప్రతీ భారతీయుడి కలను నెరవేరుస్తుంది. బడ్జెట్ ద్వారా అనేక రంగాల్లో యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాన్యులే వికసిత్ భారత్ మిషన్ను ముందుకు తీసుకువెళ్లేలా ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. సాధారణంగా ప్రభుత్వ ఖజానను ఎలా నింపాలన్నదానిపై బడ్జెట్ ఫోకస్ ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ సామాన్యుల జేబులు ఎలా నింపాలన్నదానిపై దృష్టి పెట్టి రూపొందించినది. ఈ బడ్జెట్తో దేశ పౌరులు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. తద్వారా వినియోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతుంది. అణు ఇంధన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరవడం లాంటి చర్యలు ఈ బడ్జెట్లో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణలు’అని ప్రధాని కొనియాడారు. కాగా, కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయ పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయించడంతో పాటు పాత విధానంలోనూ శ్లాబులు మార్చి పన్ను తగ్గించారు. దీంతో ఈ బడ్జెట్ ప్రజల చేతిలో మిగులు ధనం ఉండేందుకు దోహదం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. -
బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐలు
అధికమొత్తంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని 74% నుంచి 100%కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మార్పు చాలా బీమా రంగంలో అవసరమైన మూలధనం సమకూరుతుందని, పోటీని పెంచుతుందని, దేశవ్యాప్తంగా బీమా వ్యాప్తిని మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఈ చర్య 2047 నాటికి ‘అందరికీ బీమా’ అనే ప్రభుత్వ విజన్కు అనుగుణంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలు, షరతులను సమీక్షించి కేంద్రం వాటిని సరళీకృతం చేయనుంది. ఎఫ్డీఐ పరిమితిని పెంచడం వల్ల మరిన్ని గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆకర్షించడం, పోటీని పెంచడం, కొత్త మార్కెట్ను తీసుకురానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ సంస్కరణ బీమా సంస్థలు ఒకే విధానంతో తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి, కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడానికి అనుమతిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్.. వంటి ప్రధాన బీమా కంపెనీల షేర్లు ఈ ప్రకటన తర్వాత భారీగా లాభపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, వనరులను తీసుకువచ్చేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్కు దోహదం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఏపీకి గుండు సున్నా
-
‘నిర్మలమ్మ బడ్జెట్ ఓ పెద్ద జోక్’
ఢిల్లీ: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తమ ప్రయోజనాల కోసమే బీహార్కు వరాలు ఇచ్చిందన్నారు. బీహార్ కోసమే బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. హర్యానా రైతులకు కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదన్నారు. ఉద్యోగం, ఆదాయం గురించి కాదు.. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావనే లేదన్నారు.కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మనకు జీతం లేకపోతే ఏం జరుగుతుంది? ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఆదాయపు పన్ను ఉపశమనం నుండి ప్రయోజనం పొందాలంటే, మీకు నిజంగా ఉద్యోగాలు అవసరం. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు. మీకు జీతం ఉంటే మీరు తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు అనిపించవచ్చు. అలాగే, ఒక దేశం, ఒక ఎన్నిక కోరుకునే పార్టీ వాస్తవానికి ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎన్నికలను ఉపయోగించి మరిన్ని ఉచితాలను అందిస్తుందని చెప్పడం హాస్యాస్పదం.#WATCH | On #UnionBudget2025, Congress MP Shashi Tharoor says, "I think frankly the applause you heard from the BGP benches was for the middle-class tax cut. We look at the details and that may be a good thing. So if you have a salary you may be paying less tax. But the important… pic.twitter.com/vbOJHyMMMy— ANI (@ANI) February 1, 2025కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ..‘వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనే నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పని చేస్తాయన్నారు. కానీ, చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించింది’ అని ఎద్దేవా చేశారు.The FM spoke of 4 engines: Agriculture, MSMEs, Investment, and Exports. So many engines that the Budget has been completely derailed.— Jairam Ramesh (@Jairam_Ramesh) February 1, 2025కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ..‘రైతులకు కనీస మద్దతు ధర లభించలేదు. అణు విద్యుత్ గురించి మాట్లాడారు కానీ హర్యానాలో ఉన్న గోరఖ్పూర్లోని అణు విద్యుత్ కేంద్రం చాలా కాలంగా ఉంది. దీని గురించి మాట్లడలేదు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. MGNREGA వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఏమీ ప్రకటించలేదు. ప్రకటించినదంతా ప్రధానంగా బీహార్ గురించే ఉందన్నారు. #WATCH | #UnionBudget2025 | Congress MP Kumari Selja says, "Farmers didn't get MSP. They talked about nuclear but our nuclear power plant in Haryana's Gorakhpur (Gorakhpur Haryana Anu Vidyut Pariyojana) has been there for a long and both are happening there. Many such issues are… pic.twitter.com/fanSTExEzs— ANI (@ANI) February 1, 2025 -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!
యూనియన్ బడ్జెట్ 2025-26 లిథియం బ్యాటరీలు.. సంబంధిత రంగాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గణనీయమైన పన్ను మినహాయింపులను ప్రకటించింది. స్థానిక తయారీని మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పన్నులు తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుముఖం పడతాయి.కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, 12 ఇతర కీలకమైన ఖనిజాల వంటి అవసరమైన పదార్థాలపై కూడా కేంద్రం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) తొలగించింది. బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి పరికరాల తయారీకి ఈ పదార్థాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలకు, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ తయారీలో ఈ పదార్థాలపై ఆధారపడే పరిశ్రమలకు ఖర్చులను తగ్గిస్తుంది.ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల.. కంపెనీలు అదనపు పన్నులు లేకుండా బ్యాటరీ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను, సాధనాలను దిగుమతి చేసుకోవచ్చు. టాటా, ఓలా ఎలక్ట్రిక్, రిలయన్స్ వంటి కంపెనీలను భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కేంద్రప్రభుత్వ చర్య వల్ల.. ఈవీ బ్యాటరీలు కొంత తక్కువ ధరకే లభిస్తాయి. ఇది ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. దేశీయ తయారీని పెంచుతుంది. ఇది చైనా, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ క్లీన్ ఎనర్జీ వృద్ధికి.. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు సహాయపడుతుంది. -
టీడీఎస్లో మార్పులు.. అద్దె ఆదాయంపై భారీ ఊరట
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో టీడీఎస్కి కీలక మార్పులను ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు, ఇళ్లు, భవనాలపై అద్దె ఆదాయాన్ని పొందేవారికి భారీ ఊరట కల్పించారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచారు."ఇది టీడీఎస్ వర్తించే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా చిన్న చెల్లింపులను స్వీకరించే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది" అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రేట్ల సంఖ్యను తగ్గించడం, పరిమితి మొత్తాలను పెంచడం ద్వారా టీడీఎస్ ఫ్రేమ్వర్క్ను సరళీకృతం చేసే ప్రణాళికలను కూడా ఆమె వివరించారు.టీడీఎస్లో ప్రధాన మార్పులు ఇవే..సీనియర్ సిటిజన్లకు పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంపుఅద్దె ఆదాయంపై టీడీపీ పరిమితి వార్షికంగా రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు.లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద చెల్లింపులపై వసూలు చేసే టీసీఎస్ పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుపాన్ కార్డు లేని పన్ను చెల్లింపుదారులకు అధిక టీడీఎస్ నిబంధన వర్తిస్తుంది. విద్యా రుణాల చెల్లింపులపై టీసీఎస్ పూర్తీగా తొలగింపుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
ట్యాక్స్ పేయర్లకు కొత్త పన్ను శ్లాబులు ఇవే
-
బడ్జెట్లో ఏపీకి నిల్!
విజయవాడ, సాక్షి: ఎన్డీయే కూటమి సర్కార్లో టీడీపీ, జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. బిహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. వీలుచిక్కినప్పుడల్లా ఆర్థికంగా ప్యాకేజీలు ఇస్తూ వస్తోంది. అదే ఏపీ విషయంలో అటు ప్రత్యేక హోదా, ఇటు ప్యాకేజీ రెండూ ఇవ్వడం లేదు. కానీ, బాబు సర్కార్కు అప్పులిప్పించడంలో సాయం చేస్తోంది. ప్చ్.. ఇప్పుడు బడ్జెట్లోనూ ఇదే వివక్ష ప్రదర్శించింది. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్(Union Budget 2025) ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కానరాలేదు. పోనీ.. రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ పేరు ఉందా? అంటే అదీ లేదు. కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. సరికదా.. అమరావతి, మెట్రో రైల్.. లాంటి కీలకాంశాల గురించి ప్రస్తావించలేదు. టీడీపీ(TDP)కి ప్రస్తుతం 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ టీడీపీ గప్పాలు కొట్టుకుంటోంది. అలాంటిది ప్రత్యేక కేటాయింపులను సాధించడంలో ఇటు చంద్రబాబు, అటు బీజేపీకి దగ్గరైన పవన్ కల్యాణ్లు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిహార్ విషయంలో.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది. ఏపీకి మాత్రం అరకోర నిధులను పడేస్తోంది. -
రూ.50.65 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపంరెవెన్యూ వసూళ్లు రూ.34,20,409 కోట్లుపన్ను వసూళ్లు రూ.28,37,409 కోట్లుపన్నేతర వసూళ్లు రూ.5,83,000 కోట్లుమూలధన వసూళ్లు రూ.16,44,936 కోట్లురుణాల రికవరీ రూ.29,000 కోట్లుఇతర వసూళ్లు రూ.47,000 కోట్లుఅప్పులు, ఇతర వసూళ్లు రూ.15,68,936 కోట్లుమొత్తం ఆదాయం రూ.50,65,345 కోట్లుమొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లురెవెన్యూ ఖాతా రూ.39,44,255 కోట్లువడ్డీ చెల్లింపులు రూ.12,76,338 కోట్లుమూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,27,192 కోట్లుమూలధన ఖాతా రూ.11,21,090 కోట్లువాస్తవ మూలధన వ్యయం రూ.15,48,282 కోట్లురెవెన్యూ లోటు రూ.5,23,846 కోట్లునికర రెవెన్యూ లోటు రూ.96,654 కోట్లుద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లుప్రాథమిక లోటు రూ.2,92,598 కోట్లురూపాయి పోక..పెన్షన్లు 4 పైసలువడ్డీ చెల్లింపులు 20 పైసలుకేంద్ర పథకాలు 16 పైసలుప్రధాన సబ్సిడీలు 6 పైసలుడిఫెన్స్ 8 పైసలురాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు 22 పైసలుఫైనాన్స్ కమిషన్కు చెల్లింపులు 8 పైసలుకేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలుఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 8 పైసలుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్రూపాయి రాక...ఇన్కమ్ ట్యాక్స్ 22 పైసలుఎక్సైజ్ డ్యూటీ 5 పైసలుఅప్పులు, ఆస్తులు 24 పైసలుపన్నేతర ఆదాయం 9 పైసలుమూలధన రశీదులు 1 పైసలుకస్టమ్స్ ఆదాయం 4 పైసలుకార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలుజీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు -
ఉద్యోగులకు శుభవార్త.. రూ.12 లక్షల వరకు నో టాక్స్
-
Budget 2025-26: ధరలు తగ్గేవి ఇవే..
కేంద్ర బడ్జెట్ 2025-26లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పూర్తీగా మినహాయించింది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ (BCD) నుండి పూర్తిగా మినహాయించిన వస్తువుల జాబితాలో 36 ప్రాణ రక్షక మందులు, వెట్ బ్లూ లెదర్, లిథియం బ్యాటరీలు ఉన్నాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) వరుసగా ఎనిమిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ మినహాయింపులు ప్రకటించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుండి పూర్తిగా మినహాయించిన వస్తువులు ఇవే..ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 ముఖ్యాంశాలు36 ప్రాణ రక్షక ఔషధాలుఈవీల తయారీకి ఉపయోగించే 35 రకాల ముడిపదార్థాలువెట్ బ్లూ లెదర్లిథియం బ్యాటరీలు స్క్రాప్కోబాల్ట్ ఉత్పత్తులుఎల్ఈడీలుజింక్12 క్లిష్టమైన ఖనిజాలుచేపల పేస్ట్పై సుంకం 30% నుంచి 5%కి తగ్గింపు -
రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. పన్ను వ్యవస్థను సరళతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొత్త పన్ను విధానం ఆకర్షణీయమైన పన్ను రేట్లను అందిస్తుంది. వివిధ మినహాయింపులు, మినహాయింపుల అవసరాన్ని తొలగిస్తుందని చెప్పారు. ఇందులోని కీలక ఫీచర్లు ఇవే..కొత్త పన్ను విధానం ప్రకారం.. వార్షికంగా రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు విధిస్తారు. ఉదాహరణకు, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను ఉంది. కొత్త విధానం ప్రకారం రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర శ్లాబుల్లో కూడా మార్పులు ఉంటాయని నిర్మలమ్మ ప్రకటించారు. రూ.25 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.1.10 లక్షలు ఆదా అవుతుందని చెప్పారు.కొత్త పన్ను విధానంలో శ్లాబుల సవరణరూ.0-4 లక్షలు - సున్నారూ.4-8 లక్షలు - 5%రూ.8-12 లక్షలు - 10%రూ.12-16 లక్షలు - 15%రూ.16-20 లక్షలు - 20%రూ.20-24 లక్షలు - 25%రూ.24 లక్షల పైన 30 శాతంఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఈ కొత్త విధానం పన్ను సౌలభ్యాన్ని సులభతరం చేయడం, వాటిని మరింత క్రమబద్దీకరించడానికి తోడ్పడుతుందని కేంద్రమంత్రి సీతారామన్ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. పన్ను భారాన్ని తగ్గించడం, పన్ను ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుందని భావిస్తున్నారు. ఎలా లెక్కిస్తారంటే..నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. తాజా బడ్జెట్లో రిబేట్ను రూ.60 వేలుగా నిర్ణయించారు. ఇది ఇప్పటివరకు రూ.25,000గా ఉండేది. కాబట్టి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. అలాంటి వారు పైన పేర్కొన్న శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను వర్తించని ఆదాయం రూ.7 లక్షలుగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్స్ రూ.75 వేలు కలుపుకొని రూ.7.75 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని తాజాగా రూ.12.75 (ప్రామాణిక తగ్గింపు రూ.75వేలు, రిబేట్ కలిపి)కు సవరించారు. -
కేంద్ర బడ్జెట్.. బీహార్కు వరాలు!
ఢిల్లీ: పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వ్యూహత్మక అడుగులు వేసింది. బీహార్లో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. బీహార్ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా దేశంలో ఆహార ప్రాసెసింగ్ను ప్రోత్సహించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధిని కల్పిస్తుంది. అలాగే, బీహార్లో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.అంతేగాక మఖానాను పండించే రైతులకు సాంకేతిక సాయం, ఆర్థిక సాయం సైతం అందించనున్నారు. దీని ద్వారా మఖానా రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ దేశంలోనే మఖానా ఉత్పత్తిలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిని మరింత ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మఖానా పరిశ్రమకు ఊతమిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.🚨 Big boost for Bihar’s Makhana farmers! 🌿💰 FM Nirmala Sitharaman announces the setup of a Makhana Board in Bihar to enhance processing, marketing & farmer training. This will strengthen the Bihar Makhana industry, ensuring better value & global reach!#Makhana #BiharInfra pic.twitter.com/6sfaDR9m2t— Bihar Infra & Tech (@BiharInfra) February 1, 2025ఇది బీహార్కి నిజంగా చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. బీహారీలు చాలా ఏళ్లుగా మఖానాను పండిస్తున్నారు. ఇక, మఖానా అనగా ఇదొక రకమైన ఆహారం. ఇవి ఆకుల మాదిరిగా ఉండి గింజలాంటి నిర్మాణంలో ఉంటాయి. వీటిలో గింజల లాంటివి వస్తాయి. దేశంలో 90 శాతం మఖానాను బీహార్లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్తర బీహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. దీంతో ఆ ప్రాంతానికి మఖానా ప్రాంతం అపే పేరు కూడా వచ్చింది. బడ్జెట్లో చేసిన ఈ ప్రకటనతో ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మఖానాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం దాని ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని యోచిస్తోంది.బీహార్కు వరాలు ఇలా..బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్కు ఆర్థికసాయం.ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతాం.పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంఇందులో భాగంగానే బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.బీహార్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన. దీదీంతో ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనుంది. -
బడ్జెట్ 2025-26.. నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఆమెకు ఎనిమిదో బడ్జెట్, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడవ పర్యాయం ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్.బడ్జెట్ ప్రకటన కారణంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఫిబ్రవరి 1వ తేదీ శనివారం అయినప్పటికీ ఉదయం 9:15 గంటల నుండి ప్రారంభమయ్యాయి. సానుకూల అంచనాలతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాల్లోకి జారుకున్నాయి.మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పతనమయ్యాయి. మరోవైపు హెల్త్కేర్ ఇండెక్స్ మాత్రం లాభాల్లో చలిస్తోంది. -
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు
పన్ను సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2025 ప్రసంగంలో వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యాన్ని పెంచడానికి, పన్ను వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన నొక్కి చెబుతుందని కొందరు విశ్వసిస్తున్నారు.ఫేస్ లెస్ అసెస్ మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్, రిటర్నులను వేగంగా ప్రాసెస్ చేయడం వంటి కీలక అంశాలను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దాదాపు 99% రాబడులు ప్రస్తుతం స్వీయ మదింపు(సెల్ఫ్ అసెస్మెంట్)పై ఆధారపడి ఉన్నాయన్నారు. పన్ను విధానాలను ముందుగా కేంద్రం విశ్వసించిన తర్వాతే వాటి మార్పులను పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధానం పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టడం వల్ల పన్నుల వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని, పన్నుల నిర్మాణాన్ని సరళతరం చేయడపై దృష్టి పెడుతారని కొందరు భావిస్తున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులపై విస్తృత ప్రభావాలను చూపుతుందని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళుతుందని భావిస్తున్నారు. -
బడ్జెట్ 2025: గిగ్ వర్కర్లకు ఇక మంచిరోజులు
న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్యోగులకు(గిగ్ వర్కర్లకు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్(Union Budget 2025) ద్వారా వాళ్లకు గుర్తింపుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్స్కు లాభం చేకూరనుంది. ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే.. ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన(PM-JAY) కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాది ఐదు లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు. అలాగే గిగ్ వర్కర్ల సామాజిక భద్రత త్వరలో కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలనూ వర్తింపజేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారామె. గిగ్ వర్కర్లు అంటే..తాత్కాలికంగా.. తమకు ఉన్న వీలును బట్టి ఉద్యోగాలను చేసేవాళ్లను గిగ్ వర్కర్లు అంటారు. ప్రత్యేకించి.. యాప్ల ద్వారా సేవలందించే ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉన్నారు. డెలివరీ యాప్లు, రైడ్ యాప్లతో పని చేసే ఉద్యోగులతో పాటు ఫ్రీలాన్సర్లు, ఆన్లైన్ ట్యూటర్లు ఈ విభాగంలోకి వస్తారు. అయితే.. సంప్రదాయ ఉద్యోగులకు ఉన్నట్లు వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు. అది కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నా.. ఈ తరహా ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు ఇంతకాలం తీవ్రంగా భావించాలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు.. రాబోయే రోజుల్లో వాళ్లకు మంచి రోజులు వస్తాయనే సంకేతాలు అందించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. పది కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఆ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. కిందటి బడ్జెట్లో గిగ్ వర్కర్ల కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. అయితే ఈసారి బడ్జెట్లో కచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం గమనార్హం.