
విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ప్రయోజనాలు ఎంత ఉన్నా దాని విపరిణామాల పట్ల చాలా మందిలో ఆందోళన ఉంది. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన నుండి ఆర్థికాంశాలు, విద్య వరకు ఆర్థికంగా విలువైన చాలా పనులను ఆటోమేట్ చేయడం ద్వారా పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ఏఐ డెవలపర్లు హామీ ఇస్తున్నప్పటికీ, ఈ పురోగతి గణనీయమైన విపరిణామాలనూ తీసుకుతో రావచ్చని ఆర్థిక సర్వే 2024-2025 (Economic Survey 2024-2025) హెచ్చరిస్తోంది.
ఆర్థిక సర్వే 2024-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాజాగా పార్లమెంట్ ముందు సమర్పించారు. ఏఐ పురోగతి ముఖ్యంగా మధ్య, దిగువ ఆదాయ కార్మికులపై ప్రభావాన్ని చూపుతుందని, వివిధ రంగాలలో మానవ నిర్ణయాధికారాన్ని ఏఐ అధిగమించడం వలన పెద్ద ఎత్తున ఉపాధిలో మార్పులు సంభవిస్తాయని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది.
ఏమిటీ ఎకనామిక్ సర్వే?
ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలను సమీక్షించే ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్. ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై పనితీరు, విధానపరంగా సానుకూల మార్పులను సంగ్రహించి విశదీకరిస్తుంది. అలాగే స్వల్ప, మధ్య కాలానికి ఆర్థిక వ్యవస్థకు ఉన్న అవకాశాలను తెలియజేస్తుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా దీన్ని వెల్లడిస్తారు.
ఏఐపై ఆర్థిక సర్వే 2024-25 ఏం చెప్పిందంటే..
ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, నేర న్యాయం, విద్య, వ్యాపారం, ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ మానవ పనితీరును అధిగమించగలదని అంచనా ఉంది. ఇది పెద్ద ఎత్తున మధ్య, దిగువ ఆదాయ కార్మికుల ఉపాధిని ప్రభావితం చేస్తుంది.
మునుపటి పారిశ్రామిక, సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ప్రస్తుత ఏఐ స్వీకరణ ప్రతికూల ప్రభావాల భయాలు అంతగా కనిపించకపోవచ్చు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవా ఆధారితమైన నేపథ్యంలో చిన్న స్థాయి ఐటీ సేవల్లో పనిచేసే ఉద్యోగులకు ఆటోమేషన్ ముప్పు ఉంటుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి కార్మికులను తొలగించి సాంకేతికతతో భర్తీ చేస్తాయి.
ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సామూహిక సామాజిక ప్రయత్నం అవసరం. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల మధ్య సహకారం ద్వారా భారతదేశం బలమైన సంస్థల సృష్టిని వేగవంతం చేయాలి.
నైపుణ్య సంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉద్యోగులను ఏఐతో కలిసి పనిచేసేలా సన్నద్ధం చేయాలి.
ఏఐ ప్రస్తుతం శైశవదశలో ఉన్నందున దాని పునాదులను బలోపేతం చేయడానికి, దేశవ్యాప్త సంస్థాగత ప్రతిస్పందనను సమీకరించడానికి అవసరమైన సమయం దేశానికి లభించింది.
విస్తృత-వ్యాప్తి స్వీకరణను సాధించడానికి ముందు ఏఐ డెవలపర్లు అధిగమించాల్సిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత అనేది డెవలపర్లు పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు.
యువ, డైనమిక్, సాంకేతిక-అవగాహన ఉన్న జనాభాను పెంచడం ద్వారా పని, ఉత్పాదకతను పెంపొందించడానికి ఏఐని ఉపయోగించగల శ్రామిక శక్తిని సృష్టించగల సామర్థ్యాన్ని భారతదేశం కలిగి ఉంది.
కార్మిక శక్తి, సాంకేతికత సరైన మార్గంలో సమతుల్యం అయినప్పుడు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. పని భవిష్యత్తు శ్రామిక శక్తి, యంత్ర సామర్థ్యాలను ఏకీకృతం చేసే 'అగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్' చుట్టూ తిరుగుతుంది.
లేబర్ మార్కెట్లో ఏఐతో వచ్చే మార్పులు శాశ్వత ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉన్నందున విధాన నిర్ణేతలు ఆవిష్కరణలను సామాజిక వ్యయాలతో సమతుల్యం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment