
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేలను ప్రైవేటీకరించమని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా నూతన రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. గోయల్ శుక్రవారం లోక్సభలో మాట్లాడుతూ రైల్వేల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కొన్ని యూనిట్ల కార్పొరేటీకరణకూ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
గతంలో రైల్వే బడ్జెట్లలో రాజకీయ ప్రయోజనాల కోసం నూతన రైళ్లపై ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు గుప్పించేవారని మండిపడ్డారు. రాయ్బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో కాంగ్రెస్ హయాంలో ఉత్పత్తి ప్రారంభం కాలేదని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 ఆగస్ట్లో తొలి కోచ్ తయారైందని చెప్పుకొచ్చారు. విజేతలు లక్ష్యం దిశగా దూసుకుపోవడంపైనే దృష్టిసారిస్తారని, పరాజితులు కష్టాలను చూసి డీలాపడతారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment