
లక్నో: సుప్రీంకోర్టు కూడా మనదేనంటూ యూపీ మంత్రి ముకుత్ బిహారీ వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కార్యకర్తలతో జరిగిన ఓ సమావేశంలో.. మంత్రి ‘బీజేపీ అభివృద్ధి నినాదంతోనే అధికారంలోకి వచ్చింది. కానీ రామమందిర నిర్మాణం విషయంలో మాపై నమ్మకం ఉంది. మందిరాన్ని నిర్మించి తీరతాం. ఇందుకోసం మేం చిత్తశుద్ధితో ఉన్నాం. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉం ది. సుప్రీంకోర్టు, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు అన్నీ మనవే’ అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై దుమారం రేగటంతో మంత్రి వివరణ ఇచ్చుకున్నారు.
‘బాబ్రీ’ కేసులో నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో లక్నో ట్రయల్ కోర్టు జడ్జి నివేదికను కోరుతూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 1992 నాటి ఘటనలో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, ఉమా భారతి తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాలపై విచారణ జరుగుతోంది. ఈ వీవీఐపీల పాత్రను విచారిస్తున్న ఈ కోర్టు జడ్జి ఎస్కే యాదవ్.. తన విచారణను 2019 ఏప్రిల్లోగా ఎలా పూర్తిచేయాలనుకుంటున్నారో వివరిస్తూ సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను ఒక జడ్జే పూర్తిచేయాలని, రోజువారీ విచారణలు చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండేళ్లలోగా తుదితీర్పు ఇవ్వాలని ఏప్రిల్ 19, 2017న సుప్రీంకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment