ప్రధానికి సీమ రైతుల స్పెషల్ గిఫ్ట్స్
ప్రధానికి సీమ రైతుల స్పెషల్ గిఫ్ట్స్
Published Mon, Sep 18 2017 9:05 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఓవైపు నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 68వ పుట్టినరోజు జరుపుకున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుంచి పార్టీల కతీతంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేయటం చూశాం. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఆయనకు ఊహించని బహుమతులు అందాయి.
68 పైసలతో 400 చెక్కులు రాసి ఆయనకు కానుకగా పంపారు రాయలసీమ సాగునీటి సాధన సమితి(ఆర్ఎస్ఎస్ఎస్) సభ్యులు. దేశంలోనే థార్ ఎడారి తర్వాత అనంతపురం జిల్లా అత్యల్ప వర్షాపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకెక్కింది. అలాంటిది ఆ ప్రాంతంలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ఎస్ ప్రతినిధులు ఇలా వినూత్న నిరసన తెలియజేశారు.
‘రాయలసీమ నాలుగు జిల్లాలో సాగునీటి వసతిలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే. అయితే ఇక్కడ కేవలం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న కారణంతో కోస్తాంధ్రా అభివృద్ధిపైనే దృష్టిసారిస్తున్నారు. సాయం చేయాల్సిన కేంద్రం కూడా ఇక్కడి రైతులను పట్టించుకోవటం లేదు. అందుకే తమ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా నిరసనను తెలియజేశాం’ అని ఆర్ఎస్ఎస్ఎస్ అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Advertisement