
పీఎం కేర్స్కు భారీ విరాళం ప్రకటించిన ఆర్ఐఎల్
ముంబై : కరోనా వైరస్పై దేశం జరిపే పోరులో సాయపడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పీఎం కేర్స్ ఫండ్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) రూ 500 కోట్ల విరాళం ప్రకటించింది. పీఎం సహాయ నిధికి అందించే మొత్తానికి అదనంగా మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు రూ 5 కోట్ల చొప్పున విరాళాలను అందచేస్తామని ఆర్ఐఎల్ తెలిపింది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు 100 పడకలతో కోవిడ్-19 హాస్పిటల్ రెండు వారాల్లోనే సిద్ధమైందని, వైద్య సిబ్బంది రక్షణ కోసం పీపీఈ ప్రొటెక్టివ్స్ గేర్స్ను పంపిణీ చేస్తామని వెల్లడించింది. పది రోజుల్లో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది పేదలకు భోజనం సరఫరా చేయడంతో పాటు ప్రతిరోజూ లక్ష మాస్క్లను వైద్య సిబ్బంది, ఆరోగ్య సంరక్షకులకు సరఫరా చేస్తామని తెలిపింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు దేశవ్యాప్తంగా ఉచిత ఇంధనాన్ని సమకూరుస్తామని పేర్కొంది.