ఢిల్లీ: సమైక్య రాష్ట్రం కోసం కేంద్ర మంత్రులు పోరాడతామని హామి ఇచ్చినట్లు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సీమాంధ్ర మంత్రులతో ఏపీఎన్జీవోల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.ఆరు నెలల్లో పోయే పదవుల కోసం పట్టుకుని ఉండలేమని మంత్రులు తెలపారన్నారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఉద్యోగ సంఘాలతో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని అశోక్ బాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సేవ్ పేరుతో సెప్టెంబరు 7వ తేదీన తలపెట్టే సభకు కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు గురువారం న్యూఢిల్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులతో సమావేశమైయ్యారు. అనంతరం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎన్జీవోల సంఘం నాయకులు ప్రసంగించారు.
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు వ్యవహారిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే కేంద్రం తప్పక దిగివస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం వారు సమైక్య రాష్ట్రం కోసం గట్టి పోరాటం చేయాలని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు మాట్లాడటం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం నాయకులు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.