
నేడు బ్రెజిల్కు మోడీ
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు
ప్రపంచ స్థాయి నేతలతో తొలిసారిగా భేటీ
14, 15 తేదీల్లో ‘బ్రిక్స్’ సదస్సులు..
న్యూఢిల్లీ: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న ఐదు వర్ధమాన దేశాల కూటమి ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బ్రెజిల్కు వెళుతున్నారు. ‘బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా’లతో కూడిన ఈ కూటమి ఆరో సమావేశాలు 14, 15వ తేదీల్లో జరుగనున్నాయి. ఈ సదస్సులో ప్రత్యేక అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు, ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలపై చర్చించనున్నారు. తొలుత మోడీ ఆదివారం రాత్రి జర్మనీలోని బెర్లిన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి సోమవారం బ్రెజిల్లో సదస్సు జరుగనున్న ఫోర్టాలెజాకు వెళతారు. ఈ పర్యటనలో మోడీ వెంట కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ఉన్నతాధికారులతో కూడిన బృందం వెళుతోంది. అయితే మోడీ తొలుత బెర్లిన్లో జర్మనీ చాన్స్లర్ మెర్కెల్తో భేటీ కావాల్సి ఉంది. కానీ ఆమె ఫుట్బాల్ ప్రపంచకప్లో తమ దేశం ఫైనల్కు చేరుకోవడంతో.. ఆ మ్యాచ్ కోసం బ్రెజిల్ వెళుతుండడంతో భేటీ రద్దయింది.
సంస్కరణలే ప్రధానంగా.. ఈసారి ‘బ్రిక్’ సమావేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను డిమాండ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా చర్చలు జరుగనున్నాయి. దీనితోపాటు గత ఏడాది దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన ‘బ్రిక్స్’ సమావేశాల్లో ప్రతిపాదించిన పలు అంశాలపైనా చర్చిస్తారు. ముఖ్యంగా దాదాపు రూ. 5 లక్షల కోట్లతో ‘బ్రిక్స్’ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు, దీనికి సభ్య దేశాల్లో ఎవరెవరు ఎంత ఇవ్వాలి?, ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇంతేగాకుండా వాణిజ్యం, సహకారం తదితర అంశాలపై మంత్రుల స్థాయి చర్చలు.. వ్యాపారవేత్తలలో భేటీలు కూడా ఈ సదస్సులో జరుగనున్నాయి. సమావేశాల అనంతరం ఫొర్టాలెజా డిక్లరేషన్ను ప్రకటిస్తారు. కాగా ఈ సదస్సు అనంతరం ‘బ్రిక్స్’ దేశాల అధినేతలు అర్జెంటీనా, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, గయానా, పెరు, పరాగ్వే తదితర లాటిన్ అమెరికా దేశాల అధినేతలతో సమావేశం కానున్నారు.
ప్రపంచ స్థాయి నేతలతో తొలిసారిగా...ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ.. ఈ సదస్సు నేపథ్యంలో తొలిసారి ఎక్కువ మంది ప్రపంచ స్థాయి నేతలతో భేటీ కానున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ జుమా తదితరులతో భేటీ అవుతారు. .
మోడీకి అమెరికన్ కాంగ్రెస్లో పెరుగుతున్న మద్దతు
అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలని కోరుతున్న అక్కడి ప్రతినిధుల సభ (కాంగ్రెస్) సభ్యుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానం మేరకు మోడీ వచ్చే సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీని కాంగ్రెస్ ఉమ్మడి సమావేశానికి ఆహ్వానించాలంటూ ప్రతినిధుల సభ స్పీకర్కు 36 మంది సభ్యులు లేఖ రాశారు.