
ఎమ్మెల్సీలుగా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ)గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మతోపాటు మంత్రులు స్వతంత్రదేవ్ సింగ్, మోహసిన్ రజాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే ప్రకటించిన విషయం తెలిసిందే.
సోమవారం శాసనమండలి చైర్మన్ సీఎం యోగి, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, స్వతంత్రదేవ్ సింగ్, మోహసిన్ రజాలతో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. కాగా యూపీ మంత్రిమండలిలో ఏకైక ముస్లిం మంత్రిగా మోహసిన్ రజా కొనసాగుతున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం గోరఖ్పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్కు పార్టీ కేంద్ర అధిష్టానం సీఎం పదవిని అప్పగించింది. కొన్ని రోజుల తర్వాత యోగి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాగా, సీఎం యోగి ఏదైనా సభ (శాసన సభ, శాసన మండలి) లలో సభ్యులు కావాల్సిన నేపథ్యంలో మండలి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై నేడు మరికొందరు నేతలతో కలిసి యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు.