
చెన్నై: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా సంప్రదాయాలను ఉల్లంఘించలేమని హిందూ మహిళా భక్త సంఘాలు అంటున్నాయి. 50 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచిచూస్తామని, తర్వాతే ఆలయాన్ని దర్శిస్తామని సంఘాలు తేల్చాయి. చెన్నైలోని గంగాదీశ్వర ఆలయంలో శనివారం భారత్ హిందూ మున్నాని ఆధ్వర్యంలో ‘లైట్ల్యాంప్’ ప్రార్థనా సమావేశం జరిగింది. రుతుక్రమం ముగిసేదాకా(50 ఏళ్లు) శబరిమల ఆలయాన్ని సందర్శించమని ఈ సందర్భంగా మహిళా భక్తులు ప్రతినబూనారు. ‘కోర్టు తీర్పులు ఎలా వచ్చినా పురాతన సంప్రదాయాలను గౌరవిస్తాం. సంప్రదాయాలపై నమ్మకాన్ని చాటిచెప్పడానికే లైట్ల్యాంప్ ప్రార్థన నిర్వహించాం. విశ్వాసాల మేరకే శబరిమలను సందర్శించాలని మహిళా భక్తులు ప్రతినబూనారు’ అని హిందూ మక్కల్ కచ్చి చీఫ్ అర్జున్ సంపత్ చెప్పారు.