
సాక్షి, హైదరాబాద్ : చింతమడక గ్రామ ప్రజలకు ఇంటింటికీ రూ.10 లక్షలు ఇచ్చినట్లుగానే.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అదే తరహాలో ఇవ్వాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. ప్రజలందరినీ సమదృష్టితో చూస్తానని సీఎంగా మీరు ప్రమాణం చేశారు. అది మీకు గుర్తు చేస్తున్నాం. మీరందరినీ సమ దృష్టితో చూడటం లేదనే భావన ప్రజల్లో కలిగితే.. రాష్ట్రంలో అశాంతి పెరిగే అవకాశం ఉంది. ఈ స్కీమ్కు "చింతమడక స్కీమ్" అని పేరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. మీరు తక్షణం దీనిపై నిర్ణయం తీసుకోకపోతే.. అర్హులైన కుటుంబాలను కూడగట్టే పనిని చేపడతాం.
మీరు ఇస్తున్నది మీ సొంత సొమ్మేంకాదు. రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నదే. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మీడియా ఎడిటర్స్ తీసుకెళ్లాలనే కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు, డీపీఆర్లను.. ప్రతి శాసన సభ్యునికి చూసిస్తామన్న హామీని మీరు నిలబెట్టుకోవాలి. అప్పుల వివరాలను మీడియా ఎడిటర్స్కు చూపించాలి’అన్నారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఉనికి కోసమే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
నిర్వాసితుల గోడు వినాలి
‘కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లే మీడియా ఎడిటర్స్ ప్రాజెక్టు నిర్వాసితుల బాధల్ని కూడా వినాలి. భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేసిందో మీడియా గమనించాలి. అన్యాయంగా భూములు లాక్కున్నా ఏమీ చేయలేని నిస్సాహాయతలో ఉన్న నిర్వాసితుల గోడును ఎడిటర్స్ చూడాలి. ఈ ప్రాజెక్టు వల్ల కొత్తగా ఒక ఎకరం కూడా మా ప్రాంతంలో అదనంగా సాగులోకి రావడం లేదు. కాళేశ్వరం ముక్తేశ్వరం ఎత్తిపోతల పథకం ఎందుకు నత్తనడకన సాగుతోందో దృష్టి సారించాలి’
-కాంగ్రెస్ ఎమ్మెల్యే, శ్రీధర్బాబు
Comments
Please login to add a commentAdd a comment