తీజ్‌ పండుగ సాక్షిగా టీఆర్‌ఎస్‌ గ్రూపుల మధ్య లొల్లి | Disputes In TRS Activists | Sakshi
Sakshi News home page

తీజ్‌ పండుగ సాక్షిగా టీఆర్‌ఎస్‌ గ్రూపుల మధ్య లొల్లి

Jul 20 2018 2:28 PM | Updated on Apr 7 2019 4:37 PM

Disputes In TRS Activists  - Sakshi

దాడికి పాల్పడుతున్న గిరిజనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి 

నల్లబెల్లి వరంగల్‌ : మండలంలోని గుండ్లపహాడ్‌ శివారు బజ్జుతండాలో గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. వివరాల్లోకెళితే.. బజ్జుతండాలో లంబాడ గిరిజనులు తీజ్‌ పండుగను జరుపుకుంటుండగా తండాలోని యువతులు రెండు గ్రూపులుగా విడిపోయి జరుపుల సోమ్లా, జర్పుల కొమ్మాలు ఇంటి ఆవరణలో గోధుమనారు బుట్టలు ఏర్పాటుచేశారు.

ఈ పండుగకు గిరిజనులు సివిల్‌ సప్లయీస్‌ రాష్ట్ర చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఆహ్వానించారు. సుదర్శన్‌రెడ్డిని గుండ్లపాహాడ్‌ జాతీయ రహదారి నుంచి బజ్జుతండా వరకు గిరిజన యువతులు నృత్యాలు చేస్తూ ర్యాలీగా తీసుకెళ్లారు. జర్పుల సోమ్లా ఇంటి సమీపానికి రాగానే పెద్దికి స్వాగతం పలుకుతున్న సోమ్లా గ్రూపు వారిని కొమ్మలు గ్రూపునకు చెందిన వ్యక్తులు అడ్డుకుని ఒకరిపై ఒకరు వాగ్వివాదానికి దిగారు.

ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన వారిని దూషించగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొమ్మాలు గ్రూపు సభ్యులను వారించిన ‘పెద్ది’ సోమ్లా ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసిన గోదుమ బుట్టల వద్దకు వెళ్లి తీజ్‌ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం కొమ్మాలు ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసిన గోధుమ బుట్టల వద్దకు పెద్ది వెళ్తుండగా కొమ్మాలు గ్రూపునకు చెందిన వారు పెద్ది సుదర్శన్‌రెడ్డిని అడ్డుకున్నారు.

తీజ్‌ ఉత్సవాలను ప్రారంభించకుండా గోధుమనారు బుట్టలను తొలగించారు. మమ్ములను కాదని సోమ్లా ఇంటికి ఎలా పోతావని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గోదుమ నారు బుట్టలను పెద్ది సుదర్శన్‌రెడ్డిపైకి విసిరేస్తూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అనుకూలంగా కొమ్మాలు గ్రూపు సభ్యులు నినాదాలు చేశారు. వారిని సమన్వయం చేసేందుకు ప్రయత్నించినా ఎంతకు వినకపోవడంతో పెద్ది వెనుదిగారు.

విషయం తెలుసుకొన్న పోలీసులు బజ్జుతండాకు చేరుకొని ఎలాంటి అవాం?నీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో నల్లబెల్లి, నర్సంపేట ఎంపీపీ బానోత్‌ సారంగపాణి, బాదవత్‌ బద్రమ్మ, డాక్టర్‌ ఉదయ్‌సింగ్, నాయకులు జాటోత్‌లాలు, జాటోత్‌ తిరుపతి, జీవ్లా, తేజవత్‌ బద్రు, లావుడ్యా రాంసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement