
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల ఈడబ్ల్యూఎస్ పథకంలో కాపుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ పథకం దేశవ్యాప్త పథకం అయితే చంద్రబాబు అది కేవలం ఏపీకి మాత్రమేనన్న భ్రమలు కల్పించారని మండిపడ్డారు. ఈడబ్ల్యూఎస్పై చంద్రబాబు గతంలో తూతూమంత్రంగా జీవో జారీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు నిర్వాహకంతో ఈడబ్ల్యూఎస్ పథకంపై స్పష్టత లేక చాలా మంది విద్యార్థులు నష్టపోయారన్నారు.
ఈడబ్ల్యూఎస్పై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని కోరారు. కాపునాడు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ జీవోని యధాతదంగా అమలు చేయడం వల్ల అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు పదివేల సీట్లు పెరిగాయని చెప్పారు. దీంతో జనాభాశాతం ఎక్కువగా ఉన్న కాపు విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయని వివరించారు. తన రాజకీయ లబ్ధి కోసమే కాపులను చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఆరోపించారు.