
సాక్షి, విజయవాడ : కమ్యూనిస్టులు దొంగలంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వామపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వామపక్ష నేతలను దూషించిన ఎంపీ జేసీ ఒక మానసిక రోగి అని దుయ్యబట్టారు. జేసీ వెంటనే కమ్యూనిస్టులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘జేసీ కన్న పెద్ద దొంగ రాష్ట్రంలో మరొకరు లేరు. ఒక బస్సుకు పర్మిషన్ తీసుకొని నాలుగు బస్సులు నడుపుతున్న దొంగ జేసీ. బినామీల పేరుతో వందల ఎకరాల భూములు కాజేసి సిమెంట్ ఘనుడు జేసీ’ అని వామపక్ష నేతలు విరుచుకుపడ్డారు.
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను వెధవలు అన్న జేసీ.. మరీ వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ఏమవుతారో చెప్పాలని ప్రశ్నించారు. వామపక్ష నేతలు ఎక్కడ దొంగతనం చేశారో జేసీ చెప్పాలని నిలదీశారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి అని, ఆయన కల్లు తగిన కోతి లాంటి వాడు అని మండిపడ్డారు. జేసీ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై కేసులు పెడతామని హెచ్చరించారు.
తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎందుకూ పనికిరాని వెధవలంటూ తిట్టిపోసిన ఆయన.. కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి వెళ్లకముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయంతో ఉండేవాడిననీ, కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలుసుకున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment