
సాక్షి, తాడేపల్లి : ‘విలువలు కలిగిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన నాయకత్వం చూసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. వైఎస్ జగన్ చిటికెస్తే చంద్రబాబుకుప్రతిపక్ష హోదా కూడా గల్లంతే. ఫిరాయింపులను ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడే. 23మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. చంద్రబాబు.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సొంతంగా పార్టీ పెడితే డిపాజిట్లు కూడా వచ్చేయి కావు’ అని పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పప్పుతోనే టీడీపీలో సంక్షోభం..
మంత్రి కొడాలి నాని శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘టీడీపీలో పోటీ చేయొద్దని దేవినేని అవినాష్కు ముందే చెప్పా. చంద్రబాబు కసాయిలాంటివాడు...మోసం చేస్తాడని చెప్పా. నాపై ఓడిపోతాడని తెలిసినా అవినాష్ను గుడివాడలో నిలబెట్టారు. అవినాష్ ఓడిపోయాక చంద్రబాబు అతడిని పురుగులా చూశాడు. టీడీపీని నారా లోకేష్ రోడ్డు రోలర్లా తొక్కేస్తున్నాడు. అతడి వల్లే టీడీపీలో సంక్షోభం ఏర్పడింది. అందుకే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. వల్లభనేని వంశీ టీడీపీని వదిలేస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ను చంద్రబాబు ఎందుకు వదిలారో చెప్పాలి. మరి కేసులకు భయపడి ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు.
పవన్ డ్రామాలు ఆపితే మంచిది
కులాల గురించి ఎక్కువగా మాట్లాడేది పవన్ కల్యాణే. ఆయన ఇక డ్రామాలు ఆపితే మంచిది. కులాలు, మతాలపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించామని ఆరోపిస్తున్నారు. వరదలున్నప్పుడు ఇసుక ఎవరైనా తీయగలుగుతారా?. ఇసుక కొరతకు సిమెంట్ రేట్లకు సంబంధం ఏంటి. ఇక మీ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. పేదల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా?’ అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలను మంత్రి కొడాలి నాని ఘాటూగా తిప్పికొట్టారు.