
న్యూఢిల్లీ: హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతుండగా.. మోదీ వెళ్లాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ‘ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న కార్యక్రమానికి హాజరవ్వడం ద్వారా నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని చులకన చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ప్రధానికి విదేశీయులు, విదేశీ రేటింగ్ ఏజెన్సీల సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తన పాలనపై సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన గుజరాత్ ప్రజలను అడగాలి’ అని ఆనంద్శర్మ అన్నారు. జీఈఎస్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని తప్పుబడుతూ ఆనంద్ శర్మ చేసిన విమర్శలపై నెటిజన్లు తప్పుబడుతున్నారు.