
సాక్షి, కొత్తగూడెం: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొత్తగూడెంలో ఆయన అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడకుండా.. తన రాజకీయ యాత్రకు సంయమనంగా సహకరించాలని ఆయన కోరారు. ‘కొత్తగూడంలో చాలా సమస్యలున్నాయి. పోడు భూములు, రైల్వే లైన్, మైనింగ్ వర్సిటీ, పర్యావరణం వంటి సమస్యలున్నాయి. సమస్యలపై సమరం కంటే వాటిపై అధ్యయనానికే ప్రాధాన్యతనిస్తా. నిపుణులతో చర్చించి వాటి పరిష్కార మార్గాలు చూపుతా. కొత్తగూడెంలో మైనింగ్ పరిశ్రమ, మెడికల్ కాలేజీ రావాల్సిన అవసరముంది’ అని పవన్ అన్నారు.
క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న శ్రీజ అనే బాలిక పవన్ కల్యాణ్ను కలిసింది. శ్రీజ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సమయంలో పవన్ ఆమెను పరామర్శించి.. ఓదార్చారు. శ్రీజ ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కొత్తగూడెంలో పర్యటన అనంతరం పవన్ ఖమ్మం బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment