
షిమ్లా : ఐదేళ్ల విరామం తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బీజేపీకి సీఎం ఎంపిక తలనొప్పిగా మారింది. సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓడిపోవటంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కాబోయే సీఎంగా ఆరెస్సెస్ నేపథ్యమున్న జైరామ్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది.
కొత్త సీఎంను ఎవరనేది తేల్చేందుకు బీజేపీ అధిష్టాన దూతలుగా వచ్చిన కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్ శుక్రవారం ఆరెస్సెస్ పెద్దలతో, బీజేపీ కోర్ గ్రూప్ మెంబర్స్తో షిమ్లాలో సమావేశమైన సంగతి తెలిసిందే. వీరి సమావేశం జరుగుతుండగానే.. ధుమాల్ అనుచరులు, ఠాకూర్ అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. పరిస్థితి శ్రుతిమించటంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే కేంద్ర మంత్రులు సమావేశాన్ని ముగించి తిరిగి వెళ్లారు. హిమాచల్ బీజేపీ, ఆరెస్సెస్ నేతలతో జరిపిన చర్చల వివరాలను కేంద్రమంత్రులు అధిష్ఠానానికి నివేదించనున్నారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో సీఎం ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment