
సాక్షి, విజయనగరం : విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీడీపీ ఆవిర్బావ సభ సందర్భంగా ఫిరాయింపు మంత్రి సుజయకృష్ణ రంగారావు సొంత నియోజకవర్గం బొబ్బిలి లో టిడిపి పాత కార్యకర్తలకు, మంత్రి అనుచరులకు నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీలో పాతికేళ్లగా ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. సీనియర్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు మంత్రిని నిలదీశారు.
సమావేశాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని.... పనులు కూడా తమవర్గం వారికే ఇచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా మంత్రి సుజయకృష్ణ రంగారావు అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు చొక్కాలు చింపుకున్నారు. దీంతో సమావేశం కాసేపు రసాభాసగా మారింది.