
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వర్గం రెచ్చిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... కోటబొమ్మాళి మండల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై గురువారం ఉదయం టీడీపీ నేత బోయిన రమేష్ ఆధ్వర్యంలో దాడి చేశారు. ముందుగా పార్టీ కార్యాలయంలోకి దూసుకు వెళ్లి... ఫర్నిచర్తో పాటు కొన్ని ఫైల్స్ ధ్వంసం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు వైఎస్సార్ కార్యకర్తలపై కర్రలు, ఐరన్ రాడ్లుతో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా రక్తం వచ్చేలా కొట్టారు. ఈ దాడిలో సుమారు 120మంది పాల్గొన్నట్లు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి శ్యామలరావు ’సాక్షి’కి వివరించారు.
కాగా దాడి జరిగిన ప్రాంతానికి ...కేవలం అయిదు వందల మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. అయితే ఇప్పటివరకూ ఈ సంఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అంతేకాకుండా దాడి చేసుకునేందుకే మీరంతా ఇక్కడ ఉన్నారా అంటూ సీఐ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. అంతేకాకుండా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడి చేశారని అన్నారు.
దాడిలో గాయపడ్డ కార్యకర్తలు :
- నేతింటి నగేష్
- బోయిన నాగేశ్వరరావు
- అన్నెపు రామారావు
- బుబ్బ వెంకటరావు
- కొర్ల ఆదినారాయణ
- పాతుల శ్యామలరావు
Comments
Please login to add a commentAdd a comment