
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరుపుల
తూర్పుగోదావరి, ఏలేశ్వరం, (ప్రత్తిపాడు): ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ తనదేనని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని లింగంపర్తి గ్రామంలో తన ఇంటివద్ద మంగళవారం నియోజకవర్గ టీడీపీ, తనవర్గం నేతలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ డీసీసీబీ చైర్మన్, తన మనువడు వరుపుల రాజాకు ఇచ్చినట్టుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో రావడంతో ఎమ్మెల్యే ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవంతోపాటు 13 ఏళ్లుగా అనేక పదవులు చేసిన తనకు గానీ, గత 36 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తున్న పర్వత కుటుంబానికి గానీ అధిష్ఠానం టిక్కెట్ ఇస్తుందన్నారు. ఇద్దరిలో ఎవరికి ఇవ్వకపోయినా వేరే అభ్యర్థిని గెలిపించే ప్రశ్నేలేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వరుపుల రాజా తనను మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. టిక్కెట్ విషయంలో చంద్రబాబుపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, ఎంపీపీ అయిల సత్యవతి, గొంతిన సురేష్, రొంగల సూర్యారావు, వాసిరెడ్డి భాస్కరబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment