
క్యామ మల్లేష్ వర్సెస్ మల్రెడ్డి రంగారెడ్డి
హైదరాబాద్ : గత ఎన్నికల్లో ఓడిపోయేవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్లే..కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..రంగారెడ్డి జిల్లా పీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఇబ్రహీంపట్నం టిక్కెట్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెంది గాంధీ భవన్కు వచ్చారని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ఇలాంటి వాళ్లే కారణమన్నారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారని, మల్లేష్ మాత్రం టిక్కెట్ వచిన్నట్టుగా అబద్దపు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.
గెలిచే వారికి టిక్కెట్ ఇవ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి ఆర్ కుంతియాను కలిసి చెప్పామని అన్నారు. ఇది కేవలం మనవి మాత్రమేనని స్పష్టం చేశారు. పీసీసీ దృష్టికి కార్యకర్తల మనోభావాలు తీసుకు వచ్చామని తెలిపారు. క్యామ మల్లేష్కు ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇవ్వడం వల్ల భువనగిరి పార్లమెంటు సీటు ఓడిపోయామని, తమకే గనక ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇచ్చి ఉంటే..భువనగిరి పార్లమెంటు గెలిచే వాళ్లమని జోస్యం చెప్పారు. క్యామమల్లేశ్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బదనాం చేస్తున్నాడని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment