
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘విశాఖలో మహానేత వైఎస్సార్ చేసిన అభివృద్ధి నీకు కనబడలేదా..? చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడని అయ్యన్నకు తెలియదా.. విమ్స్ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బాబు ఏం చేశారో అయ్యన్నకు తెలియదా.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే..ఈ ప్రాంత వ్యక్తిగా వ్యతిరేకించడం అన్యాయం కాదా.. కమర్షియల్ శాఖ ట్రిబ్యునల్ కోర్టును వైఎస్సార్ విశాఖలో ఏర్పాటు చేస్తే విజయవాడ తరలించినప్పుడు అయ్యన్న ఎందుకు అడ్డుపడలేదు’ అంటూ వీరభద్రరావు నిప్పులు చెరిగారు. విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రిపై అయ్యన్న ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.