
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్ధసారథి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగు ఏళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే సాధిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అనుభవజ్ఞుడని అధికారమిస్తే రాష్ట్రాన్ని అంపశయ్య పై పడుకోబెట్టారని విమర్శించారు. ఎప్పుడెప్పుడు బాబుని సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. అధికారులపై దాడులు, దౌర్జన్యాలు చేసిన టీడీపీ నేతలపై ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని విదేశాలకి తాకట్టు పెట్టే ఆయన జన్మభూమి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
హోదా కంటే ప్యాకేజీ కోసం పాకులాడింది వాస్తవం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అబద్దాలు చెప్పారో నిరూపించగలరా? చంద్రబాబుకి కనీస విలువలు ఉన్నాయా? అని నిలదీశారు. ధర్మపోరాటం, నవనిర్మాణ దీక్షల పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా దొరికితే కుట్రలు, కుతంత్రాలు అంటారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని.. గాలి జనార్ధన్ రెడ్డి గురించి ఆయనకు ఇప్పుడే తెలిసిందా అన్నారు. చంద్రబాబు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్ధసారథి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment