
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన జరిగిన హత్యాయత్నం కేసు నిరూపించడానికి అవసరమైతే న్యాయ పోరటానికి దిగుతామంటున్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడి మీద జరిగిన హత్యాయత్నం కేసులో చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు విచారణకు సహకరించకపోతే వారిపైన కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు.
పోలీసులు విచారణకు సహకరించాలని ఎన్ఐఏ చట్టంలో సెక్షన్ 9 స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ఎన్ఐఏను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ఐఏ విచారణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే దానిపైన పోరాడాల్సిన బాధ్యత కూడా ఎన్ఐఏదేనని తెలిపారు. ఎన్ఐఏ విచారణకు సహకరించని అధికారులపై ఐపీసీ 166 సెక్షన్ ప్రకారం కోర్టులో రిట్ దాఖలు చేస్తామన్నారు.