
సాక్షి, విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్యాకేజీ తీసుకొని నారా లోకేష్పై పోటీ చేయకుండా మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా టీడీపీ.. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో సర్వేల పేరిట కోడ్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. తెలంగాణకు చెందిన కొంతమంది విద్యార్థులతో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సర్వేలు చేయిస్తున్నారని తెలిపారు. సర్వేలు చేస్తున్నవారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పామన్నారు. అధికారపార్టీ ఆగడాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబు అక్రమ మార్గంలో గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కోడ్ను ఉల్లంఘిస్తూ.. సెల్ఫోన్లు, బైకులు పంచుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్కు బదులు చంద్రబాబు పోటీచేయాలని సవాల్ విసిరారు. మనిషి చనిపోతే పరవశించి పోయే నాయకుడు లోకేషని విమర్శించారు. పోలీసులు పారదర్శకంగా ఉండాలని, కానీ డీజీపీ.. పార్కు అక్రమించారని కోర్టుకు వెళ్లానని తనపై కక్ష కట్టారన్నారు. ఇంటిలిజెన్స్ అధికారి ఏవీ వెంకటేశ్వరరావు.. టీడీపీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. భూములు కాజేసేందుకే మంగళగిరికి లోకేష్ వచ్చారని, అప్రజాస్వామికంగా కుల ప్రాతిపాదికన ఓట్లు చేర్చారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ను టీడీపీ మేనేజ్ చేసిందని, భూములు తీసుకుంటే ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్.. ఏమి చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment