
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. ఈ మెగా క్రీడల్లో భారత్కు పురుషుల సింగిల్స్లో ఒకే ఒక్కసారి 1982 ఏషియాడ్లో సయ్యద్ మోదీ కాంస్య పతకాన్ని అందించాడు. ఈసారి జకార్తాలో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్లలో ఒకరు ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతారని ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరూ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టడం గమనార్హం. ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–23, 19–21తో 28వ ర్యాంకర్ వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోగా... మరో మ్యాచ్లో 11వ ర్యాంకర్ ప్రణయ్ 12–21, 21–15, 15–21తో 18వ ర్యాంకర్ వాంగ్చరొన్ కంటాఫోన్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు.
క్వార్టర్స్లో సిక్కి రెడ్డి–అశ్విని జంట
మరోవైపు మహిళల డబుల్స్లో తెలంగాణ క్రీడాకారిణి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్లో సిక్కి– అశ్విని జోడీ 21–17, 16–21, 21–19తో మీ కున్ చౌ–మెంగ్ యెన్లీ (మలేసియా) ద్వయంపై గెలిచింది. 1986 తర్వాత భారత తరఫున మహిళల డబుల్స్ జోడీ ఏషియాడ్లో క్వార్టర్స్కు చేరడం ఇదే ప్రథమం.