
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు తొలి ఓవర్ను మెయిడిన్తో ఆరంభించింది. ఢిల్లీ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థి జట్టులో స్టార్ ఆటగాడు క్రిస్ లిన్ స్టైకింగ్ ఎండ్లో ఉన్నప్పటికీ పరుగును కూడా సాధించలేకపోయాడు. స్వింగ్, ఫుల్ లెంగ్త్, ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ లెంగ్త్ బాల్స్తో పాటు స్లో బంతులను సంధించడంతో లిన్ కనీసం పరుగు కూడా తీయలేకపోయాడు. దాంతో ఢిల్లీకి మెయిడిన్తో శుభారంభం లభించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఇదే తొలి మెయిడిన్ ఓవర్గా నిలిచింది. మరొకవైపు బౌల్ట్ తొలి పది బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా వికెట్ తీయడం మరో విశేషం. మొదటి ఓవర్ను మెయిడిన్గా వేసిన బౌల్ట్..మూడో ఓవర్లో నాలుగు బంతుల్లో పరుగులు ఇవ్వలేదు. ఆ ఓవర్ నాల్గో బంతికి నరైన్ను అవుట్ చేశాడు.
ఈ సీజన్లో తన తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయంతో బోణి కొట్టిన కోల్కతా జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో మ్యాచ్ని చేజార్చుకున్న కోల్కతా.. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ అదే రీతిలో పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు టోర్నీ ఆరంభంలో పంజాబ్, రాజస్థాన్తో ఆడిన మ్యాచ్ల్లో ఓడినా.. ఇటీవల ముంబయి ఇండియన్స్పై గెలిచి ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంచితే, ఈ స్టేడియంలో ఇరు జట్లు మధ్య ఏడు మ్యాచ్లు జరగ్గా, అందులో ఆరు మ్యాచ్లో కేకేఆర్ గెలిచింది. ఒకదాంట్లో ఢిల్లీని విజయం వరించింది.
Comments
Please login to add a commentAdd a comment