
న్యూఢిల్లీ: తాను టెస్టు ఫార్మాట్లో నెలకొల్పిన 400 పరుగుల రికార్డు ఏదో ఒక రోజు బ్రేక్ అవడం ఖాయమని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత తరంలో పలువురు క్రికెటర్లు దూకుడుగా ఆడుతుండటంతో పాటు నిలకడగా ఆడుతున్న కారణంగా తన రికార్డు బద్ధలు కొడతారన్నాడు. తన రికార్డును బ్రేక్ చేసే వారిలో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందన్నాడు. ఇక ఆసీస్ నుంచి డేవిడ్ వార్నర్కు తన రికార్డును బద్ధలు కొట్టే సత్తా ఉందన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తన రికార్డును వారి పేరిట లిఖించుకోవడానికి ఎంతో సమయం పట్టదన్నాడు. వీరిలో వార్నర్, రోహిత్లు ఓపెనర్లే కాకుండాహిట్టర్లు కూడా కావడంతో వారు క్రీజ్లో సుదీర్ఘ సమయం నిలదొక్కుకుంటే తన రికార్డును సునాయాసంగానే బద్ధలు కొడతారన్నాడు. కోహ్లి ఎక్కువగా ఫస్ట్ డౌన్లో రావడంతో అతనికి కూడా చాన్స్ ఉందన్నాడు. కాకపోతే స్టీవ్ స్మిత్కు మాత్రం తన రికార్డును బ్రేక్ చేయడం సాధ్యం కాకపోవచ్చన్నాడు. అతను నాల్గో స్థానంలో బ్యాటింగ్ వచ్చే కారణంగా 400 పరుగుల్ని చేరుకోవడం కష్టమన్నాడు.
2004లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో లారా 400 వ్యక్తిగత పరుగులు చేశాడు. ఇదే టెస్టుల్లో నేటికీ అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ రికార్డుకు మాథ్యూ హేడెన్ ఒకానొక సమయంలో దగ్గరగా వచ్చినప్పటికీ దాన్ని అందుకోలేకపోయాడు. ఇటీవల డేవిడ్ వార్నర్ ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఆసీస్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేయడంతో అది సాధ్యం కాలేదు. ఇక ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్కప్ ఫేవరెట్లలో టీమిండియానే ముందు వరుసలో ఉంటుందన్నాడు. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టుకు టీ20 వరల్డ్కప్ను గెలిచే అవకాశం ఉంద్నాడు. వరల్డ్కప్తోనే భారత్కు స్వదేశానికి తిరుగి వస్తుందని ధీమాగా చెప్పాడు. ప్రస్తుత భారత జట్టులో ప్రతీ ఒక్కరూ తమ తమ టార్గెట్లు ఏమిటో తెలుసుకుని జట్టును పటిష్టం చేశారన్నాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ వంటి మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్లకు భారత్ ఎదురుపడితే అది అవతలి జట్టుకు సవాలే అవుతుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment