
మెక్ కల్లమ్ విధ్వంసం: కివీస్ ఘనవిజయం
క్రిస్ట్ చర్చ్: శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రాండెన్ మెక్ కల్లమ్ తన బ్యాట్ తో మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతులను ఎదుర్కొన్న మెక్ కలమ్ మూడు సిక్స్ లు, ఆరు ఫోర్లతో 51 పరుగులు చేసి కివీస్ కు సునాయాస విజయం అందించాడు.
శ్రీలంక విసిరిన 219 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. మెక్ కల్లమ్ దూకుడుగా ఆడి రన్ రేట్ ను ముందుకు తీసుకెళితే.. కోరె అండర్సన్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో 43 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న కివీస్ మూడు వికెట్ల తేడాతో లంకేయులపై జయభేరీ మోగించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 218 పరుగులు చేసింది. మహేలా జయవర్ధనే(104) పరుగులు చేసి లంక గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలుపంచుకున్నాడు.