
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయిన కారణంగా అప్పట్లో తన స్థానాన్ని ఎంఎస్ ధోనికి కోల్పోయినట్లు పార్థీవ్ పటేల్ వెల్లడించాడు. ధోని కంటే ముందే భారత జట్టు తరఫున వికెట్ కీపర్లుగా ఆడిన పార్థీవ్ పటేల్, దినేశ్ కార్తీక్ ఆ తర్వాత దాదాపు దశాబ్దకాలం మళ్లీ జట్టు దరిదాపుల్లోకి రాలేకపోయారు. వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ తన మార్క్ కీపింగ్, బ్యాటింగ్తో ధోని ప్రత్యేకతను చాటుకోవడంతో భారత సెలక్టర్లు మరో వికెట్ కీపర్ గురించి ఆలోచించే అవసరమే లేకపోయింది.
కానీ.. 2014లో టెస్టులకి ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ తర్వాత టీమిండియాలోకి వృద్ధిమాన్ సాహా, పార్థీవ్ పటేల్, దినేశ్ కార్తీక్ల పునరాగమనానికి మార్గం సుగుమమైంది. తాము మెరుగ్గా ఆడలేకపోవడంతోనే ధోని వైపు సెలక్టర్లు మొగ్గు చూపారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.
'నాతో చాలా మంది చెప్తుంటారు.. ధోని పుట్టిన తరంలో పుట్టడం నా దురదృష్టమని. కానీ.. ధోని కంటే ముందే నేను భారత జట్టులో ఆడాను. అక్కడ నేను బాగా ఆడింటే.. ధోనిని జట్టులోకి తీసుకొచ్చేవారు కాదు కదా.? కాబట్టి నేను ఆ మాటల్ని పట్టించుకోలేదు. జట్టులో చోటు కోల్పోవడానికి కారణంగా అత్యుత్తమంగా ఆడలేకపోవడమే. నా ఈ స్థితికి ఒకరిని విమర్శించడం కంటే ధోనీ తరంలో పుట్టడం నా పొరపాటు అని సర్దిచెప్పుకోవడం బాగుంటుంది. ధోని ఓ లెజెండ్ అనడంలో ఎటువంటి సందేహం లేదని పార్థీవ్ పటేల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment