ఆటో ఎల్పీజీ ధరను పెంచినందుకు నిరసనగా నగరంలో శనివారం ఆటో డ్రైవర్లు చేపట్టిన ‘రాజ్ భవన్ ఛలో’ ఆందోళన వల్ల పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆటో ఎల్పీజీ ధరను పెంచినందుకు నిరసనగా నగరంలో శనివారం ఆటో డ్రైవర్లు చేపట్టిన ‘రాజ్ భవన్ ఛలో’ ఆందోళన వల్ల పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. మెజిస్టిక్ చుట్టుపక్కల రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆటో ఎల్పీజీ ధరను తగ్గించడంతో పాటు వ్యాట్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు సిటీ రైల్వే స్టేషన్ ముందు భాగం నుంచి రాజ్ భవన్ వరకు ఊరేగింపును చేపట్టారు. ఫ్రీడం పార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వేల ఆటోలు ఎక్కడబడితే అక్కడ నిలిచిపోయాయి.
ఆటో డ్రైవర్లు ఫ్రీడం పార్కు వద్దనే సమావేశమై తమ డిమాండ్లను ఏకరువు పెట్టారు. ఇదే సందర్భంలో లక్ష్మీ నారాయణ అనే డ్రైవర్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, సహచరులు వెంటనే అతనిని కేసీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సత్వరమే సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని డ్రైవర్లు హెచ్చరించారు.