రంగంలోకి ప్రత్యేక విచారణ బృందం | Moulivakkam incident special investigation team | Sakshi
Sakshi News home page

రంగంలోకి ప్రత్యేక విచారణ బృందం

Published Sun, Jul 6 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

రంగంలోకి ప్రత్యేక విచారణ బృందం

రంగంలోకి ప్రత్యేక విచారణ బృందం

 సాక్షి, చెన్నై : మౌళివాకం ఘటన విచారణకు ప్రత్యేక బృందం(సిట్) రంగంలోకి దిగనుంది. చెన్నై మహానగర పోలీసు కమిషనర్ జార్జ్ పర్యవేక్షణలో ఓ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఈ బృందం విచారణ వేగవంతం చేయనుంది. ఈ వ్యవహారం కొందరు సీఎండీఏ అధికారుల మెడకు బిగుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మౌళివాకంలో బహుళ అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అత్యధిక మంది ఈ ఘటనలో దుర్మరణం చెందారు. ఈ ఘట నను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరో వైపు ఈ కేసు విచారణ వేగవంతం చేయడానికి ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను రంగంలోకి దించింది. ఆదివారం ఇందుకు సంబంధించిన ఆదేశాల్ని సీఎం జయలలిత జారీ చేశారు.
 
 మౌళివాకం ఘటనకు సంబంధించి మాంగా డు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కేసులో ఆ భవన యజమాని, ఆర్కిటెక్ట్, ఇంజనీర్లు అరెస్టు అయ్యారని వివరించారు. విచారణను వేగవంతం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించుతున్నామని ప్రకటించారు. చెన్నై మహానగర పోలీసు కమిషనర్ జార్జ్ పర్యవేక్షణలో ఓ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఈ బృందం విచారణ వేగవంతం చేస్తుందన్నారు. నిర్మాణ రంగంలోని సాంకేతిక అంశాలు, అనుమతుల పరంగా పరిశీలన, నిబంధనల గురించి ఈ విచారణ బృందానికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. చెన్నై ఐఐటీ,అన్నా వర్సిటీ నిపుణులు ఈ బృందానికి సహకారంగా ఉంటారని, సాంకేతిక ఆలోచనలు, విధానాలను ఆ నిపుణులు ఎప్పటికప్పుడు  బృందానికి అందించనున్నారని ప్రకటించారు.
 
 అధికారుల మెడకు ఉచ్చు :
 మౌళివాకం ఘటన పలువురు సీఎండీఏ అధికారుల మెడకు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ బృందానికి సర్వాధికారాల్ని సీఎం జయలలిత ఇచ్చారు. అలాగే, సాంకేతిక అంశాలు, అనుమతుల పరంగా, నిబంధనల పరంగా అవగాహన చేసుకోనున్న దృష్ట్యా, అధికారుల చేతివాటం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసు పరిధిలోకి మాంగాడు పోలీసులు ఆర్కిటెక్ట్, స్ట్రక్చర్ ఇంజనీర్లను ఏ విధంగా చేర్చారో అదే తరహాలో సీఎండీఏ అధికారుల పేర్లను చేర్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించి రెవెన్యూ అనుమతులు, కుండ్రత్తూరు పంచాయతీ అధికారులు ఇచ్చిన అనుమతులను ఈ బృందం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.  సీఎండీఏలో అనుమతుల, అంచనాల విభాగం అధికారులు, ప్రధాన సభ్యుడు ఒకరు సైతం భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చిన ధృవీకరణ పత్రాల్లో సంతకాలు చేసి ఉన్న దృష్ట్యా, వీరందర్నీ విచారణ బృందం ప్రశ్నించే అవకాశాలున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement