
హైదరాబాద్,సాక్షి: శంషాబాద్ ఎయిర్పోర్టులో రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యేందుకు దుబాయ్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, విజయవాడకు తరలిస్తున్నారు.
అంతకుముందు రాజ్ కేసిరెడ్డి ఆడియో విడుదల
మంగళవారం సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి ఓ ఆడియోని విడుదల చేశారు. అందులో ‘నేను రేపు(మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నాను. రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు సిట్ ఆఫీసుకు వస్తానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చాను. నా ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉంది. కాబట్టి సిట్ విచారణకు హజరవుతున్నాను’ అని పేర్కొన్నారు.
రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై
రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రాజ్ కేసిరెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కేసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా’ అని గత ఆడియోలో పేర్కొన్నారు రాజ్ కేసిరెడ్డి.
