
మీ త్యాగాలు మర్చిపోం: వైఎస్ జగన్
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసాయిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో బుధవారం పోలవరం నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. పోలవరం కోసం భూములు ఇచ్చిన రైతులు, గిరిజనులకు న్యాయం జరిగేలా చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి తీసుకున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ప్యాకేజీ ఇచ్చి స్థానికుల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రతి కుటుంబంలో చదువుకున్న వారికి ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే కనీసం రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
8 లక్షల ఎకరాలపై గిరిజనులకు మహానేత వైఎస్సార్ హక్కులు కల్పిస్తే, చంద్రబాబు ఒక్క ఎకరా ఇవ్వకపోగా భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ‘పోలవరం కావాలి, నిర్వాసితులకు న్యాయం’ జరగాలని నినదించారు. నిర్వాసితులు త్యాగాలు మర్చిపోమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు 19 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని వైఎస్ జగన్ హామీయిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులను జగన్ మాట్లాడించారు.
కిశోర్ సత్యనారాయణ
పోలవరం కారణంగా సర్వస్వం కోల్పోతున్నాం
సరైన జవాబుదారితనం లేకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
మాకు అన్నివిధాలా నష్టం చేశారు
దేవిపట్నం మండలంలో 6 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి
మాకు 15 ఎకరాల భూమి ఉంది
రూ. 2 లక్షల 8 వేల చొప్పున 2012లో పరిహారం ఇచ్చారు.
ఈ డబ్బుతో సెంటు భూమి కొనలేని పరిస్థితి
భూమికి భూమి ఇస్తామని ఇవ్వలేదు
డబ్బులు తీసుకోనివి 2500 ఎకరాలు ఉన్నాయి
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని అడుగుతున్నాం
చల్లన్న దొర(గిరిజనుడు)
మాకు 15 ఎకరాల పొలం ఉంది
ఒక్కొక్కరికి ఒక్కో మాదిరిగా ధరలు ఇచ్చి మా మధ్య గొడవలు పెడుతున్నారు
గతంలో తక్కువ ధరలు ఇచ్చారు, ఇప్పుడు ఎక్కువ ధరకు భూములు తీసుకుంటున్నారు
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మాకు పరిహారం ఇవ్వాలి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రేటు, తూర్పుగోదావరి జిల్లాలో మరో రేటుకు భూములు తీసుకుంటున్నారు
అందరికీ ఒకేవిధంగా న్యాయం చేయాలి
ఆరండల్ పేట వాసి
అందరి ఆమోదంతో పోలవరం కట్టండి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం
20 ఏళ్ల పాటు మా జీవనోపాధికి ప్రభుత్వం హామీయివ్వాలి
నిర్వాసితుల కుటుంబంలో చదువుకున్న వారికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలి
పట్టిసీమ నిర్వాసితులకు ఇచ్చినట్టుగా పరిహారం కల్పించాలి
6 పంచాయతీలు ముంపు ఎదుర్కొంటున్నాయి
మిగిలిన 8 పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు