
నేనున్నా.. పోయినా మీ గజ్జె ఆగొద్దు
హైదరాబాద్ సిటీ: 'కళాకారులే నా వారసులు. 60 ఏళ్ల నా జీవితం పండింది. తెలంగాణ రావాలనుకుంటే వచ్చింది. నేను ఉన్నా పోయినా తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి తీరాలు చేరేదాకా మీరు ఆడాలెపాడాలే.. మీ గజ్జె ఆగొద్దు.. గొంతు ఆగొద్దు. కళాకారులకు ఈ సారథి ఉద్యోగం చిన్న సత్కారమే. కళాకారులు నా బిడ్డలు' అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. సాంస్కృతిక సారథులుగా ఎంపికైన 531 మంది కళాకారుల సమ్మేళనాన్ని హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో గల సాంస్కృతిక సారథి కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రారంభించారు. 'బంగారు తెలంగాణ కోసం ఇప్పుడు మళ్లీ మీరు కష్టపడాలె. పేదరికాన్ని పారదోలేందుకు సాంస్కృతిక కళాకారులే మేధోపరమైన చైతన్యం తీసుకురావాలి. కళాకారుల పనిదినాలు, కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఎక్కడ ఉండాలనే విషయాన్ని త్వరలోనే చెబుతాం' అపని కేసీఆర్ తెలిపారు.