
తెలంగాణలో కాంగ్రెస్ స్థానం లేదని, కాంగ్రెస్కు ఉన్న అవలక్షణాలన్నీ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు.
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ స్థానం లేదని, కాంగ్రెస్కు ఉన్న అవలక్షణాలన్నీ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమన్నారు. ఈ రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం, దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఎంఐఎం పార్టీ రజాకార్ల వారసత్వ సంస్థ అని, టెర్రరిస్టులకు రక్షణ కవచమన్నారు. ముస్లిం మహిళలకు ఎంఐఎం చేసిందేమి లేదన్నారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ట్రిపుల్ తలాక్పై పార్లమెంట్లో బిల్లు పెడుతున్నామన్నారు. విభజన చట్టంలోని ప్రతి హామీని నెరవేరుస్తామని.. ఉమ్మడి హైకోర్టును విభజన చేయాలని డిమాండ్ చేశారు.
మరో వైపు గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ముక్త భారత నినాదంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. కర్ణాటక ఒక్క రాష్ట్రమే కాంగ్రెస్ ఆధీనంలో ఉందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లోకర్ణాటకను సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వారసత్వ, కుల, మతతత్వ రాజకీయాలకు అంతం పలికేందుకు బీజీపీ నడుం బిగించిదని స్పష్టం చేశారు.