
'ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ విఫలం'
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో బుధవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు.
ఒక్క వరంగల్ జిల్లాలోనే సుమారు 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రాష్ట్రంలో రైతాంగం ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు పరిచిన పథకాల్లో కొన్ని ఇప్పటికీ కొనసాగుతండడం వల్లే ప్రజలకు ఊరట కలుగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కేసీఆర్ విఫలం చెందారని జగన్ అన్నారు. కాగా, జగన్ రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాశీబుగ్గ, అలంకార్ థియేటర్, పోచమ్మ మైదానం, ధర్మారం, ములుగు క్రాస్రోడ్డు, హన్మకొండ చౌరస్తా మీదుగా జగన్ పర్యటిన కొనసాగింది. దారి పొడవునా వ్యాపారులు, యువకులు, కూలీలతో వైఎస్ జగన్ ముచ్చటించారు. సాయంత్రం 6.30 గంటలకు హయగ్రీవాచారి మైదానంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.