పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, అంకితభావంతో పనిచేస్తే తప్పకుండా గుర్తింపు లభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
త్వరలో జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి
సంగారెడ్డి క్రైం : పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, అంకితభావంతో పనిచేస్తే తప్పకుండా గుర్తింపు లభిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో శుక్రవారం వైఎస్సార్సీపీ మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో పొంగులేటి ప్రసంగిస్తూ మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతానికి, పటిష్టానికి కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి జిల్లాలోని అన్ని మండల, పట్టణ, గ్రామ, బూత్ కమిటీలను వెంటనే వేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి మంచి భవిష్యత్ ఉందని, కార్యకర్తలు నిరుత్సాహానికి గురికాకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలన్నారు. జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక త్వరలో నిర్వహిస్తామని తెలిపారు.
మహానేత ఆశయ సాధనకు కృషి
తరతరాలు గుర్తుంచుకొనేలా సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని పొంగులేటి కొనియాడారు.
ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు పేదలకు కొత్త జీవితాన్నిచ్చాయన్నారు. ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివకుమార్, మతీన్, నల్లా సూర్యప్రకాష్, శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట్ర అధ్యక్షుడు నర్రా బిక్షపతి, శ్రీధర్రెడ్డి, సంజీవరావు, జగదీష్, మల్లయ్య, చంద్రశేఖర్, క్రిష్టఫర్, యాదుల్లా, సంజీవరెడ్డి, డాక్టర్ దండెపు బస్వానందం తదితరులు పాల్గొన్నారు.