రైతులకు భరోసా కల్పించే దిశలో చర్యలను ప్రకటించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని 9 వామపక్షాలు హెచ్చరించాయి.
ప్రభుత్వానికి వామపక్షాల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా రూ. 5 లక్షల చొప్పున పరిహారం, రైతులకు భరోసా కల్పించే దిశలో చర్యలను ప్రకటించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని 9 వామపక్షాలు హెచ్చరించాయి. శుక్రవారం ఎంబీభవన్లో ఫార్వర్ట్బ్లాక్ నేత బండా సురేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఎస్యుసీఐ-సీ, ఎంసీపీఐ-యూ, న్యూడెమోక్రసీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్-లిబరేషన్) పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయినా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని వారు ధ్వజమెత్తారు. 26న మరోసారి భేటీ అయి కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. కాగా.. పత్రికల్లో 500 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చోటుచేసున్నట్టు వెల్లడైందని, ప్రభుత్వానికి దమ్ముంటే వాటిలో ఏవి నిజమైనవి, ఏవి ఇతర కారణాలతో జరిగాయన్న దానిపై ప్రకటన చేయాలని తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు.