
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం అంటారని, అదే రాచరిక పాలనలో ప్రతిపక్షం ఉండదని అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని శాడిజం పొందుతున్నారని, ఏదో ఒక రోజు ఓవర్లోడ్ అయి టీఆర్ఎస్ పడవ మునిగిపోతుందని ఆరోపించారు. టీఆర్ఎస్లో 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా..కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ తప్పు చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. టీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతి తీరని లోటు అని, ఆయన మృతిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment