TRS Party
-
కేటీఆర్ డ్రగ్ టెస్ట్ సవాల్పై బండి సంజయ్ కౌంటర్
సాక్షి, కరీంనగర్: మంత్రి కేటీఆర్ సవాల్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ వేశారు. తాము సవాల్ చేసింది ఎప్పుడు? మీరు స్పందించింది ఎప్పుడని ప్రశ్నించారు. దొంగలుపడ్డ ఆరు నెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకని మండిపడ్డారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు చికిత్స చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు దొరకననే ధీమాతోనే కేటీఆర్ స్పందించారని విమర్శించారు. డ్రగ్స్ కోసం తన రక్తం, కిడ్నీ కూడా ఇస్తానని, క్లీన్ చీట్తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్ వద్ద తన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా అని కేటీఆర్ మంగళవారం సంజయ్కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.. కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ.. గతంలో ఎప్పుడో చేసిన సవాల్కు ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని విమర్శించారు. అన్ని టెస్టులకు ప్రిపేర్ అయి ఇప్పుడు రెడీ అంటున్నాడని అన్నారు. తాను తాంబాకు తింటున్నట్లు కేటీఆర్ ప్రచారం చేస్తున్నాడని, తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తనకు ఆ అలవాటే లేదని, తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలియదని కేటీఆర్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసింది. మీ భాష చూసి నవ్వుకున్నాం. మేము సంస్కారంగా పెరిగినం మీకు అది లేక ఇలా మాట్లాడుతున్నారు. మీ చెల్లి లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లే. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేశారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చు. ’ అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. చదవండి: ‘రాజగోపాల్ అన్న .. తొందర పడకు.. మాట జారకు..’ కవిత కౌంటర్ -
Malla Reddy: ఆది నుంచి వివాదాస్పదమే!.. తాజాగా మరోవివాదంలో..
సాక్షి, మేడ్చల్జిల్లా: మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్లో ఆది నుంచి వివాదస్పద ఎమ్మెల్యేగా వార్తల్లోకి ఎక్కటం చర్చనీయాంశంగా మారుతోంది. విపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా పలు విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా జిల్లాకు చెందిన ఐదుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మరో వివాదంలో చిక్కుకున్నారు. ►జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో సొంత నియోజకవర్గమైన మేడ్చల్కు పెద్దపీట వేస్తూ మిగతా నియోజకవర్గాలను విస్మరిస్తున్నారనేది సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రధాన ఆరోపణ. అలాగే పార్టీలో జిల్లా అధ్యక్షుడితో కలిసి గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీ పరువును బజారుకు ఈడ్చుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ►జయాపజయాలు ఏదైనా కాని తత్తరపాటు వ్యవహారంతో వివాదాల వరకు తొంగి చూసి.. అదే రీతిలో సమర్థించుకోవటంలోనూ మంత్రి మల్లారెడ్డి దిట్ట. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకోవటం మొదలుకొని మంత్రి పదవిని సాధించటం వరకు ఆయన వేసిన వ్యూహాలు ఫలించాయి. ►స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మొదలుకొని సహకార సంఘాలు, మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రి పలు వివాదాలకు నెలవయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు.. కొన్ని పురపాలక సంఘాల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పలు పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచ్ అభ్యర్థుల ఖరారు వరకు పలు వివాదాలను మంత్రి మల్లారెడ్డి అధిగమించారు. టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలను సైతం మంత్రి సొంత పార్టీతో సహా విపక్షాల నుంచి మూట గట్టుకున్నారు. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇటీవల తన విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగినప్పుడు కొత్త వివాదంలో చిక్కున్న మంత్రి ఏ విధంగా బయట పడతారని భావిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో మంత్రి మల్లారెడ్డి పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు. నామినేటెట్ పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శలు ఎదర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తాడోపెడో తెల్చుకుంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించటం వివాదాస్పదంగా మారింది. భూ వివాదాల్లోనూ... అలాగే జిల్లాలో పలు భూ వివాదాల్లో కూడా మంత్రి పలు ఆరోపణలను మూటగట్టుకుని వివాదంలో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో మంత్రి అయ్యాక మేడ్చల్, జవహర్నగర్, శామీర్పేట, ఘట్కేసర్, బోడుప్పల్, పీర్జాదిగూడ సహా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ఊళ్లలోనూ భూముల కొనుగోళ్లలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. వివాదాల నడుమ ఉన్న భూములను గుర్తించి, ఇరు వర్గాలను ఒప్పించి ఆయా స్థలాలను తనకు విక్రయించేలా చేయడంలో సిద్ధహస్తుడనే పేరు ఆయనకు ఉంది. మూడు చింతలపల్లి పరిధిలో ఈ తరహాలో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
టీఆర్ఎస్లో వారసుల హవా: మా వాడు వస్తున్నాడు.. దీవించండి!
సీనియర్ రాజకీయ నాయకులు చాలా మంది తమ వారసుల అరంగేట్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత.. తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహ రచన చేశారు. దాన్ని అమలు చేస్తున్నారు కూడా. తన కుమారుడి గురించి నలుగురు చర్చించుకునే విధంగా స్లోగా తెరమీదకు తెస్తున్నారు. ఏదోవిధంగా గులాబీ బాస్ దృష్టిలో తన కుమారుడు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. మా వాడు వస్తున్నాడు.. దీవించండి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా కొనసాగారు. ఎంతో సీనియర్ అయినప్పటికీ ఆయన రాష్ట్రంలో మంత్రి కాలేకపోయారు. ఆ కోరిక అలాగే మిగిలిపోవడం సుఖేందర్రెడ్డిని తొలచివేస్తోందట. అలాగే తన కుమారుడు అమిత్రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా ఆయన కోరికల్లో మరొకటి. ఉమ్మడి జిల్లా నుంచి జగదీష్రెడ్డి మంత్రిగా ఉన్నందున మరో రెడ్డి సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశంలేదు. భవిష్యత్లో కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనిపించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొడుకునన్నా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి చట్టసభలోకి పంపించాలని గుత్తా ప్లాన్ చేస్తున్నారు. కొంచెం గుర్తు పెట్టుకోండి. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి వీలు దొరికినప్పుడల్లా కొడుకు రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రస్తావన తీసుకువస్తున్నారట. దీని ద్వారా అమిత్ పేరుపై జనాల్లో చర్చ జరగాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. జిల్లాలో ఏదో ఒక నియోజవకర్గం నుంచి అమిత్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని గుత్తా చూస్తున్నారట. అయితే అది అంత సులువుగా నెరవేరే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆరే ప్రకటించారు. మరోవైపు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్కు అవకాశం ఎలా వస్తుంది? ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తెలియాలి. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం రాకపోతే నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి అయినా పోటీ చేయించాలని సుఖేందర్ రెడ్డి అనుకుంటున్నారట. ఎలాగూ గతంలో తాను ఎంపీగా పనిచేసిన స్థానం కావడంతో తనకున్న పరిచయాలు ఉపయోగపడతాయని లెక్కలు వేస్తున్నారట. మేమూ పోటీలో ఉన్నాం అయితే నల్లగొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే నేతల లిస్ట్ కూడా టీఆర్ఎస్లో పెద్దగానే ఉందట. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డితో పాటు మరో పారిశ్రామికవేత్త, మొదటి నుంచి పార్టీలో ఉంటున్న ఓ మాజీ ఎంపీ కుమారుడితో పాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న మరో నేత కూడా టికెట్ కావాలని కోరుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్కు అవకాశం వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడిగా పెరిగిన అమిత్ ప్రజల్లోకి రాకపోవడం మైనస్గా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తాను పదవిలో ఉన్నప్పుడే కొడుకు రాజకీయ భవిష్యత్కు బాటలు వేయాలని గుత్తా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలో గుత్తా విఫలం అయితే మాత్రం.. అది అమిత్ రాజకీయ భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ భవిష్యత్ కోసం, వారసుల రాజకీయ భవిష్యత్ కోసం చాలా మంది కలలు కంటారు. కాని కొందరికీ కలలు వాస్తవ రూపంలో నెరవేరతాయి. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడిని చట్టసభకు పంపాలన్నా కల నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘తండ్రిపై కేటీఆర్ అలిగారు.. అందుకే ఢిల్లీ వెళ్లలేదు: రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం ఇచ్చారు. దానికి కౌంటరుగా అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని విమర్శించాం. ఎందుకంటే కేసీఆర్కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటి. ఆయన కుటుంబానికి లిక్కర్కు అవినాభావ సంబంధం ఉంది. మద్యంతోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించారని ఎద్దేవా చేశారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె కవితపై ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కాదు. నేను స్వయంగా ఆరోపిస్తున్న కేసీఆర్కి మరోసారి అధికారం ఇస్తే ఢిల్లీ లేదా తెలంగాణలో లిక్కర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్పై ప్రభుత్వ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36 వేల కోట్లకు పెరిగింది. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారు. అందుకే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తోంది. కేసీఆర్ అవినీతిపై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒకరికొకరు సహకరించుకున్నారు. నాణానికి బొమ్మా, బొరుసులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి. వారి నాటకాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణలో బీహార్ రాష్ట్ర సమితిగా మార్చాలనుకుంటున్నారా?. తెలంగాణలో మోదీ మోడల్ పాలనను కేసీఆర్ తీసుకురావాలనుకుంటున్నారా?. నరేంద్ర మోదీ విధానం ఐస్(ఇన్కంటాక్స్, సీబీఐ, ఈడీ), నైస్ (నార్కోటిక్స్, ఇన్కం టాక్స్, సీబీఐ, ఈడీ). తెలంగాణలో ఐస్, నైస్ మోడల్ చెల్లదు. ఈ రోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అవినీతిపరుడైన కేసీఆర్కు సహకరించవద్దని కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ ను కోరుతున్నా’’ అని రేవంత్ అన్నారు. చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు! ‘‘కేసీఆర్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను కూతురుకు అప్పగిస్తారనే కేటీఆర్ తండ్రిపై అలిగారు. అందుకే ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ వెళ్లలేదు. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే డీఎన్ఏ మారదు. అలాగే పేరు మార్చినంత మాత్రాన ఆ పార్టీ డీఎన్ఏ మారదు. కేసీఆర్ డీఎన్ఏ ఏంటో అందరికీ తెలుసు. ప్లాస్టిక్ సర్జరీతో రూపు రేఖలు మార్చవచ్చు కానీ.. మనిషి ఆలోచనలు మార్చలేరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా ఆ పార్టీతో పొత్తు ఉండదు. మాది యాంటీ బీఆర్ఎస్, యాంటీ కేసీఆర్’’ అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోపే జరగాల్సి ఉంది. కాని ముందస్తు ఊహాగానాలతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. అదే విధంగా పార్టీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు, ఆశావహులు ప్రజల దగ్గర తమ జాతకాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటున్నారు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేసుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఈ నాయకులంతా తల కిందుల తపస్సులు చేస్తున్నారు. సాంతం.. సర్వేల మయం అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలతో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పటికే అసెంబ్లీలో ఉన్నవారు... కొత్తగా అసెంబ్లీలో ప్రవేశించాలనుకునేవారు తమ రాజకీయ భవిష్యత్ గురించి, రాబోయే ఎన్నికల్లో తమ అదృష్టం గురించి ప్రజల దగ్గర పరీక్షలు చేయించుకుంటున్నారు. అదేనండి... సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రతి పార్టీ ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుని ఓవరాల్గా పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, వ్యతిరేకతల గురించి.. ఒక్కో నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే, సీటు కోరుకుంటున్నవారు, ప్రతిపక్షాల పరిస్థితులపై అధ్యయనం చేయిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నదాంతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీల తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. గ్రాఫ్ బాగుంటూనే టికెట్ ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నవారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నట్లు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా సంతోషంగా తమ పనుల్లో బిజీ అయిపోయారు. అదే సమయంలో టిక్కెట్ల హామీతో పార్టీలోకి వచ్చినవారు... టిక్కెట్ కోసం ప్రతి సారీ ఎదురుచూస్తున్నవారు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెక్ చేయించుకుంటున్నారు. కొందరిని నియమించుకుని సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే... గత ఎన్నికల్లో బాగా పనిచేసేవారికే టిక్కెట్లు ఇస్తామని, గ్రాఫ్ బాగాలేని ఎమ్మెల్యేలు ఇంటికే అని కేసీఆర్ హెచ్చరించారు. కాని ఒకరిద్దరు మినహా మిగిలిన సీట్లన్నీ సిట్టింగులకే కేటాయించారు. ఈసారి మాత్రం సిట్టింగులందరికీ అని ప్రకటించారు. దీంతో కేసీఆర్ మాటలకు అర్థాలు వేరులే అని కొందరు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఇప్పటికే అందరి జాతకాలు ఉన్నట్లు చెప్పారు. అందువల్ల ప్రజల్లో గ్రాఫ్ సరిగా లేకపోతే టిక్కెట్ రాదని భయపడుతున్నారు. అందుకే ఎవరికి వారు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. పల్లె పల్లెకు ప్రశ్నల రాయుళ్లు మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చాలా పాఠాలు నేర్పింది. పోల్ మేనేజ్మెంట్ కొత్త పుంతలు తొక్కిన విధానాన్ని అక్కడ ప్రచారంలో పాల్గొన్న నాయకులంతా పరిశీలించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజలు వేసిన ప్రశ్నలు ఎలా ఉన్నదీ అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రత్యక్షంగా చూశారు. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు ఉప ఎన్నికలో ఆయా పార్టీల కోసం పనిచేశారు. టీఆర్ఎస్ అయితే ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమించింది. మునుగోడు నేర్పిన పాఠాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేంతా తమ నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. యూత్, మహిళలు, వృద్ధులు, రైతులు, మైనారిటీలు.. ఇలా అన్ని వర్గాల్లో తమకు ఉన్న ఆదరణ గురించి సర్వే చేయించుకుంటున్నారు. ప్రజల్లో కనుక వ్యతిరేకత ఉంటే.. దాన్ని అధిగమించడం ఎలా అన్నదానిపై వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఉన్న అసంతృప్తి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో తమకున్న గ్రాఫ్ పడిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటుగా.. ఇతర పార్టీల నేతలు, ముఖ్య కార్యకర్తలను ఆకర్షించే పనిలో ఎమ్మెల్యేలంతా బిజీగా ఉన్నారు. ప్రతి పార్టీ ఆపరేషన్ ఆకర్ష గ్రామ స్థాయి నుంచి అమలు చేస్తోంది. ముందుస్తు ఊహాగానాల నేపథ్యంలో మొత్తం రాష్ట్రం అంతా రాజకీయ జాతర మొదలైంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
లండన్లో మొట్టమొదటి బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
లండన్: ఇటీవల అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మారిన సందర్భంగా సీఎం కేసీఆర్కు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నారై బీ.ఆర్.ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు. లండన్లోని చారిత్రక టవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ జెండా మంగళవారం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్నారైసెల్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి జెండాను సైతం లండన్ లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందన్నారు. నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలంతా విశ్వసిస్తున్నారన్నారు. యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులంతా బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. అలాగే భారత్ నుండి బీ.ఆర్.ఎస్ నాయకులని ఆహ్వానించి త్వరలో ఘనంగా బీ.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తామని అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక తెలిపారు. "దేశ్ కి నేత కేసీఆర్" "అబ్కి బార్ కిసాన్ సర్కార్" నినాదాలతో లండన్ టవర్ బ్రిడ్జి ప్రాంతం మారుమోగింది. కేసీఆర్ ప్రతీ పిలుపుకి స్పందించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తెలిపారు. అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, ఫృద్వి రావుల, మధుయాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కవిత రూటు ఎటు?.. పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ ఏంటి?
కల్వకుంట్ల కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా అందరికీ పరిచయమే. నిజామాబాద్ ఎంపీగా ఒకసారి గెలిచిన ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సీబిఐ కేసు విచారణతో తరచుగా న్యూస్లో నానుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఎక్కడైతే ఓడారో అక్కడే ఎమ్మెల్యేగా గెలవాలనే ఆలోచనతో ఉన్నారామె. నిజామాబాద్ జిల్లాలో ఇంతకీ ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? నిజామాబాద్పై ప్రత్యేక దృష్టి తెలంగాణా రాష్ట్రంలో 33 జిల్లాలున్నా.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ వేదికగా నిజామాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం కచ్చితంగా ఓ విశేషమే. ఈ క్రమంలోనే ఇందూరుపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారా అనే చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. నిజామాబాద్ పై సీఎం సమీక్ష తర్వాత... వెనువెంటనే మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించగా.. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రెస్ మీట్ నిర్వహించి అభివృద్ధి వివరాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్ నిజామాబాద్పై ఎందుకంత ఫోకస్ చేస్తున్నారన్న చర్చ మొదలైంది. సీఎం కుమార్తె కవిత వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగానే చేస్తారని.. కాదు.. కాదు.. బోధన్ నుంచీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని.. కొందరు ఆర్మూర్ నుంచీ రంగంలోకి దిగొచ్చని.. అటు జగిత్యాల బరిలోనూ నిలువొచ్చనీ పరిపరివిధాలుగా ప్రచారమైతే సాగుతోంది. పోటీ చేస్తారా? ఫైట్ చేస్తారా? ఈ మధ్య బీజేపీ ఎంపీ అరవింద్ వర్సెస్ కవిత ఎపిసోడ్ తో.. నిజామాబాద్లోనే నిల్చి గెలవాలన్న పట్టుదల కవితలో మరింత పెరిగిందంటున్నారు. కూతురు కోరికను అర్థం చేసుకున్న తండ్రిగా కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో కవితనే నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా బరిలోకి దించనున్నారా అనే చర్చ టీఆర్ఎస్లో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లని కేసీఆర్ తేల్చిచెప్పారంటే... కచ్చితంగా ఆలోచించాల్సిందే అనేవాళ్లూ ఉన్నారు. గతంలో ఎవరైతే బాగా పనిచేస్తారో వారికే సీట్లని చెప్పి.. దాదాపు సిట్టింగ్లకే టిక్కెట్లు కేటాయించిన గులాబీ బాస్ మాటల్లో ఆంతర్యాలు అంత త్వరగా అంతు చిక్కనివి. ఈ సారి కవితను నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ బరిలో దింపి.. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గణేష్ గుప్తాను పార్లమెంట్కు నిలబెట్టే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గణేష్ గుప్తా కూడా విద్యావంతుడు.. ఉత్సాహవంతుడు కావడంతో ఎంపీగా పార్లమెంట్కు పంపితే కూడా బెటరేమోనన్న ఆలోచనతో పాటు.. పెద్దగా నష్టమైతే ఉండకపోవచ్చనే లెక్కలు వేసుకుంటున్నట్టుగా టాక్. ఈక్రమంలోనే కవితను వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో దించి గెలిపించి క్యాబినెట్లోకి తీసుకుని.. ఇందూరులో తిరుగులేని శక్తి కావాలనే యోచనతో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ అరవింద్ వర్సెస్ కవిత మధ్య వార్లో భాగంగా అరవింద్ ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి పోటీ చేసి ఆయన్ను ఓడగొడతానన్న కవిత శపథం చేశారు. మరి రానున్న రోజుల్లో ఆ శపథాన్ని నెరవేర్చుకుంటారా? కవిత నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగితే.. మరి అరవింద్ ఎక్కడ పోటీ చేస్తారు..? లేదంటే, అరవింద్ పోటీ చేసిన సెంటర్ లోనే కవిత బరిలోకి దిగుతారా? కవిత పోటీ చేసే సెగ్మెంట్పై పొలిటికల్ సర్కిల్ చర్చలు జోరుగా సాగుతున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఉండేదెవరు.. పోయేదెవరు..?.. గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు?
ఓరుగల్లు గులాబీ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఉమ్మడి జిల్లాలో కాక రేపింది. సిట్టింగ్లకే సీట్లని చెప్పడంతో ఆశావహుల్లో గుబులు రేగింది. మరి టిక్కెట్లు ఆశించినవారు ఎదురుతిరిగితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ కోట బీటలు వారుతుందా? ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి? రాబోయే కాలానికి కాబోయే లీడర్ ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. రాబోయే కాలానికి కాబోయే లీడర్ నేనేనంటూ తిరిగిన నాయకులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు గులాబీ దళపతి సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్లకే సీట్లని ప్రకటించడంతో ప్రస్తుత ఎమ్మెల్యేలకు కాస్త ఊరటనిచ్చినా, టిక్కెట్లు ఆశిస్తున్నవారిని మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ఏ ఇద్దరు కలిసిన టిక్కెట్లపైనే చర్చించుకుంటున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పలు మార్లు పొటీకి దూరమైన నేతలను ఆలోచనలో పడేసి ఆందోళనకు గురిచేస్తోందట. అలా టిక్కెట్ రాదని ఖరారు చేసుకున్న నేతలు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే పనిలో నిమగ్నమవుతున్నారట. ఆ ఏడింట్లో సెగలే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ములుగు మినహా.. మిగిలిన 11 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీటిలో ఏడు చోట్ల గులాబీ గూటిలోనే పోటీ తప్పని పరిస్థితి ఏర్పడింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వర్థన్నపేట, నర్సంపేటలో మాత్రమే సిట్టింగ్లకు పోటీ లేదు. మిగతా అన్ని చోట్లా సిట్టింగ్లకు పోటీగా ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉద్యమ కాలం నాటి నాయకులు మేమున్నానంటూ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. పలు చోట్ల కొంతకాలం నుంచి రాజకీయంగా కత్తులు దూసుకునే పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు అనేకసార్లు బయట కూడా పడ్డాయి. ఎత్తుకు పై ఎత్తులతో టిక్కెట్ సాధించుకునే పనిలో గులాబీ నేతలు ఉండగా సిట్టింగ్లకే మళ్ళీ అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం ఆశావహులకు మింగుడు పడటం లేదు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ స్టేషన్ ఘనపూర్లో తాటికొండ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లేదా ఆయన కూతురు కావ్య టిక్కెట్ ఆశిస్తున్నారు. రాజయ్య, కడియం మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. సీఎం నిర్ణయం మళ్లీ ఇద్దరి మద్య అగ్గికి ఆజ్యం పోసినట్లయిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కు పోటీగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టికెట్ ఆశిస్తున్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన గండ్ర వెంకట రమణారెడ్డికి పోటీగా.. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి టికెట్ రేసులో ఉన్నారు. డోర్నకల్ లో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్థానంలో మంత్రి సత్యవతి రాథోడ్ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ ఉండగా అక్కడ ఎంపి కవిత టిక్కెట్ కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇద్దరి మద్య విబేధాలు బజారుకెక్కాయి. ఇక పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పోటీగా.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ రైతు విమోచన కమిటీ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు టిక్కెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పోటీగా.. ఎమ్మెల్సీ పోచంపల్లితో పాటు మరో నాయకుడు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చదవండి: బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు తెరపైకి ఆపరేషన్ ఆకర్ష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకే సీట్లని ప్రకటించిన గులాబీ దళపతి.. కొండ సురేఖకు హ్యాండిచ్చారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి సైతం రెండు మూడు చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అదే నిజమైతే సిట్టింగ్లకు సైతం ప్రమాదం పొంచి ఉంది. గత అనుభవం దృష్ట్యా ఆశావహుల్లో ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మరోవైపు.. కేసీఆర్ ప్రకటన తర్వాత అసంతృప్త నేతల కోసం కాంగ్రెస్, బీజేపీలు కాచుకుని కూర్చున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టి టిక్కెట్ రాదని నిర్ధారించుకున్న వారిని తమ వైపు తిప్పుకునే విధంగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల నాటికి గులాబీ గూటిలో ఉండేదెవరో పోయేదెవరో అంటూ.. కేడర్ చర్చించుకుంటోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: ‘బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది నేనే’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ టికెట్పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారన్నారు. 1994 నుంచి నాయకులు, కార్యకర్తలు తన వెంటే నడుస్తున్నారన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిచానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఓటర్లకు దూరం కాలేదన్నారు. తాండూరు అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ నిధులతో పాటు ఎమ్మెల్సీ గ్రాంటు నిధులను స్థానిక ప్రజా ప్రతినిధులకు కేటాయించామన్నారు. పార్టీలోకి కొందరు వస్తుంటారు.. పోతుంటారు. వారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయారని అలాంటి వారి గురించి పట్టించుకొనే అవసరం లేదన్నారు. తాండూరు రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ప్రజల మద్దతు తనకే ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్ల నిధులను తీసుకువచ్చానన్నారు. ఇప్పటికీ ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా తాండూరు–వికారాబాద్ రోడ్డుకు రూ.60 కోట్లు, తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఔటర్ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. ప్రస్తుతం ఔటర్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు కాగ్నా బ్రిడ్జి, బుద్దారం, గాజిపూర్, మన్సన్పల్లి, కందనెల్లి, జీవన్గిలలో బ్రిడ్జీల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఇటీవల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని వాటితో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు, ఎంపీటీసీలు ముందుండి పనులు పూర్తి చేయాలన్నారు. -
సీబీఐ విచారణ పూర్తి.. సీఎం కేసీఆర్తో కవిత భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి బయల్దేరిన కవిత ప్రగతిభవన్కు చేరుకున్నారు. ఆమె వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. సీబీఐ విచారణపై కేసీఆర్కు వివరించారు. 45 నిమిషాలపాటు వీరి సమావేశం కొనసాగింది. అనంతరం ప్రగతిభవన్ నుంచి కవిత తన ఇంటికి వెళ్లారు. కాగా ఢిల్లీ లిక్కరర్ స్కాం కేసులో కవితను సీబీఐ ఆదివారం విచారించిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161కింద కవిత స్టేట్మెంట్ను రికార్డు చేశారు. విచారణ ముగియడంతో సీబీఐ అధికారులు ఢిల్లీకి తిరిగి వెళ్లారు. అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు కవిత విచారణకు సంబంధించి సీబీఐ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. చదవండి: ముగిసిన కవిత సీబీఐ విచారణ.. -
ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే.. గద్వాలలో కారు డ్రైవర్ ఎవరు?
వారిద్దరూ అధికార పార్టీకి చెందినవారే. ఒకరు జడ్పీ చైర్మన్, మరొకరు ఎమ్మెల్యే. కాని ఒకరంటే ఒకరికి పడదు. సమన్వయంతో పనిచేయడం మానేసి.. ఆధిపత్య పోరుకు తెర తీసారు. ఒకరు మంత్రి మనిషి.. మరొకరికి మంత్రితో పడదు.. దీంతో ఈ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఇంటా, బయటా.. వేడేక్కిన రాజకీయం నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన రాజకీయ పోరాటం.. అధికార పార్టీలోని వారి మధ్యే జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు కొంతకాలంగా అంతర్గత వైరం కొనసాగుతుంది. గతంలో జడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు ఇప్పటికీ చల్లారలేదు. జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో ఆమె ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సైతం డీ అంటే డీ అన్నట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణను ఎదుర్కొని నిలవటం ఎమ్మెల్యే కృష్ణమోహన్కు నిత్యం సవాల్గా మారుతోంది. ఇప్పుడు స్వంత పార్టీ నేత నుంచి కూడా ప్రతికూల పరిస్ధితులు ఎదురు కావడంతో ఆయనలో ఆందోళన పెరుగుతోంది. మా దారి మాదే గద్వాల నియోజకవర్గంలో జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎవరికి వారుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధిలేని పరిస్ధితిలో జడ్పీ సమావేశంలో కలిసి పాల్గొన్నా అంటిముట్టనట్టే ఉంటున్నారు. వీరిద్దరి మద్య వైరానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుడిగా ముద్ర పడింది. దీంతో నిరంజన్రెడ్డితో ఆయనకు సఖ్యత లేదనే వాదన చాలా కాలంగా కొనసాగుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి తనకు వ్యతిరేకంగా మరోవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ సరిత గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఓసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలను ఆహ్వానించారు. మంత్రుల ఫోటోలతో జిల్లా కేంద్రంలో స్వాగత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు చైర్మన్ సరిత. తనకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే వెళ్లి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారట. ఇదే విషయాన్ని మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వీరిద్దరి వర్గపోరు కారణంగానే ఆ ఇద్దరు మంత్రులు మీటింగుకు రాకుండా డుమ్మా కొట్టారు. కులాల కురుక్షేత్రం గద్వాల నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో వాల్మీకి బోయల తర్వాత కురువ సామాజిక ఓటర్లే అధికంగా ఉన్నారు. కురువ వర్గానికి చెందిన సరిత రాజకీయంగా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. గద్వాలలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి క్యాడర్కు భరోసా ఇస్తున్నారు. చదవండి: బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత బీసి కోటా కింద గద్వాల నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ వస్తే ఎంతైనా ఖర్చు చేస్తామన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారట. పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పట్ల అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను చేరదీసి తన వర్గంలో కలుపు కుంటున్నారట. జడ్పీ చైర్పర్సన్ భర్త తిరపతయ్య కూడ గద్వాల రాజకీయాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. నన్నే పక్కనబెడతారా? ఇటీవల బీసీ గురుకుల పాఠశాల భవనాన్ని తాను రాకముందే జడ్పీ చైర్పర్సన్తో ప్రారంభింప చేయటంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సంబంధిత శాఖ జిల్లా కోఆర్డినేటర్పై చేయిచేసుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యేకు, జడ్పీ చైర్పర్సన్కు మద్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడ వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుండటంతో ప్రభుత్వ అధికారుల పరిస్దితి డోలాయమానంలో పడింది. ఎవరిని కలిస్తే ఎవరికి కోపం వచ్చి తమను టార్గెట్ చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు గద్వాల జిల్లాలో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒక కంట కనిపెట్టాలని.. విభేదాలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ కేడర్ కోరుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కారులో పెరిగిన కసి.. ఆ గడ్డ ఇక ముందు ఎవరి అడ్డా?
పునాదులు లేని చోట కమలం పార్టీకి హఠాత్తుగా ఓ ఎంపీ ఎన్నికయ్యాడు. అనుకోకుండా లభించిన విజయాన్ని ఆస్వాదించడంతో పాటు దాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. పార్టీకి మరిన్ని విజయాలు అందించడానికి అక్కడున్న నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. కాని ఆ జిల్లాలోని కమలం రేకుల మధ్య ఐక్యత కనిపించడంలేదు. ఇంతకీ కాషాయ సేనలో అంతర్గత పోరు నడుస్తున్నదెక్కడ? ఎంపీ వర్సెస్ కన్వీనర్లు ఇందూరు కమలం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గతంలో అంతర్గతంగా ఉండే విభేదాలు ఇప్పుడు వీధిన పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపి ఇంటర్నల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లుగా.. ఇప్పటివరకు ఉన్నవారికి కాకుండా కొత్తవారికి ఇవ్వడంపై ఒకింత అసహనం..ఆగ్రహం వ్యక్తం అయ్యాయి. ఈ సమావేశం వల్ల మరోసారి బీజేపి నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేపథ్యంలో ఇంఛార్జుల నియామకంలో తమను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలపై కూడా పలు మండలాల నాయకులు అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. ఇప్పటికే ఇందూరు బీజేపీలో ఎంపీ అరవింద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. అరవింద్ తనకిష్టమైనవారికే పదవులిప్పించుకుంటున్నారని.. అలాగే ఇంఛార్జులు, కన్వీనర్ల నియామకాల్లోనూ తమను పట్టించుకోలేదంటూ.. కొందరు నేతలు సుమారు రెండు గంటల పాటు సమావేశంలోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పైగా ఎంపీ అరవింద్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలూ చేసినట్టు సమాచారం. చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్) నోట నవ్వుతారు.. నొసలు చిట్లిస్తారు..! బీజేపీ పదాధికారుల సమావేశంలో.. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నేతలు అరవింద్పై పెద్దఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య అరవింద్ ఆర్మూర్ లోనే ఉండి పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు బోధన్ లోనూ బీజేపీ ఎమ్మెల్యే సీటు ఆశావహుల సంఖ్య పెరగడంతో.. ఆయా గ్రూపుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఇంతకాలం అరవింద్కు అనుకూలంగానే ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య కూడా ఈమధ్య అరవింద్తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడినీ మార్చబోతున్నారంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా పనిచేసి.. ప్రస్తుతం అరవింద్కు సన్నిహితంగా ఉంటున్న పల్లె గంగారెడ్డితో పాటు.. మరికొందరి పేర్లను జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కారులో పెరిగిన కసి ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ లో 11 మంది కార్పోరేటర్లు బీజేపి నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళారు. అధ్యక్ష పదవి మళ్ళీ తనకే ఇవ్వకపోతే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన బసవ కూడా పార్టీ మారే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ను ఢీ అంటే ఢీ కొడుతూ ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీ.. అంతేస్థాయిలో అంతర్గత కలహాల్లో కూరుకుపోతోంది. పైగా రానున్న ఎన్నికల్లో గట్టిగా పోరాడితే కమలం పార్టీకి అవకాశాలున్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వంటి స్థానాల్లోనే ఈ అంతర్గత విభేదాలు పొడచూపడం పార్టీని కలవరపెడుతోంది. వడివడిగా ఎదిగిన బీజేపీ.. అంతే వడివడిగా సంక్షోభాలు.. అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ మళ్లీ ఇందూరుపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపి బలహీనతలే ప్రత్యర్థులకు బలమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ.. నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్
హుజూరాబాద్ నియోజకవర్గం మరోసారి సంచలనాలకు వేదికగా మారబోతోంది. అదీ గులాబీ పార్టీలోనే పోటీ తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆ సీటును గులాబీ పార్టీలో ముగ్గురు ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సిటింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు పోటీ ఏ స్థాయిలో ఉండబోతోంది? ఈటల మారారు, సీన్ మారింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజూరాబాద్ లో గులాబీ కోట బీటలు వారింది. టీఆర్ఎస్లో అక్కడ ఈటలకు ప్రత్యామ్నాయ నేత ఇంకా తయారు కాలేదనే అనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరి తిరిగి అసెంబ్లీకి ఎన్నికై తన బలాన్ని చూపించుకున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా అక్కడ ఎక్కువే ఉంది. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీ కేడర్లో ఒకింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు నేతలు హుజూరాబాద్ టికెట్ కోసం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభ వద్దు.. శాసనసభ ముద్దు..! 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన కౌశిక్ రెడ్డి ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతున్నారని ఊహాగానాలు వచ్చినా.. తానే టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండబోతున్నట్టు ఆడియోలు బయటకు వచ్చినా.. మారిన సమీకరణాలు వ్యూహ ప్రతి వ్యూహాల నేపథ్యంలో ఉప ఎన్నికలకు ముందు కారెక్కారు. కానీ టిక్కెట్ దక్కలేదు. గులాబీ దళపతి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కౌశిక్రెడ్డి మాత్రం సంతృప్తి చెందలేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్సీ పదవి తృప్తిగా లేదు తనను ఎమ్మెల్యేగా గెలిపించండి అని కౌశిక్ వ్యాఖ్యానించారు. అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ముచ్చటగా ముగ్గురి పోటీ మరోవైపు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈటల మీద ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా తానేం తగ్గేదెలే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసేది తానే అని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇక మునుగోడుతో రాష్ట్రంలో పొడిచిన కొత్త పొత్తుల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పరిణామాలు మారే అవకాశాలున్నాయి. పొత్తు కుదిరితే కనుక ఆ సీటు సీపీఐకి వెళ్తుంది. అప్పుడు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు సొంత నియోజకవర్గం అయిన హుజూరాబాద్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్బాబు కూడా సొంత నియోజకవర్గానికి వస్తే హుజూరాబాద్ కోరుకునే వారి సంఖ్య మూడుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ ఎవరికి అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొత్త వారు కూడా ఈ సెగ్మెంట్ను కోరుకునే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయన్ను తట్టుకుని నిలబడే వారు అక్కడ గానీ చుట్టుపక్కల గానీ గులాబీ పార్టీలో కనిపించరనే టాక్ నడుస్తోంది. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు పోటీ పడే పరిస్తితి వస్తే అది ఈటలకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్ను కేసీఆర్ ఎవరికి ఇస్తారో చూడాలి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కేసీఆర్ ప్రకటనే అసలు సమస్య.. మాజీ ఎమ్మెల్యే దారేటు?
గతంలో మాదిరిగా ఈసారి కూడా సిటింగ్లకే సీట్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనేక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. గతం నుంచీ అక్కడ గులాబీ పార్టీకి సేవ చేస్తున్నవారి పరిస్థితి ఏంటి? గతం నుంచి సీటిస్తామంటూ హామీ పొందినవారి సంగతేంటి? ఇటువంటి వారంతా సీట్ల కోసం ఏం చేయబోతున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేతలు ఏమంటున్నారు? నకిరేకల్లో రసవత్తరం ఈసారి టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇచ్చిన భరోసా వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ పట్టరాని సంతోషం కలిగించింది. కొందరిని మాత్రం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. సిట్టింగులకే సీట్లు అంటే తమ పరిస్థితి ఏంటని పార్టీలో ఉన్న ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ఈ ఆందోళనలు కాస్త ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లా నకిరేకల్ కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఫిరాయింపుతోనే అసలు సమస్య మొదలైంది. కారు నడిపేది నేనే..! ప్రత్యర్థులుగా పోటీ చేసి గెలిచిన, ఓడిన నాయకులు ఇద్దరు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ అధినేత మాత్రం సిట్టింగులకే సీట్లు అని ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో సమావేశమైన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా పోటీ చేస్తానని అందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని... మన మౌనం పిరికితనం కాదని గోడకు వేలాడ దీసిన తుపాకీ లాంటిదని ఘాటు కామెంట్స్ చేశారు. ఎంత తొక్కాలని చూస్తే బంతిలా అంత పైకి ఎగురుదామని వీరేశం మాట్లాడిన తీరు చూస్తే ఆయన ఖచ్చితంగా పోటీలో ఉండటం ఖాయం అని తెలుస్తోంది. కమలం కొత్త వ్యూహం అయితే వీరేశం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగినా.. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వారిని ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించి సొంత పార్టీకి ధీటుగా కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. అందువల్ల ఆయన కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చేస్తారా? లేక ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే వేముల వీరేశంపై ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా ఓ కన్నేసి ఉంచాయి. కాని ఇప్పటికే చెరుకు సుధాకర్ కాంగ్రెస్లో చేరి ఆయన భార్య లక్ష్మీని నకిరేకల్ నుంచి బరిలో దింపేందుకు ప్లాన్ చేశారు. ఇలాంటి సమయంలో వేముల కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అనుమానమే. అదే సమయంలో బీజేపీలో చేరడానికి సిద్ధాంత వైరం అడ్డుగా ఉంది. వీరేశం మాజీ మావోయిస్టు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. టికెట్ వచ్చినా రాకున్నా.. బరిలో ఉంటా.! వీరేశానికి టీఆర్ఎస్ టికెట్ రాకున్నా పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన అనుచరులు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేయవద్దనే సూచిస్తున్నారు. పలు సంస్థలు చేసిన సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కంటే తనకే అనుకూలత ఎక్కువ ఉందని వీరేశం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలతో పాటు టీఆర్ఎస్ చేయించిన సర్వేలో కూడా సానుకూలత తనకే ఉందని వీరేశం అంటున్నారని టాక్. తనకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతుందా అన్న నమ్మకం ఆయనకు ఏమూలనో ఉందని అంటున్నారు. నకిరేకల్లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య మధ్య మరోసారి రసవత్తర పోరు జరగనుందని అర్థం అవుతోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్గా సర్దార్
సాక్షి, కరీంనగర్: ఉద్యమ నాయకుడు సర్దార్ రవీందర్సింగ్ను అదృష్టం వరించింది. స్టూడెంట్ లీడర్గా రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్సింగ్ మాస్లీడర్గా, న్యాయవాదిగా, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా, ఐదుసార్లు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఎన్నికవ్వడమే కాకుండా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా రవీందర్సింగ్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో అదృష్టమంటే రవీందర్సింగ్దే అంటూ చెప్పుకోవచ్చు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కరీంనగర్లో రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటిలోనే రాష్ట్రస్థాయి చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తూ నిర్ణయాలన్ని ఒకేరోజు కావడం అనూహ్యంగా జరిగాయి. సివిల్ సప్లయ్ చైర్మన్గా సర్దార్ కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్సింగ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ జీవో విడుదల చేశారు. కరీంనగర్లో రవీందర్సింగ్ కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటిలోనే ఉత్తర్వులు వెలువడడంతో రవీందర్సింగ్ కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్టూడెంట్ లీడర్గా.. మాస్ లీడర్గా.. రవీందర్సింగ్ విద్యార్థి దశలోనే 1984లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టి కొద్ది కాలంలోనే రాజకీయ అరంగ్రేటం చేశారు. కరీంనగర్ మున్సిపాల్టీలో 1995లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి కౌన్సిలర్గా బాధ్యతలు స్వీకరించారు. 2001లో బీజేపీ నుంచి కౌన్సిలర్గా ఎన్నికై ఆ పార్టీ ఫ్లోర్లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి కార్పొరేటర్గా ఎన్నికవ్వడంతోపాటు బీజేపీ నగర అధ్యక్షుడిగా 2006 వరకు పనిచేశారు. 2006లో సీఎం కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కేసీఆర్ పిలుపును అందుకొని బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉంటూ టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చే పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కరీంనగర్ నగరంలో ఉధృతంగా నడిపించడంతో కేసీఆర్కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం తీవ్రంగా పనిచేయడంతో కేసీఆర్ అనేక సందర్భంలో రవీందర్ సింగ్ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్కు ఎమ్మెల్సీ అవకాశం ఖాయమంటూ ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ అవకాశం అందినట్లే అంది అందకుండా పోయింది. రాష్ట్రస్థాయి పథకాలు అమలు.. టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా, మేయర్గా పనిచేసిన కాలంలో సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో ఒక్క రూపాయి మేయర్గా ప్రసిద్ధి పొందారు. ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వడం, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేయడం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. మేయర్గా ఉంటూనే కరీంనగర్ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ టీచర్, క్రీడా, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ మాస్ లీడర్గా, మేయర్గా మన్ననలు పొందారు. -
బీఆర్ఎస్ పేరును నేనే మొదట కోరా.. అవసరమైతే ఢిల్లీ హైకోర్టుకెళ్తా: ప్రేమ్నాయక్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడాన్ని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తోపన్నగండ తండాకు చెందిన బానోత్ ప్రేమ్నాయక్ తప్పుపట్టారు. తాను ముందుగా భారతీయ రాష్ట్ర సమితితోపాటు మరో మూడు పేర్లతో దరఖాస్తు చేశానని.. కానీ తన తర్వాత భారత్ రాష్ట్ర సమితిగా పేరుగా మార్చాలంటూ టీఆర్ఎస్ చేసిన దరఖాస్తుకు ఈసీ అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. చదవండి: (CM KCR: టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా..) -
అయ్యబాబోయ్ దుబ్బాకనా? ఆ పోస్టింగ్ మనకొద్దు.!
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వాధికారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అక్కడ పనిచేయాలంటేనే జంకుతున్నారు అధికారులు. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే.. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ, కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యా నలిగిపోతున్నారు అధికారులు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? రీడ్ దిస్ స్టోరీ.. పచ్చగడ్డి వేసినా భగ్గే సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే మాటల ఈటెలు విసురుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో ఏం చేయాలో తోచక అధికార యంత్రాంగం తల బాదుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికే చెందిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. అలాగే అక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన రఘునందనరావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వర్గ పోరు సాగుతోంది. ప్రోటోకాల్ వ్యవహారంతో ప్రారంభమై... పరస్పరం దిష్టి బొమ్మల దహనం వరకు నిరంతర ప్రక్రియగా మారింది. చదవండి: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్కు లేఖ పంపిన ఈసీ కార్యక్రమం ఏదైనా సీన్ సితారే నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. దుబ్బాక అభివృద్ధి మా పార్టీయే చేసిందంటూ ఇద్దరూ ప్రజలకు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ..కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎమ్మెల్యే రఘునందనరావు ఉపన్యాసాలిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నియోజకవర్గంలోని అక్బర్ పేట, భూంపల్లి నూతన మండలాల కార్యాలయాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు సమక్షంలో సైతం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి చూస్తుండగానే పరస్పరం తోపులాటకు దిగారు. ఈ ఘర్షణ చూస్తూ..ఎవరికి ఎలా సర్దిచెప్పాలో తోచక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య తరుచుగా జరుగుతున్న గొడవలు చూసి ప్రజలు కూడా చికాకు పడుతున్నారు. వీరిద్దరి వల్ల తమ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకపడిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్కు లేఖ పంపిన ఈసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి.. భారతీయ రాష్ట్ర సమితిగా అవతరించింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు పంపింది. ఇక అధికారిక ప్రకటన వెలువడటమే మిగులుంది. అక్టోబర్ 5న పార్టీ పేరు మార్పుపై ఈసీకి టీఆర్ఎస్ లేఖ పంపింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ గురువారం ఈసీ ఆమోదం తెలిపింది. రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 1:20కి బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. అనంతరం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. చదవండి: (రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు) -
జగిత్యాల పర్యటన.. కొండగట్టుపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నేడు అద్భుతమైన కలెక్టరేట్ నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పడిందన్నారు. జగిత్యాల జిల్లా అయితదని కలలో కూడా అనుకోలేదని, ప్రస్తుతం జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు అభినందలు తెలిపారు. ఏకైక రాష్ట్ర తెలంగాణే తెలంగాణలో అద్భుత పుణ్యక్షేత్రాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. బండలింగాపూర్ను మండల కేంద్రం చేస్తామని పేర్కొన్నారు. దేశంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ఏకైక రాషష్ట్రం తెలంగాణనే అని అన్నారు. తాను బతికున్నంత వరకూ రైతుబంధు, రైతు బీమా ఆగవని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనదని, కానీ దేశంలో ధాన్యం కొనే ఏకైక రాష్ట్ర తెలంగాణేనని చెప్పారు. ఇంకా ఎన్నో పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి: మనకు మనమే సాటి.. ఎవరూ లేరు పోటీ: సీఎం కేసీఆర్ ‘మోటర్లకు మీటర్లు పెట్టాలట.. పెడదామా అని ప్రశ్నించారు. గోల్మాళ్ గోవిందం గాళ్లు, కారుకూతలు కూసేవాళ్లు మన మధ్య తిరుగుతున్నారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలాగే దేశమంతా అభివృద్ధి చెందాలి. మనం వచ్చినప్పుడే కేంద్రంలో మోదీ కూడా వచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని జరిగిందా? మోదీ వచ్చాక ఉన్న ఆస్తులు ఊడగొడుతున్నారు. రైతులకు ఉచితాలు ఇవ్వొద్దు కానీ.. ఎన్పీఏల పేరిట రూ. 14 లక్షల కోట్ల ప్రజా సంపదను దోచిపెట్టారు. రూ. 35 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్ఐసీని కూడా అమ్మేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పిడికిళ్లు బిగించాలి. దేశంలో ఇప్పటికే 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. 50 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు ఊడిపోయాయి.’ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. -
వామపక్షాల తీరు మారాలి.. పక్క పార్టీల వైపు ఆశగా చూస్తూ..
భారత్లో కమ్యూనిస్టుల పరిస్థితి దారుణంగా తయారైంది. వారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అవకాశవాద, స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. పదే పదే తప్పులు చేయడం వీరికి అలవాటై పోయింది. బీజేపి మతతత్త్వపార్టీ అంటూ వేలెత్తి చూపే ఈ కమ్యూనిస్టులు కేరళలో పచ్చి ముస్లిం మతతత్త్వ పార్టీ అయిన ముస్లిం లీగ్తో కలిసి తమ స్వార్థ రాజకీయాలు చేస్తుంటారు. గతంలో నిరు పేదల పక్షాన పోరాడుతారనే కాస్తో కూస్తో పేరు ఉండేది. ఇటీవల కాలంలో పోరాటాలు పక్కన పారేసి తమ పబ్బం ఎలా గడుపుకోవాలనే ఆరాటమే వీరిలో ఎక్కువైంది. గతంలో ఖమ్మంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీ ముఖ్య నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయి పక్క పార్టీకి సహాయపడినట్లు అదే వామపక్ష పార్తీలకే చెందిన మరో కీలక నాయకుడు విమర్శించడం తెలిసిందే. ఇలాంటి వాదంతోనే ప్రస్తుతం తెలంగాణలో తమ పబ్బం గడుపుకోవడానికే టీఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. గతంలో ఇవే కమ్యూనిస్టు పార్టీలను అవమానకరంగా దూషించిన కేసీఆర్ పంచన చేరి ఆయన పారేసే ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయొచ్చని ఆశపడుతున్నారు. బీజేపి మతతత్త్వ పార్టీ అని వేలెత్తి చూపుతున్న ఈ సోకాల్డ్ వామపక్షీయులు టీఆర్ఎస్ దోస్తీ చేస్తున్న పచ్చి మతతత్త్వ పార్టీ అయిన మజ్లిస్ పార్టీతో ఎలా కలుస్తారో ప్రజలకు చెప్పాలి. అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే పొత్తు అని చెప్పి తప్పించు కుంటారేమో. మతతత్త్వం పేరుతో బీజేపీని పదే పదే విమర్శించే వీరు ఎంఐఎం వైఖరిని విమర్శించిన దాఖలాలు లేవు. మొన్నటిదాక టీఆర్ఎస్ను అవినీతి, అక్రమాల పుట్ట అని వేలెత్తి చూపిన వీరు... తాము చేతులు కలుపగానే టీఆర్ఎస్ నీతిమంతంగా మారిపోయిందా? కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని టీఆర్ఎస్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వామపక్షాలు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ పర్య టనను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే నోముల నరసింహయ్యను టీఆర్ఎస్లో కలిపేసుకొని తమను నిర్వీర్యం చేసిన విషయాన్ని కూడా మరిచి పోయారని ఆ పార్టీల కార్యకర్తలే దుయ్యబడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్తో చేతులు కలిపి టీఆర్ఎస్పై దుమ్మెత్తి పోసిన వీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతోపాటు మళ్ళీ బీజేపీని తిట్టిపోస్తున్నారు. అంతకు ముందు ఇవే వామపక్షాలు తెలుగు దేశం పార్టీతో అంటకాగిన విషయం తెలిసిందే. దీనిని బట్టి అర్థమమ్యే విషయం ఏంటంటే వీరంతా తమ స్వార్థం కోసం ఎవరితోనైనా, ఎప్పు డైనా కలిసి పోతారనీ, సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి ఉండవనీనూ. ఈ పార్టీల జాతీయ స్థాయి నాయకులు కూడా తక్కువేమీ తిన లేదు. మన రాష్ట్ర నాయకులకు వారే మార్గదర్శకులు. ఈ పార్టీలకు చెందిన అగ్రనాయకుల్లో కొందరు కోట్లకు పడగలెత్తారనీ, కొందరికి ప్రముఖ జాతీయ టీవీ ఛానళ్లలో, పత్రికల్లో వాటాలు కూడా ఉన్నాయనే విమ ర్శలున్నాయి. దేశమంతా రాష్ట్రాల వారీగా ఇతరులతో జట్టు కట్టడానికి వీరంతా చెప్పే ఏకైక కారణం బీజేపీ హిందూ మతతత్త్వాన్ని ఎదుర్కొని సెక్యులరిజాన్ని కాపాడటం. ఇక్కడ ప్రముఖ రచయిత్రి తస్లిమా నస్రీన్ అన్న... ‘భారత్లో సెక్యులరిజం అంటే హిందువులను అవమానించడం, మైనార్టీల పేరుతో అన్య మతస్థులను నెత్తికెత్తుకోవడం’ అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. ఈ వామపక్ష భావాలవారు ప్రధానంగా సామాజిక కార్యకర్తల ముసుగులో, స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన తీస్తా సెతల్వాద్ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం గతంలో అక్రమంగా కేసుల్లో ఇరికించేందుకు ఎంతగా ప్రయత్నించారో ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలున్నాయంటే చాలు ఇలాంటి వారు మేధావుల రూపం లోనో, మరో రూపంలోనో బీజేపీకి వ్యతిరేకంగా కల్పిత ఉద్యమాలు సృష్టిస్తుంటారు. వామపక్షాల నాయకులు తమ పార్టీల బలోపేతానికి కృషి చేయకుండా పక్క పార్టీల వైపు ఆశగా ఎదురు చూస్తుండడం వీరి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా వామపక్షాలు మేలుకొని తమ పార్టీల పటిష్టతకు పూనుకోకపోతే గతంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలనేవి ఉండేవి అని చెప్పుకునే దుఃస్థితి వస్తుంది. (క్లిక్ చేయండి: అదో.. ఆరో వేలు లాంటి వ్యవస్థ.. రద్దు చేయడమే మేలు!) - శ్యామ్ సుందర్ వరయోగి సీనియర్ జర్నలిస్ట్ -
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ
-
Nagarkurnool: ముందస్తు ఊహాగానాలు.. టీఆర్ఎస్లో అలజడి
సాక్షి, మహబూబ్నగర్: నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతిపై అనర్హత వేటు అధికార పార్టీ టీఆర్ఎస్కు తలనొప్పి తెచ్చిపెట్టింది. నేతల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు జిల్లా పరిషత్ పీఠం సాక్షిగా మరోసారి తెరమీదకు రావడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాగర్కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ప్రసాద్ను కాదని.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం దుమారానికి దారితీసినట్లు తెలుస్తోంది. భరత్ప్రసాద్కు చెక్ పెట్టేలా జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు గతంలో లాగే పావులు కదిపి.. తెరవెనుక తతంగం నడిపించినట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల్లో వైరం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలొస్తాయని ఊహాగానాలు వెల్లువెత్తుతుండగా.. తాజా రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళన పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. తొలుత అలా.. 2019 జూన్లో జరిగిన నాగర్కర్నూల్ జెడ్పీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 20 జెడ్పీటీసీలకు 17 స్థానాలను కైవసం చేసుకుని జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వేషన్ కాగా.. కల్వకుర్తి నుంచి గెలుపొందిన భరత్ప్రసాద్ను చేయాలని తొలుత భావించారు. అయితే అనూహ్యంగా తెలకపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి పేరును ఓ ఇద్దరు ముఖ్యనేతలు తెరపైకి తీసుకు రాగా.. ఆమెకే అవకాశం దక్కింది. రాములు ప్రస్తుతం నాగర్కర్నూల్ ఎంపీగా ఉండడం, గతంలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడంతో ఆయన కుమారుడు, విద్యావంతుడైన భరత్ప్రసాద్ను చైర్మన్ చేస్తే తమకు భవిష్యత్లో సమస్యలు తలెత్తుతాయని భావించిన సదరు నేతలు పద్మావతి పేరును తెరమీదికి తెచ్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు, వారి అనుచరుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎంపీ అనుచరుల్లో అసహనం.. విమర్శలు జెడ్పీ పీఠానికి సంబంధించి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఎంపీ రాములు, అతడి అనుచరుల్లో అసహనం నెలకొన్నట్లు తెలుస్తోంది. అంతర్గత భేటీలో ఈ విషయం చర్చకు రాగా.. కావాలనే గతంలో తెరచాటు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారని ఒకరిద్దరు ఆగ్రహావేశాలకు లోనైనట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నడుచుకోవాలని.. సంయమనం పాటించాలని వారికి ఎంపీ సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికలకు సమయం ఇంకా ఏడాదికి పైగా ఉన్నప్పటికీ బాలాజీసింగ్కు ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టడం.. ఎస్సీకి కేటాయించిన స్థానంలో వేరొకరిని నియమించడంపై ఆ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కోర్టు ఆదేశించినప్పటికీ.. తెలకపల్లి జెడ్పీటీసీగా సుమిత్ర ప్రమాణస్వీకారంలో జాప్యం జరుగుతోంది. పద్మావతి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే జాప్యం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా.. తెలకపల్లి జెడ్పీటీసీ పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. 1997లో మొదటి కుమారుడు, 2001లో ఇద్దరు కవలలు జన్మించినట్లు పేర్కొన్నారని.. వాస్తవానికి 1991లో మొదటి కుమారుడు, 1997లో ఒకరు, 2001లో మరొకరు జని్మంచారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జెడ్పీటీసీ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది. దీనిపై పద్మావతి హైకోర్టును ఆశ్రయించగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. చివరకు స్టే పిటిషన్ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించడంతో పద్మావతిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఆమె డివిజనల్ బెంచీకి వెళ్లినా చుక్కెదురైంది. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపిక అనివార్యం కాగా.. భరత్ప్రసాద్తో పాటు ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలి నుంచి పీఠం ఆశిస్తున్న భరత్నే జెడ్పీచైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ.. వైస్ చైర్మన్ బాలాజీసింగ్కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. దీని వెనుక సైతం తొలుత అడ్డు పడిన వారే ఉన్నారని.. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అన్నీ తానై పథకం ప్రకారం భరత్కు చెక్పెట్టేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఎనిమిదేళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయని, అందుకే మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసం వద్ద మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తనతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. తమపై కేసులు పెట్టడం నీచమైన రాజకీయ ఎత్తుగడ అని విమర్శించారు. సీబీఐ, ఈడీతో భయపెట్టించి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈడీ వచ్చి ప్రశ్నలడిగితే కచ్చితంగా సమాధానం చెబుతామని తెలిపారు. సీబీఐ.. ఈడీ అన్నింటిని ఎదుర్కొంటామని అన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందునే ఈడీ వచ్చిందని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. మీడియాకు లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని చూస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనం ఏం చేస్తామో చెప్పుకొని గెలవాలి కానీ ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. కాదు కూడదని కేసులు పెడతామంటే పెట్టుకోండి.. అరెస్టులు చేసుకోండి.. దేనికైనా భయపడేది లేదు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటాం. జైళ్లో పెడతామంటే పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?’ అని కవిత ఫైర్ అయ్యారు. చదవండి: హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ.. -
అసెంబ్లీ బరిలో కవిత..
మౌలిక వసతుల లేమి.. ఏళ్ల తరబడి సాగుతున్న భూగర్భ డ్రెయినేజీ పనులు.. వెనుక బడిన నగర సుందరీకరణ నేపథ్యంలో నగరాభివృద్ధిని పట్టాలెక్కించడానికి స్వయంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఈ అంశం స్థానిక ప్రజల్లో ఆసక్తిని కలిగించడంతో పాటు అభివృద్ధిపై ఆశలను చిగురింపజేసింది. మరోవైపు రాజకీయ వర్గాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రానున్న ఎన్నికల్లో అర్బన్ నుంచి బరిలో దింపడమే పరమార్థమని అంచనాలు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను పార్లమెంట్ స్థానానికి పోటీ చేయిస్తారని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వ్యవసాయ వనరులతో అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ముందంజలో ఉన్న నిజామాబాద్ జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ అయి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర సుందరీకరణ పనుల విషయంలో పరిస్థితి ముందుకు పడడం లేదు. నిధులు వస్తున్నప్పటికీ వివిధ పనుల విషయంలో ఏళ్లతరబడి ఆలస్యం అవుతోంది. దీంతో నగర నవీకరణ వెనుకబడుతోంది. 1972లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు రూపొందించిన మాస్టర్ప్లాన్ తప్ప కొత్త మాస్టర్ప్లాన్ను పట్టాలు ఎక్కించలేదు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ప్రారంభమైన భూగర్భ డ్రెయినేజీ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ పనులు సాగుతూనే ఉన్నాయి. అంచనాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా హైదరాబాద్లో నిజామాబాద్ నగర అభివృద్ధి పనుల విషయమై సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో నిజామాబాద్ వస్తానని, ఈలోగా ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు ఖమ్మం వెళ్లి అక్కడ జరిగిన నగర అభివృద్ధిని చూసి రావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేవలం ఒక్క నిజామాబాద్ నగర అభివృద్ధి పనుల విషయమై సమీక్ష చేయడంపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధి పనుల విషయమై ప్రజల్లో చర్చ సాగుతోంది. అయితే వివిధ వర్గాల్లో మాత్రం రాజకీయ అంశాలపై సూక్ష్మ పరిశీలనలు చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత రెండోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అరి్వంద్ విజయం సాధించారు. తర్వాత కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వివిధ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. గత కొన్ని నెలల క్రితం మాత్రం కవిత బోధన్ లేదా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచే బరిలో ఉంటారని చర్చ జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేషగుప్తాను ఈసారి నిజామాబాద్ పార్లమెంటు అభ్యరి్థగా బరిలోకి దించుతారని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కవిత నగరంపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇందులో భాగంగానే నగర అభివృద్ధి విషయమై ముఖ్యమంత్రితో సమీక్ష చేయించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ముందస్తుగా వచ్చినప్పటికీ, షెడ్యూల్ మేరకు వచ్చినా సమయం ఏడాది లోపే ఉండడంతో ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కల్వకుంట్ల కవితకు రాష్ట్ర కేబినెట్లోకి రావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశం ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేగానే శాసనసభలో అడుగుపెట్టి మంత్రి కావాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కె కవిత రెండోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ విజయం సాధించారు. 40 ఏళ్ల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లానే నగరానికి ఇప్పటికీ అమలవుతోంది. -
మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటం.. ఎక్కడి నుంచి పోటీ?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావడంతో ఎర్ర పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే జిల్లా నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్నది వారి ఆరాటం. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? ఇదే అదను, దిగాలి బరిలోకి ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అనేవారు. కాల క్రమంలో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది. గతంలో మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో దేవరకొండలో సీపీఐ తరపున రవీంద్ర కుమార్ గెలిచారు. కానీ ఆయన సొంత పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో కూడా గెలిచి దేవరకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్య నాయకులే కాదు.. రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కేడర్ కూడా చాలావరకు అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లా నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో అడుగుపెట్టడం కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు అంతా. ఇటువంటి క్లిష్ట సమయంలో వామపక్షాలకు మునుగోడు రూపంలో ఓ వరం లభించి పునర్జన్మ పొందినట్లు అయిందని చెప్పవచ్చు. మిర్యాలగూడ ఎవరికి? దేవరకొండ ఎవరికి? మునుగోడులో అధికార టీఆర్ఎస్కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి. బీజేపీని ఓడించే లక్ష్యంతో రెండు పార్టీలు గులాబీకి దన్నుగా ఉన్నాయి. ఇప్పుడిదే వారికి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్, టీఆర్ఎస్ మధ్య పొత్తగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు గులాబీ పార్టీతో పొత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో రెండు పార్టీలు ఒక్కో స్థానాన్ని తమకు కేటాయించాలని అడగనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ మునుగోడు లేదా దేవరకొండ స్థానంలో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీపీఐ మునుగోడు కంటే దేవరకొండ సీటుపైనే మక్కువగా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి మోసం చేసి పార్టీ మారిన రవీంద్ర కుమార్ను దెబ్బ తీయాలని సీపీఐ నాయకత్వం భావిస్తోంది. అయితే జిల్లాలో సీపీఐకి అంతో ఇంతో కేడర్ ఉన్న నియోజకవర్గం అదే కావడం మరో కారణం. ఒకవేళ దేవరకొండలో అవకాశం రాకపోతే మునుగోడు సీటునే కోరనుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ ఐదు సార్లు గెలవడం పార్టీ కేడర్ ఇంకా మిగిలే ఉండటంతో మునుగోడును ఇవ్వాలని బలంగా కోరే అవకాశం కనిపిస్తోంది. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.? జూలకంటి రెఢీ ఇక సీపీఎం కూడా నల్గొండ జిల్లాలో ఒక సీటు కోరుదామనే ఆలోచనలో ఉందని సమాచారం. మిర్యాలగూడ సీటు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో సీపీఎం ఉందని టాక్. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎలాగూ అక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనాలతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి అక్కడ సిట్టింగ్కు సీటు ఇస్తే అధికార పార్టీకి చేతులు కాలే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గులాబీ పార్టీ నాయకత్వం కూడా మిర్యాలగూడ సీటును సీపీఐఎం పార్టీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ సభలో తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. అంటే ఆయనకు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. ఈ బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే ఉబయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గం జనాలకు ముఖం చూపించడానికి ఇబ్బంది పడుతున్నారట. అందుకే తమ పీఏలు, అనుచరులతో పనులు చక్కబెడుతున్నారని టాక్. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫాంహౌజ్కే పరిమితం.? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లలో గత ఎన్నికల్లో గులాబీ పార్టీకే 13 దక్కాయి. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన భీరం హర్షవర్థన్రెడ్డి కూడా తర్వాతి కాలంలో కారెక్కి హాయిగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హర్షవర్థన్రెడ్డితో పాటు.. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చిక్కుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు ఆ ఫాంహౌస్ ఎపిసోడ్ తర్వాతి నుంచి తమ నియోజకవర్గాలకు రావటం లేదు. దీంతో వారు ప్రజలకు ముఖం చాటేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఈ ఇద్దరు మాత్రమే ఎందుకు ఆ వ్యవహారంలో తలదూర్చారనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతుంటే వారిద్దరు మాత్రమే ప్రగతిభవన్ను వదలటం లేదు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఇంటెలిజెన్స్ సూచన మేరకే నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని ఎమ్మెల్యేలు చెబుతుండటం విశేషం. ప్రభుత్వం కూడా వీరికి భద్రత పెంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు సమకూర్చింది. ఆయినా వారు నియోజకవర్గాల్లోకి రావడానికి భయపడుతున్నారు. గోడకెక్కిన గువ్వల అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పోస్టర్లు అతికించటం కలకలం రేపుతుంది. గతంలో ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లలో ఫోటోలు కూడా పెట్టారు. జిల్లా పరిషత్ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డిపై దాడి.. వికలాంగుడిపై దాడి.. గిరిజన సర్పంచ్పై దాడి.. ఫారెస్టు ఆఫీసర్పై దాడి.. సీఎం పర్యటనలో నన్నే ఆపుతావారా అంటు సీఐపై చిందులు వేశారంటూ పోస్టర్లలో ప్రచురించారు. వీటిని స్దానికులు ఆశ్చర్యంగా చూస్తుండటం ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే పోస్టర్ల వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చదవండి: (హీటెక్కిన తెలంగాణ పొలిటికల్ సమీకరణాలు.. బీజేపీకి లాభమెంత?) తమ నేతను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు మండిపడుతున్నారు. గతంలో కూడ పలు సందర్భాల్లో గువ్వల బాలరాజు తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తర్వాత ఎమ్మెల్యేపై తిట్లపురాణంతో సాగుతున్న ఫోన్ సంభాషణలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని వందకోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యేను తరమికొట్టాలని.. అందుకు అన్నివర్గాల వారు సహకరించాలని..ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేకు సంకటంగా మారుతున్నాయి. క్షేత్ర స్థాయి కష్టాలు కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్దన్రెడ్డి ఇప్పటికే పార్టీ మారి ఆనేక విమర్శలు ఎదుర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయి పార్టీ మారాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారిన నాయకుడు డబ్బు కోసం ఇప్పుడు కూడా మారడని గ్యారెంటీ ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుతో సఖ్యత లేని కారణంగా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. దిద్దుబాటు చర్యలకు అధిష్టానం పెద్దగా చొరవ చూపకపోవటంతోపాటు.. ఫామ్ హౌజ్ వ్యవహారంతో పార్టీకి నష్టం కలుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే కొల్లాపూర్కు రావాలని ప్రయత్నించినా స్దానికంగా ఉండే తన అనుచరుల సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడ ప్రతిపక్షాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అదునుగా ఎమ్మెల్యే వైరివర్గం నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని మరింత తీవ్రం చేసింది. ప్రగతిభవన్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లో తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపధ్యంలో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల బాటపడతారో లేక ఫాంహౌస్ కేసు తెగేంతవరకు దూరంగా ఉంటారో చూడాలి. -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ ధోబీఘాట్ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమోహన్ వర్గాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో రెండు వర్గాలు విడిపోయి తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా బలాలను ప్రదర్శించుకుంటూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చాటుతున్నారు. ఈ క్రమంలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేక నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం కుషాయిగూడలో ఆధునిక యాంత్రిక ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగా తనకు అవమానం జరిగిందని స్థానిక కార్పొరేటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకోగా.. ప్రొటోకాల్ తనకు సంబంధించిన అంశం కాదని అది అధికారుల చూసుకుంటారంటూ ఎమ్మెల్యే చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మహిళా కార్పొరేటర్నైన తనను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అడుగడుగునా అవమానపరుస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. ఒక మహిళనని చూడకుండా గడిచిన మూడేళ్లుగా అనేక అవమానాలకు గురిచేస్తూ వస్తున్నారని ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో లేని విధంగా ఎమ్మెల్యే చర్లపల్లి డివిజన్లో కార్పొరేటర్ ప్రమేయం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’ ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి చేస్తూ ప్రొటోకాల్ సమస్యకు తెరలేపుతూ తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళనైన తనను అంతటా అవమానపరుస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అధిష్టానానికి అందజేస్తానన్నారు. తాజాగా కుషాయిగూడ ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగానూ తనను అగౌరవపరిచినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు ధోబీఘాట్ వద్దే తాను ఉన్నానని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి రావడం మరో అరగంట సమయం ఉందని నిర్వాహకులు చెప్పడంతో పూలే వర్ధంతి సభలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చేలోపు మంత్రి, ఎమ్మెల్యే ధోబీఘాట్ యంత్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ప్రస్తావన లేకుండా నిమిషాల వ్యవధిలో ప్రారంభించి వెళ్లి తనను అవమానపరిచారని ఆవేదన చెందారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తనపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అవి పూర్తి అసత్యాలని కొట్టి పడేశారు. -
మల్లారెడ్డిపై ఐటీ దాడులు.. ఆ లాకర్స్లో ఏమున్నాయి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది. దాడుల సందర్భంగా మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో రూ.18.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలు, భారీ ఎత్తున ప్రాపర్టీ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని లాకర్లను ఐటీ శాఖ అధికారులు తెరవనున్నారు. ఇక, దాడుల నేపథ్యంలో తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు. చదవండి: (IT Raids: మల్లారెడ్డికి మరో షాకిచ్చిన ఐటీ అధికారులు!) -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్కడి ‘ఎమ్మెల్యేలకు ఎర’ వేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీచేసింది. ఇప్పటికే అరెస్టయిన హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్ వ్యాపారి నందుకుమార్తో.. రఘురామకు సత్సంబంధాలు ఉన్నట్లుగా సిట్ గుర్తించడంతో ఆయనకు నోటీసులు అందజేసింది. నిందితుల సెల్ఫోన్లలో రఘురామకృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడడంతో ఎంపీని విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. దీంతో 41–ఏ సీఆర్పీసీ కింద గురువారం ఆయనకు నోటీసులు జారీచేశారు. ఈ నెల 29న ఉ.10:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో తెలిపారు. సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టుచేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్లో పేర్కొన్నారు. మరోవైపు.. ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం ఆయన నివాసంలో నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్ అనుమానిస్తోంది. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య ఈ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, కర్ణాటక బీడీజేఎస్ చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గుస్వామి, కరీంనగర్కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్లను నిందితులుగా పేర్కొన్నారు. అలాగే, ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) ప్రతాపన్లు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు.. జగ్గు ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. చదవండి: (వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) -
హైదరాబాద్ కేంద్రంగా స్టేట్ వర్సెస్ సెంట్రల్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒకవైపు చలిపులి వణికిస్తుండగా.. మరోవైపు రాజకీయ వేడి రగులుకొంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల మాటల తూటాలతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు తారస్థాయికి చేరింది. నగరం కేంద్రంగా సాగుతున్న దర్యాప్తు సంస్థల దండయాత్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఐటీ, ఈడీ కేసులు, విచారణలు, అరెస్టులతో కేంద్రం ముందుకు వెళ్తోంది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారానికి సంబంధించిన ఫాంహౌస్ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఆయుధంగా వాడుకుంటోంది. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పెద్దల యుద్ధానికి కొన్ని రోజులుగా హైదరాబాద్ వేదికైంది. ఈడీ కేసులతో మొదలై.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఉన్న వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి సెంట్రల్ వర్సెస్ స్టేట్గా మారిపోయింది. టీఆర్ఎస్ నాయకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్న కేంద్రం దాదాపు ఏడాది కాలంలో పావులు కదిపింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నోటీసులు, దాడులతో కలకలం సృష్టించింది. స్థిరాస్తి సంస్థలు, సెల్ఫోన్, వస్త్ర, జ్యువెలరీ వ్యాపార దిగ్గజాలు కూడా వీటిని ఎదుర్కొన్నారు. ఓ పక్క ఈ పరిణామాలు ఇలా నడుస్తుండగానే చికోటి ప్రవీణ్కు సంబంధించిన క్యాసినో కేసుతో ఈడీ రంగంలోకి దిగింది. ప్రవీణ్తో మొదలైన విచారణ ఎదుర్కొనే వ్యక్తుల పరంపర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ వరకు వచి్చంది. వీరితో పాటు విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డినీ ఈడీ అ«ధికారులు ప్రశ్నించారు. లిక్కర్ కేసుతో మారిన సీన్... ఇలా ఐటీ, ఈడీ కేసులు, దాడులతో వాతావరణం వేడెక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీ లేకుండా చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్తో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు కేసులు, నోటీసులు, దాడులు, విచారణల వరకే కేంద్ర సంస్థలు పరిమితమయ్యాయి. లిక్కర్ కేసులో ఢిల్లీ సర్కారు నేతలతో పాటు హైదరాబాద్కు చెందిన కొందరు కీలక వ్యక్తుల్నీ ఓ ఏజెన్సీ అరెస్టు చేయడం, మరో ఏజెన్సీ సైతం కస్టడీలోకి తీసుకుని విచారించడం చకచకా జరిగిపోయాయి... పోతున్నాయి. ఈ వ్యవహారంలో ఏకంగా ఎమ్మెల్సీ కవిత పేరును తీసుకురావడానికి బీజేపీ అధినాయకత్వం ప్రయతి్నంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఫాంహౌస్ కేసుతో రంగంలోకి సిట్.. మునుగోడు ఉప ఎన్నికకు కొన్ని రోజుల ముందు తెరపైకి వచ్చి ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారానికి వేదికైన ఫాంహౌస్ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఖరీదు చేయడానికి అవసరమైన డీల్ చేస్తూ రంగంలోకి దిగిన నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి అరెస్టు అయ్యారు. తాము స్వా«దీనం చేసుకున్న ఆడియో, వీడియోల్లో కేంద్రం పెద్దలకు సంబంధించిన వ్యవహారాలే ఉన్నాయంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏకంగా బీఎల్ సంతోష్, తుషార్ భట్టాచార్య, జగ్గు స్వామిలకే నోటీసులు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు శ్రీనివాస్కు నోటీసులు ఇచ్చి రెండు రోజులు విచారణ చేసింది. మంత్రిపైనే ఐటీ బాణం.. ఈ కౌంటర్లు–ఎన్కౌంటర్ల మధ్యలో మంగళవారం చోటు చేసుకున్న వ్యవహారం కీలకంగా మారింది. ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డినే టార్గెట్గా చేసుకుంది. ఉదయం నుంచి ఏకకాలంలో ఆయనతో పాటు కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల ఇళ్లపై దాడులు చేసింది. మెడికల్ సీట్లలో అవకతవకలు, లావాదేవీల మధ్య భారీ వ్యత్యాసాలు గుర్తించినట్లు లీకులు కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ నాయకుల అనుచరులు, సహాయకులతో పాటు పార్టీ మద్దతుదారులను టార్గెట్గా చేసుకున్న కేంద్ర సంస్థలు మల్లారెడ్డి వ్యవహారంతో ప్రత్యక్షంగా మంత్రికి..పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక పంపినట్లయింది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తుయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
తగ్గేదేలే.. ఆస్పత్రికి కాదు.. సరాసరి అసెంబ్లీకే పోవాల.!
ఆయనో ప్రభుత్వ అధికారి. వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన పనిచేస్తున్న శాఖను ఉపయోగించుకుని పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశారు. ఆయన చేసే కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడూ వివాదస్పదమవుతున్నాయి. తాజాగా సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే సీటు కోసం ఆ అధికారి పడరాని పాట్లు పడుతున్నారని సెటైర్లు పడుతున్నాయి. హెల్త్ డైరెక్టర్కు రాజకీయ ఆశలు తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్న గడల శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఆయన పేరు అందరికీ పరిచయమైంది. ఇక అప్పటినుంచి పొలిటికల్ ఏంట్రీ కోసం ఆరాటపడుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారని టాక్. ఇప్పుడు కొత్తగూడెం పట్టణంలో ఎక్కడ చూసిన గడల శ్రీనివాసరావు ప్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇక గులాబీ పార్టీ కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గడల చేస్తున్న హడావుడి చూసి ఏం జరుగుతుందో తెలియక సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైలెంట్గా గమనిస్తున్నారు. అప్పుప్పుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు డిహెచ్ తీరుపై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.. ఎవరెన్ని డ్రామాలు వేసినా వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ తనకే ఇస్తారని చెబుతున్నారు వనమా. కఠోర పూజలు, మెడికల్ క్యాంపులు రెండు సంవత్సరాలుగా గడల శ్రీనివాసరావు నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జీఏస్ఆర్ ట్రస్ట్ పేరుతో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ.. జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనే చేసే కార్యక్రమాలు కొన్ని వివాదస్పదమవుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. సుజాతనగర్ ప్రాంతంలోని చిన్న తాండాలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గడల చేసిన మిరపకాయ పూజలు సంచలనం రెకెత్తించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్ అయి ఉండి మూఢ నమ్మకాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పూజ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ వివాదంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన శ్రీనివాసరావు మళ్లీ లోకల్ గా కార్యక్రమాలు ప్రారంభించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొని డిజే టిల్లు పాటకు డ్యాన్స్ వేయడంపై విమర్శలు చెలరేగాయి. ఇది కూడ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సర్.. సదా మీ సేవలో తెలంగాణలో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను సీఏం కేసీఆర్ ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్కు వచ్చిన డాక్టర్ శ్రీనివాసరావు నిమిషం వ్యవధిలో రెండు సార్లు ముఖ్యమంత్రికి పాద నమస్కారం చేశారు. రెండు చేతులు జోడించి కేసీఆర్కు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కాని గడల శ్రీనివాసరావు చెబుతున్నదానిని కేసీఆర్ విన్నట్లుగా అనిపించలేదు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ వ్యవహార శైలిపై అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసమే డిహెచ్ ఇలా చేస్తున్నారని ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుకుంటున్నారట. ప్రతిపక్షాలు సైతం డిహెచ్ తీరును తప్పు పడుతున్నాయి. పదవికి రాజీనామా చేసి గులాబి కండువా కప్పుకుంటే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డాక్టర్కు గట్టి పోటీ కొత్తగూడెంలో మళ్లీ పోటీ చేయాలని సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. మరోవైపు పొత్తుల్లో ఈ సీటు సీపీఐ కే వస్తుందని, తానే బరిలో దిగుతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం మొన్నటి భేటీలో అన్నిచోట్లా సిటింగ్లకే సీట్లు ఇస్తామని ప్రకటించారు. మరి కొత్తగూడెంలో ఏం జరుగుతుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సింహం వర్సెస్ సివంగి: యుద్ధం వెనుక కారణాలేంటి?
మొదట వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత శత్రువులు. రెండు పార్టీల మధ్య రాజకీయాలకే పరిమితం కావల్సిన వైరం.. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా తిట్టుకునే వరకు ఎందుకు వచ్చింది? గత లోక్ సభ ఎన్నికలప్పుడు మొదలైన రగడ.. రానురాను కత్తులు మింగి.. నిప్పులు కక్కేవరకూ ఎందుకు దారితీసింది? ఎంపీ అరవింద్.. ఎమ్మెల్సీ కవిత మధ్య సింహం వర్సెస్ సివంగిలా సాగుతున్న యుద్ధం వెనుక కారణాలేంటీ? 2019లో మారిన సీను 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికైన కల్వకుంట్ల కవిత.. తానిచ్చిన హామీలు నెరవేర్చలేదనే అభిప్రాయాన్ని తీసుకురావడంలో బీజేపీ నేతలు సక్సెసయ్యారు. ఎంపీ అభ్యర్థిగా బీజేపీ టిక్కెట్ సాధించుకునే క్రమంలో ధర్మపురి అరవింద్ దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పాదయాత్ర చేపట్టారు. చెరకు ఫ్యాక్టరీలు తెరిపించకపోవడంపై టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు అరవింద్. తనను పార్లమెంట్కు పంపిస్తే ఫ్యాక్టరీలను తెరిపించడంతో పాటు.. నిజామాబాద్లో పసుపు బోర్డ్ ఏర్పాటు చేయిస్తానంటూ ఏకంగా బాండ్ పేపర్తో రైతుల విశ్వాసాన్ని చూరగొన్నారు. తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకునే క్రమంలో కొంత యారగెంట్గా మాట్లాడటాన్నే తన శైలిగా మార్చుకున్నారు ధర్మపురి అరవింద్. అరవింద్ విమర్శలు, పాదయాత్ర, పసుపు రైతుల మూకుమ్మడి నామినేషన్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే కవితకు సహకరించకపోవడం వంటివెన్నో కారణాలు కవిత ఓటమికి కారణాలయ్యాయి. అవన్నీ ధర్మపురి అరవింద్ విజయానికి దారి తీసాయి. మాటలు.. మంటలు అరవింద్ ఎంపీగా విజయం సాధించడంతో పాటు..ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. నిజామాబాద్ కార్పోరేషన్ లో కూడా 28 డివిజన్లు గెల్చుకుని.. టీఆర్ఎస్ తో ఢీ అంట్ ఢీ అనే పార్టీగా స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీ అవతరించింది. గతంలో ఎమ్మెల్యేగా యెండల లక్ష్మీనారాయణ గెల్చినా... అరవింద్ గెలుపు తర్వాత.. కాషాయజెండా బలం మరింత పెరిగింది. దాంతో అరవింద్కు గెలుపిచ్చిన కిక్కుతో... కవితపై, కేసీఆర్పై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం ఎక్కువైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా కవిత మళ్లీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిజామాబాద్ నుంచి గెలిచారు. ఆ గెలుపు పైన కూడా అరవింద్ సెటైర్లు వేయడంతో... కవిత వర్సెస్ అరవింద్ మాటల యుద్ధం ముదిరింది. పార్లమెంటుకా? అసెంబ్లీకా? వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న బీజేపి ఎంపీలందరినీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని బీజేపి అధిష్ఠానం యోచిస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో... ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని.. బాల్కొండ నుంచి కూడా దిగే అవకాశాలున్నట్టు.. అలాగే నిజామాబాద్ రూరల్, అర్బన్ వంటి నియోజకవర్గాలపైనా దృష్టి సారించారంటూ రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. అరవింద్ వర్సెస్ కవిత కాస్తా... అరవింద్ వర్సెస్ టీఆర్ఎస్గా మారడంతో.. అరవింద్ ఎక్కడికెళ్లితే అక్కడ అడ్డుకోవడాలు సాధారణ విషయాలుగా మారాయి. ఆర్మూరు మండలం ఇసాపల్లిలో పసుపు రైతులు అరవింద్ను అడ్డుకుని ఆయన కారు అద్దాలు ధ్వంసం చేయడం గతంలో ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత ఇందల్వాయి మండలంలోనూ శివాజీ విగ్రహావిష్కరణ సమయంలోనూ... దర్పల్లి, మోపాల్ వంటి ప్రాంతాల్లోనూ అరవింద్ ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడమూ ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణాన్ని సృష్టించింది. నోరు జారింది.. అద్దం పగిలింది కొంతకాలం పాటు నిజామాబాద్లో వాతావరణం స్తబ్దుగా మారింది. తాను ఎంపీగా గెలవడానికీ...తర్వాత తనను తాను లైమ్ లైట్ లో ఉంచుకోవడానికి... కవితను, కల్వకుంట్ల కుటుంబాన్నే అరవింద్ ఎక్కువ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది కాస్తా ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి నుంచి వ్యక్తిగత శత్రుత్వంగా మారింది. కవిత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో టచ్ లో ఉన్నారని... ఆమెకు బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర ఇవ్వకపోవడమే అందుకు కారణమన్నట్టుగా అరవింద్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ప్రత్యర్థుల మధ్య అగ్గి రాజుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్ లో అరవింద్ తల్లి ఒక్కరే ఉన్న సమయంలో టీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటిపై దాడికి దిగి ఫర్నీచర్, ఇంటి అద్దాలు ధ్వంసం చేయడంతో మరింత రచ్చకు దారి తీసింది. ఏకంగా గవర్నర్ ఇన్వాల్వ్ కావడం...అరవింద్ కు టాప్ టు బాటమ్ పార్టీ నేతల నుంచి సానుభూతి పెరిగింది. మరోవైపు అరవింద్ ఇంటిపై దాడిని ఓ సామాజికవర్గపు ఎంపీ ఇంటిపై దాడి అంటూ కులరంగు పులమడం మరింత అగ్గి రాజుకునేలా చేసింది. కవితకు మద్దతుగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. చివరకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య వ్యక్తిగత పోరుగా మారిపోయింది. ఏడాది ముందే గరం గరం ఇద్దరు ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య తలెత్తిన కొత్త పోరు ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. పైగా ఎక్కడ పోటీ చేస్తే అక్కడి కొచ్చి ఓడిస్తానని కవిత సవాల్ విసరడం... దమ్ముంటే ఆర్మూర్లో నాపై గెలువు అని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరవింద్కు ఛాలెంజ్ చేయడం పోరు మరింత రసవత్తరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అరవింద్ ఎక్కడ నిలబడుతాడోనన్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా.. తాను నిజామాబాద్లోనే మళ్లీ పోటీ చేస్తానని అరవింద్ ప్రకటించారు. చూడాలి.. ముందు ముందు ఈ ఇద్దరు నేతల మధ్య పోరు ఎక్కడకు దారితీస్తుందో..? పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఏడాదికి ముందే బలప్రదర్శనలు.. సిట్టింగ్ను కాదని.. మాజీ ఎమ్మెల్యే హడావుడి
సాక్షి, నిజామాబాద్ : ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే నిజామాబాద్లో నాయకుల బలప్రదర్శనలు షురూ అయ్యాయి. తాజాగా ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య నువ్వా నేనా అనేవిధంగా మాటలయుద్ధం ముదిరింది. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాడి వేడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థానంలో మరోరకమైన రాజకీయ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోవిధంగా తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగులకు మళ్లీ టిక్కెట్లు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ పలువురు ఎమ్మెల్యేల్లో ఒకింత అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో టిక్కెట్టు రేసు మొదలైందనేలా నాయకుల కార్యక్రమాలు ఉంటున్నాయి. నిజామాబాద్ అర్బన్లో మైనారిటీల తరువాత మున్నూరుకాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత సైతం ఈ స్థానం నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే లలిత నగరంలో మున్నూరుకాపు కార్తీక వనభోజనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న లలిత, మరోసారి ఎమ్మెల్సీ హామీని కేసీఆర్ నుంచి పొంది టీఆర్ఎస్లో చేరారు. చివరి నిముషంలో సదరు ఎమ్మెల్సీ స్థానం కల్వకుంట్ల కవితకు కేటాయించారు. లలితకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు. అయితే లలిత తన సొంత నియోజకవర్గం ఆర్మూర్ బదులు తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్ను ఆశిస్తున్నట్లు సమాచారం. మున్నూరుకాపు నుంచి మహిళగా తనకు అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రొటీన్గా చేస్తే పట్టించుకోం.. కానీ టార్గెట్గా నడుస్తోంది: మంత్రి తలసాని పట్టు జారకుండా.. ఆకుల లలిత కార్యక్రమాల్లో పాల్గొంటుండగానే ఎమ్మెల్యే గణేశ్గుప్తా కార్యక్రమాల్లో దూకు డు పెంచారు. నగర అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో నగరంలో ఈ నెల 16న భారీ ప్రదర్శన చేయించారు. మళ్లీ తనదే టిక్కెట్టు అన్న ధీమాతో ఉన్న గణేశ్గుప్తా పట్టు ఏమాత్రం జారకూడదనే సంకల్పంతో ముందుకు కదులుతున్నారు. ఇదిలా ఉండగా వైశ్య సామాజిక వర్గం నుంచి బీజేపీ తరపున ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బలంగా దూసుకొస్తున్నారు. ధన్పాల్కు అన్నివర్గాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఈసారి ఆయనకు బీజేపీ నుంచి టిక్కె ట్టు కచ్చితంగా వస్తుందని వివిధ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నుంచి బీజేపీ ద్వారా తన సామాజిక వర్గానికే చెందిన నాయకుడు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా, మరోవైపు టీఆర్ఎస్ నుంచి ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న మున్నూరుకాపు సామాజిక వర్గం నాయకురాలు టిక్కెట్టు ఆశించే పరిస్థితి ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు నెలకొంది. నిజామాబాద్ అర్బన్ నియాజకవర్గంలో టిక్కెట్ల వేట ఇప్పటి నుంచే ప్రారంభమైందని వివిధ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేదెవరు, ఎంఐఎం బరిలోకి దిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం చోటుచేసుకుంటుందనే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
తొమ్మిదేళ్ల క్రితం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎదురేలేదు.. మరి నేడు?
సాక్షి, హైదరాబాద్: నగర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. సీనియర్ నేతల వలసలతో గ్రేటర్లో ఆ పార్టీ కకావికలమవుతోంది. వరుస ఓటములతో సంస్థాగతంగా బలహీనపడటంతో పాటు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడంతో మరింత దిగజారింది. తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇతర పార్టీలకు క్యూ కడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తొమ్మిదేళ్ల క్రితం వరకు నగరంలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ప్రాతినిధ్యం కలిగి ఎదురులేని శక్తిగా ఉన్న నగర కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం గులాబీ ఆకర్ష్తో నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్బై చెప్పగా, తాజాగా కమలం ఆకర్ష్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్టీని వీడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ ముఖ్య నేతలపై వల విసరడంలో కమలనాథులు సఫలీకృతమవుతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, పార్టీ సనత్నగర్ ఇన్చార్జి మర్రి శశిధర్రెడ్డి పార్టీలోకి ఆహ్వానించడంలో విజయవంతమైంది. మిగిలిన అసంతృప్త వాదులను సైతం చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్పై దృష్టి కేంద్రీకరించలేదన్న అపవాదును మూటగట్టుకొంటోంది. ముఖ్యనేతలు ఒక్కొక్కరు జారుకోవడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి) కమలం ఆకర్ష్.. తాజాగా కమలం ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర ప్రభావం చూపింది. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుటుంబం పార్టీకి గుడ్బై చెప్పగా, వారితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, ద్విత్రీయ శ్రేణి నేతలు బీజేపీలో చేరారు. ఆ తర్వాత కుత్బుల్లాపుర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్ కాంగ్రెస్ను వీడారు. తాజాగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ వైపు మొగ్గారు.. దాసోజు శ్రవణ్ మాత్రం కేవలం రెండు మాసాలకే బీజేపీని కూడా వీడి టీఆర్ఎస్లోచేరారు. మరో ముఖ్యనేత మైనారిటీ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా రథసారథి కరువు రాష్ట్ర రాజధానిగా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న మహా నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కరువైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ పదవికి రాజీనామా చేయడంతో నగర సారథి లేకుండా పోయారు. రెండేళ్లుగా కమిటీ లేని నగర కాంగ్రెస్ను ఆరు నెలల క్రితం మూడు జిల్లాలుగా విభజించి కమిటీలు వేయాలన్న పీసీసీ నిర్ణయం సైతం అటకెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో జవసత్వాలు నింపే ప్రయత్నం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. వరుస ఓటములతో.. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకాగా, అప్పట్లో గ్రేటర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పక్షంలో చేరిపోయారు. ఆ తర్వాత రెండోసారి జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. శివారు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డిలు అధికార పార్టీలో చేరిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తాజాగా పార్టీ కీలక నేతలు బీజేపీలోకి జారుకోవడంతో కాంగ్రెస్కు మింగుడు పడటంలేదు. -
Telangana: బీజేపీ మెయిన్ టార్గెట్ ఆ ఆరుగురే..!
తెలంగాణలో జెండా పాతేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కాషాయ దళం భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? మునుగోడు పోయింది సరే, 2023 ఎన్నిక కోసం ఎలా సమాయత్తం కావాలి? ఢిల్లీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతలకు వచ్చిన ఆదేశాలేంటి? తెలంగాణలో దూకుడు మీదున్న కమలదళానికి మునుగోడ్ బ్రేక్ వేసింది. కారు, కమలం పార్టీల మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరిగినా.. చివరికి విజయం టీఆర్ఎస్కే దక్కింది. దీంతో కాషాయ పార్టీ అగ్రనేతలు.. తెలంగాణ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా కీలక నేతలకు బ్రీఫింగ్ ఇచ్చారు. పటిష్టమైన క్యాడర్ లేని నల్లగొండ జిల్లాలో కొంత పట్టుసాధించినట్లు భావిస్తున్న బీజేపీ నేతలు...ఉప ఎన్నిక తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలం పెంచుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో.. పార్టీకి దూరంగా ఉంటున్న నేతలకు కాషాయ కండువాలు కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ లిస్టులో ఉన్న ప్రధానంగా మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ గెలవని పార్లమెంట్ స్థానాల్లో ఖమ్మం ఒకటి. ఇక్కడ పాగా వేయడానికి అవసరమైన అస్త్రాలను కమలనాథులు సిద్దం చేసుకుంటున్నారు. వారితో పాటు ఇతర జిల్లాల్లోనూ బడా నేతలపై కన్నేశారు. 1. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మం నుంచి గతంలో వైఎస్సార్సిపి ఎంపీగా గెలిచిన పొంగులేటి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం పేరుకే పార్టీలో ఉన్నా.. పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతారు. జిల్లాలో మంచి పేరు ఉండడంతో పాటు ఆర్థికంగా పుష్కలమైన వనరులున్నాయని ఈయనకు పేరుంది. ఇటీవల ఆయన కూతురి వివాహం సందర్భంగా జిల్లా అంతటా చేసిన ఆర్భాటం ఇప్పట్లో ఎవరూ మరిచిపోరు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో కమలం పాగా వేయాలంటే పొంగులేటి సరైన వ్యక్తిగా పార్టీ భావిస్తోంది. 2. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల పేరు కమలం పార్టీ సీరియస్గా పరిశీలిస్తోంది. గతంలో కెసిఆర్కు అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్నా.. అనూహ్యంగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత జిల్లాలో మారిన సమీకరణాలు ఇబ్బందికరంగా మారడం తుమ్మలను నిరుత్సాహపరిచాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మంత్రి పదవి వస్తుందనుకున్న తుమ్మలకు.. నిరాశే మిగిలింది. సత్తుపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభకు కూడా తుమ్మల రాలేదు. తుమ్మలను చేర్చుకోగలిగితే.. జిల్లాలో పార్టీ సూపర్హిట్ అన్న ఆలోచనలో ఉన్నారు. 3. జలగం వెంకటరావు ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జలగం వెంకటరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. అమెరికాలో చదువుకుని వచ్చి సత్తుపల్లి, కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో కొత్తగూడెం నుంచి రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. మారిన సమీకరణాలతో టీఆర్ఎస్ తనను పక్కన పెట్టిందన్న భావనలో జలగం వర్గం ఉంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తుమ్మలకు సన్నిహితుడిగా ఉంటోన్న జలగం.. తాజాగా సత్తుపల్లి మీటింగ్కు దూరంగా ఉన్నాడు. ఇటువంటి సీనియర్ నాయకులను తమవైపు తిప్పుకుంటే పార్టీకి లాభం చేకూరుతుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. 4. జూపల్లి కృష్ణారావు తుమ్మల లాగే టీఆర్ఎస్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నుంచి 5 సార్లు గెలిచిన జూపల్లి.. గతంలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో, ఆ తర్వాత కిరణ్కుమార్ రెడ్డి సర్కారులో మంత్రిగా ఉన్నారు. 2014-18 మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్లో స్ట్రాంగ్ లీడర్లలో ఒకరైన జూపల్లి.. 2018లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓడారు. కొంత కాలంగా టీఆర్ఎస్ పట్ల జూపల్లి అసంతృప్తిగా ఉన్నారు. 5. పట్నం మహేందర్ రెడ్డి నాలుగు సార్లు తాండూరు నుంచి గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గరి బంధువు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2018 వరకు రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం.. 2018లో అనూహ్యంగా పైలట్ రోహిత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో పైలట్ రోహిత్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరిపోవడం పట్నంకు రుచించని వ్యవహారంలా మారింది. అందుకే పట్నం మహేందర్రెడ్డిని తమ వైపుకు తిప్పుకోవాలన్నది బీజేపీ ఆలోచన. 6. బాల్కొండ సునీల్ రెడ్డి బాల్కొండ టీఆర్ఎస్లో చాలా కాలం పని చేసి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ముత్యాల సునీల్కుమార్ రెడ్డి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాడు. నియోజకవర్గంపై కొంత పట్టున్న సునీల్రెడ్డి.. అవకాశం దక్కట్లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిజామాబాద్లో సునీల్రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. మరింత బలోపేతం అవుతామని భావిస్తున్నారు. మొదటి ఫేజులో కొందరిని చేర్చుకోగలిగితే.. ఆటోమెటిక్గా మరింత మంది చేరుతారన్న భావనలో ఉన్నారు కమలనాథులు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో కొత్త పొత్తులకు దారి తీస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్కు పొత్తు కుదిరితే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ సీపీఐ కోటా కిందకు వెళుతుందనే ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే హుస్నాబాద్ గులాబీ ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేస్తారు? అసలు బరిలో ఉంటారా? లేదా? నాడు కమ్యూనిస్టుల కంచుకోట హుస్నాబాద్ నియోజకవర్గం.. కరీంనగర్ జిల్లాలో వామపక్షాలకు ఒకనాటి కంచుకోట. ఇక్కడ సీపీఐ నాయకులు దేశిని చిన మల్లయ్య ఐదుసార్లు, చాడ వెంకట్ రెడ్డి ఒకసారి విజయం సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా వామపక్షాలతో, టీఆర్ఎస్ పొత్తు గురించి ప్రచారం జరుగుతుండటంతో.. హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దారెటు అనే చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న కేసీఆర్ మిత్రుడు కెప్టెన్ లక్ష్మీకాంత్ రావ్ తనయుడే సతీష్ కుమార్. టీఆర్ఎస్లోని ఈక్వేషన్స్ వల్ల వారి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ నుంచి హుస్నాబాద్ కు వెళ్ళి సతీష్కుమార్ పోటీ చేసి గెలిచారు. పొత్తు పొడుస్తుందా? కొత్తగా పొత్తు పొడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే కరీంనగర్ జిల్లాలో సీపీఐ ముందుగా అడిగే స్థానం హుస్నాబాద్ అవుతుంది. గులాబీ దళపతి కేసీఆర్ కొత్తగా దోస్తీ కలిసిన మిత్రపక్షం కోసం హుస్నాబాద్ ఇవ్వడానికి ఒకే అంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రస్తుత టీఆరెఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిస్తితి ఏంటనే చర్చ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో జరుగుతోందట. హుస్నాబాద్ నుంచి మళ్లీ సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్కు వలస వెళ్లాల్సిన పరిస్తితి ఏర్పడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సతీష్కుమార్ కుటుంబం అంతా అక్కడే రాజకీయంగా ఎదిగింది. కుటుంబ వ్యాపారాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈటల రాజేందర్ కోసం గతంలో సతీష్కుమార్ను హుస్నాబాద్కు పంపించారు కేసీఆర్. ప్రస్తుతం ఈటల బీజేపీలో చేరినందున అక్కడ గులాబీ పార్టీలో కొంతవరకు ఖాళీ ఏర్పడిందంటున్నారు. చదవండి: (తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్.. అనూహ్యంగా ఎదిగిన కమలం) హుజురాబాద్తో లింకు ఈటల రాజీనామా కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్వీ కార్యకలాపాల్లో మళ్లీ నిమగ్నం అయ్యారు. ఆ సీటు ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ సీటుకు బదులుగా ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ... తానే హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అంటూ చెప్పుకుంటున్నారు పాడి కౌశిక్రెడ్డి. అయితే ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నందున హుజూరాబాద్ సీటు సతీష్ కుమార్కు ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో టాక్. కాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పదవిని తీసుకోవాలని కోరుకుంటున్నారట. ఇదే నిజమైతే అటు హుస్నాబాద్ ఇటు హుజూరాబాద్ రెండింటిలోనూ కొత్త అభ్యర్థులు బరిలో దిగుతారని అనుకోవచ్చు. చదవండి: (MLAs Purchase Case: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్కు సిట్ నోటీసులు) -
MLAs Purchase Case: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్కు సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు బూసారపు శ్రీనివాస్కు గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 21న ఉదయం 10:30కి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న రామచంద్రభారతికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు మరో ఇద్దరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరిని ఫరీదాబాద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం. వీరిద్దరూ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న రామచంద్రభారతికి అత్యంత సన్నిహితులుగా చెబుతున్నారు. ఈ ఇద్దరికీ కేసులో సహ నిందితుడిగా ఉన్న నందుకుమార్తోనూ సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ఎర కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం (సిట్)కు అప్పగించిన మరుసటి రోజునే సైబరాబాద్కు చెందిన ప్రత్యేక బృందం ఒకటి ఢిల్లీకి చేరుకొని విచారణ చేపట్టింది. నిందితులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం, కాల్డేటా ఆధారంగా ఫరీదాబాద్లో వీరిని అదుపులోకి తీసుకుంది. వీరికి ముగ్గురు ముద్దాయిలతో ఉన్న సాన్నిహిత్యం, ఎమ్మెల్యేల కొనుగోళ్లలో వీరి ప్రమేయం తదితర వివరాలపై ఆరా తీస్తోంది. ఇప్పటికే అదుపులో ఉన్న నిందితులకు సంబంధించిన వీడియోల్లో రాజస్తాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సిద్ధంచేసిన ప్రణాళిక, దీనికి తామందించిన సహకారం వంటి అంశాల ప్రస్తావన ఉండటంతో ఈ వ్యవహారంలో వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్లో అరెస్ట్ చూపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి అరెస్ట్తో కేసు విచారణ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. చదవండి: (బుల్లెట్ ప్రూఫ్తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం) -
తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్.. అనూహ్యంగా ఎదిగిన కమలం
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలి తెలంగాణ పర్యటనలో రాజకీయంగా చాలా సంకేతాలు, సందేశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ , కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మద్య ఏర్పడిన వైరుధ్యాల ప్రభావం ఈ పర్యటనలో సుస్పష్టంగా కనిపించింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత జరిగిన మోడీ పర్యటనలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనలేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మద్య వాతావరణం ఉప్పు, నిప్పుగానే సాగుతోంది. మోడీనికాని, కేంద్ర ప్రభుత్వాన్ని కాని కెసిఆర్, కెటిఆర్, తదితర టిఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దానికి ప్రతిగా తెలంగాణ బిజెపి నేతలు కూడా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో ఒకరకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనూహ్యంగా ఎదిగిన కమలం ఇటీవల పర్యటనలో ప్రధాని మోడీ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేరుగా కెసిఆర్ పైన, ఆయన కుటుంబంపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాకపోతే కెసిఆర్ పేరు ఎత్తలేదు. కాని మోడీ ప్రసంగంలో విమర్శల తీవ్రత భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతంగా తీసుకోవచ్చు. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఆయన అవినీతి మయంగా, కుటుంబ పాలనగాను విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తనను కిలోల కొద్ది తిడుతున్నారని, ప్రజల కోసం తాను భరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అంటే దీని అర్దం టిఆర్ఎస్ అధినేతలు కాని, ఇతర నేతలు కాని తనను ఎలా విమర్శిస్తున్నది గమనిస్తూనే ఉన్నానని ఆయన చెప్పకనే చెప్పారు. తెలంగాణలో కమల వికాసం ఖాయమని, మునుగోడు ఉప ఎన్నికలో బిజెపికి వచ్చిన ఓట్లే నిదర్శనమని ఆయన అన్నారు. నిజానికి మునుగోడులో బిజెపి ఓటమి చెందింది. అయినా, కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టివేసి, టిఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చి పదివేల తేడాతో ఓడిపోయినా, అది తమకు అనుకూల సంకేతంగానే మోడీ భావిస్తున్నారు. మనీ పాలిట్రిక్స్ ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దానిని అధిగమించి బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన భావిస్తున్నారు. మోడీ టిఆర్ఎస్ పై అవినీతి విమర్శలు చేస్తున్నారు. కాని అదే సమయంలో ఒక విషయాన్ని వ్యూహాత్మకంగా విస్మరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా ఖర్చు చేశాయి. మరి అదంతా నల్లధనమా? లేక తెల్లధనమా? నోట్ల రద్దు చేయడం ద్వారా నల్లధనాన్ని అరికడతామని ప్రకటనలు చేసిన బిజెపి, ఇప్పుడు టిఆర్ఎస్ తో పోటీగా అంత డబ్బును ఎలా ఖర్చు చేయగలిగారన్నది పెద్ద ప్రశ్న. దురదృష్టవశాత్తు దేశ రాజకీయాలలో డబ్బు పాత్రను నిరోధించడంలో మోడీ ప్రభుత్వం కూడా సఫలం కాలేదు సరికదా.. తమ పార్టీ తరపున కూడా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. అలాంటప్పుడు ఇతర పార్టీలకు బిజెపి భిన్నమైన పార్టీ అని ఎలా చెప్పగలరు. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడోందని ప్రధాని స్థాయిలో వారు ఆరోపిస్తే దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. మోడీ గతంలో కూడా ఇలాగే చేశారు. ఏపీలో గత ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజకీయ విభేదాలు వచ్చాక పోలవరం ప్రాజెక్టు ఆయనకు ఏటిఎమ్ అయిందని మోడీ విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు పి.ఎస్.పై కేంద్ర దర్యాప్తు సంస్తల అధికారులు దాడులు చేసి రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించారు. అది జరిగి మూడేళ్లయినా ఆ కేసు ఎందుకు ముందుకు నడవలేదన్నది బహిరంగ రహస్యమే. ఇలాంటివాటిని మోడీ ఎలా సమర్ధించుకోగలరు? కేంద్ర సంస్థలు x రాష్ట్ర సంస్థలు తెలంగాణలో కూడా టిఆర్ఎస్ ప్రముఖులపై విమర్శలు చేయడం రాజకీయ లక్ష్యమే తప్ప, మరొకటి కనిపించడం లేదన్న విమర్శకు ఆస్కారం ఇస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనో, కాళేశ్వరం అవినీతి అనో బిజెపి నేతలు తరచు విమర్శలు గుప్పిస్తుంటారు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఎదుటి పార్టీలను బెదిరించడానికి ఇలాంటి ఆరోపణలు చేయడం అన్ని పార్టీలకు అలవాటైంది. రాష్ట్ర పోలీసులను టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి వినియోగిస్తోందని ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. వీటిలో కొంతవరకు నిజమే ఉండవచ్చు. రామగుండం సభలో మాత్రం మోడీ ఒక ప్రశ్న వేశారు. సింగరేణి కాలరీస్ ను ప్రైవేటైజ్ చేస్తామంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే తాము ఎలా ప్రైవేటీకరిస్తామని ఆయన ప్రశ్నించారు. దీనికి టిఆర్ఎస్ కూడా సరైన సమాధానం చెప్పినట్లు కనిపించదు. కార్ ఫైరింగ్ ఇటీవలికాలంలో టిఆర్ఎస్ నేతలు బిజెపిపైన, మోడీ, అమిత్ షా ద్వయంపై తీవ్ర విమర్శలు గుప్పించడం ద్వారా రాజకీయ రగడ సృష్టిస్తున్నారు. ఈ వ్యూహం వల్ల నష్టం జరుగుతుందా? లాభం జరుగుతుందా? అన్నది భవిష్యత్తు పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. బిజెపిని నిలువరించి, తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి టిఆర్ఎస్ అన్ని వ్యూహాలు వేస్తోంది. అంతేకాదు తమ ప్రభుత్వంలోని లోటు పాట్లను, సహజంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను మొత్తం కేంద్రంపైన, బిజెపిపైన నెట్టడంలో టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో కొంతమేర సఫలం అయినట్లే అనిపిస్తుంది. చదవండి: (CM KCR: కేంద్రం టార్గెట్గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!) ఉదాహరణకు పార్టీ పిరాయింపుల విషయంలో టిఆర్ఎస్, బిజెపిలకు పెద్ద తేడా లేదు. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెరపైకి తెచ్చి బిజెపిని బదనాం చేయడానికి టిఆర్ఎస్ బాగానే వాడుకుంది. రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా దానికి కారణం కేంద్రమేనని టిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. దీనిని ఎదుర్కోవడం బిజెపికి పెద్ద సవాలుగా మారిందని చెప్పాలి. ప్రత్యేకించి రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తోంది. నిజానికి దీనివల్ల రైతులకు వాటిల్లే నష్టం ఏమీ ఉండదు. అయినా టిఆర్ఎస్ , వామపక్షాలు దీనిపై రైతులలో భయాన్ని సృష్టించే యత్నం చేస్తున్నాయి. బిజెపి కూడా మీటర్ల ఏర్పాటును సమర్ధించలేకపోవడం, తామేమీ దానిని అమలు చేయాలని కోరడం లేదని చెప్పడం విశేషమే. రంజుగా రాజకీయం ఒక విషయంలో మాత్రం టిఆర్ఎస్ను మోడీ బాగానే కార్నర్ చేశారని అనుకోవాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందిన ఈ రోజులలో మూఢ నమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, మంత్రివర్గం ఏర్పాటు మొదలైన అంశాలలో మూఢ నమ్మకాలను పాటిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దీనికి జవాబు ఇచ్చే స్థితిలో టిఆర్ఎస్ లేదని అంగీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే కేంద్రం పధకం కింద ఇళ్లు ఇవ్వలేకపోయామని మోడీ ఆరోపించారు. మొత్తం మీద వచ్చే శాసనసభ ఎన్నికలకోసం టిఆర్ఎస్, బిజెపిలు రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. మోడీ కూడా తెలంగాణ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారని అర్ధం అవుతుంది. వీరి మధ్యలో కాంగ్రెస్ నలిగిపోతుందా? లేక నిలబడగలుగుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఆటలో అరటి పండవుతుందా? వాస్తవానికి క్షేత్రస్థాయిలో తెలంగాణలో బిజెపికన్నా కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ ఇటీవలి పరిణామాలలో కాంగ్రెస్ను బిజెపి వెనక్కి నెడుతోంది. ఇప్పటికీ బిజెపికి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా తెలంగాణలో అధికారంలోకి రావడానికి బిజెపి వ్యూహరచన చేస్తుంది. అయితే అది అంత తేలిక కాదని టిఆర్ఎస్ జవాబిస్తోంది. గత సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్పై టిఆర్ఎస్ తేలికగా విజయం సాదించింది. ఈసారి బిజెపి, కాంగ్రెస్ల మధ్య ఓట్లు చీలి టిఆర్ఎస్ బయటపడుతుందా? లేక బిజెపి తన సర్వశక్తులు ఒడ్డి అధికారంలోకి రాగలుగుతుందా అన్నది రాజకీయ తెరపైన చూడాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
CM KCR: కేంద్రం టార్గెట్గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం!
కేంద్రం టార్గెట్గా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారా?. దర్యాప్తు సంస్థలతో ఢీ కొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారా?. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా?. మునుగోడు స్ట్రాటజీని వచ్చే ఎన్నికల్లో అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా?. అసలు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏం జరిగింది? అనేది ఓ పరిశీలిస్తే.. కేంద్రాన్ని ఢీ కొనేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలే టార్గెట్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తుంటే వాటిని తిప్పికొట్టేందుకు తనకున్న అధికారాలను ప్రధాన అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. బీజేపీ నేతలే టార్గెట్గా రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపుతున్నారు. ఇదే అంశాన్ని ఎల్పీ సమావేశంలో నేతలకు చెప్పినట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని వారు ఎంత దూరం వెళ్తే మనం అంత దూరం వెళదామని నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రధాన టార్గెట్గా నేతలంతా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. నియోజకవర్గాల్లో బీజేపీని దోషిగా నిలపాలని, ప్రతి అవకాశాన్ని వాడుకోవాలన్నారు. తన కూతురు కవితని పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని ఇంత దారుణమైన రాజకీయాలు ఉంటాయా? అని వాపోయారు. పార్టీలో ఇంకెవరికైనా పార్టీ మారాలని ఒత్తిడి తెస్తే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. రానున్న 10 నెలలు కీలకమని అందరూ సీరియస్గా పనిచేయాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. చదవండి: (ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ) మునుగోడు ఉప ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన చోట ఇంఛార్జ్లుగా వ్యవహరించిన మంత్రులకు క్లాస్ పీకినట్లు సమాచారం. నిత్యం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ పనిచేయాలని సూచించారు. రానున్న కాలమంతా ఎన్నికల సంవత్సరంగా భావించి పనిచేయాలన్నారు. మునుగోడు అమలు చేసిన స్ట్రాటజీని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. ప్రతి 100 మందికి ఓ ఇన్ఛార్జ్ను నియమించి ప్రణాళికతో ముందుగా సాగాలని నేతలను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలను ఆదేశించారు. అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి నష్టం చేకూరిస్తే అసలు స్థానమే కోల్పోతారని పలువురు నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి మూడోసారి అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు, బీజేపీని ధీటుగా ఎదుర్కొనేలా కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఢీకొనేందుకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు. -
Munugode: ఉప ఎన్నిక ముగిసినా చల్లారని వేడి
సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని అధికార పార్టీ టీఆర్ఎస్ చెబుతున్నా.. కార్యాచరణ మాత్రం ఆ దిశాగానే సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కగా, ఇప్పుడు ఆ వేడి చల్లారకుండా టీఆర్ఎస్, బీజేపీలు తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఉప ఎన్నికలో నువ్వా నేనా అన్నట్లుగా పోరాడిన పార్టీలు ఆ తర్వాత కూడా తగ్గేదేలేదు అన్నట్లు కార్యక్రమాలు చేపడుతున్నాయి. బలం పెంచుకునే దిశగా ఆ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మునుగోడులో గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవాలతోపాటు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టగా, అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బీజేపీ పోరాటానికి దిగింది. మరోవైపు సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ క్షేత్ర స్థాయిలో వెళ్లాలని దిశా నిర్దేశం చేయడం కూడా ఆ సంకేతాలనే ఇస్తుంది. బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కోసం జిల్లా కోర్ కమిటీని, నియోజకవర్గ కన్వీనర్లను కూడా నియమించడం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి మునుగోడు ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించే పనిలో పడింది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఎన్నికలకు ముందే ఆయా శాఖల వారీగా ప్రభుత్వం గుర్తించింది. ఉప ఎన్నికల సమయంలో ప్రజలు నేతల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ జిల్లా ఇన్ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావుకు విన్నవించారు. త్వరలోనే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటిపై త్వరలో నిర్వహించబోయే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించేందుకు సిద్ధం అవుతోంది. ప్రధానంగా రోడ్లు, కాలేజీలు, చండూరును రెవెన్యూ డివిజన్ చేయడం తదితర సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు దృష్టిపెట్టారు. ఇక సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉన్నా ముందస్తు వస్తే ఎలా ముందుకు సాగాలన్న అంశంపై టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనా ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు జిల్లాలో మరింత అభివృద్ధిపై దృష్టి సారించింది. సమస్యలే ఎజెండాగా.. ఉప ఎన్నికలో ఓటమిపాలైనా.. అధిక ఓట్లు సాధించిన బీజేపీ మాత్రం ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతోనే మునుగోడులో ప్రజ సమస్యలపై దృష్టిపెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం హామీలు ఇచ్చిందే తప్ప వాటిని పరిష్కరించలేదంటూ బీజేపీ నుంచి పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గొల్ల కురుమలకు వచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై సోమవారం మునుగోడులో ధర్నా చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పరిష్కారం కోసం తన పోరాటం కొనసాగిస్తానని రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. «ఇలా ముందస్తు నేపథ్యంలో అధికార పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించగా బీజేపీ మాత్రం ప్రజాసమస్యలపై కార్యచరణ ప్రారంభించింది. మునుగోడులో ఇరు పార్టీల పోటాపోటీ కార్యాచరణ -
టీఆర్ఎస్ నేతలు మనుషులేనా? మానవత్వం లేదా?: షర్మిల
-
Munugode: బీజేపీ ఓటమి.. కమ్యూనిస్టులకు సంతోషమెందుకు?
మునుగోడు విజయం ఎవరికి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోంది? బీజేపీని ఓడించినందుకు గులాబీ పార్టీ కంటే ఎర్ర పార్టీలే ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నది నిజమేనా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక క్రమంగా ఉనికి కోల్పోతున్న వామపక్షాలకు మునుగోడు టానిక్లా పనిచేస్తుందా? టీఆర్ఎస్తో మునుగోడు పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా? మునుగోడు ఒకప్పుడు సీపీఐకి కంచుకోట ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వామపక్షాలు తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతున్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేక, స్థానిక సంస్థల్లో కూడా కూనారిల్లిపోతూ... కేడర్ చెల్లాచెదురవుతున్నా.. చేసేది లేక చేష్టలుడిగి చూస్తున్నారు అగ్ర నాయకులు. లెఫ్ట్ పార్టీల విజయం అనే మాట విని చాలాకాలం అయిపోయింది. మునుగోడు అసెంబ్లీ స్థానం ఒకప్పుడు సీపీఐకి కంచుకోట. అటువంటి చోట ఎన్నోసార్లు గెలిచిన కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోగా... గతంలో విజయం సాధించిన సీపీఐ సోదరపార్టీ సీపీఎంతో కలిసి ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతివ్వాల్సి వచ్చింది. ఓడిన బీజేపీ రెండో స్థానానికి చేరింది. అయినప్పటికీ బీజేపీ ఓటమిలో తమ ప్రమేయం ఉండటం సీపీఐ, సీపీఎంలకు ఎంతో సంతోషాన్నివ్వడమే గాదు..వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చినట్లయింది. కారెక్కడమే కామ్రెడ్లకు బెటరా? మునుగోడులో ఎలాగైతే టీఆర్ఎస్తో కలిసి బీజేపీని ఓడించగలిగామో... భవిష్యత్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో తమ సైద్ధాంతిక శత్రువైన కమలం పార్టీకి అధికారం దక్కకుండా గులాబీ పార్టీతో కలిసి సాగాలని వామపక్షాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సూది, దబ్బనం పార్టీలు అన్న నోటితోనే... ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో లెఫ్ట్ పార్టీల వల్లే గెలిచాం అని చెప్పడంతో ఎర్ర పార్టీల నేతలు ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నారట. ఏడాదిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు తమకు బలమున్న స్థానాల్లో చెరో పది అడగాలని చర్చించుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా చెరో ఎంపీ సీటు కూడా అడిగే ఆలోచన చేస్తున్నాయట. ఇక ఎన్నికలు వచ్చే వరకు టిఆర్ఎస్ తో ఉమ్మడి కార్యాచరణకు కూడా సిద్ధం అవుతున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. ఇక్కడ బూస్ట్.. అక్కడ సపోర్ట్ బీజేపీపై ఉమ్మడిగా చేసే పోరాటానికి తెలంగాణలో ప్రధాని పర్యటనను అస్త్రంగా మలచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కార్యాచరణలో ఇరుపక్షాలకు ప్రయోజనాలు దాగున్నాయి. లెఫ్ట్ పార్టీలకు తెలంగాణలో బూస్టింగ్ ఇచ్చి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కోసం సీపీఎం, సీపీఐల మద్దతు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని లెఫ్ట్ పార్టీలు టిఆర్ఎస్ సహాకారంతో ఎలాగైనా అడుగు పెట్టాలని చూస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్తో కూటమి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి సక్సెస్ కాదని కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకత్వం గట్టిగా అభిప్రాయపడుతోంది. కేసీఆర్ మాత్రం కాంగ్రెస్, బీజేపీలు లేని మూడో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్తో పొత్తు లేనేలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య స్నేహం కుదిరే చాన్స్ లేదు. వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో దోస్తీ కొనసాగిస్తున్నాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ను కాదని టీఆర్ఎస్తో పొత్తు కొనసాగించగలుగుతారా? మునుగోడు బాటలో నడిచి తెలంగాణ అసెంబ్లీలో మళ్ళీ పాదం మోపాలని రాష్ట్రంలోని రెండు కమ్యూనిస్టు పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. ఈ పూర్వ రంగంలో లెఫ్ట్, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ముందడుగు వేస్తాయా? లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటదా?: ఈటల
సాక్షి, హన్మకొండ: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు తీరుపై మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రధానమంత్రిని అవమాన పరుస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పారిపోతున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోని సీఎం కేసీఆర్ ఒక్కడేనని ధ్వజమెత్తారు. కారు ప్రమాదంలో గాయపడ్డ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పరామర్శించిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. సొంత పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేసే ఏకైక సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. చివరకు గవర్నర్ ఫోన్ని టాపింగ్ చేస్తున్నారంటే అంతకంటే దుర్మార్గం ఏమిలేదన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోనే అవకాశం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాటలు చూసి తెలంగాణ ప్రజలు కుంగిపోతున్నారని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువుల అందించాలని మోడీ చూస్తూంటే.. కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం, సీపీఐ పార్టీలను, పలు సంఘాలను రెచ్చగొట్టి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం సరికాదన్నారు. సింగరేణి బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ మాయలో పడి సింగరేణి కార్మకులు నిరసనలు చేస్తున్నారని తెలిపారు. ఈనెల 12న రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి వస్తున్నారని, మోదీ టూర్ విజయవంతం చేయాలని కోరారు. చదవండి: ('ఆయనేమో తడిబట్టలతో తిరుగుతాడు.. వీళ్లేమో కోర్టుకు.. ఎందుకంత భయం?') -
'ఆయనేమో తడిబట్టలతో తిరుగుతాడు.. వీళ్లేమో కోర్టుకు.. ఎందుకంత భయం?'
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ కేసులో విచారణను ఆపాలంటూ బీజేపీ కోర్టులో పిటిషన్ ఎందుకేసిందో చెప్పాలని మంత్రి హరీష్రావు కోరారు. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడేమో మాకు దొరికిన వాళ్ళు ఎవరో తెలియదంటూ తడిబట్టలతో తిరుగుతారు. కానీ వాళ్ల పార్టీ ప్రధాన కార్యదర్శి సిట్ని నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేస్తారని ఎద్దేవా చేశారు. మీకు సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్ళారు? మీకెందుకంత భయం? అంటూ ప్రశ్నించారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ, తెలంగాణలో విఫల ప్రయత్నం చేసిందన్నారు. అయితే ఇక్కడ బీజేపీ పరిస్థితి కుడితిలో పడిన ఎలక మాదిరిగా తయారైందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ దొంగలు అడ్డంగా దొరికిపోవడంతో జాతీయ స్థాయిలో ఆ పార్టీ పరువు పోయిందన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతలు గందరగోళంలో ఉన్నారని తెలిపారు. బీజేపీ నేతలు చెంపలు వేసుకుని తప్పు ఒప్పుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. 'మరోవైపు గవర్నర్ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మాట్లాడుతున్నారు. రాహుల్పై పోటీ చేసిన తుషార్ గురించి మేం చెప్పాం. కానీ గవర్నర్ మాత్రం తన ఏడీసీ తుషార్ గురించి మాట్లాడారు. గవర్నర్ హుందాగా ఉండాలి. గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు' అని మంత్రి హరీష్ రావు అన్నారు. చదవండి: (పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు) -
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, ఖమ్మం జిల్లా: పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ వెంటే తాను ఉంటానని తుమ్మల స్పష్టం చేశారు. ములుగు జిల్లా వాజేడులో గురువారం ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో మనం పని చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరులకు ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఒడి దుడుగులు సహజం. రాబోయేవి మన రోజులే.. ఎవరు అధైర్య పడొద్దు.. ఆందోళన చెందవద్దని తుమ్మల అన్నారు. 40 ఏళ్లు రాజకీయంగా ఏ విధంగా ఉన్నానో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఉంటాను. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేల కోట్లు ఇచ్చారు. మనకు మేలు చేసే వ్యక్తులనే మనం ఆదరించాలి. తాత్కాలిక అవసరాల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి’’ అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చదవండి: అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
ప్రొటోకాల్ వివాదం.. టీఆర్ఎస్ వాదనను ఖండించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించలేదన్న టీఆర్ఎస్ వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రామగుండం కార్యక్రమానికి కేసీఆర్ను ఆహ్వానించామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శికి ఎరువుల ఫ్యాక్టరీ సీఈవో లేఖ అందజేశారని కేంద్రం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్కు రాసిన లేఖను కేంద్రమంత్రి మాండవీయ విడుదల చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుల మధ్య దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ప్రొటోకాల్ రగడ మరోమారు తెరమీదకు వచ్చింది. గతంలో ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు సీఎంను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని మండిపడిన టీఆర్ఎస్.. ఇప్పుడు రామగుండం కార్యక్రమం విషయంలోనూ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక మలుపు -
Telangana: మళ్లీ ప్రొటోకాల్ రగడ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుల మధ్య దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ప్రొటోకాల్ రగడ మరోమారు తెరమీదకు వచ్చింది. గతంలో ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు సీఎంను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని మండిపడిన టీఆర్ఎస్.. ఇప్పుడు రామగుండం కార్యక్రమం విషయంలోనూ తీవ్ర విమర్శలు గుప్పించింది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే నిమిత్తం ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రానికి వస్తున్నారు. దీనికి ఆహ్వానం విషయంలో వివాదం మొదలైంది. రామగుండం ఫ్యాక్టరీలో తెలంగాణ రాష్ట్రం కూడా అధికారిక భాగస్వామిగా ఉన్నా.. మోదీ ప్రభుత్వం కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం కేసీఆర్కు నామమాత్రంగా ఆహ్వానం పంపడం ద్వారా తెలంగాణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడింది. ఆహ్వాన పత్రంలో ప్రధాని మోదీ తర్వాత సీఎం హోదాలో కేసీఆర్ పేరు ఉండాలని.. కానీ ప్రొటోకాల్ పాటించలేదని ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. దీనితోపాటు 2020 నవంబర్లో భారత్ బయోటెక్ సందర్శన కోసం అధికారికంగా హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీ.. ప్రొటోకాల్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ను అవమానించారని టీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? ఇక మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కీలక అంశాలపై నిలదీయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పలు అంశాలపై ప్రశ్నలు, నిలదీతలతో ట్విట్టర్లో వరుస ట్వీట్లు మొదలుపెట్టింది. ‘‘మోదీ గారూ.. తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా? ఏమైనా తెస్తారా? తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు? విభజన చట్టం హామీల సంగతేంటి? నీతి ఆయోగ్ చెప్పిన నిధులిచ్చేది ఎప్పుడని తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతోంది..’’ అని పేర్కొంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో 2021 మార్చిలోనే ఉత్పత్తి మొదలైందని, ఇప్పటివరకు 10 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసిందని గుర్తు చేసింది. ‘‘మోదీ తెలంగాణకు వస్తున్నారు. మొన్న సర్కారును కూల్చే కుట్ర బయటపడింది. నిన్న మునుగోడులో బీజేపీ ఓడిపోయింది. అయినా అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు రెండేండ్ల క్రితమే పునః ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం పేరిట మాయ చేసేందుకే మోదీ వస్తున్నారు..’’ అని టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ఉత్సాహం చూపుతున్నారని ఎద్దేవా చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర, మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు, ఇతర అంశాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శల యుద్ధం సాగుతుండగా.. ఇప్పుడు మోదీ పర్యటన, ప్రోటోకాల్ రగడ మరింత ఆజ్యం పోసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని టూర్కు కేసీఆర్ దూరమే! 2020 నవంబర్లో హైదరాబాద్లోని భారత్ బయోటెక్లో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించలేదు. దానితో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ప్రధాని కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్కు వచ్చి సీఎంను పిలవకపోవడం/సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని టీఆర్ఎస్ అప్పట్లోనే తీవ్రంగా మండిపడింది. ఆ తర్వాత ప్రధాని మోదీ పలుమార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చినా స్వాగత కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ►ఈ ఏడాది ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్ కార్యక్రమాలకు వచ్చిన ప్రధానిని ఆహ్వానించే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించారు. కేసీఆర్ వెళ్లలేదు. ►ఈ ఏడాది మేలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవానికి మోదీ వచ్చినా కేసీఆర్ ఆహ్వానం పలకలేదు. ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. ►జూలై రెండున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ హైదరాబాద్కు రాగా కేసీఆర్ దూరంగా ఉన్నారు. అదే రోజున విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా ఎదురెళ్లి భారీ స్వాగతం పలికారు. ►ఇవేకాదు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన పలు వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల్లో కూడా సీఎం హోదాలో కేసీఆర్ పాల్గొనలేదు. మంత్రులు, ఉన్నతాధికారులే హాజరయ్యారు. ►ఈ నేపథ్యంలో ఈ నెల 12న రామగుండంలో ప్రధాని మోదీ హాజరయ్యే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: ఫాంహౌస్ ఎపిసోడ్లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఈ నెల 12న ప్రధాని మోదీ ప్రారంభించే రామగుండం ఎరువుల కర్మాగారం కార్యక్రమం ఆహ్వానంలో కనీస ప్రొటోకాల్ పాటించకుండా తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. pic.twitter.com/jYpX0GTT8q — TRS Party (@trspartyonline) November 8, 2022 అయ్యా ప్రధాని మోదీ గారు తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు? విభజన చట్టం హామీల అమలు సంగతేమిటి? నీతి ఆయోగ్ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు? అని నిగ్గదీసి అడుగుతున్నది తెలంగాణ సమాజం. pic.twitter.com/ZOBTjGDeUA — TRS Party (@trspartyonline) November 8, 2022 -
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం
-
9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
8వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: రంజిత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే బీజేపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుతుండటాన్ని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగానే జరుగుతోందని తెలిపారు. బీజేపీకి తొందరపాటు ఎందుకు?. ఈసీ ఎవరి చేతిలో ఉంటుంది?. ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. 'కౌంటింగ్కు కేంద్రం నుంచి అబ్జర్వర్ వస్తారు. వాళ్ల ఆధీనంలోనే కౌంటింగ్ జరుగుతుంది. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మందు పోసినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం. బీజేపీ నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు బీజేపీ నేతలు ఆగలేరా?. ఖర్చు పెట్టి ఓడిపోతున్నామనే భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని' టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి మండిపడ్డారు. చదవండి: (Munugode Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్రాజ్) -
Munugode Bypoll: చౌటుప్పల్లో తక్కువ ఓట్లు.. నిరాశలో రాజగోపాల్ రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. రౌండ్ రౌండ్ ముగిసే సమయానికి పార్టీల మధ్య ఆధిక్యం తారుమారవుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య టగ్ అఫ్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం వద్ద రాజగోపాల్రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చేశారు. సొంత మండలం చౌటుప్పల్లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని ఆవేదన చెందారు. ఫలితం ఎలాగైనా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చివరి వరకు హోరాహోరి తప్పకపోవచ్చని, బాజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. కాగా చౌటుప్పల్ మండలంలో 55,678 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 21,209...బీజేపీకి 21,174...కాంగ్రెస్కు 5,164 ఓట్లు పడ్డాయి. ఇక మునుగోడు కౌంటింగ్లో ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. 4 రౌండ్లు ముగిసే సరికి 714 స్వల్ప ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 4,854 ఓట్లు రాగా, బీజేపీకి 4,555 ఓట్లు పోలయ్యాయి. చదవండి: ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు -
Munugode Round Wise Results: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు
సాక్షి నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు, మూడు రౌండ్లు మినహా ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబరచని బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మూడో రౌండ్ తర్వాత ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యంలో నిలిచిన టీఆర్ఎస్.. 14 రౌండ్లు ముగిసే సరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యం సాధించింది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో.. టీఆర్ఎస్-228, బీజేపీ-224, బీఎస్పీ-10, ఇతరులకు 88 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. 21 టేబుళ్ల ఏర్పాటు నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. 3-4 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. 93.41 శాతం పోలింగ్ నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ సాగింది -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి
సాక్షి, నల్గొండ: తాను అభిమానించిన నాయకుడు ఓడిపోతాడని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఆ యువకుడు వేదనకు గురయ్యాడు. అదే ఆందోళనతో గుండెపోటుకు గురై మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల్లోని రాంనగర్ కాలనీకి చెందిన ఊదరి శంకర్ (30) సెంట్రింగ్ పని చేస్తుంటాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొంత కాలంగా విద్యానగర్ కాలనీలో సోదరి వద్ద ఉంటున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నెల రోజులుగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోసం ప్రచారం నిర్వహించాడు. పోలింగ్ ముగిసిన తర్వాత టీవీలు, సోషల్ మీడియాలో వచ్చిన ఎగ్జిట్పోల్ ఫలితాలతో ఆందోళనకు గురయ్యాడు. గురువారం రాత్రి 9 గంటల వరకు తన మిత్రులతో మాట్లాడి ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఊరి నుంచి వచ్చిన అక్కాబావలు తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పక్కింటి వారి సాయంతో తలుపు తెరిచి చూడగా శంకర్ చనిపోయి ఉన్నాడు. ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డి విజయం సాధిస్తారని చాలా ధీమాతో ఉన్న సమయంలో ఎగ్జిట్పోల్స్ అందుకు విరుద్ధంగా రావడాన్ని తట్టుకోలేక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్ తెలిపారు. చదవండి: మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్మార్టం.. ఆ నివేదికలో ఏముంది? -
మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్మార్టం.. ఆ నివేదికలో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం రాత్రి వరకు కొనసాగడంతో బూత్ల వారీగా పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం పోస్ట్మార్టం పూర్తి చేసింది. పార్టీ అనుసరించిన ప్రచార వ్యూహం వల్లే 93 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనాకు వచ్చింది. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ ఆధిక్యత సాధిస్తారని పార్టీ అంచనా వేసింది. ఈ మేరకు మండలాలు, యూనిట్ల వారీగా పార్టీ ప్రచార ఇన్చార్జీలుగా పనిచేసిన నేతలు తమ నివేదికలు సమర్పించారు. పోలింగ్ బూత్ల వారీగా నమోదైన ఓట్లు, వాటిలో టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీలకు వచ్చే ఓట్లపై తమ అంచనాలను గణాంకాలతో సహా పొందు పరిచారు. మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఈ నివేదికలను క్రోడీకరించి శుక్రవారం పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు అందజేశారు. పోలైన ఓట్లలో 50శాతం మేర ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి సాధిస్తాడని ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ ఇన్చార్జీల నుంచి అందిన నివేదికలతోపాటు ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సంస్థల నివేదికలు, వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా సీఎం విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి పార్టీ తరపున ఏజెంట్ల జాబితాపై కసరత్తు జరుగుతోంది. పార్టీ తరపున ఓట్ల లెక్కింపులో పాల్గొనే ఏజెంట్లకు శనివారం అవగాహన కల్పిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే సుమారు పక్షం రోజులపాటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తలమునకలైన నేతలు గురువారం రాత్రి పోలింగ్ ముగిసేంత వరకు పార్టీ కేడర్ను సమన్వయం చేశారు. చదవండి: Telangana: ఆర్టీసీలోనూ 95% పోస్టులు స్థానికులకే -
గులాబీ గూటిలో ముసలం.. ఎంపీకి తలనొప్పిగా మారిన మంత్రి!
ఔను!. వాళ్ళిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. ఒకే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎంపీ పైగా అధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలు. ఒకే ప్రాంతం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతలు పైకి ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా రాజకీయంగా రగిలిపోతున్నాట. ఇద్దరి మద్య ఆధిపత్యపోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుందట. ఎవరా నేతలు... ఎందుకు వారి మధ్య కోల్డ్ వార్.. మానుకోటగా పేరొందిన మహబూబాబాద్ జిల్లాలో అధికారపార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారపార్టీ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే జిల్లాను ఏలుతున్నారు. మంది ఎక్కువైతే పెరుగు పలుచనైనట్లు అంతా అధికారపార్టీ ప్రజాప్రతినిధులే కావడంతో ఇక వారికి ఎదురే ఉండదనుకుంటాం. కానీ అక్కడ మాత్రం ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఇద్దరు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు ఉన్నా ఆ జిల్లాలో ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుందట. చదవండి: ఎమ్మెల్యేకు ఊహించని ఫోన్ కాల్.. టీఆర్ఎస్ గెలుస్తుందా సార్ అంటూ.. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత బయట ఎక్కడ కలిసినా, కార్యక్రమాల్లో పాల్గొన్నా...ఇద్దరు చాలా క్లోజ్గా కనిపిస్తారు. వారిని చూసిన వారెవ్వరైనా...వారి మధ్య విభేదాలు ఉన్నాయంటే అసలు నమ్మరు. బయటకు ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఆధిపత్యం కోసం అంతర్గంతంగా యుద్ధమే సాగిస్తున్నారట. మూడోసారి కేసిఆర్ సీఎం కావాలని ఏకంగా మంతి సత్యవతి రాథోడ్ పాదరక్షలు లేకుండా నడిచే దీక్ష చేపట్టగా, బయ్యారం ఉక్కు పరిశ్రమకై కవిత ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేస్తూనే రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లోలోపల రగిలిపోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ తమ పంతం నెగ్గించుకునే పనిలో పడ్డారట. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ గతంలో తెలుగుదేశం నుంచి డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకముందు తెలుగుదేశం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి రెడ్యానాయక్పై ఓటమిపాలయ్యారు. చివరకు టిఆర్ఎస్లో చేరగా చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సైతం టిఆర్ఎస్లో చేరాడంతో సత్యవతి రాథోడ్కు స్థానం లేకుండా పోయింది. 2018లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్కే గులాబీ దళపతి టిక్కెట్ ఇచ్చి, సత్యవతి రాథోడ్ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి అప్పగించారు. చిరకాల రాజకీయ ప్రత్యర్ధులు ఒకే పార్టీలో ఉండడంతో గులాబీ బాస్ సమన్యాయం చేసినప్పటికీ సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్ కుటుంబాల మధ్య సఖ్యత లేని పరిస్థితే కనిపిస్తుంది. మంత్రి సత్యవతి రాథోడ్ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరు కుటుంబాలు రాజకీయంగా పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహబూబాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రెడ్యానాయక్ కూతురు. కవిత, రెడ్యానాయక్ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మహిళా నేతల్లో ఎంపీ కవితకు చురుకైన నాయకురాలిగా గుర్తింపు ఉంది. అయితే తన తండ్రి రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఉన్న బేదాభిప్రాయాలు కవితకు తలనొప్పిగా మారాయి. అంతేకాదు కవిత కూడా మంత్రి సత్యవతి రాథోడ్ తో విభేదించే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గమే కాకుండా...మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇద్దరూ పోటీపడుతున్నారు. ఎంపీ కవిత పార్టీ అధ్యక్షురాలిగా మహబూబాబాద్ పరిమితం అయినా.. ఎంపీ పరిధి మాత్రం ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఉండడంతో ఆమె కూడా తరచూ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక సత్యవతి రాథోడ్...మహబూబాబాద్తో పాటు, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఇంచార్జీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇద్దరు మహిళా నేతలు కలిసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎప్పుడు పరస్పర విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. కానీ, బహిరంగంగా ఎక్కడా బయటపడకున్నా, అంతర్గతంగా విభేదాలు పొడచూరినట్టు సమాచారం. పర్యటనలు, కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే ఉంటున్నా...ఎవరి కేడర్ను వారు ప్రోత్సహిస్తున్నట్టు చర్చ నడుస్తోంది. ఆధిపత్యం కోసం అనుచరగణాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు అసలు కారణం రాబోయే ఎన్నికలని ప్రచారం జరుగుతోంది. రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ చిరకాల ప్రత్యర్థులు కావడం ఒకటైతే, మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలపై కన్నేశారని, వచ్చే ఎన్నికల్లో ఎదో ఒక స్థానం నుంచి టికెట్ దక్కించుకుని పోటీచేస్తారన్న చర్చసాగుతుంది. డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ ఉండగా, మహబూబాబాద్ నుంచి ఎంపీ కవిత ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట. అందుకే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నాయక్తో కవితకు విభేదాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల నుంచి రెడ్యానాయక్ కుటుంబంతో మంత్రి సత్యవతి రాథోడ్కు చెక్ పడే అవకాశం ఉండడంతో ఇప్పటినుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి రాజకీయంగా పై చేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారట. శంకర్ నాయక్తో కవితకు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారట. పైకి అంతా కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న రాజకీయంగా మంత్రి ఎంపీ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ సాగుతుంది. మానుకోట గులాబీ గూటిలో అంతర్గత వైరం అధిష్టానం దృష్టికి సైతం వెళ్ళింది. కానీ ఎక్కడా విభేదాలు ఉన్నట్లు బయట పడకుండా జాగ్రత్త పడుతూ చాప కింద నీరులా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసి పార్టీ క్యాడర్ తమ వైపు తిప్పుకొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట. మానుకోటలో అధికారం పార్టీలో నాయకుల రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్న గులాబీ దళపతి రెండు కుటుంబాలు ఇద్దరు మహిళా నేతలకు ఏ విధంగా న్యాయం చేస్తారోనని పార్టీ శ్రేణులతో పాటు స్థానికులు చర్చించుకుంటున్నారు. మానుకోట గులాబీ గూటిలో ముసలం ఎటువైపు దారి తీస్తుందోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
కేటీఆర్ సీఎం కాడనే భయంతో కేసీఆర్ చిల్లర రాజకీయాలు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
Kishan Reddy: ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే స్వామీజీలు అవసరమా?
న్యూఢిల్లీ: మునుగోడు ఎన్నిక తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆందోళనపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే. రోహిత్రెడ్డితో ప్రభుత్వం కూలిపోతుందనుకుంటే మేం చేసేదేమీ లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే స్వామీజీలు అవసరమా? మేం చేర్చుకోలేమా? అని ప్రశ్నించారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. బ్రోకర్లను మధ్యలో పెట్టాల్సిన ఖర్మ మాకు పట్టలేదన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటు చర్య అని మండిపడ్డారు. కేటీఆర్ సీఎం కాడనే భయంతో కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన మాకు లేదు. రాష్ట్రంలో మాకు ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే. వచ్చే ఎన్నికల్లో మేం ప్రజాస్వామ్య బద్ధంగానే అధికారంలోకి వస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని మేం ఎప్పుడూ చెప్పలేదన్నారు. గతంతో టీడీపీ ఎలా బురదజల్లే ప్రయత్నం చేసిందో ఇప్పుడు కేసీఆర్ అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. 2014 నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు చేర్చుకున్నారు?. ఒక్క ఎమ్మెల్యేతోనైనా రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు. నలుగురు ఆర్టిస్ట్లను పెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు వేరే పార్టీ నుంచి వచ్చారు. ఆ ఎమ్మెల్యేలకు వంద కోట్లు కాదు వంద పైలు కూడా అనవసరమే అని ఎద్దేవా చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలిచిచ అధికారం చేపడుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్కు బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సవాల్) -
మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసింది : బండి సంజయ్
-
సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్పై మంత్రి జగదీష్రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై బీజేపీ నేత ఈటల రాజేందర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో మంత్రి మాట్లాడుతూ.. మునుగోడులో ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు, గన్ లైసెన్స్లపై ఈటల అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వంచన చేరి భాష, న్యాయం, ధర్మం పేరుతో సానుభూతి కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన నిలబడిందే కౌరవుల వైపు అంటూ దుయ్యబట్టారు. బీజేపీ నేతలే టీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారని మంత్రి జగదీష్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బీజేపీ నేతలే దాడులు చేశారని, మునుగోడులో మెజారిటీ రాదనే విషయమే అర్థమయి ఇలాంటి పనులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అందుకే రాజేందర్ సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓటమికి సాకులు వెతుక్కుంటూ అసత్యలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్కు హింస నచ్చదు.. శాంతియుతంగా ఎన్నికలకు వెళ్లాలనే కోరుకుంటారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఎన్నో ఘర్షణలు ఉండేవని, టీఆర్ఎస్ వచ్చాక ఒక రాజకీయ ఘర్షణ జరగలేదని తెలిపారు. ‘తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఉత్తప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు. దుర్మార్గమైన పార్టీలో చేరి ఏదో మాట్లాడి సానుభూతి పొందాలని చూస్తున్నారు. తెలంగాణలో ఉన్న శాంతి భద్రతలు, రక్షణ ఇంకెక్కడ లేదు. షీటీమ్స్ ఎంతో బాగా పనిచేస్తున్నాయి. ఎవరు ఎటు వైపు ఉన్నారో, ఎవరు కౌరవుల వైపు చేరారో అన్ని ప్రజలకు తెలుసు. దాడులు దాడులు అంటున్నరు.. ఎవరు దాడులు చేశారో అన్ని సాక్షాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ సోదాలేమి మా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేయవు.. ప్రజలు మా వైపు ఉన్నారు. మాతో ఉన్నారు. నా పీఏలపై ఎక్కడా సోదాలు జరగలేదు. నా సన్నిహితుడుపై జరిగింది’ అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: మునుగోడులో రోడ్డెక్కిన ఓటర్లు.. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి .. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ల ‘పిట్ట’ పోరు.. ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ!?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయాలనుకుంటోన్న జాతీయ పార్టీనుద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్, కాంగ్రెస్ల నడుమ పిట్టపోరుకు దారితీశాయి. కేసీఆర్ తన పార్టీని ఊహల్లోనూ నడుపుకోవచ్చని, అంతర్జాతీయ పార్టీ పెట్టి చైనా, అమెరికాల్లో కూడా పోటీ చేయొచ్చని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఆయన స్పందనకు ట్విట్టర్ వేదికగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్లు కూడా కౌంటర్లు ఇచ్చారు. సొంత సీటు... కన్న కూతురు రాహుల్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘సొంత స్థానం అమేథీలో గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్గాంధీ.. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్కు సుద్దులు చెపుతున్నారు’ అని పేర్కొన్నారు. దేశానికి ప్రధాని కావాలనుకునే నాయకుడు ముందు సొంత నియోజకవర్గ ప్రజలను మెప్పించాలని సూచించారు. ఈ ట్వీట్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేని ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా? ఎవరన్నా గుర్తు చేయండ్రాబాబూ!? అంటూ రీట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ కూడా స్పందించారు. ఓటమితోనే గెలుపు ప్రారంభమవుతుందని, ఒక్క ఓటమి ద్వారా నాయకుడి భవిష్యత్ను నిర్ణయించలేమని, అలా అయితే సిద్దిపేటలో ఓడిపోయింది ఎవరని మాణిక్యం ప్రశ్నించారు. -
ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ఎన్నికల ప్రచారం నేటి (మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో రోడ్షో నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుకు మోదీ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శలు గుప్పించారు. ఓటుకు తులం బంగారం ఇచ్చైనా గెలుస్తాననే పొగరుతో బీజేపీ నాయకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద కాంట్రాక్టర్లను మోదీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ రాకముందు కరెంట్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ సామాన్యుడి బతుకు నాశనం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేశారు. మోదీ అధికారంలో వచ్చినప్పుడు రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరింది. మోదీ వచ్చినప్పుడు పెట్రోల్ ధర రూ.70 ఉంటే ఇవాళ 110 రూపాయలకు చేరింది. కార్పొరేట్ శక్తులకు మోదీ కొమ్ముకాస్తున్నారు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా. ఎవరు పెద్దోళ్ల కోసం ఉన్నారు..? ఎవరు పేదోళ్ల కోసం ఉన్నారు. ఆలోచించి ఓటు వేయండి.. ఆగం కాకండి. ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలని’ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు -
ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసులోని ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తమ అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరపనుంది. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మొయినాబాద్ ఫామ్హౌస్లో పట్టుబడిన నిందితుల రిమాండ్కు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు నిందితులు సైబరాబాద్ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు.. నిందితుల రిమాండ్కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని పేర్కొంది. చదవండి: మోర్బీ ఆసుపత్రికి ప్రధాని.. అర్థరాత్రి హంగామా.. ఆగమేఘాల మీద మరమ్మతులు -
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్.. మాజీ స్పీకర్ VS సిట్టింగ్ ఎమ్మెల్యే
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్ మొదలైందా? మాజీ స్పీకర్కు, సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య పోరు షురూ అయిందా? టీఆర్ఎస్ నాయకత్వం ఎవరికి మద్దతిస్తోంది? భూపాలపల్లిలో అధికార పార్టీ తరపున పరీక్ష రాసేదెవరు? సీటు రానివారి పరిస్థితి ఏంటి? జయశంకర్ భూపాలపల్లిలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం భూపాలపల్లిలో అధికార పార్టీలో సెగలు మొదలయ్యాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సిటింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య సీటు కోసం పంచాయతీ అక్కడి రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఎమ్మెల్సి మధుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. సారు రావాలి.. మీరు కావాలి అంటూ ఆయన అనుచరులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరపడం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మధుసూదనాచారి భూపాలపల్లి నుండి మళ్ళీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అధిష్టానం నుండి వచ్చిన స్పష్టమైన సూచనల ప్రకారమే చారి మళ్ళీ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి? 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోవడం, తర్వాత గండ్ర అధికార పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో చారి భూపాలపల్లి నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మధుసూదనాచారి, ముఖ్యమంత్రి మాట మేరకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న మాటలు వినిపించాయి. కేసీఆర్ మాట జవ దాటకుండా ఉండి మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సి పదవి పొందారు. భూపాలపల్లిలో అధికార పార్టీకి వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ చేయించిన సర్వేలో వెల్లడైందన్న వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి. బర్త్డే పాలిట్రిక్స్? మాజీ స్పీకర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఆలోచన ప్రజల్లో మొదలైనట్లుగా సీఎం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రజల్లో చారీ పట్ల మళ్ళీ ఆదరణ మొదలైందని ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే మధుసూదనాచారి నియోజకవర్గంలో వరుసగా పర్యటించడం...ఎమ్మెల్సీ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుతుండటంతో ఆయన వర్గం నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న నియోజకవర్గ వ్యాప్తంగా మధుసూదానాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటంతో భూపాలపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నియోజకవర్గంలో మధుసూదనాచారి మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఎమ్మెల్యే చేస్తున్న వాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే పరీక్ష రాయబోతున్న మీ సహాయ సహకారాలు కావాలి అనడం, ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదే అని మాట్లాడుతుండటంతో భూపాలపల్లి ఎమ్మెల్యే సీటు విషయంలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది. స్థానికంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మొదలవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మధుసూదనాచారి మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల పరీక్షలో రాసేదెవరో.. ఉత్తీర్ణులయ్యేదెవరో అన్న చర్చ నియోజకవర్గంలో తీవ్రంగా జరుగుతోంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.. బీజేపీని ఏకిపారేసిన సీఎం కేసీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ చండూరు సభ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. కార్పొరేట్ గద్దలకు బీజేపీ 14 లక్షల కోట్లు ఇచ్చిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి నిధులు ఇవ్వడం చేత కాదా అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే మనల్ని నూకలు తినమన్నారని, నూకలు తినమన్న వారికి ఎన్నికల్లో తోకలు కత్తిరించాలన్నారు. బలవంతంగా రుద్దబడిన మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి చెంపపెట్టు కావాలని ఆకాంక్షించారు. చండూరు సభ వేదికపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని వేదికపైకి తీసుకొచ్చారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. ఈ నలుగురు అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా తెలంగాణ, జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. చదవండి: వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న వడ్లు కొనడం చేతకాని వారు వంద కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారా అని సీఎం కేసీఆర్ విమర్శించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు. దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ను పడగొట్టాలని చూశారని.. ఢిల్లీ బ్రోకర్లు ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారన్నారు. ‘నేను రాజ్యాంగబద్దమైన ముఖ్యమంత్రి పదదవిలో ఉన్నాను. కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడతాయి. తలకుమాసినోడు ఒకడొచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. మతోన్మాద శక్తులను తరిమేస్తే తప్ప దేశం బాగుపడదు. టీవీల్లో చూసింది చాలా చిన్నది. ముందు ముందు చూడాల్సింది చాలా ఉంది’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న
LIVE UPDATES: ‘మునుగోడులో యుద్ధం చేయాలి. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం చేనేతలకు చేశారు. నేతన్నలపై జీఎస్టీ విధించి మళ్లీ వాళ్లనే ఓట్లు అడుగుతున్నారు. చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీకి ఓటు వేయకుండా చేనేతలు బుద్ధి చెప్పాలి. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా?. పెట్టుబడి దారులు, కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోంది. విద్యుత్ సంస్కరణల ముసుగులో మీటర్లు పెడుతున్నారు. మీటర్ పెడతామన్న వారికే మీటర్ పెట్టాలి. ఎన్నికల్లో చేసే దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే గోస పడతాం. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదు. పాలను, నీళ్లను వేరు చేసి చూసే విజ్ఞత ప్రజలకు ఉండాలి. మోదీ విశ్వ గురువు కాదు. విష గురువు. బలవంతంగా రుద్దబడిన ఉప ఎన్నిక వారికి చెంపపెట్టు కావాలి’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ►కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందకోట్లకు ఆత్మగౌరవాన్ని కొందామని చూసినట్లు తెలిపారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారని ప్రస్తావించారు. అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. రాజకీయం అంటే అమ్ముడుపోడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని పేర్కొన్నారు. ►మోదీ గారు మీకు ఇంకా ఏం కావాలని.. రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. దీనిపై విచారణ జరగాలన్నారు. వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్నారు. దీని వెనకున్న వారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ను పడగొట్టాలని చూశారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చినవారు చంచల్గూడ జైలులో ఉన్నారన్నారు. కరిసే పామును మెడలో వేసుకుంటామా? ►చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఫలితం కూడా మీరు(ప్రజలు) ఎప్పుడో తేల్చేశారని పేర్కొన్నారు. ఎలక్షన్ వస్తే చాలు కొందరు హడావిడీ చేస్తరని.. గాయ్.. గాయ్ గత్తర్ గత్తర్ లొల్లి నడుస్తుందని అన్నారు. ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతుందని సీఎం సెటైర్లు వేశారు. బావ చెప్పిండనో, బావమర్ధి చెప్పిండనో, డ్యాన్సులు చేశారనో ఓట్లు వేయొద్దని కోరారు. దోపిడి దారులు మాయ మాటలు చెబుతూనే ఉంటారు. కరిసే పామును మెడలో వేసుకుంటామా అని ప్రశ్నించారు. సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికకు మరో నాలుగు రోజులు సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని మరింత జోరు పెంచాయి. బహిరంగ సభలు, సహావేశాలతో హోరెత్తనున్నాయి. సోమవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావిస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కాసేపట్లో చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరైనట్లు సమాచారం ఇప్పటికే కేసీఆర్ చండూరు సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కాగా ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహరంపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. దీంతో చండూరు సభ వేదికగా సీఎం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
టీఆర్ఎస్ ధన బలంతో మునుగోడులో గెలువాలని చూస్తోంది : రాజగోపాల్ రెడ్డి
-
నందకుమార్తో పరిచయాలు ఉన్నాయి.. కానీ: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో ఎవరైనా చేరవచ్చని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పార్టీలో చేరికల కోసం ప్రత్యేక కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చిన వారినైనా చేర్చుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. నందకుమార్తో తమకు పరిచయాలు ఉన్నాయి కానీ ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వస్తే ఏంటి.. పోతే ఏంటని ప్రశ్నించారు. బీజేపీ దగ్గర డబ్బులు లేవని, డబ్బులు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ విమానం కొంటున్నారని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నించారంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై మరోసారి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే. వేరే పార్టీ నుండి వచ్చిన వారిని మంత్రులు చేశారు. బీఎస్పీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదువులు ఇచ్చారు. కాంగ్రెస్కు చెందిన 12 మందిని టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కట్టుకథలు అల్లారు. ముందు రూ. 100 కోట్లు.. ఆ తర్వాత రూ. 15 కోట్లు అన్నారు. ఆ నలుగురు మా పార్టీలో చేరితే ప్రభుత్వం పడిపోతుందా?. నందకుమార్ తెలుసు కానీ నా అనుచరుడు కాదు. ఆయన ఎంపీ సంతోష్కు సన్నిహితుడు. కేసీఆర్ ప్రెస్మీట్ ఢిల్లీలో కాకుంటే లండన్లో పెట్టుకోవచ్చు.’ అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సెటైర్లు వేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం.. బండి Vs కేసీఆర్.. యాదాద్రిలో హైటెన్షన్ -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు!
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు నలుగురు పార్టీ ఫిరాయించేలా ప్రలోభపెట్టా రనడానికి, ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఫామ్హౌజ్ వ్యవహారంలో ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని.. ఈ తతంగం మొత్తాన్ని బయటపెట్టేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రలోభాల పర్వాన్ని ఆసాంతం పరిశీలిస్తున్నారని, త్వరలోనే జాతీయ మీడియా ముందుకు తీసుకెళ్లనున్నారని పేర్కొంటున్నాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా.. టీఆర్ఎస్ ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున న్యాయపరమైన చిక్కులు తలెత్త కుండా జాగ్రత్తలు తీసుకున్నాకే మాట్లాడాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వ్యవహారంలో బీజేపీ ఢిల్లీ పెద్దల ప్రమే యం ఉన్నట్టు రూఢీ చేసే సమాచారం సదరు స్వామీజీల ఫోన్లలో దొరికిందని అంటున్నాయి. ఫామ్హౌజ్లో రికార్డయిన ఆడియో, వీడియో ఫుటేజీలోనూ బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్రను రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని.. వాటిలోని సమాచారాన్ని రూఢీ చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ బండారాన్ని బయటపెట్టాలని కేసీఆర్ భావిస్తు న్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? నిందితులను రిమాండ్కు పంపకముందే మీడియాతో మాట్లాడితే పోలీసు విచారణను ప్రభావితం చేశారనే ఆరోపణలు వచ్చే అవకా శం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్తున్నా యి. బీజేపీ ఎదురుదాడి వలలో చిక్కుకోకుండా ‘ఎమ్మెల్యేలకు ఎర’ వెనుక బాగోతాన్ని ఆధారాలతో సహా జాతీయ మీడియా ముందు బయట పెట్టాలని సీఎం నిర్ణయించినట్లు టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. స్వామీజీల ఫోన్లలో కీలక సమాచారం తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగినట్టుగా నిందితులు నందకుమార్, ఇద్దరు స్వామీజీలు వెల్లడించారని సదరు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు వివరించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు, రూ.400 కోట్ల ప్రలోభాలకే పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని అంటున్నాయి. బీజేపీ కీలక నేత ఒకరు తమతో నేరుగా టచ్లో ఉన్నట్టు చెప్పారని.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు బాధ్యత తమకు అప్పగించారని వారు చెప్పిన సంభాషణలు రికార్డు అయ్యాయని పేర్కొంటున్నాయి. కేంద్ర సంస్థల దుర్వినియోగం, తెలంగాణలోనూ వాటిని ఉసిగొల్పనున్న వైనానికి స్వామీజీల సంభాషణలు అద్దం పట్టేలా ఉన్నాయని అంటున్నాయి. ప్రగతిభవన్లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్హౌజ్ ఘటనలో ప్రలోభాలకు గురైన ట్టుగా పేర్కొంటున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు(అచ్చంపేట), రేగ కాంతారావు (పినపాక), బీరం హర్షవ ర్ధన్రెడ్డి(కొల్లాపూర్), పైలట్ రోహిత్రెడ్డి (తాండూరు) బుధవారం రాత్రి నుంచీ ప్రగ తిభవన్లోనే ఉండటం గమనార్హం. ఘటన తర్వాత వారు మీడియాకు అందుబాటులోకి రాలేదు. అయితే వారు ఫామ్హౌజ్లో బీజేపీ దూతలతో జరిగిన మంతనాలు, పోలీసుల రాక, భేటీకి సంబంధించిన ఆధారాలు తదితరాలపై సీఎం కేసీఆర్కు పూర్తి వివరాలు వెల్లడించారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పదిరోజులుగా బేరసారాలు జరిగాయని.. భేటీ కోసం దీపావళి తర్వాత సమయాన్ని ఖరారు చేశారని వివరించారని అంటున్నాయి. చదవండి: ఫామ్హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్రెడ్డి కౌంటర్ ఎటాక్ ఈ సమయంలో ఆడియో, వీడియో ఫుటేజీల్లో నిక్షిప్తమైన సమాచారం గురించి కేసీఆర్ ఆరా తీశారని.. ప్రలోభాల పర్వంపై పూర్తి వివరాలను బయటపెట్టేదాకా మౌనం పాటించాలని ఆదేశించారని పేర్కొంటున్నాయి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, మంత్రి హరీశ్రావు కూడా బుధవారం రాత్రి నుంచీ ప్రగతిభవన్లోనే ఉండిపోయారు. మంత్రి హరీశ్రావు మాత్రం గురువారం తెల్లవా రుజామున బయటికి వెళ్లి కాసేపటికే తిరిగి ప్రగతిభవన్కు చేరుకున్నారు. వారు ప్రలోభాల పర్వానికి సంబంధించిన ఆడి యో, వీడియో ఫుటేజీలను విశ్లేషించి.. ఆధా రాలను సిద్ధం చేసుకుంటున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నైతిక విలువలు లేకుండా పార్టీలో చేర్చుకున్నది మీరు
-
ఫామ్హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్రెడ్డి కౌంటర్ ఎటాక్
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఓటమి తప్పదని తెలిసి టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ఫామ్హౌజ్ ఘటన టీఆర్ఎస్ కుట్రగా వర్ణించారు. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన చరిత్ర టీఆర్ఎస్దేనని మండిపడ్డారు. ఫిరాయింపులకు పెద్ద పీట వేసింది కేసీఆర్.. ఫిరాయించిన వారికి మంత్రి పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు, రాజీనామాలు చేయించకుండా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. నైతిక విలువలు లేకుండా అనేకమందిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. తాము బ్రోకరిజం చేశామంటున్న ఇంద్రకరణ్రెడ్డికి ఏ పార్టీ నుంచి గెలిచారో ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. మండలిలోని మొత్తం కాంగ్రెస్ నేతల్ని టీఆర్ఎస్ తమ పార్టీలోకి లాక్కుందని ప్రస్తావించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారని, ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను చేర్చుకోలేదా అని నిలదీశారు. అక్రమ కేసులు, రాజకీయ బెదిరింపులతో చేర్చుకున్నారని మండిపడ్డారు. తమకు ఆ అవసరం లేదని, 2023 వరకూ తాము వేచిచూడటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. చదవండి: ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్ బీజేపీకి సంబంధం ఏమిటి ‘కల్వకుంట్ల కుటుంబం నుంచి సీఎం పదవి చేజారిపోతుందని భయం. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారని భయం. ఫామ్హౌజ్కు పోలీసులు రాకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియా కోసం పోస్టులు సిద్ధం మునుగోడులో బీజేపీ నేతలకు కేటీఆర్ ఫోన్ చేస్తే అది నైతికత. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ఫామ్హౌజ్ ఘటనలో దొరికిన డబ్బులెంత? ఇప్పుడా డబ్బులు ఎటు పోయాయి. డబ్బుతో పట్టుకున్నామని చెబుతున్న వాళ్లతో బీజేపీకి సంబంధం ఏమిటి? నలుగురు ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా. వాళ్లేమైనా ప్రజాబలం ఉన్న నాయకులా. కొంతమంది పోలీసు అధికారులు దిగజారి వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టాలంటే మొదటి కేసు కేసీఆర్ పైనే పెట్టాలి. ఫామ్హౌజ్కు ఎందుకు పిలిచారు. అప్పుడే మా పార్టీలోకి రానిస్తాం వాళ్లకు వాళ్లే పిలుచుకున్నారు. వాళ్లకు వాళ్లు మొత్తం వ్యహారం నడిపించారు. దమ్ముంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. ఇది ఇతర రాష్ట్రాలతో సంబంధం ఉన్న కేసు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరుతో సానుభూతి కోసం ప్రయత్నాలు. ప్రధానిని తిడితేనే జాతీయ నేత అతవుతామని కేసీఆర్ భావిస్తున్నారు. 8 సంవత్సరాలలో ఒక్క అవినీతి మరక లేకుండా పనిచేస్తున్న పార్టీ బీజేపీ. నాలుగు ఆర్లు మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మా పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే మధ్యవర్తులు అక్కర్లేదు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే మా పార్టీలోకి రానిస్తాం. టీఆర్ఎస్ నేతలు చాలా మందితో నందకుమార్ ఫోటోలు దిగారు. నాతో దిగిన ఫోటో చూపించి కిషన్ రెడ్డి మనిషి అంటే ఎలా;’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్ వద్ద పరిస్థితేంటి? -
ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ వేదికగా జరిగిన ఘటనను ఖండిస్తూ అధికార పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర చండూరు: టీఆర్ఎస్ను చూస్తుంటే బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి బీజేపీ తమను టార్గెట్ చేసిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. చండూరులో విలేకరు లతో మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలో సింహ యాజులు, రామచంద్ర భారతి, నందకుమార్ల ద్వారా టీఆర్ఎస్కు చెందిన గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్రెడ్డిలను రూ.100 కోట్లకు పైగా నగదు, కాంట్రాక్టులు, ఇతర పదవులను ఇవ్వజూపి బీజేపీలోకి రావాలని ప్రలోభ పెట్టే యత్నం జరిగిందని తెలిపారు. ఇదే విషయం తమ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో భారీ మెజారీ్టతో గెలవబోతోందని.. బీజేపీ డిపాజిట్ కోల్పోతుందనే భయంతో కుట్రలకు తెర లేపుతోందని మండిపడ్డారు. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అడ్డదారిన.. దొడ్డి దారిన కొనే యత్నం మొదలు పెట్టిందని సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ నాటకాలాడితే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రలోభాలకు లోనుకారు.. అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పరిహాసం చేస్తోంది. ధనస్వామ్యంతో కొనుగోళ్ల పర్వం సాగిస్తోంది. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగరు. బీఆర్ఎస్తో ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం. కేసీఆర్కు ఆదరణ పెరుగుతున్నందునే ఈ కుతంత్రం. – మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు బీజేపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు దురాలోచనతో అడ్డదారులు ఎంచుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకం కాదు. కేసీఆర్ ముందు మోదీ, అమిత్ షా ఆటలు సాగవు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి. – మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి మోదీ, అమిత్ షా కుట్ర దేశవ్యాప్తంగా కేసీఆర్కు వస్తున్న ఆదరణ ఓర్వలేక మోదీ, అమిత్ షా కుట్ర జరుగుతోంది. రాజగోపాల్రెడ్డి తరహాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగే రకం కాదు. – మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలంగాణలో కుదరదు మునుగోడులో విజయం సాధించలేమనే భయంతోనే నీచ రాజకీయాలను బీజేపీ మొదలు పెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీ తరం కాదు. మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కుదరదు. –శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ బేరసారాలకు లొంగదు టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదు. ఇది కే సీఆర్ పార్టీ ఎవరూ కొనుగోలు చేయలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్ష్యం. – గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. ఫాంహౌజ్ వద్ద పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభా పెట్టినందుకు ముగ్గురిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. తమ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుండగా.. తమకు అలాంటి అవసరమే లేదని బీజేపీ చెబుతోంది. తాజాగా ఈ కేసులో కీలక అంశాలు వెలుగు చూశాయి. 84 సీసీ కెమెరాల్లో ఈ ఆపరేషన్ దృశ్యాలు రికార్డయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ నుంచి సంప్రదింపులు జరిపినట్లు గుర్తించిన పోలీసులు ఫామ్హౌజ్లో గంట 20 నిమిషాల వీడియో ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాడీవోర్న్ కెమెరాలో సంభాషణ దృశ్యాలు రికార్డ్ అయిన దృశ్యాలను సేకరించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు మూడు రోజులుగా నిఘా పెట్టి చివరకు రంగంలోకి దిగారు. చదవండి: బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 8. సెక్షన్ 120బి కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్హౌజ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులను లోపలికి రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫామ్హౌజ్లోనే ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ జగధీశ్వర్ రెడ్డి మొయినాబాద్ ఫామ్హౌజ్కు చేరుకున్నారు. పట్టుబడ్డ కారు, నగదు సైతం అక్కడే ఉంది. చదవండి: తొందరపడి ఒక కోయిల ముందే కూసింది: రేవంత్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఘటనపై గురువారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రలోభ పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వినిపిస్తున్న ఈ కేసులో కీలకంగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రగతిభవన్లోనే ఉన్నారు. బేరసారాల ఆడియో టేపులు ఉన్నాయని ఎమ్మెల్యేలు అంటున్న నేపథ్యంలో.. వాటిని కూడా మీడియా ముందు బయటపెట్టే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన యత్నంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు. తమతో పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్రావు మీడియాతో మాట్లాడిన వీడి యోను బుధవారం ఆయన ట్యాగ్ చేశారు. ఆ పార్టీ కొనుగోళ్లపై తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ రేవంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: హైడ్రామా: నేరుగా ప్రగతిభవన్కే.. కేసీఆర్తో ఆ నలుగురు భేటీ -
హైడ్రామా: నేరుగా ప్రగతిభవన్కే.. కేసీఆర్తో ఆ నలుగురు భేటీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బేరసారాలకు ప్రయత్నించారంటూ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన ఫామ్హౌజ్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి చెందినదే. మెయినాబాద్ మండలం అజీజ్నగర్లోని ఈ ఫామ్హౌస్పై పోలీసులు దాడి చేసినప్పుడు రోహిత్రెడ్డి మీడియాతో మాట్లాడకుండా లోపలే ఉండిపోయారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను రహస్యంగా విచారించారు. అనంతరం రోహిత్రెడ్డిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని బయలుదేరారు. ఆ వాహనం నేరుగా ప్రగతిభవన్కు చేరుకుంది. రోహిత్రెడ్డికి చెందిన సొంత వాహనం పోలీసు వాహనం వెనకాలే వెళ్లింది. మిగతా ముగ్గురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి ముగ్గురూ ముందుగానే ప్రగతిభవన్కు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు నడుమ రోహిత్రెడ్డి కూడా రాత్రి 11 గంటలకు ప్రగతిభవన్కు చేరుకున్నారు. కేసీఆర్తో ‘ఆ నలుగురు’ భేటీ.. నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు! టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి హరీశ్రావుతో పాటు మరికొందరు పార్టీ ముఖ్య నేతలు కూడా బుధవారం రాత్రి ప్రగతిభవన్కు వచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలందరితోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ భేటీ కొనసాగింది. తమతో బీజేపీ దూతలు సంప్రదింపులు జరిపిన తీరు, ప్రలోభాలకు గురిచేసిన వైనాన్ని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు పూసగుచి్చనట్లు వివరించినట్లు తెలిసింది. దీనిపై గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మీడియా ముందుకు వచ్చే అవకాశమున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడే అవకాశముందని సమాచారం. గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు టీఆర్ఎస్ పిలుపునిచి్చంది. కాగా, మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసు కమిషనర్ ప్రెస్మీట్ ముగిసిన సెకన్లలోనే.. ఫేస్ బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు రావడం, ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయతి్నంచారనే ఆరోపణలు, ఇతర వివరాలూ వైరల్ కావడం గమనార్హం. ఔటర్ రింగ్రోడ్డు సమీపంలో.. రోహిత్రెడ్డి 2017లో పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి మొయినాబాద్ వెళ్లే మార్గంలో అజీజ్నగర్ రెవెన్యూ పరిధి టలో ఐదెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మామిడి చెట్లు నాటారు. మధ్యలో విశాలమైన ఫామ్హౌజ్ను నిర్మించారు. ఔటర్ రింగ్రోడ్డుకు ఒకట్రెండు కిలోమీట ర్ల దూరంలోనే ఈ ఫామ్హౌజ్ ఉంటుంది. రోహిత్రెడ్డి తరచూ ఇక్కడికి వస్తూపోతూ ఉంటారని.. సమీపంలో జనం పెద్దగా ఉండరని పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పూజల కోసమే వచ్చాం: నందకుమార్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఇంట్లో పూజల కోసమే తాము వచ్చామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన నందకుమార్ చెప్పారు. హైదరాబాద్లోని సరూర్నగర్ చైతన్యపురికి చెందిన ఆయన ఘటన అనంతరం వివరాలు వెల్లడించారు. తనతోపాటు ఢిల్లీలోని ఫరీదాబాద్లో ఉన్న ఆలయ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మ, తిరుపతిలోని శ్రీమనాథరాజపీఠం పీఠాధిపతి డి.సింహయాజులు వచ్చారని తెలిపారు. బ్యాగులు తెరవకుండానే.. మొయినాబాద్ రూరల్, రాజేంద్రనగర్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని, అందుకోసమే ముగ్గురు వ్యక్తులు ఫామ్హౌస్ వద్దకు వచ్చారని ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించినప్పుడు.. రోహిత్రెడ్డికి చెందిన కారులో ఉన్న రెండు ట్రావెల్ బ్యాగులను తెరవాలని మీడియా కోరినప్పటికీ.. పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. గంట సేపు రోహిత్ రెడ్డిని రహస్యంగా విచారించిన పోలీసులు అతన్ని పోలీస్ వాహనంలోనే ఎక్కించుకొని ప్రగతి భవన్కు తీసుకెళ్లారు. దాదాపు నాలుగైదు గంటల పాటు ఫామ్హౌస్ వద్ద హైడ్రామా సాగింది -
టీఆర్ఎస్ లోకి మాజీ ఎంపీ రాపోలు భాస్కర్
-
Telangana: రాజకీయాల దిశను మార్చబోతున్న మునుగోడు!
ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల దిశను మార్చబోతోందా? ఎన్నిక జరుగుతున్న ప్రాంతం రాజధానిగా మారిపోయిందా? కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున అక్కడే కేంద్రీకరించారా? పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మంత్రులతో అధికారిక వాహనాలు అక్కడ దుమ్ము రేపుతున్నాయా? ఇంతకీ మునుగోడులో ఏం జరుగుతోంది? ప్రచారం.. ఆపై అధికారుల హడావుడి నల్గొండ జిల్లా మునుగోడు ఇప్పుడు తెలంగాణకు మరో రాజధానిగా మారిపోయిందన్నట్టుగా పరిస్థితి ఉంది. ఉప ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్ర యంత్రాంగమంతా అక్కడే తిష్ట వేసింది. రాష్ట్ర కేబినెట్ మొత్తం అక్కడే ఉంది. వారి కోసం అధికారులు వచ్చి వెళుతున్నారు. దీంతో మునుగోడులో ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు అధికారుల రాకపోకలతో నానా హడావుడిగా తయారైంది. ఏ ఎన్నికల్లోనూ ఇంత హడావుడి చూడలేదంటున్నారు స్థానిక ప్రజలు. ఎన్నిక కోసం ఢిల్లీ నుంచి నాయకులు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తక్కువేం తినలేదు. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో సహా పలువురు కేంద్ర నాయకులు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో కేంద్ర పెద్దల్లో ఒకరు బీజేపీ అభ్యర్థి కోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి కోసం భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతున్నందున అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చావో రేవో అన్నట్లుగా పోరాడుతుండటంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. 15 మంది మంత్రులు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర పరిపాలన అంతా మునుగోడు నుంచే సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. 15 మంది రాష్ట్ర మంత్రులు, 71 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారంలో తలమునకలయ్యారు. కేటీఆర్, హరీష్ రావు సహా అనేక మంది సీనియర్ మంత్రులు మునుగోడులోనే తిష్ట వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ కూడా బాగానే ఫైట్ చేస్తోంది. నిత్యం హైదరాబాద్లోనే కనిపించే కాంగ్రెస్ సీనియర్లంతా ఇప్పుడు మునుగోడులోనే ప్రచారం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా మునుగోడు ప్రచారంలో పూర్తిగా మునిగిపోయారు. పాపం ఖాకీలు కీలక నేతల పర్యటన, ప్రచారంతో పోలీస్ యంత్రాంగానికి కంటి మీద కునుకు కరువైంది. స్థానిక పోలీసులకు తోడుగా ఇతర జిల్లాల నుంచి కూడా వేలాదిగా పోలీసులను అక్కడ మోహరించారు. వాహనాల తనిఖీలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీస్ చెక్పోస్టులు, బారీకేడ్లు పెట్టి వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాము చూడని పెద్ద పెద్ద కార్లు రావడం, ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ జామ్లతో మునుగోడు ప్రజలు సతమతమవుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక అనేక రకాలుగా చరిత్ర సృష్టించబోతోంది. -
మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయం: మంత్రి తలసాని
-
Munugode Bypoll: జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఎక్కువ మంది బరిలో ఉండటం.. అందులోనూ చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటంతో.. ఎవరిపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. వారు ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది, అందువల్ల ఎవరికి లాభం జరుగుతుందనే దానిపై అంచనాల మీద అంచనాలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో ఆందోళన కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయం పార్టీలను వేధిస్తోంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఓట్లు చీలిపోకుండా కట్టడి చేసే పనిలో పడ్డాయి. గతంలో చిన్న పార్టీలు, స్వతంత్రులకు ఎన్ని ఓట్లు పడ్డాయి. ఏ మేరకు, ఎవరి ఓట్లను చీల్చగలిగారన్న అంచనాల్లో మునిగిపోయాయి. త్రిముఖపోరే.. అయినా తప్పని ఆందోళన ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తోపాటు జాతీయ పార్టీ అయిన బీఎస్పీ నుంచి ఒకరు కలిపి నలుగురు ఉండగా.. రిజిస్టర్డ్ పారీ్టల అభ్యర్థులు 10 మంది ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు 83 మంది బరిలో ఉన్నా.. ప్రధాన పార్టీలు 36 మంది స్వతంత్రులను ఒప్పించి బరిలో నుంచి తప్పించగలిగాయి. అయినా పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. మొత్తంగా ప్రధాన పారీ్టలు మినహా మిగతా 44 మంది అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చుతారన్నది కీలకంగా మారింది. మారిన పరిస్థితుల్లో అంచనాలెలా? గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కనిపించినా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరడంతో ప్రస్తుత ఉప ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్కు చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులను, ప్రజాప్రతినిధులను వీలైనంత మందిని టీఆర్ఎస్, బీజేపీ తమవైపు తిప్పుకొన్నాయి. అయినా పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న స్పష్టత లేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ గుర్తుపై ఎన్ని ఓట్లు పడ్డాయి? క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగిందన్న లెక్కలు తీసుకున్నాయి. ఇక టీఆర్ఎస్కు ఈసారి సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పారీ్టల ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఆ పార్టీ తమ ఓటు బ్యాంకుతోపాటు కాంగ్రెస్ నుంచి వచి్చన నేతలపై ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ గతంలో రాజగోపాల్రెడ్డికి పడిన కాంగ్రెస్ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ నాయకులు పోయినా కేడర్ ఉందని, ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ చెబుతోంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఇలా.. 2018 సాధారణ ఎన్నికల్లో 16 మంది బరిలో ఉన్నారు. పోలైన మొత్తం 1,98,843 ఓట్లలో.. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రాజగోపాల్రెడ్డికి 97,239 (48.90 శాతం) ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి 74,687 ఓట్లు (37.56 శాతం), బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్రెడ్డికి 12,725 ఓట్లు (6.40 శాతం) వచ్చాయి. అదే ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన ఇండిపెండెంట్ మంగ వెంకటేశ్ కురుమకు 3,569 ఓట్లు (1.79 శాతం), ట్రక్కు గుర్తుపై ఎస్ఎంఎఫ్బీ పార్టీ నుంచి బరిలో ఉన్న చిలువేరు నాగరాజుకు 2,279 ఓట్లు (1.15 శాతం) లభించాయి. బీఎల్ఎఫ్ అభ్యర్థి గోశిక కరుణాకర్కు 2,080 ఓట్లు (1.05 శాతం), నోటాకు 3,086 ఓట్లు (1.55 శాతం) పడ్డాయి. మిగతా అభ్యర్థులందరికీ కలిపి మూడువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ఈ లెక్కలను, ప్రస్తుత పరిణామాలను బేరీజు వేసుకుంటున్నాయి.