
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో 30 ఏళ్లలోపు వయసు ఓటర్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నారు. మిగతా వయసు వారితో 30–39 ఏళ్లవారు ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత 30 ఏళ్లలోపువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న 18–19 ఏళ్లవా రు 8,432 మంది ఉంటే.. 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయసువారు ఏకంగా 51,131 మంది ఉన్నారు. అంటే 59,563 మంది ఓటర్లు 30ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
ప్రసన్నం చేసుకునే దిశలో..
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మొదట్లో లక్ష ఓట్లను సాధించడం టార్గెట్గా పెట్టుకోగా.. కొత్త ఓటర్లతో సంఖ్య పెరగడంతో ఇప్పుడు లక్షా 25వేల ఓట్ల టార్గెట్తో పనిచేస్తున్నాయి. విపరీతమైన పోటీకారణంగా ఈసారి పోలింగ్ 90శాతానికి పైగా నమోదుకావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో యు వ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో యువతపై పట్టున్న స్థానిక నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు తాయిలాలు ఇస్తున్నాయి. ఆయా నేతల స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షలదాకా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.
కొత్త ఓటర్లు 15,134 మంది
ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అక్టోబర్ 4వ తేదీ నాటికి ఓటు నమోదు, సవరణల కోసం 25,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 15,134 మంది ఓట్లు/సవరణలను ఆమోదించారు. మరో 10,696 మంది దరఖాస్తులను తిరస్కరించగా, ఒకరి దరఖాస్తు పెండింగ్లో పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment