
మాట్లాడుతున్న డీజీపీ మహేందర్రెడ్డి
సాక్షి, గోదావరిఖని (రామగుండం): శాంతి భద్రతల పరిరక్షణలో రామగుండం కమిషనరేట్ పోలీసుల పనితీరు బాగుందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రామగుండంకు వచ్చారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులతో సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్ల వారీగా అధికారుల పనితీరును తెలుసుకున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ కమిషనరేట్లో ప్రస్తుత స్థితిగతులను వివరించారు. రెండు జిల్లాల్లో పోలీసింగ్ పరంగా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను తెలియజేశారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి లేదన్నారు. తెలంగాణలో పోలీసులు అన్ని శాఖల మధ్య సమన్వయం చేస్తూ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్ష సమావేశంలో నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి, గ్రేహౌండ్స్ చీఫ్ శ్రీనివాస్రెడ్డి, ఐజీ ఎస్బీఐ ప్రభాకర్రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, పెద్దపల్లి డీసీపీ పి.రవీందర్, అడిషనల్ డీసీపీలు అశోక్ కుమార్, రవికుమార్, రెండు జిల్లాల ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. (చిన్నమెసేజ్తో శ్రీరామ రక్ష)