DGP Mahendar Reddy
-
డీజీపీ మహేందర్రెడ్డి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) ఎం.మహేందర్రెడ్డి శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మహేందర్రెడ్డి పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఉదయం 8:25 గంటలకు పరేడ్ నిర్వహించనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు అంజనీకుమార్కు ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి గౌరవ లాఠీని అందిస్తారు. అనంతరం అంజనీకుమార్ను డీజీపీ కుర్చీలో గౌరవప్రదంగా కూర్చోబెట్టనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మహేందర్రెడ్డికి సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది వీడ్కోలు పలకనున్నారు. మహేందర్రెడ్డి సేవలు అభినందనీయం: హోంమంత్రి డీజీపీగా పదవీ విరమణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ ఎం.మహేందర్రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శాలువాతో సత్కరించారు. ఈ మేరకు లక్డీకాపూల్లోని హోంమంత్రి కార్యాలయానికి వెళ్లిన డీజీపీ మహేందర్రెడ్డి హోంమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డికి మంత్రి చార్మినార్ జ్ఞాపికను అందించారు. పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారని ప్రశంసించారు. విధినిర్వహణలో తనదైన ముద్రవేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా, డీజీపీగా, ఇతర అనేక హోదాల్లోనూ పనిచేసి అందరి మన్ననలు పొందారని హోంమంత్రి గుర్తు చేశారు. డీజీపీగా మహేందర్రెడ్డి పనిచేసిన ఈ ఐదేళ్లలో తెలంగాణ పోలీసు శాఖను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. గురువారం బదిలీలు పొందిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు సైతం హోంమంత్రిని కలిశారు. -
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 2022 ఏడాదిలో పోలీస్ శాఖ సఫలీకృతమైనట్టు డీజీపీ ఎం.మహేందర్రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు సహా కొన్ని రకాల నేరాలు కొంత పెరిగినా...నేరస్తులకు శిక్షలు పడే శాతం గతేడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి 56 శాతానికి చేరడం సంతృప్తినిచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ఏడాది మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించగలిగామన్నారు. మతఘర్షణలు ఇతర నేరాల కట్టడిలో పోలీస్శాఖలోని అధికారులు, సిబ్బంది అంతా ఒక బృందంగా కలిసికట్టుగా పనిచేశారని డీజీపీ తెలిపారు. భవిష్యత్తులో సైబర్నేరాల ముప్పు మరింత పెరగనుందని, ఆ దిశగా పోలీస్శాఖ సమాయత్తమయ్యేలా ఎన్నో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం లక్డీకాపూల్లోని తెలంగాణ పోలీస్ కేంద్ర కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ 2022 వార్షిక నివేదిక, తెలంగాణ పోలీస్ ట్రాన్స్ఫార్మేషనల్ జర్నీ నివేదికలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఉత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచిన ఉప్పల్, కోదాడ టొన్, ఆదిలాబాద్ వన్టౌన్, లక్ష్మీదేవిపల్లి, సిరోల్ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల)కు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేందర్రెడ్డి సుదీర్ఘంగా ప్రసగించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీస్శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ఫలితాలు, గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సరళి తదితర అంశాలను వివరించారు. నాలుగు మూల సూత్రాలతో ముందుకెళ్లాం.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణతోపాటు మారుతున్న నేరసరళికి అనుగుణంగా మార్పు చెందేలా పోలీస్శాఖ బలోపేతానికి ప్రాసెస్, టెక్నాలజీ, కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ అనే నాలుగు మూల సూత్రాలను అనుసరించినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఎక్కడ ఉన్నా భద్రంగా ఉన్నామన్న విశ్వాసాన్ని ప్రజల్లో, అదే సమయంలో తెలంగాణలో నేరం చేస్తే తప్పక పట్టుబడతామన్న భయాన్ని నేరస్తుల్లో తేగలిగామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడంలో పోలీస్తోపాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయ పర్చేలా తీసుకువచ్చిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ పోలీస్శాఖకు చేరిన అదనపు వనరుగా డీజీపీ పేర్కొన్నారు. రానున్న ఐదారేళ్లలో దేశంలోనే ఉత్తమ సంక్షేమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ స్ట్రీట్ వెండార్స్తో సీసీటీవీల బిగింపు మొదలు.. రాష్ట్రవ్యాప్తంగా నిఘా నేత్రాలుగా మారిన సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో తొలుత ఎన్నో అనుమానాలు ఉండేవని డీజీపీ గుర్తు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా తొలిసారి సీసీటీవీలను ఏర్పాటు చేసుకునేందుకు బంజారాహిల్స్లో తోపుడు బండ్ల వాళ్లు ముందుకు వచ్చారన్నారు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రజలు, పలు సంస్థలు, ఎన్జీఓల సహకారంతో ప్రస్తుతం 10,25,849 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరి పోలీస్శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. కాగా, దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో కమిషన్ నివేదిక హైకోర్టుకు సమర్పించిందని, దానిపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుందని, ఆ ప్రాసెస్ కొనసాగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలిపారు. అన్ని రోడ్లపై స్పీడ్ లిమిట్కు సంబంధించిన సైన్బోర్డులు ఏర్పాటు చేసేలా ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ మహేశ్భగవత్, అడిషనల్ డీజీలు నాగిరెడ్డి, సందీప్శాండిల్య, సంజయ్జైన్, ఐజీ కమలాసన్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ ఈనెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుందని, గత 36 ఏళ్లుగా తన వృత్తిగత జీవితంలో అనేక అవకాశాలు ఇచ్చిన అన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, సీఎస్లు, ఇతర సిబ్బందికి అందరికీ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వృత్తిగత జీవితంలో మీడియా ఎంతో సహకరించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. -
తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు.. ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీతో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో బదిలీలు జరిగాయి. బదిలీల అనంతరం తెలంగాణ ఇన్చార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్. - రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్. - ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు. - లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్. - హోంశాఖ కార్యదర్శిగా జితేందర్. -
టీఎస్పీఐసీసీసీ చైర్మన్గా డీజీపీ మహేందర్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ‘సూపర్ పోస్టు’ను సృష్టిస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఇటీవలే ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్పీఐసీసీసీ)’కు ప్రభుత్వం చైర్మన్ను నియమించనుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ఎం.మహేందర్రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. తర్వాత ఆయననే ఈ పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర పోలీసు విభాగం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైతం ఐసీసీసీ చైర్మన్ ఆధీనంలోనే ఉండనున్నట్టు సమాచారం. రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇలాంటి పోస్టు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు సలహాదారులే.. రాష్ట్ర పోలీసు విభాగంలో డీజీపీతోపాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన వారి సేవలను వినియోగించుకోవడం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే వారిని శాంతిభద్రతల విభాగం సలహాదారులుగానో, చట్ట సవరణ, పోలీసు మ్యాన్యువల్లలో మార్పుచేర్పులకు సంబంధించిన కమిటీలకు ఇన్చార్జులుగానో నియమింవారు. మాజీ డీజీపీలు ఏకే మహంతి, అనురాగ్శర్మలతోపాటు రిటైర్డ్ ఐజీ గంగాధర్ల నియామకాలు ఈ కోవలోకే వస్తాయి. మరికొందరు పదవీ విరమణ చేసిన డీఎస్పీలు, అదనపు ఎస్పీల సేవలనూ వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. కొందరైతే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా పనిచేస్తున్నారు. వారంతా గవర్నర్, హోంమంత్రి, డీజీపీ లేదా ఆయా యూనిట్లకు నేతృత్వం వహించే పోలీసు ఉన్నతాధికారి ఆధీనంలో పని చేస్తుంటారు. దీనికి భిన్నంగా ఎం.మహేందర్రెడ్డిని ఐసీసీసీ చైర్మన్గా కేబినెట్ హోదాలో నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణతో కలిపి.. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మూడింటిలో జోన్లు, డివిజన్లతోపాటు పోలీస్స్టేషన్ల సంఖ్య పెంపునకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించింది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్కు 1,252, సైబరాబాద్కు 750, రాచకొండకు 763 మంది అదనపు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం ఐసీసీసీ చైర్మన్గా మహేందర్రెడ్డిని నియమించాలని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో పాటు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆయన ఆధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించడంతో మార్పులు జరిగాయి. కేబినెట్ మూడు కమిషనరేట్ల ప్రతిపాదనలకు అదనంగా ఐసీసీసీ కోసం 400, సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం 500 పోస్టులను కూడా జోడించి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిపి మొత్తంగా 3,965 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పోలీసు విభాగం వినియోగిస్తున్న టెక్నాలజీల నిర్వహణతోపాటు ఐసీసీసీ మొత్తం దాని చైర్మన్ ఆ«ధీనంలోకి వెళుతుంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో కొనసాగుతున్న ఐసీసీసీకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ఏడో అంతస్తులో చైర్మన్ కార్యాలయం ఉండనుంది. ఇటీవల ఐసీసీసీకి వెళ్లిన మహేందర్రెడ్డి ఆ చాంబర్ను పరిశీలించారని.. ఈ వారాంతంలో లేదా వచ్చే నెల మొదటివారంలో ఐసీసీసీ చైర్మన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
విద్యార్థుల రక్షణ సామాజిక బాధ్యత
సాక్షి, హైదరాబాద్: స్కూల్ విద్యార్థుల భద్రత, రక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరముందని పాఠశాల విద్యార్థుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ముందు పలువురు అభిప్రాయపడ్డారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాణీకుముదిని అధ్యక్షురాలిగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్ ఎంహెచ్ఆర్డీలో వివిధ వర్గాలతో భేటీ అయి, వారి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ స్వాతి లక్రా, ప్రభుత్వ కార్యదర్శి దివ్య దేవరాజన్, డీపీజీ మహేందర్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన పాల్గొన్నారు. పిల్లలపై జరిగే ఘటనలను మార్గదర్శకాల రూపకల్పనపై కమిటీ సలహాలు తీసుకుంది. డీజీపీ మాట్లాడుతూ భద్రత, రక్షణవిషయంలో యాజమాన్యాలను భాగస్వాముల ను చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవస్థీకృత చట్టంలో మార్గదర్శకాల రూపకల్పన చేయాలన్నారు. ఘటన జరగకముందే మేల్కొనే వ్యవస్థ ఏర్పాటు అవసర మని స్వాతి లక్రా సూచించారు. పిల్లలరక్షణ సామాజిక బాధ్యతగా అందరూ భావించాలని దేవసేన అన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. -
గురుకులంలో సీటు రాకుంటే రైతు అయ్యేవాడిని
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల విద్యాలయంలో సీటు రాకపోయిఉంటే.. సొంత ఊరైన ఖమ్మం జిల్లా కూసుమంచిలో వ్యవసాయం చేసేవాడినని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. చిన్ననాటి స్నేహితులు కూడా వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఉద్యోగ విరమణ చేసేలోపు చదువుకున్న పాఠశాలను సందర్శించాలనుకున్న డీజీపీ.. మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల విద్యాలయానికి వచ్చారు. సుమారు రెండు గంటల పాటు ఆయన విద్యాలయంలో గడిపారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుకు కారణమైన మద్ది నారాయణరెడ్డి, దివంగత పీఎం పీవీ నర్సింహారావు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ సర్వేల్ గురుకులం ఎన్నో నేర్పిందని, విద్యాపరంగా వేసిన పునాది తన జీవితాన్ని మలుపు తిప్పిందని వివరించారు. డీజీపీ స్థాయికి ఎదగడానికి ఈ గురుకులమే కారణమని ఆయన స్పష్టం చేశారు. తన గురువులు నేర్పిన విలువలు ఇప్పటి వరకు దిక్సూచిలా పనిచేస్తున్నా యన్నారు. గురుకులంలో చదివితే ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చని చెప్పారు. -
రాజకీయాల్లోకీ సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టాలను అమలు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. చట్టాల రూపకల్పనలో నల్సార్ విశ్వవిద్యాలయం నిమగ్నమైందని, ఈమేరకు వర్సిటీతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ప్రత్యేక సైబర్ చట్టాలతో కేసుల విచారణ, దర్యాప్తు వేగవంతమవడంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని స్పష్టంచేశారు. సైబర్ చట్టాలను అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని తెలిపారు. శనివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సైయంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం దేశంలోనే మొదటిది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తులు, సంస్థలతోపాటు రాజకీయాల్లో కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు గూగుల్ పే ద్వారా ఓటర్ల ఖాతాలకు నగదు బదిలీ చేశారని ఆరోపించారు. పోలీసులు, న్యాయ విభాగాలు మాత్రమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాజకీయాల్లో సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కసారి రిజిస్టర్లోకి ఎక్కితే... అమెరికా తరహాలో లైంగిక నేరస్తుల జాబితా తెలంగాణలోనూ అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితాతో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాలని సూచించారు. నిందితుల పేరు, ఇతరత్రా వివరాలను రిజిస్టర్లో ఎక్కించాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఒకసారి రిజిస్టర్లో ఎక్కితే వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు, రాయితీలకూ అనర్హులుగా ఉంటారని హెచ్చరించారు. డ్రోన్ పోలీసింగ్.. అవగాహన లోపం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, మోసపోతున్న వారిలో విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం విచారకరమని కేటీఆర్ చెప్పారు. సైబర్ మోసాల బారిన పడిన వారు 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పోలీసు యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువగా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ‘మారుమూల ప్రాంతంలోని బాధితుడు డయల్ 100కు కాల్ చేస్తే పోలీసు వెళ్లాలంటే సమయం పడుతుంది. పోలీసు కంటే ముందే కెమెరా, సైరన్, లైట్తో డ్రోన్ వెళ్లి అక్కడి పరిస్థితిని పోలీసులకు చేర్చే స్థాయికి రాష్ట్రం ఎదగాలి. ఈ మేరకు డీజీపీ, హోంమంత్రి కార్యాచరణ రూపొందించాలి’ అని కేటీఆర్ చెప్పారు. నెక్ట్స్జెన్ పోలీసింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి సాధారణ పోలీసులు, సిబ్బంది స్థానంలో టెక్ పోలీస్, నెక్ట్స్జెన్ పోలీసుగా మారాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, దీంతో రాష్ట్ర ఆదాయం కూడా మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ ఎకో సిస్టమ్ బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని, సైబర్ సేఫ్టీ కేంద్రం ఏర్పాటుకు కారణమిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్రావు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఏసీబీ డీజీ అంజనీకుమార్ యాదవ్, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, సైయంట్ ఫౌండర్, చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక నేరాలపై ఎస్హెచ్వోలకు అవగాహన ఉండాలి : డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక నేరాలపై పోలీసు స్టేషన్ అధికారులకు(ఎస్హెచ్వో)లకు అవగాహన ఉండా లని రాష్ట్ర డీజీపీ పి.మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక నేరాలు అరుదుగా జరిగేవని, వాటిని సీసీఎస్ లేదా సీఐడీకి బదిలీ చేసేవాళ్లమని, మారిన పరిస్థితుల్లో ఆర్థిక నేరాలు అధికమైనందున వాటి దర్యాప్తు బాధ్యతను సంబంధిత పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. గురువారం మాసబ్ట్యాంక్లోని పోలీసు ఆఫీ సర్స్ మెస్లో ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎఫ్) డీజీ ఉమేష్ష్రాఫ్ రచించిన ‘ఎకనామిక్ అఫెన్సెస్–హ్యాండ్ బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్’ను డీజీపీ ఆవిష్కరించారు. అడిషనల్ డీజీ జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యకమ్రంలో డీజీపీ మాట్లాడుతూ..యువ పోలీస్ అధికారులకు మార్గ దర్శకంగా ఉండేందుకు సర్వీసులో ఉన్న ప్రతీ సీనియర్ పోలీస్ అధికారి తమ అనుభవాలతో రచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా నేరాల స్వభావాలలో మార్పులు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా, ఇటీవల కాలంలో ఆర్థిక పరమైన నేరాలు అధికమయ్యాయన్నారు. ఉమేష్ ష్రాఫ్ రచించిన పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిస్తామని, ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. మాజీగవర్నర్, రిటైర్డ్ డీజీ పి.ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, తాను క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఆర్థికపరమైన అవకతవకలు, నేరాలు సహకార సంఘాల నుంచే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ఉమేష్ ష్రాఫ్ రాసిన మరో పుస్తకం క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ పరిచయ కార్యక్రమం జరిగింది. రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎంవీ కృష్ణారావు, అరవింద్ రావు, సాంబశివరావు, ఉమేష్ కుమార్, రాజీవ్ త్రివేది, రత్నారెడ్డిలతోపాటు అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్, అంజనీకుమార్, శివధర్రెడ్డి, రాజీవ్ రతన్, సంజయ్ జైన్, విజయ్ కుమర్, అభిలాష బిష్త్, నాగిరెడ్డి, కమలహాసన్ రెడ్డి హాజరయ్యారు. -
క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: బోగస్ సర్టిఫికెట్ల నియంత్రణకు మరో అడుగు పడింది. ఈ దిశగా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఈ వెబ్సైట్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. 27 భాషల్లో ఈ వెబ్సైట్ సేవలు పొందేలా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, డీజీపీ మహేందర్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వెబ్సైట్ రీ డిజైనర్ ప్రొఫెసర్ నవీన్కుమార్, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాసంస్థల విశ్వసనీయతను విశ్వవ్యాప్తంగా చాటడానికే ఈ వెబ్సైట్ను రూపొందించినట్లు వక్తలు చెప్పారు. తక్షణ వెరిఫికేషన్ కూడా.. ‘ఆధార్, ఈమెయిల్ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్సైట్కు లింక్ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్ పూర్తి చేసి సమాచారం పంపుతాం. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్ సంతకంతో అందిస్తాం. 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు’ అని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చెప్పారు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్ బోర్డులను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు. ఈ సైట్నూ హాక్ చేసే ఘనులున్నారు: డీజీపీ మహేందర్రెడ్డి ఇప్పటివరకూ ఉద్యోగాలకు వెళ్లే యువత సరిఫికెట్లు అసలో, నకిలీవో తెలుసుకోవాలంటే తీవ్ర జాప్యం జరిగేది. దీనివల్ల యువకుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే ఒక ముఠాను పట్టుకుంటే, మరికొన్ని ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్లు దేశ విదేశాల్లో ఉన్నారు. కన్సల్టెన్సీలూ ఫేక్ సర్టిఫికెట్లు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ టైమ్లో ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. రాబోయేకాలంలో ఇందులోనూ హ్యాకర్స్ ప్రవేశించే వీలుంది. బ్లాక్చైన్ టెక్నాలజీతో మరింత పటిష్టం చేయాలి. తెలంగాణ చరిత్రలో మైలురాయి: సబిత తెలంగాణ విద్య చరిత్రలో ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారి మన రాష్ట్రంలోనే దీన్ని తెచ్చాం. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టాలన్న ఆలోచనకు అనుగుణంగా అన్నిస్థాయిల అధికారులు చొరవ తీసుకున్నారు. టెక్నాలజీని వాడుకుని జరిగే మోసాలకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. దీన్ని ఆషామాషీగా ప్రారంభించి వదిలేయకుండా మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలి. మన రాష్ట్రంలో జారీ చేసే సర్టిఫికెట్లు నకిలీలు చేయలేరనేది నిరూపించాలి. -
అవసాన దశలో మావోయిస్టు ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమం నాయకత్వ లేమితో బలహీనమై అవసాన దశలో ఉందని, ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోవచ్చని డీజీపీ మహేందర్రెడ్డి వ్యాఖ్యానించారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని, ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు ఆలూరి ఉషారాణి శనివారం డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి అలియాస్ విజయక్క అలియాస్ పోచక్క అలియాస్ భాను దీదీగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారని.. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో మావోయిస్టు ఉద్యమం నుంచి తప్పుకొని లొంగిపోయారని ప్రకటించారు. ‘‘ఉషారాణి కుటుంబ నేపథ్యమంతా మావోయిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంది. తండ్రి ఆలూరి భుజంగరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విరసంలో సభ్యుడిగా కొనసాగారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పీపుల్స్వార్లో చేరారు. ఉషారాణి గుడివాడ ఏఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆర్ఎస్యూలో చేరి, 1987లో విద్యార్థి సంఘ నేతగా ఎన్నికయ్యారు. 1991లో పీపుల్స్వార్లో చేరి మునుగోడు దళ కమాండర్గా పనిచేశారు. 1998 యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్పై దాడిచేసి ఒకరిని చంపి, ఆయుధాలు తీసుకెళ్తున్న సమయంలో ఆమె భర్త ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఉషారాణి 2002 నుంచి ఇప్పటివరకు దండకారణ్య జోనల్ కమిటీలో పనిచేశారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019లో సరెండర్ అవుతానని పార్టీని కోరారు. రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు లొంగిపోయారు’’ అని డీజీపీ వివరించారు. మావోయిస్టు పార్టీకి నాయకత్వలోపం మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిస్తున్న సీనియర్లు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. జంపన్న, సుధాకర్ సరెండర్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేదన్నారు. మావోయిస్టు పార్టీకి అగ్ర నాయకత్వం లేక బలహీనపడిందని ఉషారాణి ద్వారా తెలుసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం పార్టీలోకి కొత్తగా వస్తున్న వారికి ఐడియాలజీ లేదని.. నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కూలిపోతుందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ కమిటీలో కీలకమైన 11 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని.. వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పారు. సెంట్రల్ కమిటీ మెంబర్ ముప్పాళ్ల లక్ష్మణరావు నడవలేకపోతున్నారని, కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని.. ఆనంద్ కూడా అనారోగ్యంతో ఉన్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోతే మంచి వైద్యసేవలు అందిస్తామని, సాధారణ జీవితం గడపవచ్చని చెప్పారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి పోలీసు విభాగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. -
మావోయిస్టుల ఇలాకాలో పోలీస్ బాస్లు
చర్ల: మావోయిస్టుల ఇలాకాగా పేరున్న ఛత్తీస్గఢ్కు సరిహ ద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నాపురం వద్ద సీఆర్పీఎఫ్ క్యాంపును వారు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్ ద్వారా చెన్నాపురం చేరుకున్న వారు క్యాంపు పరిసరాలతో పాటు అధికారులు, సిబ్బందికి కల్పించిన వసతులను పరిశీలించారు. అదనపు డీజీపీ ఎస్.ఎస్.చతుర్వేది, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అదనపు డీజీ నళిన్ప్రభాత్, సదరన్ సెక్టార్ ఐజీ మహేష్చంద్ర లడ్డా, కుంట డీఐజీ రాజీవ్కుమార్ ఠాకూర్, డీఐజీ ఎస్.ఎన్.మిశ్రా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా క్యాంపులు సీఆర్పీఎఫ్ క్యాంపు ప్రారంభించిన అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ, నక్సల్స్ నిర్మూలన కోసం కేంద్ర హోం శాఖ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగా లను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులో క్యాంపులు ఏర్పాటుచేయగా, జిల్లా పోలీసు యంత్రాంగం, సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు. కాగా, అమాయకపు ఆదివాసీ గిరిజనులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులు తెలంగాణలో ఆదరణ కోల్పోయారని మహేందర్రెడ్డి పేరొన్నారు. సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్సింగ్ మాట్లాడుతూ మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల పోలీసుల పనితీరు అభినందనీయమని తెలిపారు. -
నిమజ్జనం పై డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ప్రకటన
-
వజ్రోత్సవాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలుగా ఘనంగా నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ముఖ్య అతిధిగా హాజరు కాను న్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను, ఇటీవల అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను సీఎం సన్మానించనున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వాయిద్య కళాకారుడు శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. వజ్రోత్స వాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శిస్తారు. అనంతరం లేజర్ షో, ఆ తర్వాత బాణాసంచా కార్యక్రమా లుంటాయని అధికారులు తెలిపారు. వజ్రోత్స వాల్లో భాగంగా థియేటర్లలో ప్రదర్శించిన గాంధీ సినిమాను దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు తిలకించినట్టు అధికారులు పేర్కొన్నారు. -
పుస్తక ప్రదర్శనతో బాపూ భావజాలం ఆకళింపు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ ఆలోచనలను, భావజాలాన్ని ఆకళింపు చేసుకొనేందుకు పుస్తక ప్రదర్శన ఎంతో దోహదం చేస్తుందని సీఎస్ సోమేశ్కుమార్ అన్నారు. ‘మంచి పుస్తకం చెంతన ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే‘.. అన్న గాంధీ సూక్తిని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఇతర సీనియర్ అధికారులతో కలసి సీఎస్ శనివారం పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరఖాను, చేనేత మగ్గాన్ని, ఎద్దు గానుగ యంత్రాన్ని తిలకించారు. -
స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభోత్సవాన్ని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఆయన సందేశానికి ముందు 75 మంది వీణ వాయిద్య కళాకారులతో దేశభక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఇతర నృత్యాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్రెడ్డి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరక్టర్ రాజమౌళి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరక్టర్ హరికృష్ణ తదితరులతో కలిసి హెచ్ఐసీసీ వేదికను పరిశీలించారు. ఈనెల 8న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆహ్వానితులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
సీసీసీ ఆలోచన ఆయనదే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మానవ సమాజం ఉన్నంతకాలం.. పోలీసింగ్ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందని, ఆ వ్యవస్థ ఎంత బలంగా, శ్రేష్టంగా ఉంటే.. సమాజానికి అంత రక్షణ, భద్రత ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. హైదరాబాద్లో ఇంతటి కమాండింగ్ వ్యవస్థ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని, కానీ, చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణానికి ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త, ప్రధాన వ్యక్తి డీజీపీ మహేందర్రెడ్డినే అని సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కాలని, అలాగే ఈ భవనం నిర్మాణానికి సహకరించిన సంబంధిత శాఖ మంత్రి, విభాగాలు, కంపెనీలు కూడా ఇందులో భాగం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి సీసీసీ నిర్వహణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ.. యావత్ పరిపాలనకు ఉపయోగకరంగా ఉంటుందని, నార్మల్ రోజుల్లో ఒకలా.. విపత్తుల రోజుల్లో మరోలా ఉంటుందని ఆ సమయంలో మహేందర్రెడ్డి చెప్పారని గుర్తు చేసుకున్నారు. గొప్పపనితనం ప్రదర్శించేందుకు గొప్ప వేదిక ఏర్పాటును సాకారం చేసుకున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖకు హృదకపూర్వక అభినందనలు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఈ భవనం పూర్తి కావాలని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్య మైందని సీఎం కేసీఆర్ వివరించారు. సమాజం కోసం పాటుపడుతున్న పోలీసులకు సెల్యూట్ చెప్పిన సీఎం కేసీఆర్.. సంస్కారవంతమైన పోలీసింగ్ వ్యవస్థ అంతటా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ను అరికట్టేందుకు సమర్థవంతంగా పని చేయాలని, ఆ మహమ్మారిని తరిమి కొట్టాలని పోలీస్ శాఖకు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ సహకారం పోలీసులకు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారాయన. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మహిళా భద్రత అంశాన్ని.. తమ వెంట వచ్చిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిణితో స్వయంగా పరీక్షించి ధృవీకరించిన ఘటనను సైతం సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ఫ్రెండ్లీ పోలీస్గా తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికి కలికితురాయి నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
టెక్నాలజీ వినియోగంతో మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం వల్ల మరింత పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని డీజీపీ మహేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఉబెర్ యాప్ సంస్థతో కలసి లైవ్ లింక్ షేర్ టూల్ను ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వల్ల రియల్ టైమ్ లొకేషన్తో పాటు యూజర్ వివరాలు త్వరితగతిన తెలుస్తాయని, దీని వల్ల ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం సులభమవుతుందన్నారు. భద్రత కోసమే: ఉబెర్ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు తాము సేఫ్టీ టూల్ కిట్ ద్వారా లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించామని ఉబెర్ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తమ యాప్లో అనేక భద్రతా అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ లైవ్ లింక్ టూల్ కిట్ సోమవారం నుంచి పోలీస్ శాఖకు లింకు అవుతుందని తెలిపారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న స్వాతిలక్రా తదితరులు సేఫ్టీ టూల్ కిట్ పని ఇలా.. డ్రైవర్ భద్రతతో పాటు ప్రయాణికుల సేఫ్టీకి ఉబెర్ సంస్థ యాప్ లైవ్ లొకేషన్, పోలీస్ కంట్రోల్ సెంటర్, డయల్ 100కి చేరిపోయేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉబెర్ యాప్లోని సేఫ్టీ టూల్ కిట్లో బ్లూ షీల్డ్ క్లిక్ చేయగానే వాహనం నంబర్, డ్రైవర్ పేరుతో పాటు ప్రతీ నాలుగు సెకండ్లకు ఒకసారి వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరిపోతుంది. ప్రయాణికులు సైతం ఈ లింక్తో షేర్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ షేర్ వద్దనుకుంటే ఉబెర్ యాప్లోని ఎస్ఓఎస్ ఉపయోగించుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎస్ఓఎస్ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్కు క్షణాల్లో కాల్ వెళ్తుంది. దీని వల్ల అటు ప్రయాణికులు, ఇటు వాహన డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదం ఉన్నా దగ్గరలోని పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలికి చేరుకుంటుంది. -
డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్ నేరగాళ్లు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్కు మహేందర్రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్ మోస గాళ్లు ఈ పని చేసినట్లు గుర్తించారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్ నంబర్ను బ్లాక్ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, డీపీల ద్వారా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, అలాంటి నంబర్లపై నిఘా పెట్టాలని సూచించారు. -
డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్ల వసూళ్లు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఏదో రకంగా కేటుగాళ్లు.. ప్రజలను బురిడీ కొట్టించి.. డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం సైబర్ నేరగాళ్లు వదలలేదు. 97857 43029 నెంబర్కు డీజీపీ డీపీ పెట్టి కేటుగాళ్లు మోసాలను తీర లేపారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్యులకు డీజీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. దీనిపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఈ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం -
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీతో సైబర్ నేరాల ఆటకట్టు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్స్లెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటీ సంస్థలు, ఐఐటీ, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో సైబర్ సేఫ్టీ, జాతీయ భద్రత అనే అంశంపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో డీజీపీ మహేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సైబర్ నేరాల నిరోధంపై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను డీజీపీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రతీ స్టేషన్లో సైబర్ వారియర్ సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్ కీలక పాత్ర పోషిస్తోందని దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 800 లకు పైగా పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సైబర్ వారియర్లుగా నియమించామని డీజీపీ తెలిపారు. జిల్లా, కమిషనరేట్, రాష్ట్రస్థాయిలోను సైబర్ నేరాల పరిశోధన విభాగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సైబర్ నేరం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని తద్వారా దేశ భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సదస్సుల్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర హోంశాఖ డైరెక్టర్ పౌసమి బసు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంటెలిజెన్స్ ఐజీ రాజేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ట్రాన్స్జెండర్ల డిమాండ్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, పురుషులతో సమానంగా తమకూ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఇన్వార్డులో వైజయంతి వసంత, ఓరుగంటి లైలా, చంద్రముఖి మువ్వల తదితరులు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన అన్ని విభాగాల్లోని పోస్టుల్లో తమకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని బుధవారం డీజీపీ కార్యాలయం వద్ద ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. అందరితో సమానంగా బతికే హక్కు ట్రాన్స్జెండర్లకు ఉందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులను, 2021లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. బోర్డు విడుదల చేసిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తమకు 45 రోజుల సమయం ఇవ్వాలని, దరఖాస్తు ఫారమ్లో స్త్రీ, పురుషులతో పాటుగా ట్రాన్స్జెండర్ ఆప్షన్ జోడించాలని డిమాండ్ చేశారు. -
‘బిహార్’.. హాట్హాట్..
సాక్షి, హైదరాబాద్: పొలిటికల్ వర్సెస్ పోలీస్.. ఇది కొత్తదేమీ కాదు కానీ తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా బిహారీ బ్యాచ్ అంటూ రాష్ట్రంలోని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లను ఉద్దేశించి వారం రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డీ.. రాజీనామా చేసి కేసీఆర్ ముఖాన కొట్టు అన్న వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు దీటుగానే స్పందించాయి. ఒక రాష్ట్రానికి చెందిన అధికారులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం బుధవారమే తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా రేవంత్రెడ్డి గురువారం సంబంధిత ఐఏఎస్లు, ఐపీఎస్లకు ఇచ్చిన కీలక పోస్టింగ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదురుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే కుర్చీలో కూర్చోవడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని రేవంత్ ఆ లేఖలో సూచించారు. దీనిపై తాజాగా ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించింది. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగుల్లో పక్షపాత వైఖరి తెలంగాణలో బిహార్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలతో పాటు కీలకమైన విభాగాలను కేటాయించ డంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఆ విభాగాలకు అధిపతులుగా పనిచేయడం వల్ల అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగులపై పక్షపాత వైఖరి వీడాలంటూ గురువారం సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 157 మంది ఐఏఎస్లు, 139 మంది ఐపీఎస్ అధికారులుండగా ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శి నుంచి ఇన్చార్జి డీజీపీ వరకు బిహార్ అధికారులనే ఇవ్వడం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎందుకు లూప్లైన్లో పెడుతున్నారో చెప్పాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై ఐపీఎస్ల ఆగ్రహం రేవంత్రెడ్డి చేసిన బిహార్ బ్యాచ్ వ్యాఖ్యలను రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం గురువారం తీవ్రంగా ఖండించింది. ఆలిండియా సర్వీసు రూల్స్ తెలియకుండా రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించింది. అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం జరిగే అధికారుల కేటాయింపులపై వివాదాస్పదంగా మాట్లాడటం సరైంది కాదని పేర్కొంది. పోస్టింగ్ల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ విచక్షణతో కూడుకున్నదని కూడా స్పష్టం చేసింది. డీజీపీ మహేందర్రెడ్డి బలవంతంగా సెలవులో వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, బిహార్కు చెందిన ఐపీఎస్లను డీజీపీ చేసేందుకే ఇలా చేశారని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసోసియేçషన్ తీవ్రంగా ఖండించింది. మహేందర్రెడ్డి ఇంట్లో జారిపడటంతో డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి కోసం మెడికల్ లీవులో వెళ్లారని వివరించింది. వ్యక్తిగత ప్రయోజనం కోసం అధికారుల మధ్య చిచ్చు పెట్టి, రాష్ట్రాల వారీగా విభజించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా స్పందించింది. బలవంతపు సెలవు నిజం కాదు: డీజీపీ తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందం టూ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్త వం కాదని డీజీపీ మహేందర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంట్లో జారిపడిన సంఘటనలో ఎడమ భుజంపైన ఎముకకు మూడు చోట్ల హెయిర్లైన్ ఫ్రాక్చర్ జరిగిందని తెలిపారు. లోపలి గాయం మానేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినందునే ఫిబ్రవరి 18వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని వివరించారు. వైద్యుల సలహా మేరకు తిరిగి విధుల్లో చేరతానని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందం టూ తప్పుడు, బాధ్యతా రహిత ప్రచారం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఒక పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం భావ్యం కాదని, తమ రాజకీయ అవసరాలకు ప్రభుత్వ అధికారులపై ఈ విధమైన అసత్య ప్రచారం చేయడాన్ని తీ వ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒక ఉన్నత స్థాయి, బాధ్యతాయుత హోదాలో ఉన్న సీనియర్ అధికారిపై ఈ విధమైన ఆరోపణలను చేయడం ఆక్షేపణీయమని, ప్రభుత్వంపై అపో హలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సంజయ్పై దాడి సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉద్యోగుల సమస్య లపై దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేసిన అంశంలో రాష్ట్ర సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఇతర పోలీసు అధికారులకు లోక్సభ ప్రివి లేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ అంశంలో బండి సంజయ్ ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. దాడి, అరెస్టు ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ వాదనలు విని.. ఆయన సమ ర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించింది. తర్వాత కొద్దిగంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు్ల జారీ అయ్యాయి. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ శని వారం ఆదేశించారు. సమన్లు జారీ అయిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, హుజూరా బాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, జమ్మికుంట ఇన్ స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్రావు, హుజూరా బాద్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు, కరీంనగర్ టూటౌన్ ఇన్స్పెక్టర్ చలమల్ల నరేశ్ ఉన్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల భరతం పడతాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ డిగ్రీలను తయారు చేస్తున్న నేరస్తుల భరతం పడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. దీనికోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమన్వయంతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సోమవారం ఆయన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ యూనివర్సిటీలు ఇచ్చే సరిఫికెట్లన్నీ ఒకే పోర్టల్ ద్వారా సంబంధిత కంపెనీలు తేలికగా పరిశీలించుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా నకిలీ అని తేలితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీలకు సూచించారు. ఈ ప్రక్రియలో పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ దిశగా అన్ని యూనివర్సిటీలు డేటాను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ నకిలీల గుర్తింపునకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు. అవసరమైన సంస్థలు పోర్టల్కు లాగిన్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2016 వరకు అన్ని సర్టిఫికెట్లు ఆన్లైన్ చేశామని, త్వరలో మిగతా సంవత్సరాలవి కూడా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ వెంకటరమణ, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
ఏడాదంతా ‘కోవిడ్ డ్యూటీ’లోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని డీజీపీ ఎం. మహేందర్రెడ్డి తెలిపారు. 2020 తరహాలోనే 2021లో సంవత్సరమంతా కోవిడ్ విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేశామని... వైద్య, ఆరోగ్య, రెవెన్యూ సహా ఇతర శాఖల సమన్వ యంతో ప్రజలకు సేవలు అందించామన్నారు. దీంతో ప్రజల నుంచి పోలీసులకు మంచిపేరు లభించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఇతర ఉన్నతాధికారులతో కలసి వార్షిక నేర నివేది క–2021ను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ శాం తిభద్రతల పరిరక్షణలో సఫలీకృతమయ్యా మని, నేరాల నియంత్రణ, నేరస్తులను అరె స్టులో మంచి ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టురహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. 2020లో లాక్డౌన్ నేపథ్యంలో నేరాలు తక్కువగా నమోదయ్యాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఏడాదితో పోలిస్తే 2021లో నేరాల నమోదు 4.6 శాతం పెరిగిందని వివరించారు. 2021లో జరిగిన హత్యలు, కిడ్నాప్లు సహా వివిధ నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మొత్తం 1,32,906 కేసులు... వివిధ నేరాలకు సంబంధించి 2020లో మొ త్తం 1,35,537 నమోదవగా 2021లో మొత్తం కేసుల సంఖ్య 1,32,906గా నమోదైంది. 2021లో 838 హత్య కేసులు, 1,218 కిడ్నాప్, 2,382 రేప్ కేసులు నమోదయ్యాయి. 98 మంది మావోయిస్టుల అరెస్ట్.. ♦2021లో 98 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. మరో 133 మంది లొంగిపోయారు. స్టేట్ కమిటీలో ఇంకా 100 ఉండగా వారిలో కేవలం 30 మందే తెలంగాణకు చెందిన వారు. మిగతా 70 మంది ఛత్తీస్గఢ్వాసులు. ఆ రాష్ట్రంతో కలసి మావోయిస్టులను కట్టడి చేస్తున్నాం. 38,812 మంది నేర నిర్ధారణ ♦2021లో మొత్తం 38,812 మంది నిందితు లు దోషులుగా నిరూపితం కాగా.. 80 కేసుల్లో 126 మందికి జీవితఖైదు పడింది. శిక్షల శాతం 48.5 నుంచి 50.3 శాతానికి చేరింది. పదేపదే నేరాలు చేస్తున్న 664 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించాం. 5 నిమిషాల్లోనే స్పాట్కు... ♦డయల్ 100 నంబర్కు వచ్చే కాల్స్కు పోలీసులు సత్వరం స్పందించాలనే లక్ష్యంతో రెస్పాన్స్ టైమ్ను గణిస్తున్నాం. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 7 నిమిషాల్లో పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో పోలీసులు స్పాట్కు చేరుకుంటున్నారు. రూ. 53 కోట్ల విలువైన సొత్తు రికవరీ... ♦2021లో మొత్తం 17,429 దొంగతనాలు నమోదవగా రూ. 113 కోట్ల విలువైన సొ త్తు దొంగలపాలైంది. వాటిలో 7,682 కే సులను (44%) కొలిక్కి తెచ్చి రూ. 53 కో ట్ల (47%) విలువైన సొత్తు రికవరీ చేశాం. 838 జీరో ఎఫ్ఐఆర్లు... ♦నేరం జరిగినప్పుడు పరిధుల సమస్యతో బాధితుడు ఠాణాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడకుండా ఉండటానికి రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేపడుతున్నాం. 2020లో ఇలాంటి కేసులు 517 నమోదవగా 2021లో అవి 838కి పెరిగాయి. వాటిని ఆయా పరిధిల్లోని ఠాణాలకు బదిలీ చేస్తున్నాం. 4 నెలల్లో ట్విన్ టవర్స్... ♦హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్మి తమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 3–4 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చు. రిటైరయ్యేలోగా ప్రతి పోలీసుకూ ఇల్లు ♦ప్రతి ఒక్కపోలీసుకు రిటైరయ్యే సమ యానికి సొంత ఇల్లు ఉండాలన్నదే మా లక్ష్యం. దీనికి ప్రభుత్వం సహకరిస్తోంది. ప్రతిజిల్లాకు ఓ పోలీసు కల్యాణ మం డపం, అనువైన ప్రతిచోటా పెట్రోల్ బం కుల ఏర్పాటుతో ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. సిబ్బందికి నామమాత్రపు వడ్డీ లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. -
ఈటల ఓటమికి ప్రయత్నించారంటూ వెయ్యికి పైగా ఫోన్లు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్కు మద్దతు ఇచ్చారని, ఈటల రాజేందర్ ఓటమికి ప్రయత్నించారని ఆగంతకులు ఫోన్లు చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. తన ఫోన్ నెంబర్ను ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియాలో పెట్టి ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండ్రోజుల నుంచి వెయ్యికి పైగా ఫోన్లు వచ్చాయని, దీని వెనుక ఎవరున్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కోరినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధిస్తోందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తనను ఇటీవల అభినందించిన వ్యవహారాన్ని గుర్తుచేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హోంమంత్రి, డీజీపీ నుంచి న్యాయం చేస్తామన్న హామీ లభించిందని కృష్ణయ్య తెలిపారు. (చదవండి: TSRTC: బస్సు చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్) -
డీజీపీ, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: డీజీపీ మహేందర్రెడ్డితోపాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా చిట్చాట్లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజికవర్గం ఆధారంగా డీజీపీని అనుమానిస్తున్నారని, ఇది తగదని అన్నా రు. పోలీసుల్లో ఒకే విభాగానికి ప్రభుత్వపెద్దలు పెద్దపీట వేస్తున్నారని, పోలీసు శాఖ రెండు వర్గాలుగా చీలిపోయిందని వ్యాఖ్యానించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా పేరొందిన కరీంనగర్ జిల్లాకు చెందిన వేణుగోపాల్రావు, నర్సింగరావు, ప్రవీణ్రావు, రమణకుమార్లతో కూడిన 30 మంది బృందంతో రాజకీయ నేతలపై ఆధునిక సాంకేతికతతో నిఘా పెట్టారని, దీని కోసం ఓ విశ్రాంత ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక సెల్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవర్గానికి చెందిన ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా తమవర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ మేరకు ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి గజానన్ని డిప్యుటేషన్ మీద తీసుకువచ్చారని ఆరోపించారు. తనకు అనుకూలమైన అధికారులకు హైదరాబాద్లో పోస్టింగులు ఇప్పించుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. వాటాల పంచాయితీతోనే ఉపఎన్నిక ఇరవై ఏళ్లు మంత్రి హరీశ్రావుతో సహవాసం చేసిన ఈటల రాజేందర్ అకస్మాత్తుగా దొంగ ఎలా అయ్యారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ చైర్మన్గా ఉన్న టీఆర్ఎస్ అనే కంపెనీలో వాటా అడుగుతున్నాడన్న అక్కసుతోనే రాజేందర్ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించారని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ము పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాలే ఈటల రాజీనామాకు దారితీశాయని, అందుకే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ తోడుదొంగలేనని విమర్శించారు. ఏడేళ్లలో ప్రధాని గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరలు పెంచడం తప్ప ఇంకేమీ చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ నయా నిజాం అని, తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అల్లుడు హరీశ్రావు అనే ఖాసీం రిజ్వీని దింపారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీలో కేసీఆర్ బీజేపీ, నడ్డా బీజేపీ అని రెండు విభాగాలు ఉన్నాయని, బండి సంజయ్ ఆటలో అరటి పండు అని వ్యాఖ్యానించారు. అందుకే మురళీధర్ రావు, సుగుణాకర్రావు, విద్యాసాగర్రావులు బండి సంజయ్ని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 2022లో ముందస్తు ఎన్నికలకు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్లో ముసలం పుడుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు 2022 డిసెంబర్లో కేసీఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. సీఎం కేసీఆర్కు సూసైడ్ టెండెన్సీ ఉందని, ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెదరగొట్టడం ఆయనకు అలవాటేనని అన్నారు. ఇందుకు 2004 నుంచి 2018 వరకు తన పార్టీ ప్రజాప్రతినిధులు, ఆయన చేసిన రాజీనామాలు, ముందస్తు ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. దళితబంధు కోసం ఇప్పుడు కేటాయించిన రూ.రెండు వేల కోట్లనే విడుదల చేయలేదని,మాటలతో మభ్యపెట్టే కేసీఆర్ను 2022 ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిస్తారని, ఆ దెబ్బకు కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటారని అన్నారు. హైదరాబాద్లో వరద సాయం కోసం రూ.10 వేలే సరిగా ఇవ్వనివారు, దళితబంధు కింద లక్షలాది మందికి రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారని ప్రశ్నించారు. -
తెలంగాణలో 20 మంది డీఎస్పీలకు స్థానచలనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: నాలా విషాదం: మణికొండ డీఈ సస్పెన్షన్! -
మహిళలపై నేరాలకు సైబర్ ల్యాబ్తో చెక్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ ల్యాబ్ దోహ దపడుతుందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈ తరహా నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసుశాఖలో సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర మహిళాభద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి.స్వాతిలక్రా, సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధనాకేంద్రం (సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్) అధికారుల మధ్య కుదిరిన అవగాహనాఒప్పందంపై శుక్రవారం డీజీపీ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఐ.జి సుమతి, సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తదితరులు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, దీనిలో భాగంగానే సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యమవుతుందని, సైబర్ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు సైబర్ ల్యాబ్ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. 2020–21ను సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ, పరిష్కారానికి సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని స్వాతిలక్రా అన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్ట్రాగాం, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల ద్వారానే ఈ నేరాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డితో సీఆర్సీఐడీఎఫ్ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్)తో డీజీపీ కార్యాలయంలో శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి కూడా పాల్గొంటారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ)తో పాటు, మహారాష్ట్ర పోలీసులతో పలు ప్రాజెక్టుల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. రాష్ట్ర విమెన్సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ సైబర్ ల్యాబ్ నడుస్తుంది. ఇందుకోసం విమెన్సేఫ్టీ వింగ్ మూడో అంతస్తులో ల్యాబ్ నిర్మించారు. ఇందులో పనిచేసేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, సైబర్ క్రైం ఇన్వెస్టిగేటర్స్, కంటెంట్ రైటర్స్ను నియమించారు. ఈ నెలాఖరున కార్యకలాపాలు ప్రారంభించనుంది. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత
-
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.మావో అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ కుమారుడు రావుల రంజిత్ బుధవారం రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం రంజిత్ దండకారణ్యం బెటాలియన్ కమిటీ చీఫ్గా కొనసాగుతున్నాడు. కాగా రెండు సంవత్సరాల క్రితం తండ్రి రామన్న ఆనారోగ్య సమస్యతో రామన్న చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రంజిత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం.ఈ సందర్భంగా రావుల రంజిత్ను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడారు. '' మావోయిస్టు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ ప్రస్తుతం ప్లాటున్ కమిటి మెంబర్గా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా కు చెందిన మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న కుమారుడు రంజిత్ 1998లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాడు. తండ్రి రామన్న ఆధ్వర్యంలో రంజిత్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ జాయిన్ అయి 2019 వరకు మెంబర్గా వ్యవహరించాడు. అయితే తండ్రి మరణం తర్వాత రంజిత్ అనేక అవమానాలకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో పార్టీ మాత్రం అతని లొంగుబాటుకు అంగీకరించలేదు. ఈ మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తనంతట తాను లొంగిపోవాలని రంజిత్ భావించాడు. 2017 నుండి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసాడు.2018 కాసారం అటాక్ లో కీలక పాత్ర పోషించాడు..2021 లో జీరం అటాక్తో పాట 2020 మినప అటాక్లో సైతం రంజిత్ చురుగ్గా వ్యవహరించాడు. కరోనా పాండమిక్ సమయంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నారు. తెలంగాణ రాష్టం నుంచి 11 మంది, ఆంద్రప్రదేశ్ నుంచి 3 మంది సెంట్రల్ కమి ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లో ఉన్న 14 మంది మావోయిస్టులు లొంగిపోవాలి. 4 లక్షల పరిహారం తో పాటు ప్రస్తుత ఖర్చులకు 5 వేలు అందజేస్తున్నాం.'' అంటూ తెలిపారు. -
అవగాహనతోనే ఆన్లైన్ వేధింపులకు చెక్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: డేటా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు, మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన, విద్యాశాఖ కమిషనర్ సందీప్కుమార్ సుల్తానియా, విమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి రిత్విక, సైబర్సేఫ్టీ నిపుణులు రక్షితా టాండన్ హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ, టీనేజీ విద్యార్థులు, మహిళలు సైబర్ వేధింపుల బారిన పడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని, ఇలాంటి వాటిపై అవగాహన ఉంటే అప్రమత్తంగా ఉండొచ్చన్నారు. సైబ్హర్–3లో విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతోంది. జూలై 1 నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా 10 నెలలపాటు నిర్వహించబోతున్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేయనున్నారు. కాగా, దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడొద్దన్నారు. వర్టికల్స్ అమలుపై డీజీపీ అభినందన వర్టికల్ ఫంక్షనల్ అమలులో 2020 –21లో ఉత్తమ ఫలితాలు సాధించిన 223 పోలీస్ స్టేషన్ల అధికారులకు డీజీపీ ప్రత్యేక పురస్కారాలు ప్రకటించారు. 17 ఫంక్షనల్ వెర్టికల్స్ అమలులో తాడూర్ పోలీస్ స్టేషన్కు మొదటి స్థానం, కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్కు రెండవ, రామగుండం పోలీస్ స్టేషన్కి 3వ స్థానం, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు నాలుగవ స్థానం లభించాయి. ఈ సందర్భంగా సంబంధిత ఎస్హెచ్ఓలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. అనంతరం ఇన్వెస్టిగేషన్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్రెడ్డి పరామర్శ
సాక్షి, నల్గొండ/ఖమ్మం: దొంగతనం కేసులో అరెస్టయిన దళిత మహిళ మరియమ్మ లాకప్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె కుమారుడు ఖమ్మం జిల్లాలోని సంకల్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ను తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ఆదివారం పరామర్శించారు. లాకప్డెత్ ఘటనపై కుటుంబసభ్యుల నుంచి డీజీపీ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు అడ్డగూడురులో ఏం జరిగిందని, ఎవరు మరియమ్మ, ఉదయ్ కిరణ్ను కొట్టారని అడిగి తెలుసుకున్నారు. విచారణ సమయంలో వారిని ఎంతమంది కొట్టారని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.డీజీపీ ముందు ఉదయ్ కిరణ్ కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు తమను అత్యంత క్రూరంగా కొట్టారని డీజీపీకి తెలిపాడు. తమకు న్యాయం చేయాలని ఉదయ్ కిరణ్ డీజీపీని వేడుకున్నాడు. ప్రభుత్వం అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులను సస్పెండ్ చేశామని చెప్పారు. అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మరియమ్మ ఘటన బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని డీజీపీ తెలిపారు. మరియమ్మ కుటుంబం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు. రూల్స్ విరుద్ధంగా ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: మరియమ్మ, ఆమె కుమారుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ? -
ఖమ్మం లో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన
-
Telangana: పోలీసులకు తీపికబురు
సాక్షి, హైదరాబాద్: పోలీసు సిబ్బందికి డీజీపీ మహేందర్రెడ్డి తీపి కబురు అందించారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు అందరికీ ఇంటి రుణపరిమితిని పెంచుతూ, అదే సమయంలో రుణాల వడ్డీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన భద్రత– ఆరోగ్య భద్రత ట్రస్ట్ బోర్డు మీటింగ్లో.. ప్లాటు కొనుగోలు వడ్డీరేటును 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించారు. పిల్లల విదేశీ విద్యా రుణాలను అన్ని హోదాల్లోని వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. ఈ సందర్భంగా డీజీపీకి తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇల్లు కట్టుకునేందుకు లోన్లు ఇలా... కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి దాకా రూ. 35 లక్షల నుంచి 40 లక్షలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 45 లక్షల నుంచి 50 లక్షలు, డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.55 లక్షల నుంచి 60 లక్షలు, ఐపీఎస్లకు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షలకు రుణ పరిమితి పెంచారు. ప్లాటు కొనుగోలుకు రుణం పెంపు కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు రూ. 20 లక్షల నుంచి 25 లక్షలు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షలు, డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు రూ.30 నుంచి రూ.35 లక్షలు, ఐపీఎస్లకు రూ.40 లక్షల నుంచి 45 లక్షలకు రుణ పరిమితిని పెంచారు. చదవండి: Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త -
తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నాం: డీహెచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని డీహెచ్ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. గతనెల 29న లక్ష కరోనా పరీక్షలు జరిగాయని, రెండోదశ ఫీవర్ సర్వేలో 68.56 శాతం మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. తెంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోవిడ్ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా డీహెచ్, డీజీపీ, కార్మిక జైళ్లశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా డీహెచ్ తన వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్లతో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.ఇప్పటి వరకు 10 ఆస్పత్రుల కరోనా చికిత్స లైసెన్స్ రద్దు చేసినట్లు, బ్లాక్ ఫంగస్ మందులకు దేశవ్యాప్తంగా కొరత ఉందన్నారు. బ్లాక్ ఫంగస్ ఔషధాలు కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1500 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, కరోనా చికిత్సలకు తగినన్ని ఆస్పత్రులు, పడకలు ఉన్నాయన్నారు ఔషధాల బ్లాక్ మార్కెట్పై 150 కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదుచేసినట్లు తెలిపారు. ఈ మేరకు డీజీపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు పెట్టి.. రూ.35.81 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేసినట్లు, జనం గుమిగుడినందుకు 13,867 కేసులు పెట్టినట్లు తెలిపారు. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు, లాక్డౌన్ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని హైకోర్టుకు వెల్లడించారు. చదవండి: పిల్లలకు థర్డ్వేవ్ అలర్ట్.. ముప్పును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు! మద్యం ప్రియులు.. మే నెలలో ఎంత తాగారో తెలుసా! -
కరోనా చైన్ బ్రేక్ చేయడం కోసమే లాక్డౌన్ పొడిగింపు- డీజీపీ మహేందర్ రెడ్డి
-
హైదరాబాద్లో డీజీపీ సుడిగాలి పర్యటన
-
Telangana Police: ఆపదా.. మేమున్నాం పదా!
►సార్.. నా పేరు సంతోష్ కర్ణాటకలో బ్యాంకు ఉద్యోగిని. ఆడిటింగ్ కోసం ప్రతివారం హైదరాబాద్ రావాలి. ఎలా సార్.. అంటూ డీజీపీకి ట్వీట్ చేశాడు. నిమిషాల్లో డీజీపీ బృందం స్పందించింది. ఈ–పాస్ లింక్ పంపి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ►వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉండే 9 నెలల గర్భవతి అయిన స్వర్ణ, ఆమె భర్త అశోక్ లాక్డౌన్ వల్ల సొంతూరికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే గమనించిన మామునూరు ఏసీపీ వెంటనే పోలీసు వాహనంలో వారిని ఇంటికి చేర్చారు. సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కఠినతరం చేసినప్పటి నుంచి, ఎవరికి ఏ సమయంలో ఆపద వచ్చి నా డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ @TelanganaDGP టీమ్ వెంటనే స్పందిస్తోంది. ఎక్కడి నుంచి ఏ సమస్యలపై ట్వీట్ వచ్చినా.. ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలను అప్రమత్తం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా వారి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తోంది. ఆకస్మిక మరణాలు, వైద్య సాయం, రక్తదానం తదితర అత్యవసర అంశాలకు టీమ్ సభ్యులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో కారణాలు వివరిస్తున్నారు. ఈ–పాస్ https//policeportal.tspolice.gov.in దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70 వేల మందికిపైగా ఈ–పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యవసరమైన వాటన్నిటినీ అనుమతిస్తూ మిగతావి తిరస్కరిస్తున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాల వంటి వాటికి సంబంధించి దరఖాస్తులు మాత్రం పెండింగ్లో ఉంటున్నాయి. సేవా ఆహార్ యాప్.. ఈ నెల 7న తెలంగాణ పోలీసులు.. వివిధ ఎన్జీవోలు, ఫుడ్ డెలివరీ సంస్థలతో కలిసి ప్రారంభించిన సేవా ఆహార్ యాప్కు మంచి స్పందన వస్తోంది. రోజుకు 2,200 మంది కరోనా పాజిటివ్ రోగులకు ఈ యాప్ ద్వారా ఆహారం అందజేస్తున్నారు. ఇప్పటిదాకా 40 వేల ప్లేట్ల భోజనం అందించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నుంచి రోజూ అదనంగా మరో 200 ప్లేట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సేవా ఆహార్యాప్ లేదా 77996 16163 వాట్సాప్ నంబరులో ఉదయం 6 గంటలలోగా ఆర్డర్ పెడితే మధ్యాహ్నానికల్లా ఆహారాన్ని ఇంటి వద్దకు లేదా ఆసుపత్రి వద్దకు వచ్చి అందజేస్తారు. రోగులు, మహిళలకు చేయూత ఉదయంపూట దారితప్పిన, రవాణా సౌకర్యా ల్లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, వృద్ధు లను పోలీసులు క్షేమంగా వారి ఇళ్లకు చేరుస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సోమవారం మీర్చౌక్ ఏసీపీ ఆనంద్ ఆసుపత్రికి వెళ్తున్న మహిళలను పోలీసు వాహనంలో తరలించి చికిత్స అందేలా చూశా రు. సకాలంలో ఇంటికి చేరుకోలేకపోయిన వారిని తమ వాహనం లేదా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపుతున్నారు. సోమవారం అన్ని కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ఇలాంటి సహాయ కార్యక్రమా లు చేపట్టారు. దీనికితోడు డయల్ 100కి కాల్ చేసినా స్థానిక పోలీసుస్టేషన్కు సమాచారం అందించి సాయం అందేలా చూస్తున్నారు. -
Lockdown: ఫుడ్ డెలివరీపై కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ను కఠినతరం చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆదివారం పోలీసులు వెనక్కి తగ్గారు. విద్యుత్ శాఖ ఉద్యోగులపై లాఠీచార్జి విషయమై ఆ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డీజీపీతో మాట్లాడగా.. తలసేమియా రుగ్మతకు సంబంధించిన వారిని అడ్డుకోవడంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా స్పందించడంతో పోలీసులు దిగివచ్చారు. శనివారం అర్ధరాత్రి డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో సమీక్ష నిర్వహించి ఫుడ్ డెలివరీ సేవలకు అంతరాయం కలగించరాదని ఆదేశించారు. అదే విధంగా తలసేమియా రుగ్మత గలవారిని, విద్యుత్ ఉద్యోగులను అడ్డుకోరాదని సూచించారు. దీంతో ఆదివారం పోలీసులు వారికి ఇబ్బందులు కలిగించలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేశారు. జాతీయ రహదారులు మినహా రాష్ట్ర రహదారులను మూసివేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాలనీ రోడ్ల నుంచి రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు లాఠీలు ఝుళిపించడం, తనిఖీలు ముమ్మరం చేయడంతో రోడ్ల మీద జనసంచారం పూర్తిగా అదుపులోకి వచ్చింది. దీనికితోడు సరుకు రవాణా వాహనాలను నగరాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే అనుమతించడంతో రోడ్లపై వాహనాలు తగ్గిపోయాయి. అత్యవసర విభాగాలు, మెడికల్, ఫార్మా, విద్యుత్, వ్యవసాయ తదితర అనుమతి ఉన్న రంగాల ఉద్యోగులను పోలీసులు ఐడీలు చూసి అనుమతించారు. ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్రతోపాటు అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలు దగ్గరుండి పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అన్ని నగరాల్లో డ్రోన్ల ద్వారా గల్లీలు, కాలనీలను పర్యవేక్షించారు.కాగా, పాసులు కావాల్సిన వారు https://policeportal.tspolice. gov.in దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు. మార్కెట్లలో రద్దీ లాక్డౌన్ మినహాయింపు సమయమైన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు జనాల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఆదివారం కావడంతో మటన్, చికెట్, చేపల మార్కెట్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఎక్కడా సామాజిక దూరం పాటించలేదు. అయితే, పోలీసుల ఆదేశాల మేరకు కూరగాయలు, ఇతర విక్రయదారులు ఉదయం 10 గంటలకన్నా ముందే వ్యాపార సముదాయాలు మూసివేసి ఇళ్లకు కదిలారు. అయితే, కొందరు ఆకతాయిలు మాత్రం 10 గంటల వరకు ఏదో కారణంతో కరోనా నిబంధనలు తుంగలోతొక్కి రోడ్లపై సంచరించారు. -
Lockdown: 9.30 గంటలకే వ్యాపారం ఆపేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దుకాణదారులు, వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు.. రోజూ ఉదయం 9.30కే కార్యకలాపాలు ఆపేయాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. ఎవరూ కూడా చిన్నచిన్న కారణాలతో బయటికి రావొద్దని, అవసరమైన వస్తువులన్నీ సమీపంలోనే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. శనివారం డీజీపీ గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్వయంగా తిరుగుతూ లాక్డౌన్ పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘అనవసరంగా వాహనాలు రోడ్డు మీదికివస్తే సీజ్ చేస్తాం. లాక్డౌన్ తరువాతే వాటి విడుదల ఉంటుంది. అది కూడా కోర్టు ద్వారా తీసుకోవాలి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల ఇచ్చిన మినహాయింపును సద్వినియోగం చేసుకోవాలి. లాక్ డౌన్లో అనుమతి ఉన్న పరిశ్రమలు కూడా ఈ సమయానికి అనుగుణంగానే షిప్టులు ఉండేలా చూసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు తప్ప మిగిలిన రోడ్లన్నీ మూసివేస్తాం. టౌన్లు, సిటీల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను మూసివేస్తున్నాం. మినహాయింపు సమయంలో మాత్రమే వాటిని తెరుస్తాం. దీనివల్ల రోడ్ల మీద అనవసర సంచారాన్ని నియంత్రించవచ్చు’’అని డీజీపీ చెప్పారు. ప్రజలంతా లాక్డౌన్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత మందుల చీటీలు పట్టుకుని రోడ్ల మీదికి వచ్చినా.. వాహనాలు సీజ్ చేసి, కేసులు పెడతామని హెచ్చరించారు. కూరగాయల మార్కెట్లలో రద్దీ నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్లు, స్థానిక మున్సిపల్, మార్కెటింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. -
లాక్డౌన్ కోసం లాఠీ పట్టారు
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: శనివారం ఉదయం 10.30 గంటలు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లోకి వచ్చీపోయే దారులన్నీ మూతపడ్డాయి.. ప్రధాన రహదారులన్నిటా చెక్పోస్టులు కట్టుదిట్టం అయ్యాయి.. రోడ్లపైకి వచ్చినవారిని వచ్చినట్టు పోలీసులు ఆపేశారు. అనవసరంగా వచ్చినట్టు కనిపించినవారిపై లాఠీలు ఝళిపించారు. ఎక్కడివారిని అక్కడ్నుంచే వెనక్కి పంపేశారు.. రాష్ట్రంలో పలుచోట్ల లాక్డౌన్ సరిగా అమలు కావడం లేదని, కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. పోలీసులు పకడ్బందీగా లాక్డౌన్ అమలుపై దృష్టిపెట్టారు. హైదరాబాద్లో డీజీపీ, జిల్లాల్లో ఎస్పీలు, కమిషనర్లు నేరుగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. అవసరం లేకున్నా రోడ్డు మీదికి వచ్చిన వాహనాలను సీజ్ చేసి, కేసులు పెట్టారు. పలుచోట్ల పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నిరోజులు సరిగా పట్టించుకోకుండా.. ఇప్పుడు అవసరంపై బయటికొచ్చిన వారిపైనా ప్రతాపం చూపడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. సీఎం కేసీఆర్ ఆగ్రహంతో.. శుక్రవారం వరంగల్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి, లాక్డౌన్ పరిస్థితులపై అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో లాక్డౌన్ సరిగా అమలుకావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. శనివారం 10 గంటల తర్వాత రోడ్డుపై కనిపించిన వారిపై పోలీసులు విరుచుకుపడ్డారు. అకారణంగా బయటికి వచ్చిన వారిపై లాఠీచార్జి చేసి, వేలాది వాహనాలు సీజ్ చేశారు. నల్లగొండ, వరంగల్, మరికొన్ని జిల్లాల్లో డ్రోన్ కెమెరాలతో లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ స్వయంగా లాఠీ పట్టి రోడ్డుపైకి వచ్చిన వారిని కట్టడి చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో, ప్రధాన రహదారులపై మూడు రకాల చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఫుడ్ డెలివరీ బాయ్స్పై ప్రతాపం! హైదరాబాద్లో వందల మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ను అడ్డుకుని, లాఠీచార్జి చేయడం, వాహనాలు సీజ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఫుడ్ డెలివరీకి మినహాయింపు ఉందని.. ఆస్పత్రుల్లో, ఇళ్లలో ఉన్న వేల మంది కరోనా రోగులకు ఆహారం సరఫరా చేస్తున్నామని.. తమను అడ్డుకోవడం ఏమిటని వారు నిలదీశారు. ఫుడ్ డెలివరీ బాయ్స్పై లాఠీచార్జిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. అయితే తాము ఫుడ్ తీసుకెళ్తున్న వారిని ఏమీ అనలేదని, గుర్తింపు కార్డులు లేకుండా.. కేవలం స్విగ్గీ, జొమాటో టీషర్టులు వేసుకుని తిరుగుతున్నవారి వాహనాలనే సీజ్ చేశామని పోలీసులు అన్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో.. స్విగ్గీ, జొమాటో సంస్థలు శనివారం తమ ఫుడ్ డెలివరీ సర్వీసులను నిలిపివేశాయి. డెలివరీ బాయ్స్పై పోలీసుల లాఠీచార్జిని తప్పుపడుతూ.. న్యాయవాది కారం కొమిరెడ్డి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. జీవో నం 102 ప్రకారం.. ప్రభుత్వమే ఫుడ్ డెలివరీ సర్వీసులను అనుమతించినపుడు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అత్యవసరమైన వారినీ అడ్డుకోవడంపై.. పలుచోట్ల తలసేమియా రోగులు, వారికి రక్తదానం చేయడానికి వెళ్తున్న దాతలను సైతం పోలీసులు అడ్డుకోవడం కనిపించింది. దీనిపై తలసేమియా రోగుల తల్లిదండ్రులు డీజీపీకి మొరపెట్టుకున్నారు. తమను అనుమతించాలని, ప్రాణాలు ఆపదలో పడతాయని ప్రాధేయపడ్డారు. నల్లగొండలో విద్యుత్ సిబ్బంది, మీడియా, ఇతర శాఖల ఉద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. 6 నుంచి 10 మధ్య గందరగోళం! లాక్ డౌన్ సమయంలో పోలీసుల హడావుడి ఇకవైపు అయితే.. అంతకుముందు మినహాయింపు సమయం 6 నుంచి 10 గంటల మధ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ఎక్కడ చూసినా జనం గుంపులు, గుంపులుగా బయటికివచ్చారు. వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద భౌతిక దూరం అనేది ఎక్కడా పాటించలేదు. ఈ నాలుగు గంటల్లో ఎక్కడా పోలీసులు కనిపించలేదు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకునే లేకుండా పోయారు. -
రూల్స్ బ్రేక్ చేస్తే వాహనాలు సీజ్ చేస్తాం: డీజీపీ మహేందర్ రెడ్డి
-
నల్గొండ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
-
లాక్డౌన్: విద్యుత్ సిబ్బందికి ఇబ్బందులు.. మంత్రి ఫైర్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ పేరిట పోలీసులు విద్యుత్ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మే 12 నుంచి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ నుంచి అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వాటిలో విద్యుత్ శాఖ కూడా ఉంది. ఈ నేపథ్యంలో నల్గొండలో లాక్డౌన్లో భాగంగా పోలీసులు విద్యుత్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగులు తమ ఐడీ కార్డులు చూపిస్తున్నా పోలీసులు వినిపించుకోవడమే గాక అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో శనివారం విద్యుత్ ఉద్యోగులు ఈ విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కాగా నల్గొండ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి అనంతరం డీజీపీతోనూ ఈ అంశంపై చర్చించారు. విద్యుత్శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుందన్నారు. విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. విద్యుత్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. చదవండి: లాక్డౌన్: చికెన్ వ్యాపారి కారుకు ప్రెస్ స్టిక్కర్.. చివరికి! -
Lockdown: సీఎం కేసీఆర్ ఆదేశం.. రంగంలోకి డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రోడ్డేక్కితే చాలు.. రోక్కం వసూలు చేస్తున్నారు.. లాక్ డౌన్ గీత దాటితే చాలు.. కేసులు కట్టేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని వారికి కేసులతో పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్లో పలు చెక్పోస్టుల వద్ద తనిఖీలను ఆయన పర్యవేక్షించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్: డీజీపీ తెలంగాణలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 లోగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. తెలంగాణ సరిహద్దుల వద్ద లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరించాలని మహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. విస్తృత తనిఖీలు.. మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఎమర్జెన్సీ, పాసులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు.. భారీగా వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలను పాటించనివారిపై కేసుల నమోదు చేస్తున్నారు. నిన్నటి వరకు కేవలం లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన వాహనాలకు జరిమానాలు మాత్రమే విధించిన పోలీసులు.. ఇవాళ నుంచి సీజ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం అనుమతులు ఉన్నవారు మాత్రమే సంబంధిత ఐడి కార్డు గానీ, లెటర్స్ గానీ తీసుకొని రావాలని వాటిని చూపిస్తేనే అనుమతి ఇస్తామంటున్నారు. పొంతన లేని సమాధానం చెప్పే వారిపై మరింత కఠినంగా.. సికింద్రాబాద్లోని బేగంపేట్ చిలకలగూడ బోయినపల్లి, మారేడ్పల్లి, కార్ఖానా పరిధిలో పోలీసులు ప్రధాన రోడ్లపై ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లను ఏర్పాటు చేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులను నిలిపివేసి ఏ కారణాల చేత బయటకు వచ్చారో వివరాలు తెలుసుకొని పంపిస్తున్నారు. పొంతన లేని సమాధానం చెప్పే వారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. బేగంపేటలో అడిషనల్ సీపీ అవినాష్ మహంతి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలను పర్యవేక్షించారు. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్డుపై ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలను కొనసాగిస్తున్నారు. లాక్డౌన్లో సరకు రవాణా వాహనాలకు అనుమతి లేదు లాక్డౌన్లో సరకు రవాణా వాహనాలకు అనుమతి లేదని సీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి గూడ్స్ వాహనాలకు అనుమతి లేదని సీపీ వెల్లడించారు. చదవండి: భారత్కు మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. -
లాక్డౌన్: పావు తక్కువ పదికే రంగంలోకి పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఉదయం 10 గంటల తరువాత కూడా రోడ్లపై ప్రజలు కనిపిస్తున్నారని, లాక్డౌన్ కఠిన అమలుకు ఉ.9.45లకే పోలీసులు రంగంలోకి దిగాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30 వరకు లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో అనుమతి లేని వాహనాలను సీజ్ చేయాలని, ప్రతీ వీధిలోనూ పోలీసు వాహనాలు సైరన్ వేసుకుని తిరగాలని సూచించారు. లాక్డౌన్ అమలుపై జోనల్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బుధవా రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీపీ జితేంద ర్, ఇంటెలిజెన్స్ విభాగం ఐజీ ప్రభాకర్రావు పాల్గొ న్న ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రం లో లాక్డౌన్ అమలుతీరును ప్రతిరోజూ జిల్లాల వారీగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారని వెల్లడించారు. మే 30 తర్వాత తిరిగి పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్డౌన్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. అంతా ఫీల్డ్లో ఉండాల్సిందే.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నా.. 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాల కోసం వస్తున్నారని డీజీపీ అన్నారు. మార్కెట్లు, దుకాణాల వద్ద ప్రజలు గుమికూడటం కనిపిస్తోందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుంచే తమ అవసరాల కోసం వెళ్లేలా ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. 10 గంటల తర్వాత కూడా వీధుల్లో పెద్ద ఎత్తున జన సంచారం ఉంటోందని, దీని నివారణకు తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉదయం 9:45 గంటల నుంచే పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీ, డీఎస్పీ, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులంతా కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జనం రద్దీని తగ్గించేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రీకరించేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ప్రధాన రహదారుల్లోనే లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు జరగాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని సూచించారు. -
తెలంగాణలో లాక్డౌన్ అమలు విఫలం
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ అమలు తీరు పట్ల విమర్శలు వెల్లువేత్తతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో సడలింపుల సమయం 10 గంటల తర్వాత కూడా ప్రజలు యథేచ్చగా రోడ్లపైకి గుంపులు గుంపులుగా వస్తున్నారు. పోలీసు శాఖ విచ్చలవిడిగా పాసులు జారీ చేయడమే దీనికి ప్రధాన కారణం, సాధారణ రోజుల్లాగానే రోడ్లపైకి జనం వస్తున్నారు. తెలంగాణలో లాక్డౌన్ అమలులో పోలీసు శాఖ విఫలమైంది అని ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో వెంటనే డీజీపీ వెంటనే సమావేశం నిర్వహించి జోనల్ ఐజీలు, డీఐజీలు, కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్డౌన్ ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లే విధంగా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. 10 గంటల అనంతరం వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై సరైననా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జన సామర్థ్యాన్ని తగ్గిచేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని అన్నారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. లాక్డౌన్ నిబందనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టాలని సూచించారు. లాక్డౌన్ సమయం ముగియగానే ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని తెలిపారు. లాక్డౌన్ అమలుపై సామన్య ప్రజానికం నుండి సహాయ సహకారాలు అందుతున్నాయని, ఈ విషయంలో పోలీసు శాఖపై ఏవిధమైన ఫిర్యాదులు అందడంలేదని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని, అయితే లాక్డౌన్ అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని స్పష్టం చేశారు. చదవండి: లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు -
కరోనా నిబంధనలు గాలికి..జరిమానాలు 30 కోట్లపైనే..!
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనా వైరస్ చలనం లేనిది, అది ఎక్కడికీ ప్రయాణించలేదు. కానీ, మనుషులే వాహకాలుగా దాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ముక్కు నోరు ద్వారా వ్యాపించే ఈ వైరస్ కట్టడికి మాస్కు, భౌతికదూరం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. కానీ, కొందరు పౌరులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. అయినా, కొందరు ఈ విషయాన్ని పట్టించుకోవ డం లేదు. ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 4,38,123 మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. అందులో లాక్డౌన్లో 12 నుంచి 15 వ తేదీ వరకు 50,367 కేసులు నమోదయ్యాయంటే ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరుగుతు న్నాయో అర్థమవుతుంది. వీరందరిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపీసీ ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.30.66 కోట్ల జరిమానా వసూలు చేశారు’’అని సోమవారం హైకోర్టుకు స్వయంగా సమర్పించిన నివేదికలో డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రోజూ దాదాపు పదివేల కేసులు ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 45 రోజుల్లో 4.3 లక్షల కేసులు నమోదయ్యాయి. రోజుకు 9,736 కేసులు. భారీగా గుమిగూడటం, బహిరంగంగా మద్యం తాగడం, బర్త్ డే పార్టీలు చేసుకోవడం తదితరాలన్నీ కలిపి 50,367 కేసులు నమోదయ్యాయంటే ఉల్లంఘనలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. వీరిలో కొందరు రాజకీయ నేతలు కూడా తమ పుట్టినరోజు పేరుతో కరోనా నిబంధనలు పాటించకపోవడం గమనార్హం. బాధ్యతగా ప్రవర్తించని వారెవరినీ తాము ఉపేక్షించబోమని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసుశాఖ స్పష్టం చేసింది. -
Lockdown: మాస్కులు లేకుండా తిరిగిన వారినుంచి రూ. 31 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాస్కులు లేని వారి నుంచి మొత్తం రూ.31 కోట్లు వసూలు చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. బ్లాక్ మార్కెట్లో ఔషధల అమ్మకాలపై 98 కేసులు నమోదు చేసినట్లు, మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసుల ఫైల్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ రోజు(మంగళవారం) విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరయ్యారు. అలాగే, తెలంగాణలో లాక్డౌన్, కరోనా నిబంధనలపై డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక అందించారు. ఇందులో భాగంగా.. భౌతిక దూరం పాటించనందుకు మొత్తం 22,560 కేసులు నమోదయ్యాయని డీజీపీ న్యాయస్థానానికి వివరించారు. కరోనా నేపథ్యంలో కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ చెప్పారు. బ్లాక్ మార్కెట్లో ఔషధల అమ్మకాన్ని నిరోధిస్తున్నామని, ఇప్పటికి 98 కేసులు నమోదు చేశామని వివరించారు. లాక్డౌన్ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి 14 వరకు నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశామని చెప్పారు. మాస్కులు ధరించని వారికి మొత్తం రూ.31 కోట్ల జరిమానా విధించామని తెలిపారు. కాగా లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధులు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కరోనా వారియర్లుగా గుర్తించాలని హైకోర్టు చెప్పింది. చదవండి: TS: ‘వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు నిర్వహించడంలేదు’ -
Telangana High Court: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య చికిత్సలు, సీటీ స్కాన్లాంటి పరీ క్షలు, ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ లాంటి మం దులకు గరిష్ట ధరలు నిర్ణయిస్తూ తాజా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణ ఆంక్షలను మరింత కఠి నతరం చేయాలని, అనూహ్యంగా పెరుగుతున్న కేసులు, మరణాలను దృష్టిలో ఉంచుకొని వారాం తపు లాక్డౌన్ పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే రాత్రి కర్ఫ్యూను కొనసాగించే విషయంపై ఈనెల 8వ తేదీ కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సం దర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి, ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. సమృద్ధిగా కరోనా పరీక్షల కిట్లు: డాక్టర్ శ్రీనివాసరావు గతంలో ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అయితే ప్రస్తుతం లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారని డాక్టర్ శ్రీనివాసరావు నివేదించారు. ఈ కారణంగానే పరీక్షల సంఖ్య తగ్గుతోందని, పరీక్ష కిట్లు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కోర్టు.. ప్రజల దగ్గరికే వెళ్లి పరీక్షలు చేయాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్టులో ఉన్న వారికి పరీక్షలు చేయాలని ఆదేశించింది. అలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలను 24 గంటల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వివాహ శుభకార్యాల్లో, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను తగ్గించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు గత ఏడాది ఇచ్చిన జీవోను సవరిస్తూ 24 గంటల్లో కొత్త మార్గదర్శకాలతో మరో జీవో జారీ చేయాలని ఆదేశించింది. ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు సరఫరా చేయడం లేదని డాక్టర్ శ్రీనివాసరావు నివేదించారు. రాష్ట్రంలో 18–44 మధ్య వయస్సు గలవారి కోసం 3.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలని, వీరికి వ్యాక్సిన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కాగా కేంద్రం కేటాయించిన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సహా ఇతర మందులు నిర్ణీత సమయంలోగా రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే తమిళనాడు నుంచి ఆక్సిజన్ రానందున ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ అందించాలని కూడా ఆదేశించింది. కాల్ సెంటర్లకు అనూహ్య స్పందన: ఏజీ కరోనా రోగుల కోసం హితం యాప్ అందుబాటులోకి తెచ్చామని, అలాగే కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వీటికి అనూహ్య స్పందన లభిస్తోందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. అయితే కరోనా చికిత్సలకు సంబంధించిన సమాచారం తెలియజేసేలా అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని, అలాగే వీటిని అనుసంధానిస్తూ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ధర్మాసనం సూచించింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆస్పత్రుల సిబ్బంది బ్లాక్మార్కెటింగ్ చేస్తున్నారు: డీజీపీ కరోనా నియంత్రణ ఆంక్షలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి నివేదించారు. కరోనా నియంత్రణ మందులను అక్రమంగా విక్రయిస్తున్న 39 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఆసుపత్రుల సిబ్బందే ఎక్కువగా మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో మందులను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది. మాస్కు లేకుండా వెళ్తున్న వారి వాహనాలను సీజ్ చేసే విషయాన్ని పరిశీలించాలని, ఈ మేరకు పోలీసులకు అధికారాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆసుపత్రుల వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలి భౌతికదూరం పాటింపు విషయంలో రెవెన్యూ, స్థానిక సంస్థల అధికారులతో కలిసి ఫంక్షన్ హాల్స్, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోర్టు సూచించింది. అలాగే ఆసుపత్రుల దగ్గర రోగులు, వారి సహాయకులు అయోమయానికి గురవుతున్నారని, వారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించింది. అంత్యక్రియల కోసం ఎన్ని స్మశానాలు ఏర్పాటు చేశారు? అందులో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? జైళ్ళలో ఉన్న ఖైదీలు, వృద్ధులు, వికలాంగులు తదితరులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ? తదితర వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. లక్ష టెస్టులు చేసేలా చర్యలు తీసుకోండి గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రెండురోజుల్లో నిపుణులతో కమిటీ వేయాలని, కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని, ఆన్లైన్లో సమావేశమవుతోందన్న ప్రభుత్వ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజూ లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. పరీక్షలు పెంచాలని పదేపదే ఆదేశించినా తగ్గిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల సంఖ్య తగ్గించడం ద్వారా వాస్తవ కేసుల సంఖ్య ఎలా తెలుస్తుందని, రోజూ లక్ష పరీక్షలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చదవండి: విషాదం: కరోనాతో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి మృతి శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు! -
బ్లాక్మార్కెట్పై సీఎం సీరియస్: హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలా.. వద్దా అనే విషయంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కరోనా సెకండ్ వేవ్, నైట్ కర్ఫ్యూ, ఔషధాల బ్లాక్మార్కెట్, రంజాన్ ప్రార్థనలు తదితర విషయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా మొదటివేవ్లో పోలీసుశాఖ సమర్థంగా పనిచేసిందని, ప్రస్తుతం సెకండ్వేవ్లోనూ మరింత మెరుగ్గా పనిచేస్తోందని కితాబిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు, వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, రెమిడెసివిర్ తదితర ఇంజెక్షన్లతో సహా ఇతర అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు. కొందరు ప్రజలు భయంతోనో లేదా ముందుజాగ్రత్తతోనే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో పెట్టుకుంటున్నారని.. దీంతో సిలిండర్ల కొరత ఏర్పడే ప్రమాదముందని, అనవసరంగా కొన్న మందులు కూడా పాడైపోతాయని చెప్పారు. అదే సమయంలో కొందరు ఆక్సిజన్, రెమిడెసివిర్, ఇతర అత్యవసర మందులను నల్ల బజారులో విక్రయిస్తున్నారని, వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే ఔషధాలను నల్లబజారులో విక్రయిస్తుండటంపై సీఎం సీరియస్గా ఉన్నారని మహమూద్ అలీ చెప్పారు. ప్రజలంతా తప్పకుండా భౌతికదూరం పాటించాలని, మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ కమిషనర్ మహేశ్ భాగవత్ పాల్గొన్నారు. కాగా, సమీక్ష సమావేశం అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ ఓ టీవీ చానల్తో మాట్లాడారు. ఈనెల 30వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది కదా? లాక్డౌన్ పెడతారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. రాష్ట్రంలోని పరిస్థితులపై త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. వాస్తవానికి సీఎంకు లాక్డౌన్ పెట్టడం ఇష్టం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఇలాగే జాగ్రత్తలు పాటిస్తే మరో 3–4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందని.. అలాంటప్పుడు లాక్డౌన్ పెట్టాలనే ఆలోచనే ఉండదని పేర్కొన్నారు. -
ఇక సులువుగా పోలీస్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇకపై పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికేషన్ (పీవీసీ), పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల (పీసీసీ)కు పోలీసు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్లు కావాలనుకున్న వారు నేరుగా ఆన్లైన్లో ఐ–వెరిఫై ద్వారా దరఖా స్తు చేసుకునే విధానాన్ని పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని డీజీపీ మహేందర్రెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు. www.tspolice.gov.inను క్లిక్ చేసి పోలీస్ వెరిఫికేషన్–క్లియరెన్స్ ఆప్షన్స్ ఎంచుకుని.. నిబంధనలను ఫాలో అయితే సరిపోతుంది. పోలీసు వెరిఫికేషన్ సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ శాఖ సంబంధ కార్యాలయాలు, అందులో అపాయింట్ అయ్యే ప్రైవేటు ఉద్యోగులు. ఆయా కార్యాలయాల్లో ఇతర సేవల కోసం పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వలస వెళ్లే పౌరులకు ఇది అవసరం. ఒకసారి దరఖాస్తు పూర్తి చేశాక పోలీసుల పని మొదలవుతుంది. దీనిపై సందేహాలుంటే హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలి. ఇవీ లాభాలు.. ► ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. ► డాక్యుమెంట్ల దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపులు సులభతరంగా మారుతాయి. ► ఆన్లైన్ దరఖాస్తుల్లోని ఫొటోల ఆధారంగా నేరచరిత కలిగిన వారిని సులువుగా గుర్తించే వీలుంది. ► దరఖాస్తుల పరిశీలనకు అదనపు మానవ వనరుల వినియోగం తగ్గింపు. ► దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకునే సదుపాయం దరఖాస్తుదారులకు కలుగుతుంది. -
పౌరులతో దురుసుగా ప్రవర్తించకూడదు: డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూఅమలుపై పోలీస్ ఐజీలు, కమీషనర్లు, ఎస్పీలతో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవోలో పేర్కొన్న విధంగా పటిష్టంగా కర్ప్యూను అమలుచేయాలని తెలిపారు. అంతేకాకుండా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసివేయాలని పేర్కొన్నారు. ఏ గూడ్స్ వాహనాలను ఆపకూడదన్నారు. కాగా, నైట్ కర్ఫ్యూలో మినహాయింపు ఉన్నవారు సెల్స్ ఐడెంటిటీ కార్డును కచ్చితంగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పోలీసులకు విజ్ఙప్తి చేశారు. అంతేకాకుండా కర్ఫ్యూ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్,జితేందర్, ఐ. జీ. లు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, రాజేష్ కుమార్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: అంతా తూచ్.. అది నకిలీ పోలీస్ నోటిఫికేషన్ -
వైన్స్, బార్ల వల్ల కరోనా వ్యాప్తి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బార్లు, మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుండవచ్చని, కానీ కరోనా వ్యాప్తికి ఈ కేంద్రాలు అడ్డాగా మారుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలు పాటించని బార్లు, మద్యం దుకాణాలు, పబ్బులు, క్లబ్బులు, ఫంక్షన్ హాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటి లైసెన్సులు, అనుమతులు రద్దు చేయాలని తేల్చిచెప్పింది. ఆయా సంస్థల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించింది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన లేఖలను ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిపై గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పరీక్షలు ఇంతేనా? ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని తాము ఆదేశించినా ప్రభుత్వం వాటి సంఖ్యను ఆశించిన స్థాయిలో పెంచలేదని ధర్మాసనం ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పరీక్షల్లో 20 శాతంలోపే ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తుండగా గ్రామీణ జిల్లాల్లో వాటి సంఖ్య 5 శాతానికి మించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను 70 శాతానికి పెంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్రెడ్డి నివేదిక సమర్పించారు. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మాస్క్ ధరించని 1,16,467 మందికి జరిమానా విధించినట్లు డీజీపీ నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితితో పోలిస్తే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, పాతబస్తీకి వెళ్తే 2 రోజుల్లో లక్షల మంది మాస్క్ లేకుండా దొరుకుతారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. బార్లు, వైన్స్, పబ్బులు, క్లబ్బులు, మాల్స్, థియేటర్ల దగ్గర ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను ధర్మాసనం ఆదేశించింది. వైద్య నిపుణులతో కమిటీ... రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని తాము చెప్పట్లేదని, అయితే కరోనా కేసుల ఆధారంగా మైక్రో, కంటైన్మెంట్ జోన్లను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే ప్రజలు హాజరయ్యేలా చూడాలని, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్–17 కింద వెంటనే వైద్య నిపుణులతో అడ్వయిజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ఉంటే వారికి కార్యాలయాల్లోనే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. కరోనా చికిత్స అందిస్తున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సీరో సర్వేలెన్స్ నివేదికతోపాటు కంటైన్మెంట్ జోన్ల వివరాలను తదుపరి విచారణలోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక్క డోసు టీకా కూడా వృథా కాకుండా చూడాలని సూచించింది. రాష్ట్రానికి అందిన టీకా డోసుల సంఖ్య, వృథా అయిన వ్యాక్సిన్ల సంఖ్య, టీకా అందుకున్న లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే... పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలనే నిబంధన పెట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 14లోగా స్థాయీ నివేదికను సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. చదవండి: 10 మందిలో ఒకరిపై కరోనా దీర్ఘకాల ప్రభావం -
సర్వే: షీ టీమ్ల పనితీరుపై 89 శాతం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: నేర నియంత్రణలో స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు, గృహహింస, లైంగిక వేధింపుల నిరోధంపై స్వయం సహాయక బృందాల మహిళలకు చైతన్యం, అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లు కలసి పనిచేయనున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకుడు సత్యనారాయణ, పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జూమ్ ద్వారా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, దేశంలో తొలిసారిగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని గుర్తుచేశారు. పోలీసులు ప్రతిచోటా భౌతికంగా ఉండలేరని, ఈ నేపథ్యంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా సమాజ భద్రతలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. 89 శాతం మంది సంతృప్తి.. షీ టీమ్లకు 2020లో 5 వేల ఫిర్యాదులు అందాయని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా చెప్పారు. షీ టీమ్ల పనితీరుపై ప్రముఖ సంస్థ సెస్ ద్వారా సర్వే నిర్వహించగా 89 శాతం మంది షీ టీమ్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో 1.70 లక్షల మహిళా బృందాల్లో 17 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వీరికి గృహహింస, పని ప్రాంతాల్లో వేధింపులు, ఇతర సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించడం హర్షణీయమని మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. పలు స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు. అనంతరం యూజర్ ఫ్రెండ్లీ సాంకేతిక విధానం క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసే పోస్టర్, కౌమార బాలికలపై జరిగే సైబర్ క్రైమ్స్ నిరోధం తదితరాలపై ప్రచురించిన పుస్తకాలను డీజీపీ ఆవిష్కరించారు. వేధింపులపై క్యూఆర్ కోడ్తో ఫిర్యాదు.. ఇటు మహిళల భద్రతకు చేపట్టిన చర్యల్లో భాగంగా క్యూఆర్ కోడ్ (కాప్స్ యాప్)తో ఫిర్యాదు చేసే విధానాన్ని పోలీస్ మహిళా భద్రతా విభాగం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా క్యూఆర్ కోడ్ సాయంతో మహిళలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, పని ప్రాంతాల్లో వేధింపులు తదితర సమస్యలపై మహిళా భద్రతా విభాగానికి ఫిర్యాదు చేసే విధానాన్ని సోమవారం డీజీపీ మహేందర్రెడ్డి ప్రారంభించారు. తమ మొబైల్ ఫోన్లో ఈ లింక్ను సేవ్ చేసుకొని, లింక్ ఓపెన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫిర్యాదుల పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు షీ టీమ్ సెంట్రల్ సర్వర్కు వెళ్తుంది. క్యూఆర్ కోడ్ ద్వారా అందే ఫిర్యాదులపై తీసుకునే చర్యలు, అధికారుల ప్రవర్తన తదితరాలపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. -
వరంగల్ పోలీసులపై డీజీపీ ప్రశంసలు
వరంగల్ క్రైం : ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేసే నేరాల సంఖ్య పెరుగుతోంది. సెల్ఫోన్కు వచ్చే ఓటీపీని అపరిచిత వ్యక్తులకు చెబితే క్షణాల్లో బ్యాంకులో ఉన్న సొమ్ము స్వాహా అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిందితులు దేశ, విదేశాల్లో ఉండి తమ నేరాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. యువతులు, మహిళలను వేధించడం, సామాజిక మాధ్యమాల ద్వారా ఇబ్బంది పెట్టే ఆకతాయిల ఆట కట్టించడం తదితర కేసుల్లో సాంకేతిక అంశాలను సేకరించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన సైబర్ క్రైం విభాగం పోలీసులు చాటుతున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పోలీస్ బాస్ మహేందర్రెడ్డి వరంగల్ సిబ్బందిపై శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వరంగల్ సైబర్ క్రైం పోలీసుల ప్రతిభ రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. సైబర్ వారియర్స్తో శిక్షణ రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల కాలంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీజీపీ కార్యాలయం నుంచి ‘సైబర్ వారియర్స్’ పేరిట రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ట్యాబ్లు అందజేసి పిటీ కేసులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు డయల్ 100 కు వచ్చే ఫోన్లకు 5 నుంచి 10 నిమిషాలలో స్పందించేలా చూస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. అధునాతన పరికరాలు, అత్యాధునిక విభాగం వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని సైబర్ విభాగంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఉన్నాయి. 2018 మార్చి 18న ఈ విభాగం ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడిచే ఈ విభాగంలో ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక అసిస్టెంట్ ఎనలైటికల్ అధికారితో పాటు తొమ్మిది మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. వీరందరూ బీటెక్విద్యార్హతతో కలిగి ఉన్న నేపథ్యంలో సాంకేతిక పరమైన అంశాలపై మంచి పట్టు ఉండి అనేక కేసుల్లో కీలక సమాచారాన్ని అందించగలుగుతున్నారు. ఓటీపీ, బ్యాంకు, వాట్సప్, ఫేస్బుక్, లాటరీ, ఉద్యోగాలు, గిప్ట్లు పేరిట జరుగుతున్న మోసాలు, యువతులు, మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తదితర అంశాల్లో విచారణ సిబ్బందికి కీలక సమాచారం అందిస్తూ నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. ఇదే సమయంలో వరంగల్ సైబర్ పోలీస్ విభాగం ఆధ్వర్యాన ప్రజలను చైతన్యపరిచేలా వీడియో సందేశాలను వాట్సప్ ద్వారా పంపిస్తున్నారు. వీఓఐటీ ఇంటర్నెట్ కాల్స్ను చేధించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలుడు కుసుమ దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో వరంగల్ సైబర్ క్రైం పోలీసులు అందించిన సాంకేతిక సమాచారంతోనే నిందితుడిని గుర్తించగలిగారు. బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగుడు ఆయన తల్లిదండ్రులకు ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేస్తుండడంతో గుర్తించడం సాధ్యం కాలేదు. ఈ మేరకు రంగంలోకి దిగిన సైబర్ బృందం వీఓఐటీ ఇంటర్నెట్ కాల్స్ను చేధించి నిందితుడిని అరెస్ట్ చేయించగలిగారు. ఈ విషయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ పోలీసులకు సైతం దొరకని సమాచారాన్ని వరంగల్ సైబర్ పోలీసులు అందించడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది మంది హత్యల కేసులో సాంకేతిక సమాచారమే కీలకంగా మారింది. ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిందితుడు చేసిన ఫోన్ల ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు ఆయనను గుర్తించారు. అనంతరం కోర్టులో కూడా సాంకేతిక ఆధారాలను సమర్పించడంతో నిందితుడికి ఉరిశిక్ష ఖరారైంది. ఆన్లైన్ రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే... వారి ఫోన్లలో నంబర్లు సేవ్ అయి ఉన్న వ్యక్తులకు చెడుగా సమాచారం ఇస్తూ ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను గుర్తించడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం అధికారులు పాత్ర కీలకంగా మారింది. బెంగళూరు కేంద్రంగా రుణాలు ఇస్తూ, వేధిస్తున్న నలుగురు నిందితుల అరెస్టులో వరంగల్ సైబర్ పోలీసులు కీలకపాత్ర పోసించారు. చదవండి : (ఈ-కామర్స్లో తెలుగుతో తెలివిగా టోకరా..) (రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం ) -
దేశంలోనే పోలీస్ రంగంలో ఇదే మొదటిసారి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను పోలీస్ శాఖ నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, సెమి అర్బన్ పోలీస్ స్టేషన్లలో ముగ్గురు, అన్ని కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో అయిదుగురు చొప్పున పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. దాదాపు 1988 పోలీసు అధికారులను ఎంపిక చేసి నేటి నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణాకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలిస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను నియమించడం దేశంలోనే పోలీసు రంగంలో ఇదే మొదటిసారని తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా 4జీ మొబైల్ సేవలు విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా రిమోట్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. అధికంగా పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడం, సైబర్ నేరాలను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ సైబర్ వారియర్లు కీలకపాత్ర వహిస్తారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులకు రోజువారి విధి నిర్వహణలో ఇప్పటికే 17 మార్గదర్శకాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుందని, ఇక నుండి సైబర్ నేరాలను నిరోధించడం 18వ నిబంధనగా ఉంటుందని డీజీపీ అన్నారు. సాంప్రదాయ నేరాల కన్నా సైబర్ నేరాలు భిన్నంగా ఉంటాయని, వీటిని ఎదుర్కోవడానికే సైబర్ ఆధారిత నేరాలు, వాటిని ముందస్తుగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, ప్రజలను చైతన్య పర్చడం తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగే ప్రతి నేర సంఘటనలోను సైబర్ నేర సంబంధిత కాంపోనెంట్ ఉంటుందని అన్నారు. సాధారణ నేరాలను దర్యాప్తుచేసే అధికారులకు ఈ సైబర్ వారియర్లు తోడ్పాటునందిస్తే నేరాల దర్యాప్తు త్వరితగతిన పూర్తి అవుతుందని అన్నారు. రోజురోజుకు సైబర్ నేరస్తులు ఆధునిక పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాల్సిన అవసరముందని అన్నారు. ప్రస్తుత 2021 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టి సంవత్సరంగా జనవరి 1వ తేదీన ప్రకటించడం జరిగిందని, దీనిలో భాగంగానే ఐజి రాజేష్ కుమార్ ను ఈ విభాగానికి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని డి.జి.పి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులతో ఐజి రాజేష్ కుమార్ సమన్వయ అధికారిగా ఉంటారని పేర్కొన్నారు. అడిషనల్ డి.జి గోవింద్ సింగ్, ఐ.జి రాజేష్ కుమార్ లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సైబర్ వారియర్స్ అనే పుస్తకాన్ని డి.జి.పి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. చదవండి: పాస్పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్ కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం! -
పోలీస్శాఖలో వినూత్న కార్యక్రమానికి డీజీపీ శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ సేఫ్టీ వింగ్, పెట్రో కార్స్, బ్లూకోల్ట్స్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ వంటి అనేక వైవిధ్య కార్యక్రమాలను అమలు చేస్తోన్న డీజీపీ మహేందర్రెడ్డి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి పనితీరు మదింపును మొదలుపెట్టారు. ఏ రోజు ఎవరు ఏం పనిచేశారు? దాన్ని ఎప్పటిలోగా పూర్తి చేశారు? అందుకోసం ఎలాంటి పద్ధతులు అవలంబించారు? తదితర విషయాలన్నీ ఇకపై డీజీపీ కార్యాలయంలో నమోదవుతాయి. ఆ వివరాలన్నీ పరిశీలించి ప్రతి ఒక్కరికీ పాయింట్లు ఇస్తారు. అంటే పోలీసు ఉద్యోగి పనితీరుకు ఈ పాయింట్లే ప్రామాణికంగా నిలుస్తాయన్నమాట. పదోన్నతులు, పురస్కారాలు, అలాగే బదిలీలు, పనిష్మెంట్లకు ఈ పాయింట్లే ఆధారం కానున్నాయి. సిబ్బందిలో జవాబుదారీతనాన్ని, పోటీ తత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా, పదోన్నతులు, బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించే దిశగా డీజీపీ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్సేఫ్టీ వింగ్, వర్టికల్స్ (నిర్దిష్టంగా పని విభజన)ను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్న సమయంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. వర్టికల్స్లో గణాంకాలు గతంలో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో నేరం జరిగితే దాని దర్యాప్తు నుంచి శిక్ష పడేంత వరకూ అన్నిటికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లే (ఎస్హెచ్ఓ) బాధ్యత వహించాల్సి వచ్చేది. కిందిస్థాయి సిబ్బంది సరైన సహకారం అందించకున్నా.. దాని ఫలితాలు, పర్యవసానాలు ఎస్హెచ్ఓనే అనుభవించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల కిందట వర్టికల్స్ అమల్లోకి తెచ్చారు. అంటే రిసెప్షన్ మొదలుకుని వారెంట్లు, సమన్లు, దర్యాప్తు, ఎస్హెచ్ఓ, కమ్యూనిటీ పోలీసింగ్, డయల్ 100, ట్రాఫిక్.. ఇలా ప్రతి ఒక్కరికి, ప్రతి విభాగానికి నిర్దిష్ట బాధ్యతలు (పని), నిర్దిష్ట సిబ్బందిని కేటాయించారు. అంటే ఎవరి పనికి, ఎవరి విభాగానికి వారే బాధ్యులన్నమాట. ఈ విధంగా ఎస్హెచ్ఓలకు ఊరట లభించింది. ప్రస్తుతం ఆయా వర్టికల్స్లోనే సిబ్బంది రోజువారీ పనికి సంబంధించిన గణాంకాలు నమోదవుతుంటాయి. ఈ గణాంకాలను డీజీపీ కార్యాలయం నిరంతరం సమీక్షిస్తూ ఉంటుంది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు వచ్చిన ఫిర్యాదులు, చేసిన పని, దాని పరిష్కారం, ఎంత సమయంలో పూర్తి చేశారు.. తదితర విషయాలపై నిరంతర సమీక్ష ఉంటుంది. ప్రతి పని నమోదవుతుంది. దాని ఆధారంగా పాయింట్లు నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించారు. ప్రతిరోజూ సిబ్బంది వీటిని ఠాణాలో తనిఖీ చేసుకోవచ్చు. మిగతా ఠాణాల్లోని సిబ్బంది సాధించిన పాయింట్లు, తమ పాయింట్లు చూసుకుని తాము ఏ స్థానంలో ఉన్నామో తెలుసుకోవచ్చు. ఇందులో చివరి స్థానమైన రెడ్జోన్లో ఉన్న వారిని అప్రమత్తం చేయడం, వారందరినీ ఆరెంజ్ జోన్కు తీసుకురావడం, ఆరెంజ్లో ఉన్న వారిని గ్రీన్ జోన్కు వచ్చేలా చేసేందుకు ఎస్హెచ్ఓ, జిల్లా అధికారులు కృషి చేస్తారు. హెచ్ఆర్ఎంఎస్తో అనుసంధానం ఈ వివరాలను త్వరలో పోలీసు విభాగంలో ప్రారంభించనున్న హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్)కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ప్రతి సిబ్బంది తన పనిని మదింపు చేసుకుని, తప్పులు సరిదిద్దుకుని ముందుకుసాగే అవకాశం కలుగుతుంది. -
2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం..
కొత్త సంవత్సరం వస్తుందనగానే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మనలో చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు.. చేస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. న్యూఇయర్ రిజల్యూషన్ పెట్టుకోవడం అన్నది పరిపాటి. వీటిని కచ్చితంగా పాటించేవాళ్లు కొందరైతే.. 31న ఒట్టు పెట్టుకుని.. ఒకటో తేదీ సరికి దాన్ని గట్టు మీద పెట్టేసేవాళ్లు మరికొందరు.. మన సంగతి అలా ఉంచితే.. నిత్యం బిజీబిజీగా గడిపే ప్రముఖులు ఈసారి ఏమనుకుంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 2021లో స్వదేశీ వస్తువులకే ‘సై’ అన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? సొంతూళ్లో ఇల్లు కట్టుకోవడమే ఈ ఏడాది టార్గెట్ అన్న కామ్రేడ్ ఎవరు? హరీశ్రావు ఏం చేస్తానన్నారు? సీఎస్ ఏం రాస్తారన్నారు? ఇంతకీ కొత్త ఏడాదిలో డీజీపీ మహేందర్రెడ్డి టార్గెట్ ఏమిటి? లోకల్కేవోకల్.. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లోకల్–వోకల్ నినాదం ఇచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని 2021లో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడాలని నిర్ణయించా. రోజూ ఉదయం గంటసేపు యోగ, వ్యాయామం చేస్తాను. సమతుల ఆహారం నేను తీసుకుంటుంటాను. కొత్త ఏడాదిలో ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నాను. ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. – రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటిదాక చదివా.. ఇక రాస్తా కొత్త సంవత్సరంలో బాగా పుస్తకాలు చదవడంతో పాటు పుస్తకాలు రాయడాన్ని మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న. మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పేరుతో ఇప్పటికే రాసినా.. వాటిని గూగుల్లో ఎవరైనా చూడవచ్చు. ఈ ఏడాది అభివృద్ధి అనే అంశంపై పుస్తకాలు రాయాలనుకుంటున్నా. అంతేకాదు.. ఆరోగ్యంపై మరింత ఫోకస్గా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ ఏడాది వ్యాయామం చేయడం ప్రారంభిస్తా. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హెల్త్ అండ్ ఫిట్నెస్పైనే.. శరీరం ఫిట్గా ఉంటే ఎలాంటి వ్యాధినైనా, విపత్తునైనా ఎదుర్కోగలుగుతాం. మానవాళిపై కరోనా వైరస్ విసిరిన పంజా మన ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పింది. అందుకే, కొత్త సంవత్సరంలో హెల్త్ అండ్ ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. నాతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడతా. – డీజీపీ ఎం.మహేందర్రెడ్డి రెండు మూడు ఉన్నాయి.. నాకు రెండు, మూడు లక్ష్యాలు ఉన్నాయి. సహజసిద్ధమైన అడవులు, సుందర ప్రదేశాలతోపాటు నదుల వెంట పయనిస్తూ చేసే ప్రయాణం నాకెంతో ఇష్టం. అందుకే ప్రత్యేకమైన అటవీ, వృక్ష సంపదకు, సముద్ర జీవనానికి కేరాఫ్ అయిన అండమాన్, నికోబార్ దీవులను ఈ కొత్త సంవత్సరంలో తప్పక విజిట్ చేస్తాను. ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, కల్పిత సాహిత్యం మరింత ఎక్కువ చదవాలనుకుంటున్నాను. – ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ సిక్స్ డేస్ ఏ వీక్.. ఈ ఏడాది తప్పనిసరిగా వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నది నా లక్ష్యం. గతేడాది అనుకున్నా.. సాధ్యమవలేదు.. ఈసారి మాత్రం పక్కా.. శారీరక దృఢత్వంతోనే మానసిక సంకల్పం కూడా బలంగా ఉంటుందని నేను నమ్ముతాను. అంతేకాదు.. ఆత్మవిశ్వాసంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.. – స్వాతి లక్రా, ఏడీజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నేను.. నా రెహాన్.. ఈ బిజీబిజీ పనుల్లో నేను గ్రహించనే లేదు.. నా కొడుకు రెహాన్ పెద్దవాడు అయిపోతున్నాడు. వాడికిప్పుడు 12 ఏళ్లు. ఈ కొత్త ఏడాది వాడికి బెస్ట్ ఫ్రెండ్గా మారాలని నిర్ణయించుకున్నా.. ఈ సంవత్సరం ఎలా ఉందో చూశాం. అందుకే 2021లో ఫిట్నెస్ మీద ఫోకస్ పెడతా. వ్యాయామానికి మరింత టైం కేటాయిస్తాను. – సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ ఎల్ఎల్ఎం పూర్తి చేయాలి 2015లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం కోసం అడ్మిషన్ తీసుకున్నా. అయితే పని ఒత్తిడి నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయా. 2021లో అది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదును మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను. – రాచకొండ సీపీ మహేష్ భగవత్ బోలెడు పుస్తకాలు చదవాలి ఇప్పటివరకు వీకెండ్లో ఒక పుస్తకం మాత్రమే చదివేవాడిని. 2021లో మాత్రం ప్రతీ వీకెండ్లో బోలెడన్ని పుస్తకాలు చదవాలని డిసైడ్ అయ్యా. బోలెడన్ని అంటే కనీసం మూడు నాలుగు పుస్తకాలైనా చదవాలి. గతంలో మూడు నెలలకోసారి సెలవులపై దేశ విదేశాలకు టూర్ వెళ్లేవాడిని. కొత్త సంవత్సరంలో మాత్రం కనీసం రెండు నెలలకోసారి వారం రోజులపాటు సెలవులపై వెళ్లాల్సిందే. – సన్షైన్ ఎండీ డా. గురువారెడ్డి లాస్ట్ ఇయర్లా చేయను.. అందరూ తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని కోవిడ్ పరిస్థితులు నొక్కి చెప్పాయి. నేను చాలా కాలంగా యోగా చేస్తున్నా.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వల్ల నాలుగు నెలల నుంచి చేయడం లేదు. ఈమారు గత ఏడాదిలా కాదు.. యోగాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా.. అలాగే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. – మంత్రి టి.హరీశ్రావు ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉంటారు. అందుకేవ్యక్తిగత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నా. అలాగే నా జీవితంలో గ్రీన్ ఇండియా చాలెంజ్కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో లెఫ్టిజమ్, రైటిజం అంటూ అనేక ఇజాలు వింటూ వచ్చాం. కానీ రాబోయే రోజుల్లో అంతా గ్రీనిజమే. – ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 5 కి.మీ. వాకింగ్ మస్ట్.. నాకు వాకింగ్ చేసే అలవాటు ఉంది. అయితే.. రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అలా చేయను. 2021లో శరీర దారుఢ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక నడక మానే ప్రసక్తే లేదు. రోజూ ఉదయం, సాయంత్రం కనీసం 5 కిలోమీటర్లు తగ్గకుండా నడుస్తా.. వ్యక్తిగతంగా కొత్త సంవత్సరంలో నేను నిర్దేశించుకుంటున్న లక్ష్యం ఇదే.. – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఊర్లో ఓ ఇల్లు ఈ మధ్య చలో సొంతూరు నినాదం పెరుగుతోంది. నాక్కూడా సొంతూళ్లో ఇల్లుండాలనే కోర్కె బలంగా ఉంది. అమెరికాలో వున్న పిల్లలు అప్పుడప్పుడు వచ్చి.. మన పద్ధతులు చూడకుంటే.. మనతో మమేకం కాలేరు.. అందుకే మేం కూడా ఊర్లో ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక అభ్యుదయ సంగీతం , అన్నమయ్య కీర్తనలు , ఫ్లూట్ మ్యూజిక్ నాకిష్టం.. అవి వింటూ.. అలా మనవళ్లతో కాలక్షేపం చేయాలని ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ -
నేర, మావో రహిత తెలంగాణే లక్ష్యం
సాక్షి,హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో పలు రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. నేరాల అదుపులోనూ పోలీసుల పనితీరు మెరుగైంది. నేర, మావోయిస్టు రహిత తెలంగాణే తమ లక్ష్యమని డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాలపై బుధవారం వార్షిక నివేదిక విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. డీజీపీ ఇంకా ఏమన్నారంటే... 2020లో అనేక విపత్తులు, వరదలు, కరోనా వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల వెంట నిలిచాం. మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేశాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలలో దాదాపు 6 శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది 1,60,571 కేసులు నమోదు కాగా, 2020లో 1,50,922 కేసులు నమోదయ్యాయి. 2019లో 1,780 లైంగికదాడులు జరగ్గా 2020లో ఆ సంఖ్య 1,934కు చేరింది. ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి ఘటనాస్థలానికి కేవలం 8 నిమిషాల్లో చేరుకుంటున్నాం. ఎమర్జెన్సీ రెస్పాన్స్లో దేశంలోనే ఇది అత్యుత్తమ సగటు. ప్రజలకు చేరవయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకున్నాం. డీజీపీ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు ఏమిటంటే.. 11 ఎన్కౌంటర్లలో 11 మంది మావోయిస్టులు హతమయ్యారు. 135 మంది అరెస్టు కాగా, 45 మంది లొంగిపోయారు. 22 ఆయుధాలు, రూ.23 లక్షల నగదు స్వాధీనం. 33 జిల్లాల తెలంగాణలో 30 జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు లేవు. ►లాక్డౌన్ కాలంలో 6,000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వారిలో 72 మంది మరణించారు. ►లొకేషన్ బేస్డ్ సర్వీస్ ద్వారా డయల్ 100కు ఫోన్ చేసిన బాధితులు ఎక్కడున్నారో కనిపెడుతున్నాం. ►డయల్ 100/ డయల్ 112లకు 12,45,680 ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియా కంప్లైంట్స్ 1,59,915, రిసెప్షన్ ఫిర్యాదులు 6,78,189, హాక్ ఐకి 1,15,743 ఫిర్యాదులు ►ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో 300 కేసుల్లో నేరస్తుల్ని, పాస్పోర్టు వెరిఫికేషన్లో 22 మంది నేరచరితులను గుర్తించాం. ►దర్పణ్ యాప్ ద్వారా 33 మంది పిల్లల ఆచూకీ కనుగొన్నాం ►2020లో 624 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. 350 మందిపై ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు ► షీ–టీములకు 4,855 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 567 ఎఫ్ఐఆర్లు నమోదు. ►రాష్ట్రవ్యాప్తంగా ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను ఏర్పాటు చేశాం. త్వరలో వీటిని ప్రతి జిల్లా/ కమిషనరేట్లలో ఏర్పాటు చేస్తాం. ► డిపార్ట్మెంట్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(హెచ్ఆర్ఎంఎస్) అమలుకు శ్రీకారం ►వికారాబాద్, సంగారెడ్డి, వరంగల్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం. ►థర్డ్పార్టీ ద్వారా పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ►ఆపరేషన్ స్మైల్–6లో 1,292 మందిని, ఆపరేషన్ ముస్కాన్లో 741 మంది పిల్లలను రక్షించాం. ►మానవ అక్రమ రవాణా ముఠాల నుంచి 383 మందిని కాపాడాం. ►వర్టికల్ ఫంక్షనింగ్ ద్వారా 2019లో 29 శాతంగా ఉన్న కన్విక్షన్ రేటు 2020లో 48 శాతానికి చేరుకుంది. ►2020లో నలుగురికి మరణశిక్ష ఖరారైంది. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో ఇది ఒక రికార్డు. ►రూ.93 కోట్ల 73 లక్షల ప్రాపర్టీ లాస్ అయితే రూ.50 కోట్ల 47 లక్షలు రికవరీ ►మహిళలపై వేధింపులు గత ఏడాదితో పోలిస్తే 1.92% తగ్గింది ►హత్యలు 8.29%, దోపిడీలు 28.57%, రాబరీ 33.11%, చైన్ స్నాచింగ్ 46% తగ్గాయి. ►రోడ్డు ప్రమాదాలు 13.93% తగ్గాయి. మరణాలు 9% తగ్గాయి ►వరకట్న వేధింపులు 6,544 నమోదు కాగా, అందులో 144 మంది మృతి. ►ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 2,096 కేసులు నమోదు. కేసుల పెరుగుదల 10.89%. ►రాష్ట్రవ్యాప్తంగా 9,568 ఆర్థిక నేరాలు నమోదు. 4,544 సైబర్ నేరాలు నమోదు. గతేడాదితో పోలిస్తే 103% పెరిగాయి. ►ఈ ఏడాది 16,866 రోడ్డు ప్రమాదాలు, 5,821 మంది మరణం. ►ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.613 కోట్ల జరిమానాలు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కోటీ 67 లక్షల కేసులు. ►రాష్ట్రంలో 4.5 లక్షల మందికి సంబంధించి పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేశాం. -
ఆ యాప్ల ద్వారా రుణాలొద్దు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: చట్టబద్దత లేని యాప్ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్ల పై ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్, బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఒక ప్రకటన విడదల చేశారు. (చదవండి: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత) ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45-1ఏ ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని తెలిపారు. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్లైన్ యాప్లలో అధికశాతం ఆర్బీఐలో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారం లేదని పేర్కొన్నారు. (చదవండి: జీహెచ్ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’!) ఈ యాప్లలో అధికంగా చైనీస్వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నంబర్ గాని ఇతర వివరాలు ఉండవని పేర్కొన్నారు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా) ను యాప్ ల నిర్వాహకులు తెలుసుకుంటారని, ఈ యాప్ల యూజర్లు లిఖిత పూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు. యాప్ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాధితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్ల నిర్వాహకులు దుర్వినియోగం చేస్తారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులకు అంగీకరించవద్దని సూచించారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని తెలిపారు. ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్లు మోసపూరితమైనవని, ఆర్బీఐ గుర్తింపులేని ఈ యాప్ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని తెలిపారు. ఈ యాప్ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సీ రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికం. రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణ వలయంలో చిక్కుకుంటారు. దీంతో రుణాలు చెల్లించని రుణ గ్రహీతలను తిరిగి చెల్లించమని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్లైన్ వేధింపులకు ఈ యాప్లు పాల్పడతాయి. రుణాలను చెల్లించనట్లైతే మీ పై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని రుణం అందించే యాప్లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ తెలిపారు. ఆర్బీఐలో రిజిస్టర్ కాని, అక్రమ యాప్ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని డీజీపీ కార్యాలయం ప్రజలకు సూచించింది. ఈ విషయంలో ఎవరైన వేధింపులకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి చెప్పారు. -
సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వారిపైన కేసులు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకుని హైదరాబాద్లో మత ఘర్షణలు తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. చదవండి: గ్రేటర్లో అందరికీ ఉచితంగా కరోనా టీకా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. ప్రజలందరూ పోలీసులతో భాగస్వామ్యం కావాలని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుందన్నారు. మూడు కమిషనరేట్ పరిధి లో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలీస్ శాఖ ఉన్నత సమావేశం ఏర్పాటు చేశామని, ముందస్తుగా ఉన్న సమాచారం మేరకు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసకున్నామన్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్లో అల్లర్లకు బీజేపీ కుట్ర?
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటూ డీజీపీ మహేందర్రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కోరారు. ఆదివారం సాయంత్రం డీజీపీని కలిసిన టీఆర్ఎస్ నేతలు... హైదరాబాద్లో విధ్వంసానికి బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, సైదిరెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు డీజీపీని కలిశారు. అనంతరం ఈసీ అదనపు సీఈఓ బుద్ధ ప్రకాష్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకు ముందునగరంలో అల్లర్లు సృష్టించి ద్వారా వచ్చే సానుభూతితో దుబ్బాక ఉపఎన్నికలో కొన్ని ఓట్లు సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఆ పార్టీ నాయకుల నుంచే తమకు విశ్వసనీయ సమాచారం ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్) -
తెలంగాణ పోలీస్పై కీరవాణి అదిరిపోయే పాట
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరచి, ఆలపించిన ‘పోలీస్, పోలీస్ ...తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్’ అనే పాటను డీజీపీ మహేందర్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయంలో శనివారం ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి కీరవాణి విచ్చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను విడుదల చేయడం సందర్బోచితంగా ఉందన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు. ‘మనం కష్టపడుతూ సేలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని’ డీజీపీ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ, మాతృ దేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఈ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తన తొమ్మిదేళ్ల వయస్సులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజున ఇచ్చానని తెలిపారు. ‘ఇస్తున్నా ప్రాణం మీ కోసం’ పోలీసు త్యాగాలను తెలియచేసే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వరపరచి పాడానని గుర్తు చేసుకున్నారు. ఈ పాటను హిందీలో కూడా రూపొందిస్తానని కీరవాణి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు, ఈ పాట ఎడిటర్ హైమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 'ప్రాణం పంచే మనస్సున్న పోలీస్', the video-song is here to watch, Than Q @mmkeeravaani garu & Anantha Sriram for this thoughtful tribute to the #PoliceMartyrs, in observance of #PoliceFlagDayTelangana. https://t.co/F6dKU4TNUZ — DGP TELANGANA POLICE (@TelanganaDGP) October 31, 2020 -
21 వరకు అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు, ముందస్తు వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నదులు, చెరువులు, రిజర్వాయర్లు తదితర జలవనరుల వద్ద అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. -
భారీ వర్షాలు: పోలీసు శాఖను అప్రమత్తం చేసిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో డీజీపీ మహేందర్రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు డీజీపీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల నుంచి జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సోమవారం ఆదేశించారు. పోలీసు అధికారులందరూ 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా చూడాలని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్లు, విపత్తు నివారణ శాఖలతో పాట ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధానంగా డయల్ 100కు వచ్చే కాల్స్ అన్నింటీకి ప్రాధాన్యతతో చేపట్టి పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైన డయల్ 100కు ఫొన్ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మేంట్ డైరెక్టర్ హైదరాబాద్లో హైఅలర్ట్ ప్రకటించారు. 12,13,14 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జీహేచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రఃగంలోకి దింపింది. ముంపు ప్రాంతాలను గుర్తించి నిర్వాసితుల కోసం అన్నీ ఏర్పాట్లు చేయాలని జీహేచ్ఏంసీ ఆదేశించింది. వరదలు ఎక్కవగా ఉన్న ప్రాంతాల్లో పరికరాలు, మిషన్స్ తరలించాలని, నిర్వాసితులను తరలించేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నీ జోనల్ కమిషనర్లను జీహేచ్ఎంసీ ఆదేశించింది. -
తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు..
సాక్షి, హైదరాబాద్: తన యూట్యూబ్ చానల్లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తూడి అరుణ కుమారి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. పంజాగుట్ట కేసులో ఓ మహిళను ఇంటర్వ్యూ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అన్ని రకాల హద్దులు దాటాడని అరుణ కుమారి ఆరోపించారు.(చదవండి: 139 మంది అత్యాచారం: ‘భూమి’కి న్యాయం చేయండి) తన ఇంటర్వ్యూలో సభ్యసమాజం తలదించుకునే విధంగా బాధితురాలికి ప్రశ్నలు వేశాడని మండిపడ్డారు. 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లు రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్కు ఆదేశాలివ్వడం ఏంటని, అతను సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గతేడాది జరిగిన ‘దిశ’ ఎన్కౌంటర్ ఫేక్ అంటూ మల్లన్న వ్యాఖ్యానించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో నవీన్ సుప్రీంకోర్టుతో పాటు ‘నిర్భయ’ చట్ట నిబంధనలను అతిక్రమించాడని, అతడిపై తగినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ కిడ్నాప్.. విడుదల! దుండిగల్: ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అనుమానాస్పద స్థితిలో కిడ్నాప్ అయ్యాడు. దుండిగల్ సీఐ వెంకటేశం తెలిపిన మేరకు..న్యూషాపూర్నగర్కు చెందిన హజ్మత్ అలీ యూట్యూబ్ చానల్ రిపోర్టర్. మంగళవారం రాత్రి మరో యూట్యూబ్ చానల్ రిపోర్టర్ సలీం.. అలీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే అనుమానంతో కైసర్నగర్ చౌరస్తా లోని బాచుపల్లి రోడ్డు వరకు ఓ ఆటోను వెంబడించారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వారు అందుకు ఒప్పుకోకుండా ఆటోను మియాపూర్ వైపు పోనిచ్చారు. ఈ క్రమంలో సదరు ఆటోను బాచుపల్లి పోలీసులు కోకకోలా చౌరస్తాలో పట్టుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న రేషన్ బియ్యం తరలింపు ముఠా సభ్యులు ఇన్నోవా కారులో వచ్చి సలీంను ఎత్తుకెళ్లడానికి యత్నించగా అతను తప్పించుకోవడంతో హజ్మత్ అలీని తమ వెంటకు తీసుకువెళ్లారు. దీంతో హజ్మత్ అలీ కుటుంబ సభ్యు బుధవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హజ్మత్ అలీ దుండిగల్ పోలీస్స్టేషన్కు చేరుకున్నాడు. తనను కిడ్నాపర్లు వదిలేశారని, బస్సులో ఇంటికి చేరుకున్నానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని పోలీసులు రేషన్ బియ్యం ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
అధికారులకు దిశానిర్దేశం
సాక్షి, మంచిర్యాల: డీజీపీ మహేందర్రెడ్డి కుమురం భీం జిల్లా పర్యటన ఆదివారం ముగిసింది. ఈ నెల 2న మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ ఆదివారం వరకు అక్కడే గడిపారు. నెలన్నర వ్యవధిలో రెండుసార్లు ఆసిఫాబాద్ వచ్చిన డీజీపీ.. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు, పోలీసుల పనితీరును నేరుగా తెలు సుకున్నట్లు తెలుస్తోంది. దళ సభ్యుల సం చారం నేపథ్యంలో అప్రమత్తతపై మరో మారు స్థానిక పోలీసులకు దిశానిర్దేశం చేసినట్లుగా పర్యటన సాగింది. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ సానుభూతిపరులు, కూంబింగ్లో బలగాలు వ్యవహరించాల్సిన తీరు, కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు వంటివి చర్చకు వచ్చి నట్లు సమాచారం. మావోయిస్టులను ఆదిలో నిలువరించేందుకు కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. గత ఐదు రోజులుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ప్రాణహిత తీరం, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది. అత్యంత గోప్యంగా పర్యటన డీజీపీ ఆసిఫాబాద్ పర్యటన గోప్యంగా సాగింది. ఈ ఐదు రోజుల్లో ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. తొలి రోజు హెలికాఫ్టర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మావోయిస్టు సంచారం ఉన్న అటవీ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రెండు రోజులపాటు జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీసులోనే రామగుండం పోలీసు కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ, ఓఎస్డీ ఉదయ్కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియర్తో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 4న రాత్రి పది గంటలకు మారుమూల తిర్యాణి పోలీస్స్టేషన్కు రోడ్డు మార్గాన వెళ్లి వచ్చారు. గత జూలైలో ఈ పోలీస్స్టేషన్ పరిధిలోని మంగీ అడవుల్లో మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఫైరింగ్ జరిగింది. రెండు సార్లు దళ సభ్యులు చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పించుకున్నారు. అలాంటి మారు మూల ప్రాంతానికి డీజీపీ రాత్రి వెళ్లడంతో ఏదో జరుగుతోందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అదే రాత్రి డీజీపీ ఆసిఫాబాద్ చేరుకున్నారు. ఈనెల 5న ఎస్పీ క్యాంపు ఆఫీ సులో ఉమ్మడి జిల్లాలోని మావోయిస్టు ప్ర భా వం ఉన్న ఎస్సై, సీఐ, డీఎస్పీలతో సుదీర్ఘంగా సమీక్షించారు. అదేరోజు చివరగా కుమురం భీం కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో ప్రత్యేకం గా సమావేశమయ్యారు. ఐదో రోజు మధ్యా హ్నం 3 గంటలకు రోడ్డు మార్గాన ఆసిఫాబా ద్ నుంచి హైదరాబాద్ బయలుదేరివెళ్లారు. -
సై అంటే సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టులు తిరిగి పుంజుకోకుండా చూడాలని పోలీసులు.. ఎలాగైనా తిరిగి తెలంగాణలో విస్తరించా లన్న పట్టుదలతో మావోయిస్టులు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తుండటం ఏజెన్సీ ప్రాం తాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కొత్త రిక్రూట్మెంట్ కోసం మావోలు ప్రయత్నిస్తుండటం, ఆ ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని పోలీసులు అడవులను జల్లెడ పడుతుండటం మరింత వేడి రాజేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బాస్ ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో పర్యటించి శాఖాపరంగా కీలక మార్పుచేర్పులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ కాలంలోనే మొదలు... 2005 తరువాత రాష్ట్రంలో దాదాపుగా ఉనికి కోల్పోయిన మావోయిస్టులు... లాక్డౌన్ కాలంలో అనూహ్యంగా పుంజుకున్నారు. జనవరి, ఫిబ్రవరిలలో మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఛత్తీస్గఢ్ నుంచి మావోల యాక్షన్ టీమ్లు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ ప్రహార్ కారణంగా వారంతా తాత్కాలికంగా తెలంగాణలోకి వచ్చారని పోలీసులు తొలుత భావించారు. అయితే వారు చాపకింద నీరులా మావోయిస్టు పార్టీ విస్తరణకు వచ్చారన్న విషయం తెలియడం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. అదే సమయంలో కరోనా విజృంభణతో లాక్డౌన్ విధించడం మావోలకు కలసి వచ్చింది. ఈ సమయంలో వారు పార్టీకి కావాల్సిన చందాలు, సామగ్రి సమకూర్చుకున్నారు. పలువురు ప్రజాసంఘాల నాయకులు కూడా పార్టీ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరు మావో సానుభూతిపరులు చందాలు వసూలు చేస్తూ సిరిసిల్లలో పోలీసులకు దొరికారు. జూలై 15న ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఆటవీ ప్రాంతంలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడేళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని దళం స్పెషల్ పార్టీ పోలీసులకు తారసపడటం.. పరస్పరం కాల్పులు జరుపుకోవడం కలకలం రేపింది. ఆ సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోకి 15 మంది యువత అదృశ్యమయ్యారన్న వార్త కూడా పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఆ మర్నాడే డీజీపీ మహేందర్రెడ్డి హుటాహుటిన ఆసిఫాబాద్ వెళ్లారు. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలోనూ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆ రోజు నుంచి గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులంతా అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రెండుసార్లు ఆసిఫాబాద్కు.. మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారంటూ ఈ నెల 1న జరిగిన ప్రచారంతో పోలీసులు, మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు. ఆ మర్నాడే డీజీపీ మహేందర్రెడ్డి ఆకస్మికంగా ఆసిఫాబాద్ చేరుకున్నారు. 45 రోజుల్లో డీజీపీ రెండుసార్లు ఆసిఫాబాద్లో పర్యటించడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆసిఫాబాద్లో మావోల కదలికలు పెరగడం, అదే సమయంలో గణపతి, మరికొందరు మావో అగ్రనేతలు లొంగిపోతారన్న వార్తలు తోడవడంతో రాష్ట్రంలో ఏదో జరుగుతోందన్న చర్చ తీవ్రమైంది. అయితే గణపతి లొంగుబాటు ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. అవన్నీ కట్టుకథలని, పోలీసుల మైండ్గేమ్ అని లేఖ విడుదల చేసింది. తమకు ప్రజల్లో పూర్వ ఆదరణ లభిస్తోందని, తప్పకుండా రాష్ట్రంలో పునర్వైభవం సాధిస్తామని మావోలు ప్రతినబూనారు. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ గన్మన్, యాక్షన్ కమిటీ సభ్యుడు శంకర్ గుండాలలో పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందడంతో యాక్షన్ కమిటీ సభ్యుల సంచారం నిజమేనని తేలింది. దీంతో డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోలు బలపడేందుకు అవకాశమున్న అటవీ, గోదావరి పరీవాహక జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు ఠాణాల్లో సీఐలు, ఎస్సైలను ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో మావోలను సమర్థంగా ఎదుర్కొన్న సీనియర్ పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే రెండు దశాబ్దాలనాటి ఇన్ఫార్మర్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో కొరియర్లు, సానుభూతిపరుల కదలికలపై నిఘా పెట్టాలంటూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తిరిగి కార్యాకలాపాలు ప్రారంభించిన మావోయిస్టులను సరిహద్దులోనే అడ్డుకోవాలని డీజీపీ వ్యూహాలు రచిస్తుండగా.. ప్రజామద్దతుతో తిరిగి బలపడతామని మావోలు చెబుతున్నారు. -
హై టెన్షన్.. 26 మంది కిడ్నాప్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టుల ప్రయత్నాలు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ముమ్మరంగా కూంబింగ్.. వెరసి మన్యం అట్టుడికిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవళ్లగూడెంలో ఇటీవలి ఎన్కౌంటర్, సరిహద్దున ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నలుగురు జవాన్లను శనివారం మావోలు హతమార్చిన తాజా ఘటనలతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు ఈ నెల 6వ తేదీన ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునివ్వడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం నెలకొంది. మావోలు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్షన్ టీమ్లను ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి పంపారు. జూలై 20న మావోయిస్టు పార్టీ కొత్తగా రాష్ట్ర కమిటీని, మరో 12 డివిజన్, ఏరియా కమిటీలను, రాష్ట్రస్థాయి యాక్షన్ టీమ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసు యంత్రాంగం మావోలను నిరోధించేందుకు నిరంతరం సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నెల 3న గుండాల ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత హరిభూషణ్ గన్మన్, యాక్షన్ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ లేఖలను విడుదల చేసిన మావోయిస్టు ఏరియా, డివిజన్ కమిటీ కార్యదర్శులు ఉత్తర తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండటంతో అవాంఛనీయ, విధ్వంసక ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. యాక్షన్ టీమ్లు సంచరిస్తున్న గోదావరి పరీవాహక జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కీలకమైన ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. డీజీపీ పర్యవేక్షణ డీజీపీ మహేందర్రెడ్డి నాలుగు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోనే మకాం వేసి సెర్చ్ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి పరీవాహక జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు జిల్లా ఎస్పీలు చూసుకుంటున్నారు. సబ్ డివిజినల్ పోలీసు అధికారులు ఏకంగా స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. కొన్ని నెలల కిందట ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని సబ్ డివిజన్లలో ఎస్డీపీఓలుగా ప్రభుత్వం ఐపీఎస్ అధికారులనే నియమించింది. భద్రాచలంతోపాటు మణుగూరు, ఏటూరునాగారం సబ్ డివిజన్లకు ఐపీఎస్లను కేటాయించారు. మరోవైపు మూడు రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫారసులతో సంబంధం లేకుండా పోలీస్బాస్ మార్క్తో ఓఎస్డీ, సీఐల బదిలీలు చేశారు. మావోయిస్టు ఆపరేషన్లు చేయడంలో అనుభవం ఉన్న వారిని కీలకమైన ఠాణాలకు కేటాయించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్), సీతారామ ఎత్తిపోతల పథకాలకు పోలీసులు భద్రత మరింత పెంచారు. ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తుండటంతో మావోలు వారిలో కలసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 26 మంది కిడ్నాప్ నలుగురి హత్య మావోయిస్టులు భద్రాద్రి ఏజెన్సీకి సరిహద్దుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన నలుగురు గిరిజనులను శనివారం పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో హతమార్చారు. ముందుగా ఈ రెండు గ్రామాలకు చెందిన 26 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు ఏర్పాటు చేసి ఈ నలుగురిని గొంతుకోసి దారుణంగా చంపారు. ఆరుగురిని విడిచిపెట్టి, మరో 16 మందిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. బలగాలు కూంబింగ్ ఆపరేషన్లను నిలిపేయకపోతే తమ అధీనంలో ఉన్న 16 మందిని హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. -
మావోయిస్ట్ ఏరియాలో మరోసారి డీజీపీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ మావోయిస్టు రెండో రోజు కొనసాగుతోంది. గురువారం డీజీపీ మహేందర్రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. మావోయిస్టులసంచారం, పోలీసుల చర్యలపై గురువారం విస్తృతంగా సమీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ఆసిఫాబాద్ మొదలుకొని కొమరంభీమ్, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘంగా సమీక్షించారు. మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. మరో రెండ్రోజులపాటు ఆసిఫాబాద్లోనే డీజీపీ మహేందర్రెడ్డి మకాం వేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఏరియల్ సర్వే, సమీక్షలతో స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి రెండోసారి పర్యటించారు. తిర్యాని మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, ఐదుగురు సభ్యులు రెండు సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్లో మావోయిస్టుల డైరీ లభ్యమయ్యింది. మావోయిస్టు రిక్రూట్మెంట్కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా కూంబింగ్ ఆపరేషన్పై కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు గ్రే హౌండ్స్ ఏ ఆర్ సివిల్ పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. చదవండి: మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే -
మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే
సాక్షి, అసిఫాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీస్తున్నారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు విషయమై కూడా చర్చ కొనసాగుతోంది. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?) -
‘పులిగొండల సర్పంచ్ను విడుదల చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి భద్రాచలం పులిగొండల సర్పంచ్ చలపతిని విడుదల చేయాలని లేఖ ఇచ్చారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గిరిజన సర్పంచ్ చలపతి అరెస్ట్ కండిస్తున్నామన్నారు. ‘మావోయిస్టులకు సహకరిస్తున్నారు-సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్ట్ చేయడం దారుణం. పోలీసులు చెప్పినట్లు మావోయిస్టు భావజాలం ఉంటే ఎన్నికల్లో చలపతి పోటీ చేసేవారు కాదు. భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి చలపతి. అర్థరాత్రి అన్నం కోసం ఎవరు వచ్చినా అన్నం పెడతాం. అడవిబిడ్డ బోయకులానికి చెందిన గిరిజన వ్యక్తి చలపతి. సర్పంచ్లను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా బెదిరిస్తే కాంగ్రెస్ అండగా ఉంటుంది’ అని భట్టి అన్నారు. వరదల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముంపుకు గురైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అప్రమత్తంగా ఉండండి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై పోలీస్ శాఖ అప్రమత్తమైంది. వర్షాలు, వరదల వల్ల సాధ్యమైనంత వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులనూ సిద్ధం చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. సీఎస్తో కలసి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముల్లో పోలీస్ అధికారులను నియమించినట్లు చెప్పారు. (ఊళ్లన్నీ జలదిగ్బంధం) మరో రెండ్రోజులు వర్షాలు సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని 4, 5వ హెచ్చరికలను ఆదివారం జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతోనే రాష్ట్రంలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే 24 గంటల్లో ఈ అల్పపీడనం బలహీనపడే అవకాశమున్నట్లు తెలిపింది. దీంతో వర్షాల తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 19న మరో అల్పపీడనం..: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతోనూ రాష్ట్రంలో మెస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అయితే 19న ఈ అల్పపీడనం ఏర్పడితే అది బలపడే పరిస్థితిని బట్టి వర్షపాతాన్ని అంచనా వేస్తారు. -
తెలంగాణలోనే అత్యున్నత పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: సమాజంలో శాంతి భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రమని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రాష్ట్రంలోని మహిళలు, యువతకు నిర్వహించిన వెబ్ ఆధారిత చైతన్య సదస్సు ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోలీస్ శాఖ ఆధునీకరణకు అందిస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉందన్నారు. మహిళలు, పిల్లలు సైబర్ నేరాల బారిన పడకుండా నెలరోజులపాటు సైబ్–హర్ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమం దేశంలోనే మొదటిదన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంతోపాటు దేశ, విదేశాలకు చెందిన 50 లక్షల మంది పాల్గొనడం విశేషమని కొనియాడారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. సైబ్–హర్ కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని వెల్లడించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన మై విలేజ్ షో గంగవ్వ మాట్లాడుతూ.. తనను కూడా పైసల్ గీకే కార్డు (ఏటీఎం) నంబర్ చెప్పాలని ఫోన్లో ఎవడో అడిగాడని, అయినా చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై చైతన్యం కలిగించే పలు ప్రచార కిట్లను మహేందర్రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో ఏడీజీ జితేందర్ కూడా పాల్గొన్నారు. 15 లక్షల మందికి అవగాహన..: జూలై 15న మొదలైన ఈ కార్యక్రమం ద్వారా నెలరోజులపాటు రాష్ట్రంలోని దాదాపు 15 లక్షలకుపైగా యువత, మహిళలకు ఆన్లైన్ నేరాలు, అప్రమత్తత, రక్షణ పొందే విధానం, ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి విషయాలపై అవగాహన కల్పించడం విశేషం. కాగా, ఈ కార్యక్రమం సైబర్ నేరాలపై ప్రత్యేక పుస్తకాలు వెలువరించింది. యువతలో ఆసక్తిని పెంచేలా పలు క్విజ్లు, వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్, కవితలు తదితర పోటీలు కూడా నిర్వహించింది. పోస్టర్ ప్రజెంటేషన్ కోసం అత్యధికంగా 367 మంది చిత్రాలను పంపారు. వారిలో రితిక్, నమ్రతలు విజేతలుగా నిలిచారు. ఇక కవితల పోటీల విభాగంలో దాదాపు 100కు పైగా రాగా.. వాటిలో హైమా, అన్షు, సాయి నిక్షేప్, హరికాంత్, రమాదేవిల కవితలను ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు -
అమీన్పూర్ కేసు స్వాతి లక్రాకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్ కేసును ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ స్వాతి లక్రాకు అప్పగించారు. కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. కేసు,నమోదు, అరెస్ట్ వివరాలను స్వాతి లక్రా తెప్పించుకున్నారు.డీజీపీ ఆదేశాల మేరకు ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి ప్రత్యేక అధికారిని నియమించారు. నిందితుల అరెస్ట్, ట్రయల్స్, కేసు విచారణపై స్వాతి లక్రా దృష్టి పెట్టనున్నారు. (చిన్నారులను అందంగా అలంకరించి..) అమీన్పూర్లోని మియాపూర్ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. (అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్పూర్’) -
సివిల్ వివాదాల్లో ఖాకీల జోక్యం!
సాక్షి, హైదరాబాద్ : సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చి ఫిర్యాదుదారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ వారంలో ఈ విధమైన రెండు ఘటనల్లో రాష్ట్ర మానవహక్కుల సంఘం (ఎస్హెచ్ఆర్సీ) కలగజేసుకుందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా నాగారం ఎస్సై ఓ భూవివాదంలో అకారణం గా దళితులపై దాడి చేశారని, చంపుతానని బెదిరించారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర మానవ హక్కుల సంఘం దీన్ని సుమోటాగా స్వీకరించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీ భాస్కరన్కు నోటీసులు జారీ చేసింది. ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన ఎస్పీ సదరు ఎస్సైని వీఆర్కు పంపారు. గతంలోనూ ఈ అధికారిపై ఇలాంటి ఆరోపణలున్నా యి. అదే జిల్లాలోని మునగాల పోలీస్స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. తన భూమిని ఆక్రమిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసుస్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోకపోగా దూషించి వెనక్కి పంపడంతో బాధితుడు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపించాలని హెచ్చార్సీ సూర్యాపేట జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. భూపంచాయితీలంటే ఎంత ఇష్టమో! రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులు ఎంతమందిని బలి తీసుకుంటున్నా యో చూస్తున్నాం. ఈ క్రమంలో తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో బాధితులు ముందుగా పోలీసులనే ఆశ్రయియిస్తున్నారు. దీన్ని కొందరు పోలీసులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వాస్తవానికి సివిల్ కేసులు పోలీసుల పరిధిలోనివి కావు. కానీ, ఇలాంటి వివాదాలపై పోలీసులు ఠాణాల్లోనే పంచాయితీలు పెట్టి రెండు వర్గాల నుంచి డబ్బులు దం డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులు ఎస్పీలు, మానవ హక్కుల సం ఘాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ఎవరో ఒకరి పక్షం వహించడం వల్ల ఒకవర్గం మరోవర్గంపై దాడులు, బెదిరింపులకు దిగుతోంది. వీరంతా పేదలు, బలహీనులు కావడంతో భయపడి చాలామంది రాజీకే మొగ్గు చూపుతున్నారు. అందుకే, ఇలాంటి విషయాలు తక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. డీజీపీ ఆదేశాలు బేఖాతరేనా? సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని, స్టేషన్ల చుట్టూ పదే పదే బాధితులను తిప్పించుకోవద్దని డీజీపీ మహేందర్రెడ్డి పలుమార్లు హెచ్చరించారు. ఇలాంటి వైఖరి హత్యలు, అల్లర్లు, శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుందని చెప్పినా చాలామంది గ్రామీణ పోలీసుల తీరు లో మార్పు రావట్లేదు. విచారణలో తప్పు రుజువై వేటు పడుతున్నా కొందరు కిందిస్థా యి పోలీసు అధికారుల తీరు మారడంలేదు. కొంతకాలం తరువాత పోస్టింగ్ వస్తుందన్న ధీమాతో బరితెగిస్తున్నారు. -
వివాదాస్పద పోస్టులు పెడితే కటకటాలే
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. ఓ నకిలీ వివాదాస్పద పోస్టు కారణంగా బెంగళూరులో అల్లర్లు చెలరేగి కాల్పులకు దారితీయడంతో డీజీపీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల విఘాతానికి కారణమయ్యే ఈ తరహా వివాదాస్పద, అసత్య పోస్టులు సమాజంలో ఆస్తి, ప్రాణనష్టాలకు దారితీస్తాయన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులపై తెలంగాణ పోలీసులు 24 గంటలపాటు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. అసభ్యకరంగా, అల్లర్లకు కారణమయ్యే పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేయాలని అన్ని పోలీసుస్టేషన్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ విషయంలో పౌరులంతా పోలీసులకు సహకరించాలని మహేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.