
ప్రతికాత్మక చిత్రం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : సందీప్.. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.. కొద్దిరోజులుగా కాలేజీ అయిపోగానే నేరుగా ఇంటికి రావడం లేదు.. సెలవు రోజుల్లో కూడా పని ఉందంటూ స్నేహితులతో బయటకు వెళ్తున్నాడు.. అనుమానం వచ్చిన తండ్రి ఓరోజు సందీప్కు తెలియకుండా ఫాలో అయ్యాడు. తన ఇంటికి సమీపంలోనే మణికొండలో ఓ మసాజ్ పార్లర్కు సందీప్ వెళ్తున్నట్లు గుర్తించాడు. ఆయన బ్యాంక్ ఖాతా లావాదేవీలు పరిశీలించగా రెండు నెలల్లోనే డెబిట్ కార్డు ద్వారా ఆ మసాజ్ పార్లర్కు 28 సార్లు రూ.2,500 చొప్పున రూ.70 వేలు చెల్లించినట్లు బయటపడింది! ఆదాయ పన్ను శాఖలో సీనియర్ అధికారి హోదాలో ఉన్న ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారి ఒకరికి ఈ విషయం చెప్పారు. అదే రోజు సాయంత్రం పార్లర్పై దాడి చేసి నిర్వాహకులతోపాటు డజనుకుపైగా యువతులను అరెస్టు చేశారు.
దీపక్ కుమార్... మెహదీపట్నంకు చెందిన ఈయన ఓ ప్రైవేటు బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నారు.. ఎంబీఏ చదువుతున్న తన కుమారుడికి సప్లిమెంటరీ క్రెడిట్ కార్డు ఇప్పించారు. తనకు వచ్చిన బిల్లులో కుమారుడి క్రెడిట్ కార్డు ద్వారా జరిపిన లావాదేవీలు చూసి దీపక్ ఆశ్చర్యపోయాడు. డీ ప్లస్ సెలూన్ అండ్ స్పా పేరుతో ఒకే నెలలో తన కుమారుడు రూ.27,500 ఖర్చు చేయడాన్ని చూసి కంగుతిన్నాడు. ఆరా తీస్తే మసాజ్ కోసం ఆ డబ్బు ఖర్చు చేశాడని తేలింది. డీ ప్లస్ సెలూన్ అండ్ స్పా పేరుతో హైదరాబాద్లో 20కి పైగా బ్రాంచీలు ఉండగా, బంజారాహిల్స్లోనే ఐదు ఉన్నాయి!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో ‘మసాజ్’సంస్కృతి జోరుగా వ్యాప్తి చెందింది. వేలాది మంది యువత వీటి బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్నారు. కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పంపుతున్న సొమ్మును మసాజ్ పార్లర్లకు ఖర్చు చేస్తున్నారు. మహిళలు మసాజ్ చేస్తారంటూ ఇంటర్నెట్లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా విద్యాసంస్థల వద్ద ఏజెంట్లను పెట్టి మరీ కొన్ని సెంటర్లు ప్రచారం చేస్తున్నాయి. నగరాల్లో తల్లిదండ్రులు ఇస్తున్న పాకెట్ మనీకి తోడు ఇతరత్రా అప్పులు చేసి వీటి బారిన పడుతున్న యువకులు ఎందరో ఉన్నారు. రాజధానిలోని పలు పార్లర్లపై ‘సాక్షి’దృష్టి సారించగా.. వాటిలో జోరుగా అనైతిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తేలింది.
కాలేజీల వద్ద ఏజెంట్లను పెట్టుకొని మరీ..
హైదరాబాద్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి మాత్రమే కాదు.. నగరం నలుమూలలా మసాజ్ పార్లర్లు విస్తరించి ఉన్నాయి. ఇంటర్నెట్లో దొరికిన వివరాలు, ఓ పోలీసు అధికారి అందించిన సమాచారాన్ని క్రోడీకరించి చూడగా.. సుమారు 4 వేల పార్లర్లు ఉన్నట్లు వెల్లడైంది. వీటి ద్వారా ఎంత మేర వ్యాపారం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఓ బ్యాంక్ అధికారి మచ్చుకు ఆరు పార్లర్ల ఖాతాలను పరిశీలించగా.. సగటున రోజుకు లక్ష రూపాయలకు పైగా ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోని పార్లర్లు అయితే ఇంతకంటే ఎక్కువే ఆర్జిస్తున్నాయి. హైదరాబాద్లో మొత్తం పార్లర్లు రోజుకు రూ.40 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నట్లు అంచనా. రాజధాని, శివార్లలోని వందలాది విద్యాసంస్థల్లోని విద్యార్థులే లక్ష్యంగా నిర్వాహకులు తమ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. బెంగాల్, మణిపూర్, అస్సాం, కేరళ, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి మసాజ్ పేరుతో అనైతిక పనులు చేయిస్తున్నారు. ఇంజనీరింగ్ ఇతర విద్యాసంస్థల వద్ద ఏకంగా తమ ఏజెంట్లను పెట్టుకుని మరీ ప్రచారం చేయిస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్లర్కు వచ్చే పరిచయస్తులు కొత్తవారి మొబైల్ నెంబర్ ఇస్తే నాలుగు సార్లు మసాజ్ చేయించుకోవడానికి 50 శాతం రాయితీ అంటూ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
ఇంటర్నెట్ నిండా వాటి వివరాలే
‘హైదరాబాద్ మసాజ్ సెంటర్స్’అని గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు రెండు డెడికేటెడ్ వెబ్సైట్లు స్క్రీన్పై దర్శనమిస్తాయి. వాటి లింక్ తీసుకుని వెబ్సైట్లోకి వెళ్తే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని వేలాది మసాజ్ సెంటర్ల వివరాలు బూతు బొమ్మలతో సహా ప్రత్యక్షమవుతాయి. పార్లర్ల నిర్వాహకులు ఈ వెబ్సైట్ల ద్వారా రోజుకు కొత్తగా పది నుంచి 15 వేల మంది విద్యార్థులు, యువకులను ఆకర్షిస్తున్నారు. నగరంలో 16 ప్రాంతాలను ఎంపిక చేసి వాటి పరిధిలో ఎక్కడెక్కడ మసాజ్ పార్లర్లు ఉన్నాయన్న వివరాలు వెబ్సైట్లో ఉంచారు. ఉదాహరణకు దిల్సుఖ్నగర్ అని క్లిక్ చేస్తే ఆ ప్రాంతంలోని 80 నుంచి 100 పార్లర్ల సమాచారం దొరుకుతుంది. యువతను ఆకట్టుకోవడానికి పురుషుడికి మహిళ మసాజ్ చేస్తున్న ఫోటోలను వెబ్సైట్లో ఉంచారు. దీంతో గ్రాడ్యుయేషన్, ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులు తేలిగ్గా వీటి బారిన పడుతున్నారు. నగరంలోని ప్రముఖ కూడళ్ల పేర్లలో దేన్ని కిŠల్క్ చేసినా 50కి తగ్గకుండా మసాజ్ సెంటర్ల వివరాలు ఉన్నాయి. కొందరైతే కాలనీల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
మామూళ్ల మత్తులో పోలీసులు
నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న మసాజ్ పార్లర్లు స్థానిక పోలీసు స్టేషన్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వీటిలో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిసినా మామూళ్లు తీసుకొని మిన్నకుండిపోతున్నారు. కొన్నిసార్లు పై అధికారుల ఒత్తిళ్లతో దాడులు చేయాల్సి వచ్చినా నిర్వాహకులకు ముందే హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేస్తున్నారు. తమకు వచ్చే ఆదాయంలో ఐదు నుంచి పది శాతం పోలీసులకు ముట్టజెప్పుతామని ఓ పార్లర్ నిర్వాహకుడు తెలిపారు.
ఓ తండ్రి ఆవేదన..
‘‘నగరంలో జరుగుతున్న ఈ తరహా అనైతిక కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రించాలి. పార్లర్లన్నింటినీ వెంటనే మూసివేయాలి. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనైతిక ప్రకటనలకు చోటుకల్పిస్తున్న వెబ్సైట్లను నియంత్రించాలి’’అని ఓ తండ్రి ఇటీవలే ట్వీటర్ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తన కుమారుడు తెలివైన విద్యార్థి అని ఇంజనీరింగ్లో డిస్టింక్షన్లో పాసై ఎంబీఏ మంచి కాలేజీలో చేరి రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఫెయిలయ్యాడని, ఈ అనైతిక కార్యకలాపాలకు అలవాటు పడ్డ అతడిని ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావడం కష్టంగా మారిందని ఆవేదన చెందారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నడుస్తున్న వీటిని నియంత్రించకపోతే యువత మరింత చెడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment